Monday, August 1, 2011

తిలక్ ద్వయం

 లోకమాన్యుడు 

" స్వరాజ్యం నా జన్మహక్కు "

అని నినదించి భారతజాతి దాస్య శృంఖలాల విముక్తికి శంఖారావం పూరించిన లోకమాన్యుడు బాల గంగాధర తిలక్. ' భారతదేశ అశాంతికి పితామహుడు ' గా బ్రిటిష్ వారిచే పిలువబడిన తిలక్ వృత్తి రీత్యా ఉపాథ్యాయుడు... ప్రవృత్తి రీత్యా జాతీయవాది, సంఘసంస్కర్త. భారత స్వాత్రంత్ర్య సమర ప్రారంభ దినాల్లో ముందు నిలిచి పోరాడిన నాయకుడు తిలక్.

 కాంగ్రెస్ లో తిలక్ అతివాదిగా పేరుబడ్డారు.  ఆడపిల్లలకు పది, పన్నెండేళ్ళ మధ్య వివాహం జరపాలని వుద్ద్యేశించిన బిల్లును కాంగ్రెస్ లోని మితవాదులంతా సమర్ధించగా తిలక్ మాత్రం వ్యతిరేకించారు. ఇది ఆయనలోని మితవాదానికి గుర్తు మాత్రమే కాదు... ఆయనలోని సంఘ సంస్కర్త కూడా ఇందులో స్పష్టంగా కనిపిస్తాడు. సామాజిక సమస్యల పట్ల ఆయన ఎంతగా స్పందించేవారో చెప్పడానికి 1896 - 97 సంవత్సరాలలో బొంబాయి, పూనే లను కుదిపివేసిన ప్లేగ్ మహమ్మారికి గురైన వ్యాధిగ్రస్తులపై బ్రిటిష్ అధికారుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ' కేసరి ' పత్రికలో తన రచనల ద్వారా పోరాడారు.

తిలక్ దృష్టిలో దైనందిక జీవనం, మతం వేర్వేరు కాదు " సన్యాసం స్వీకరించడమంటే జీవితాన్ని త్యజించడం కాదు. మనకు స్వంతమనే ఆలోచన లేకుండా వసుధైక కుటుంబమనే భావన కలిగి వుండాలి. మొదట మానవసేవ, తర్వాత మాధవసేవ చెయ్యాలి " అనేవారు. అప్పటివరకూ ఇళ్ల వరకే పరిమితమైన వినాయకచవితి పండుగను సర్వజన ఉత్సవంగా తీర్చిదిద్దిన ఘనత బాల గంగాధర తిలక్ దే ! అలాగే ఛత్రపతి శివాజీ జయంతుత్సవాలను కూడా సామాజికోత్సవాలుగా మార్చారు.

భారత దేశానికి స్వాతంత్ర్యం సముపార్జించడానికి హింసతో సహా అవకాశమున్న అన్ని మార్గాలను ఉపయోగించాలని నమ్మేవారు. గాంధీ లోని నాయకత్వ లక్షణాలను కనిపెట్టి ఆయనను అహింసా సిద్ధాంతం నుంచి మరల్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేసారు. స్వాతంత్ర్య సమర పథ నిర్దేశకుడిగా తిలక్ మీద గాంధీ గారికి గురుభావం వున్నా ఈ విషయంలో మాత్రం తన మనసు మార్చుకోలేదు.

భారతదేశ జాతీయ భాషగా దేవనాగరి లిపిలో వ్రాయబడే హిందీని గుర్తించాలని ప్రతిపాదించిన తొలి కాంగ్రెస్ నాయకుడు తిలక్.

 లోకమాన్య బాల గంగాధర తిలక్ వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ.... 




అమృతం కురిపించిన తిలక్ 


తెలుగు సాహితీ చరిత్రలో విశిష్ట స్థానం పొందిన కవి, రచయిత దేవరకొండ బాలగంగాధర తిలక్. సాహితీ వనంలో రాత్రి పూట అమృతం కురిపించిన తిలక్ తెలుగు సాహితీ ప్రియుల గుండెల్లో శాశ్వత స్థానం పొందారు. పదహారేళ్ళకే కవిత్వం  రాయడం ప్రారంభించి తన 24 యేట ప్రభాతము - సంధ్య అనే కవితాసంపుటి వెలువరించారు.      

వచన కవిత్వంలో ఉన్నత విలువలు గల రచయితగా తిలక్ పేరు తెచ్చుకున్నా ఆయన రాసిన కథలు కూడా తెలుగు పాఠకులను అంతగానూ  అలరించాయి. ' అమృతం కురిసిన రాత్రి ' కి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి పురస్కారం అందుకున్నారు. తెలుగు సాహితీ చరిత్రలో అమృతం కురిసిన రాత్రి ఒక మైలురాయి.



 తన రచనలతో అమృతం కురిపించిన దేవరకొండ బాలగంగాధర తిలక్ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ....  

తిలక్ గారి రచనలకు ఆకాశవాణి వారి స్పందన గురించి గతంలో రాసిన టపా......

బొచ్చుకుక్కా ? ఒట్టి కుక్కా ?


2008 లొ జరిగిన తిలక్ సాహితీ సమాలోచనం కార్యక్రమ విశేషాలు, ఆ సందర్భంగా ఆలపించిన తిలక్ గీతాలు డా. నాగభైరు అప్పారావు గారి యుట్యూబ్ ఛానల్ ద్వారా..... 









Vol. No. 02 Pub. No. 299

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం