Sunday, February 28, 2010

రంగుల పండుగ శుభాకాంక్షలు

జీవితమే రంగేళీ !
రంగు రంగుల కేళీ హోలీ !
మిత్రులందరికీ హోలీ శుభాకాంక్షలతో......
వి.శాంతారాం అద్భుత వర్ణమయ సృష్టి  నవరంగ్  నుంచి ' సంధ్య ' చేసిన హోలీ నయనానందకర నృత్యం మీకోసం....  





Vol. No. 01 Pub. No.211

Saturday, February 27, 2010

పదివేల వందనాలు

బ్లాగు మిత్రులు, వీక్షకులు అయిన శ్రేయోభిలాషులందరికీ పదివేల వందనకదంబాలు
ఈ నెల 14 వ తేదీతో బ్లాగు ప్రారంభించి ఆరునెలలు అయితే మరో పద్నాలుగు రోజులకు
అంటే నేటితో పదివేల హిట్లు పూర్తయ్యాయి. ఇందుకు కారణమైన అందరికీ పదివేల కృతజ్ఞతలు.







Vol. No. 01 Pub. No. 210

బాలు గారి తొలిపాట గురించి పద్మనాభం

శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న కథ చిత్రం ద్వారా శ్రీ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారిని తెలుగు చలన చిత్ర ప్రపంచానికి పరిచయం చేసిన నిర్మాత పద్మనాభం గారనే విషయం అందరికీ తెలిసినదే ! ఆ చిత్రంలోని ఏమి ఈ వింత మోహం... అనే పాట ద్వారా ఆ పరిచయం జరిగిందనే విషయం కూడా అందరికీ తెలిసినదే ! ఆ పాట మొదట ఘంటసాల, పి.బి. శ్రీనివాస్, రఘురామయ్య, సుశీల గార్లతో పాడించాలని అనుకున్నారట.  కానీ ఘంటసాల గారి తల్లిగారికి ఆరోగ్యం బాగులేక వూరికెళ్ళడంతో ఆ అవకాశం సంగీత దర్శకుడు కోదండపాణి గారి ద్వారా పరిచయమైన బాలు గారికి ఇచ్చారు పద్మనాభం.  ఆ విశేషాన్ని వివరిస్తూ పద్మనాభం గారు .................

" మేస్టారి అమ్మగారికి పెద్ద సుస్తీ చేసి ఆయన వాళ్ళ వూరు వెళ్ళారు. ఇటు చూస్తే పాట చిత్రీకరణ పూర్తి చెయ్యాలి. అందుకని పాట త్వరగా రికార్డు చెయ్యాలి. మాకు కొత్త కుర్రాడు గుర్తొచ్చాడు. చూద్దాం. ముందు అతనిచేత పాడిద్దాం. అంతగా బాగుండకపోతే ఆ తరువాత మళ్ళీ అండరినీ కలుపుకుని ఇంకోసారి రికార్డు చేదామని అనుకున్నాం. బాలు వచ్చాడు. ముగ్గురు ఉద్ధండుల మధ్య పాడుతున్నానన్న భయం ఎంతమాత్రం లేకుండా రిహార్సల్స్ లో పాల్గొన్నాడు. రికార్డింగ్ లోనూ దంచేశాడు. నాకు అతని గళం నచ్చింది, అయినా మర్యాదకోసం మేస్టారు వూరినుంచి వచ్చాక ఆయనకు పాట వినిపించాం. ఆయన కూడా కుర్రాడు అద్భుతంగా పాడాడు. ఉంచేయండన్నారు. అలా బాలు గాయకుడయ్యాడు " అని ఓ సందర్భంలో చెప్పారు.  



Vol. No. 01 Pub. No. 210

Friday, February 26, 2010

అమెరికాలో ' రంగుటద్దాల కిటికీ '

ఆమధ్య ఆంధ్రాలో ' రంగుటద్దాల కిటికీ ' తెరుచుకుంది.
ఈమధ్య అమెరికాలో మళ్ళీ అదే ' రంగుటద్దాల కిటికీ ' తెరుచుకుంది.
మన బ్లాగు మిత్రులు కొత్తపాళీ నారాయణ స్వామి గారు రాసిన ఆ పుస్తకం అమెరికాలో ఆవిష్కృతమైంది.
ఆ విశేషాలు ప్రసారమైన TV9 దృశ్య శకలం మీరు కూడా ఒకసారి చూడండి.




Vol. No. 01 Pub. No. 209

Thursday, February 25, 2010

విజయాధినేతకు నివాళి

తెలుగు చలనచిత్ర రంగంలో ' షావుకారు ' మొదలుపెట్టి ' శ్రీ రాజ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ ' వరకూ 'విజయ' కేతనం ఎగురవేసిన విజయా ప్రొడక్షన్స్ అధినేత కీ.శే. బి.నాగిరెడ్డి గారి ఆరవ వర్థంతి ఈ రోజు ( 25 ఫిబ్రవరి ) . ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ.............

 * నాగిరెడ్డి గారి జన్మదినం సందర్భంగా రాసిన టపా ఇక్కడ చూడండి.
Vol. No. 01 Pub. No. 208

సృజనాత్మక చిత్రాలు

మనలో చెలరేగే భావవ్యక్తీకరణకు మార్గాలెన్నో ! ఒక కవి తన భావాల్ని తన కవిత్వం ద్వారా, రచయిత కథలలాంటి రచనా ప్రక్రియల ద్వారా, సంగీతజ్ఞుడు తన సంగీతం ద్వారా, నటుడు తన నటన ద్వారా, శిల్పి తన శిల్పాల ద్వారా, చిత్రకారుడు తన చిత్రాల ద్వారా తెలియజేస్తారు. ఇందులో చిత్రలేఖన కళ విశిష్టమైనది. ఎందుకంటే పది పేజీలలో ఇమడ్చలేని భావాన్ని చిత్రకారుడు ఒక చిత్రంలో ఇమడ్చగలుగుతాడు. ఈ చిత్రలేఖనంలో నుంచి పుట్టుకొచ్చినదే చాయాచిత్ర కళ అదే ఫోటోగ్రఫి. ప్రస్తుతం ఈ కళ అత్యంత శక్తివంతమైన సమాచార సాధనం. సాంకేతికంగా అతి వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం డిజిటల్ ఫోటోగ్రఫి రాజ్యమేలుతోంది. అయితే డిజిటల్ గా ఎంత అభివృద్ధి చెందినా ఫిలింపై వచ్చే నాణ్యతను అధిగమించలేక పోతోంది.
ఆటో ఫోకస్ కెమెరాతోనో, డిజిటల్ కెమెరాతోనో ఏ విధమైన సాంకేతిక పరిజ్ఞానం లేకుండా కేవలం ఎయిమ్ అండ్ షూట్ అన్న పద్ధతిలో పుంఖాన పుంఖాలుగా ఫోటోలు తీసిపడెయ్యడం మనకు తెలుసు. అలాంటి మనకు హఠాత్తుగా ఒక ఎస్.ఎల్.ఆర్. కెమెరా ఇచ్చి ఏదో ఒక విషయం మీద ఫోటోలు తీసుకురమ్మంటే అవి సాగరసంగమం సినిమాను గుర్తుకుతెస్తాయేమో ! అలాంటి దశ నుండి ఇప్పుడిప్పుడే సాంకేతికాంశాలు నేర్చుకుంటున్నవారికి ఓ కెమెరా ఇచ్చి ఫోటోలు తీసుకుని రమ్మంటే..... వాళ్ళు తీసిన ఫోటోలకు వాళ్ళ చేతనే వ్యాఖ్యలను రాయించి, అవి ప్రదర్శనకు పెడితే...............
అదే జరిగింది నిన్న ( ఫిబ్రవరి 23 ), మొన్న ( ఫిబ్రవరి 24 ) విజయవాడ లో .............
ఆంధ్ర లయోలా కళాశాల విజువల్ కమ్యూనికేషన్స్ విభాగం వారు స్పార్క్స్ ' 10 పేరిట ఫోటోగ్రఫి ప్రదర్శన నిర్వహించారు. అందులో పాల్గొన్న వారు నిష్ణాతులైన ఫోటోగ్రాఫర్లేమీ కాదు. సాంకేతికాంశాలను ఔపోసన పట్టేసిన వారూ కాదు. ఇప్పుడిప్పుడే ఫోటోగ్రఫిలో ఓనమాలు దిద్దుతున్న విద్యార్థులు. ఆంధ్ర లయోలా కళాశాల లో విజువల్ కమ్యునికేషన్స్ విభాగంలో బి.ఎస్సీ. మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు. ఇప్పుడిప్పుడే ఈ రంగంలో అడుగుపెట్టిన విద్యార్థులలో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీసే ప్రయత్నంలో కళాశాల... వాళ్లకు కెమెరా ఇచ్చి ఫోటోలు తీసుకురమ్మని పంపించింది. అలా తీసిన వాటిల్లో మంచివి ఎన్నుకుని వాటికి సరిపడే వ్యాఖ్యలు వారిచేతనే రాయించి ప్రదర్శనకు ఉంచింది. ఎన్నుకున్న విషయానికి సంబంధించిన సబ్జెక్టు వెతుక్కోవడం ఒక ఎత్తైతే, వాటికి సరిపడే వ్యాఖ్య రాయడం మరో ఎత్తు. ఒక్కోసారి ఫోటో కంటే వ్యాఖ్యే మనల్ని ఎక్కువ ఆకర్షిస్తుంది. ఆలోచింపజేస్తుంది.
అవేమీ కళాఖండాలు కాకపోవచ్చు. కానీ ఇప్పుడే వికసిస్తున్న మొగ్గలు తీసినవి. వాళ్ళ లేత మేధకు అందిన అంశాలవి. దృశ్య మాధ్యమం ద్వారా సమాచార వ్యాప్తి చేసే క్రమంలో ఇది ఆ విద్యార్థుల తొలి అడుగు. వారిని ప్రోత్సహిస్తున్న కళాశాల యాజమాన్యానికి, వారికి నిర్దుష్టమైన మార్గాన్ని చూపుతున్న అధ్యాపక వర్గానికీ అభినందనలు. ఆ విద్యార్థుల కృషిని మీరు కూడా చూడండి........


కొసమెరుపు : ఈ విద్యార్థులలో మా అబ్బాయి కూడా ఒకడు.
Vol. No. 01 Pub. No. 207

Wednesday, February 24, 2010

నమ్మిన బంటు

1960 లో విడుదలయిన చిత్రం ' నమ్మినబంటు '. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో పాల్గొన్న తొలి తెలుగు చిత్రం ' నమ్మిన బంటు '. ఆ చిత్ర విశేషాలు కొన్ని ..................

* శంభు ఫిల్మ్స్ పతాకం పైన యార్లగడ్డ వెంకన్న చౌదరి నిర్మించిన ఈ చిత్రానికి ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు. 
* అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, గుమ్మడి, ఎస్వీ రంగారావు, రేలంగి, గిరిజ, చదలవాడ మొదలైన హేమాహేమీలు నటించిన  ఈ చిత్రంలో రామలక్ష్మణలనే రెండు ఎద్దులు, ఒక పాము కూడా నటించాయి.
అప్పట్లో దొక సంచలనం. 
* ఈ చిత్రానికి మొదట మాస్టర్ వేణు సంగీత దర్శకుడిగా వ్యవహరించినా ఆయన మరణం తర్వాత 'స్వ'రాజేశ్వరరావు గారు ఆ బాధ్యత తీసుకున్నారు. 
* ప్రముఖ రచయిత సుంకర సత్యనారాయణ ఈ చిత్ర కథనందించారు. ఆయనతోబాటు ఆత్రేయ సంభాషణలు రాసారు. సుంకర కమ్యూనిస్ట్ గా పేరు పడడంతో స్క్రిప్ట్ లో ఆ భావాలు ఎక్కువగా పడకుండా నిర్మాత స్వయంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.  
* ఎడ్ల పందాలు సన్నివేశాల చిత్రీకరణ ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో వారంరోజులపాటు మూడు కెమెరాలతో భారీగా ( అప్పట్లో ) చిత్రీకరించారు.    
* సుమారు ఒకటిన్నర సంవత్సరాలు పాటు షూటింగ్ జరిగిన ఈ చిత్రం నిర్మాణ సమయంలో అనేక అవాంతరాలు ఎదుర్కొంది. మాస్టర్ వేణు మరణంతో బాటు నాగేశ్వరరావు కాలికి దెబ్బ తగలడం, సావిత్రి గర్భవతి కావడం, మొదటి జత ఎద్దులు చనిపోవడం వంటి సమస్యలను ఎదుర్కొని నిర్మాణం పూర్తి చేసుకుని ఘన విజయం సాధించింది.  
* అచ్చమైన గ్రామీణ వాతావరణంలో నిర్మించిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా రాష్ట్రపతి రజత పతకం పొందింది. 
ఆ సంవత్సరం ' మా ఇంటి మహాలక్ష్మి ', ' జయభేరి ' చిత్రాలు కూడా ప్రశంసా పత్రాలు సాధించాయి.   
* శాన్స్  బాస్టియన్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొని అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో పాల్గొన్న తొలి తెలుగు చిత్రంగా చరిత్రకెక్కింది. 


 గమనిక :
* సాహిత్య అభిమాని బ్లాగు మిత్రులు శ్రీ శివ గారు పంపిన అక్కినేని వారి సంభాషణ నుంచి ఆడియో క్లిప్పింగ్ క్రింద ఇచ్చాను. శ్రీ శివ గారికి ధన్యవాదాలతో మీ కోసం.............
 

Vol. No. 01 Pub. No. 206



Monday, February 22, 2010

కృష్ణదేవరాయని కరుణ కృత్యం - 2

( 201 టపా తరువాయి )........  అంతే స్వరూపిణి తెర తొలగించుకుని బయిటకు వస్తుంది.  అతను తన తలపాగా తొలగిస్తాడు. అతన్ని చూసి ఖంగారు పడుతుంది.......
అతణ్ణి గతంలో నదీతీరాన కనబడే తన ఆరాధకుడు షామరాజుగా గుర్తిస్తుంది. అతడ్ని చూసి బాధపడుతుంది. తానొక బానిసగా అక్కడ ఉన్నానంటుంది. కాదు రాయలవారితో సహా మేమందరం నీ సౌందర్యానికి బానిసలమంటాడతను. తన చుట్టూ శిలలున్నాయని, అసలు తానే ఒక శిలనైపోయానని అన్న ఆమెతో.....

ఆ శిలలలోని ప్రాచీనం నువ్వు సంపాదించుకున్నావు. సంధ్యాసమయాల సుకుమారమైన ఎరుపు నీది, వెన్నెల బరువుని మొయ్యలేక భయపడి పరుగులెత్తే కెరటాల నురుగు చాంచల్యం నీ కళ్ళది. చీకటి అడవుల పవిత్ర ప్రశాంతం నీలో వుంది. అనిశ్చలత్వ, వక్షోభారం మొయ్యలేక ముక్కలుగా విరిగిపడే ఆ నడుం- అన్నీ శిలాకారంగా ఏనాడో మార్చాను.

అంటాడతను. అంతటి ప్రేమను ఇంతకాలం దాచుకుని ఇప్పుడు చెబుతున్నావు, అప్పుడే ఎందుకు చెప్పలేదని అడుగుతుంది.

నాది వాంఛ కాదు. నోరులేని ప్రేమ. నాకేమీ అక్కర్లేకపోయింది. నువ్వు యీ మేఘాల మాదిరి, ఆ నదిలో కెరటాల మాదిరి మార్పులేక, ఆ కొండల మాదిరి, నక్షత్రాల మాదిరి మార్పులేక నశింపులేక, శాశ్వతంగా యీ లోకంలోనే వుంటావనుకునేవాణ్ణి. తరువాత అది ' భ్రమ ' అని తెలుసుకున్నా. ఏదో వెర్రి నమ్మకం. నువ్వెక్కడున్నా, ఎట్లా వున్నా నాదానవనేననుకుని తృప్తి పడేవాణ్ణి. ఈ గాలి మనిద్దరికోసం, సూర్యచంద్రాదులు మనకోసం - అదీ భ్రమే. 
అంటాడతను. మరి అంతగా సుఖపెట్టే ఆ భ్రమను వదులుకుని ఇప్పుడిలా వచ్చి తననెందుకు బాధపెడతావని ప్రశ్నిస్తుంది. ఆమె కోరిక మీద తన గాథ వివరిస్తాడు. విలువిద్యనేర్చుకుని రాయల సైన్యంలో చేరిన అతను ఉదయగిరి ముట్టడిలో పాల్గొంటాడు. ఆ దుర్గాధ్యక్షుడితో బాటు అతని మేనత్తను కూడా చెరబడతాడు కృష్ణదేవరాయలు. ఆమెను ఆ చెరనుండి విడిపించడం కోసం తిరుగుతుంటే స్వరూపిణి కళ్ళబడిందని చెబుతాడు. ఆమెని విడిపించాలనే పట్టుదల నీకెందుకని ప్రశ్నిస్తుంది స్వరూపిణి. దానికతను....

ఆమె సుశీల. చాలా అందమైనది. అందమైన యే వస్తువు ఖైదులో వున్నా నా ప్రాణం జిల్లార్చుకుపోతుంది. సూర్యచంద్రాదులనూ, గాలినీ సముద్ర కెరటాలనీ ఎవరు బంధించగలరు ? వాటినేనా అందరూ సమంగా అనుభవించేటట్లు చెయ్యడం దేవుడు చేసిన వొక మంచికార్యం. 

అని వివరిస్తాడు. అంతేకాదు. మూడు ఆలయాల్లో స్వరూపిణి ప్రతిమలను చెక్కినట్లు చెబుతాడు. ఆమె భయపడుతుంది. రాయలవారు గుర్తుపడితే ప్రమాదమంటుంది.   ఏమీ కాదు అంత అందమైన స్త్రీ తన స్వంతమని రాయలవారు గర్విస్తాడంటాడతను. అతనిక్కడికి వచ్చినట్లు తెలిస్తే రాయలవారు ప్రాణాలు తీస్తారని వెంటనే వెళ్ళిపొమ్మని బ్రతిమాలుతుంది. దానికతను..............

నువ్వు నాకు మల్లే తెగించి, యివన్నీ వొదులుకుని వొచ్చేస్తావని నేను కలలో కూడా అనుకోలేదు. నిన్ను కోరిన పురుషులు యీ నగరంలొనే బోలెడుమంది వుండొచ్చు. కానీ వాళ్ళు నాకుమల్లే వారి గౌరవాలనూ, ప్రాణాలనూ త్యాగం చెయ్యడానికి సిద్ధంగా వుండలేరు. నేను నిన్ను కోరి సఫలీకృతం చేసుకోవడంలో నా మృత్యువు వుందని నాకు తెలుసు. నూరేండ్ల ముసలి వృథా బ్రతుకుకంటే వొక క్షణం మహత్తర ఆశాజ్వాలలో మండి బూడిదవడం వెయ్యిరెట్లు మేలని నా అనుభవం శాసిస్తూనే వుంది. నన్ను పొమ్మంటావు. ఎక్కడికి పోనూ ? 
ఇలా ఇద్దరిమధ్యా చాలాసేపు వాగ్వివాదం సాగుతుంది. ఆమె ఎంత బ్రతిమాలినా షామరాజు వినడు. ఆనందంగా మరణాన్ని ఆహ్వానిస్తానని, చివరగా తనకోసం ఒక్కసారి నాట్యం చెయ్యమనీ కోరుతాడు. అతని అభ్యర్థన కాదనలేక నాట్యం మొదలుపెడుతుంది స్వరూపిణి. ఇంతలో రాయలవారు అక్కడికి వేంచేస్తున్నట్లు సమాచారం తెస్తుంది చిట్టి. ఊహించని యీ పరిణామానికి బిత్తరపోతుంది స్వరూపిణి. షామరాజుని పారిపొ్మ్మని తొందరబెడుతుంది.

నిన్ను చూసి విప్పుకున్న కళ్ళని మళ్ళా యీ పాడులోకంమీద ఎట్లా వాల్చను ?
అని అడుగుతాడతను. ఆ పని చెయ్యలేకపోతే విషం తాగడమొకటే మార్గమంటుంది. ఆనందంగా విషం తీసుకుంటాడు. అతనికి తుది వీడ్కోలు చెబుతూ స్వరూప ముందుగదిలోకి వెడుతుంది. రాయలవారు వస్తారు. విఠలాలయంలో చూసిన ప్రతిమ స్వరూపిణి రూపాన్ని పోలియుండడం రామలింగడు గుర్తించి చెప్పినట్లు చెబుతారు. ఆ విషయం నిర్థారించుకోవడానికే అక్కడికి ఆమెను తీసుకెళ్ళాలని నిర్ణయించినట్లు తెలియజేస్తారు. బయిల్దేరమంటారు. రాయలవారి ధోరణిని బట్టి ఇక తప్పదని అర్థం చేసుకుంటుంది స్వరూపిణి. బయిల్దేరుతుంది. రాణీవాస అలంకరణలేమీ లేకుండా రావడానికి రాయలవారు వప్పుకోరు. అలంకరణ కోసం ఆమెను బలవంతంగా లోపలకు తీసుకెడతారు.
ఆయనకు అక్కడ పడివున్న షామరాజు దేహం కనబడుతుంది. ఎవరని అడుగుతారు. ఏం చెప్పాలో తెలియక ఒక ఖైదీ అని చెబుతుంది. ఆమెకు ఎప్పుడూ అత్తరులు పంపించే ఫెరిస్టాఖాన్ పంపిన విషాన్ని పరీక్షించడానికి ఆ ఖైదీని తెప్పించినట్లు, అతనిచేత తాగించగానే మరణించినట్లు చెబుతుంది. రాయలవారు అతన్ని చూసి జాలిపడతారు. స్వరూపిణి తట్టుకోలేకపోతుంది. ఎంతోసేపు నిజాన్ని దాచలేకపోతుంది. అతను తన స్నేహితుడని, తనని చూడడానికి వచ్చి సాహసం చేసాడని, మీరొస్తున్నారని తెలిసి వెళ్ళిపొమ్మంటే వెళ్లలేదని, అందుకే విషం ఇచ్చినట్లు చెబుతుంది. అంతేకాదు. అతను తనని ప్రేమించిన విషయం కూడా చెప్పేస్తుంది. దానికి రాయలవారు

పిచ్చివాడు ! నాతో చెబితే నిన్ను అతని వెంట పంపి వుందునుగా. నీది కఠిన హృదయం.
అనగానే స్వరూపిణి

మీదీ అంతే. ఇన్ని సంవత్సరాల నుంచి నన్నిక్కడ బంధించారు. దాస్యమే స్వర్గమనుకున్నాను. మీకు హృదయం లేదు.

అంటుంది.
ప్రేమించిన వాణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపిన నీకే హృదయం లేదని నిందిస్తారు రాయలవారు. వాదనలో ఆయన పుట్టుకను గురించి నిలదీస్తుంది. అంతే. రాయలవారికి ఆగ్రహమొస్తుంది. తన తల్లి దాసీది కాదని, సాగివారి ఆడపడుచని అంటారు. రాజుకి కొందరు భార్యలు, స్త్రీలు ఉండటం సాంప్రదాయమని, అయితే వారందరూ మహాపతివ్రతలనుకునేంత మూర్ఖుణ్ణి కాననీ అంటారు. తన ప్రతిమల్ని స్థంభాలకెక్కించినది కూడా అతనేనని చెబుతుంది స్వరూపిణి. రాయలవారు ఆశ్చర్యపోతారు. అంత గొప్ప శిల్పినీ, అతనిలోని అద్భుతమైన కళని ఆమె అందం బలిగోరిందని బాధపడతారు. అంతేకాదు. ఆమె అంత:పురంలో బందీకాదని అక్కడ వుండడానికీ, వెళ్ళిపోవడానికీ అమెకు స్వేచ్చ వుందంటూ....

ఇది బందిఖానా అంటూ ఏదో గొణిగావు మొదట్లో. నీకొక్కదానికే కాదు యీ సంకెళ్ళు. మనందరినీ యీ ప్రపంచం బంధించింది. కిరీటం నన్ను, స్వార్థం నిన్ను, కళ అతన్ని, ఆకృతి రాళ్ళనీ, చీకటి వెలుగునీ, సంస్థలు సంఘాన్నీ, ప్రేమ మానవ హృదయాన్నీ సంకెళ్ళతో సాకుతాయి. ఇదుగో ఈ సంకెళ్ళు చప్పుడు కాకుండా చూసే బాధ్యత మనదీ - బాధ్యత నాదీ...
అంటూ బయిటకు వెళ్ళిపోతారు. రాయలవారి వ్యక్తిత్వం ముందు తన ప్రేమ వెలవెలబోవడం గమనించి తన జీవితం వ్యర్థమనుకుంటుంది స్వరూపిణీదేవి. అక్కడేవున్న విషకలశం తీసుకుని నిర్జీవంగావున్న షామరాజు దగ్గరకు వెడుతుంది. కలశం ఎత్తి త్రాగబోతుండగా అతను దిగ్గున లేచి ఆమె చేతిలోని కలశాన్ని లాక్కుంటాడు. స్వరూపిణి ఆశ్చర్యపోతుంది. తాను నిజంగా విషం త్రాగలేదని, నటించానని చెబుతాడు. రాయలవారి ఔదార్యాన్ని, ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని మెచ్చుకుంటాడు. ఎందుకీ సాహసం చేసావని అడుగుతుంది స్వరూపిణి.

నేను ప్రాణాలమీద ఆశ ఎల్లానూ వొదులుకున్నా. కానీ, చూద్దాం ఏం జరుగుతుందోనని విషం పారబోసి - చిట్టికి తెలుసు - చచ్చినవాడికిమల్లే పరున్నాను. రాయలకి ఎంత దయ ? ఎంత ఆదరణ ? మనం బైటికి పోదాం. పద గ్రహణ స్నానం చేద్దాం. ఆమట్టున మావూరు...

అని బయిల్దేరదీస్తాడు. చిట్టి కూడా వారిని అనుసరిస్తుంది.
**********************




క్రీ.శ. 1512 వ సంవత్సరంలో జరిగినట్లుగా చెప్పబడే యీ కథను నాటికగా అద్భుతమైన శిల్పంతో, పదునైన సంభాషణలతో తీర్చిదిద్దారు బుచ్చిబాబు. 1944 లో ' భారతి ' లో ప్రచురణ తర్వాత కొన్నాళ్ళకు మద్రాసు ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రసారమైంది.

 

                          మిత్రులకు విన్నపం

' మల్లీశ్వరి ' చిత్రకథకూ, యీ కథకూ పూర్తి స్వామ్యం లేకపోయినా కొన్ని పోలికలు మాత్రం స్పష్టంగా కనబడతాయి. అందుకే ఆ కథ రూపకల్పనకు యీ నాటికే బీజమయినట్లు చెబుతారేమో ! ఏమైనా బుచ్చిబాబు రచనా పటిమకు యీ నాటికలోని సంభాషణలే సాక్ష్యం.

ఇది కేవలం పరిచయం మాత్రమే ! ఆ క్రమంలోనే నాటికలోని ముఖ్యమైన సంభాషణలను ఇవ్వడం జరిగింది. ఇవి బుచ్చిబాబు గారి రచనా వైశిస్ట్యాన్ని తెలియజేసేందుకు ఉపయోగిస్తాయనుకుంటాను. ఈ రచన ఇదివరలో చదివిన వారు గానీ, ఆకాశవాణి నాటికను విన్నవారు గానీ బ్లాగు మిత్రులలో గానీ, వారి పరిచయస్థులలో గానీ, ఇతర చదవరులలో గానీ ఎవరైనా ఉంటే వారి స్పందననూ, అనుభూతిని తెలియజేస్తే బాగుంటుంది. అలాగే యీ పరిచయాన్ని చదివాక 'మల్లీశ్వరి' కథకూ, యీ కథకూ గల పోలికల్ని గురించి మిత్రులు తమ విశ్లేషణలను, స్పందనను తెలియజేయగలరు. ఈ టపాలోనే వ్యాఖ్యలరూపంలోగానీ, విడిగా నా ఇ-మెయిల్ కు గానీ పంపండి.
నా e-mail : srcrao@hotmail.com  

Vol. No. 01 Pub. No. 205

Sunday, February 21, 2010

మాతృభాషాదినోత్సవం-విలువైన సమాచారం

ఈ రోజు అంటే ఫిబ్రవరి 21 వ తేదీ ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవంగా ప్రకటించింది. ఆ సందర్భంగా మన మాతృభాష అయిన తెలుగుకి సంబంధించిన విలువైన సమాచారాన్ని అందించారు శ్రీ నూర్ రెహమతుల్లా గారు. ఈయన తెలుగు భాషా వ్యాప్తికి, ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు వాడకానికి విశేషమైన కృషి చేస్తున్నారు. ప్రభుత్వాధికారిగా తనకున్న విస్తృతాధికారాల్ని తెలుగు భాషా వ్యాప్తికి ఉపయోగించడం ఎంతైనా అభినందనీయం. తెలుగుకు ప్రాభవానికి విశేషమైన కృషి చేస్తున్న ఆయనకు అభినందనలు తెలుపుతూ, తెలుగు భాషను ప్రేమించే వారందరికీ మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలతో రెహమతుల్లాగారు అందించిన ఈ వ్యాసం...................

విద్యార్ధులు తెలుగులో మాట్లాడకూడదట
* కడప జిల్లా మైదుకూరు సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాలలో తెలుగుభాష మాట్లాడకూడదంటూ చిన్నారుల మెడలో బోర్డులు తగిలించారు.తెలుగు భాష మా ట్లాడకూడదంటూ విద్యార్థులపై ఆంక్షలు విధించడం మానవ హ క్కుల ఉల్లంఘనకు పాల్పడటమేనని, ఇది ఘోర తప్పిదమని మా నవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టి స్‌ సుభాషణ్‌రెడ్డి వ్యాఖ్యానించా రు. (ఆంధ్రజ్యోతి 28.10.2009)
పసిపిల్లలు ఏడ్చేది మాతృభాషలోనే
పుట్టకముందే నేర్చుకుంటారు.మాతృభాషలో ఎన్నడూ మాట్లడనంటూ రాసి ఉన్న బోర్డులను చిన్నారి విద్యార్థుల మెడలో 'ఉపాధ్యాయులు' వేలాడదీయటం అనైతికమే కాదు అసహజం కూడా అని సైన్స్‌ నిరూపించింది. అప్పుడే పుట్టిన పసిపిల్లలు ఏడ్చే ఏడుపు కూడా మాతృభాషలోనే ఉంటుందని జర్మనీకి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. అమ్మ గర్భంలో ఉన్న తొమ్మిది నెలల్లో.. చివరి మూడు నెలల సమయంలో తల్లి మాటలు వింటూ పిల్లలు మాతృభాష గురించి తెలుసుకుంటారని, పుట్టిన తర్వాత వారి ఏడుపు అదే భాషను ప్రతిఫలిస్తుందని తెలిసింది.పిల్లలు గర్భంలో ఉండగానే తల్లి మాటలు వింటూ ఉచ్చరణ గురించి తెలుసుకున్నారని స్పష్టమైంది. పిల్లలు వివిధ రకాల ధ్వనుల్లో ఏడ్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ.. మాతృభాషకే ప్రాధాన్యమిస్తున్నారని కూడా ఈ పరిశోధనలో తెలిసింది. అమ్మతో అనుబంధాన్ని పెంచుకోవటం కోసమే శిశువు తనకు తెలిసిన మొదటి విద్యను ఇలా ప్రదర్శిస్తుంటారు.(ఈనాడు7.11.2009).కాబట్టి అన్ని మతాల దైవప్రార్ధనలు కూడా మాతృభాషల్లో ఉండటం సమంజసమే.
ద్వితీయ భాషగా తెలుగుకు బదులు ఇంగ్లీష్
ఆరు, ఆపై తరగతులు చదివే విద్యార్థులు ద్వితీయ భాషగా తెలుగుకు బదులు ఇంగ్లీష్‌ తీసుకోవడానికి ఇక మీదట జిల్లా విద్యా శాఖాధికారులే (డీఈఓ) అనుమతి ఇవ్వొచ్చని ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇతర రాష్ట్రాల విద్యార్థులు ద్వితీయ భాషగా ఇంగ్లీష్‌ను తీసుకోవాలంటే పాఠశాల విద్య డైరెక్టరేట్‌ నుంచి అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. (ఆంధ్రజ్యోతి1.11.2009)-
తెలుగుపై పరిశోధన.. అమెరికాలోనే ఎక్కువ
మనదేశంలో భాషలపై పరిశోధనలు జరిపే వారే కరవయ్యారని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్‌ సిబాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడితో పోలిస్తే.. అమెరికాలోనే ఎక్కువమంది తమిళ, తెలుగు భాషలపై పరిశోధనలు చేస్తున్న వారు కనిపించారని తెలిపారు.(ఈనాడు31.1.2010)
అంతరించిపోతున్నఅమ్మభాష
దాదాపు రెండుతరాల విద్యార్థులు తెలుగు రాకుండానే, తెలుగుభాషను తూతూమంత్రంగా చదువుకునే కళాశాలల నుంచి బైటికొచ్చారు. వాళ్లంతా ఇంజినీర్లు, డాక్టర్లు, ప్రభుత్వశాఖల్లో పెద్దపెద్ద ఉద్యోగులైపోయారు. తెలుగంటే వెగటు. ఇంట్లో తెలుగక్షరాలు కనపడనీయరు. వినబడనీయరు. ఇక వీరి పిల్లలకు మాత్రం తెలుగంటే ఏం తెలుస్తుంది పాపం! ఇలాగే ఇంకో రెండుతరాలు కొనసాగితే, తెలుగువాచకాన్ని సాలార్‌జంగ్‌ మ్యూజియంలో ఓ పురాతన వస్తువులా ప్రదర్శనకు పెట్టాల్సిందే.పేరుకు భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రమైనా, మనదగ్గర తల్లిభాషది రెండో స్థానమే. మళ్లీ మాట్లాడితే, మూడోస్థానమే.యాభై ఏడక్షరాలు, మూడు ఉభయాక్షరాలున్న మన వర్ణమాల ప్రపంచ భాషల్లోనే రెండో అతి పెద్దది. రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తరువాత కానీ మనం తెలుగుభాషకు అధికార హోదా కల్పించుకోలేకపోయాం. తెలుగుభాషకే మంగళహారతులు పాడేస్తున్నాం.ఇంగ్లిష్‌, రోమన్‌, జర్మన్‌ సహా సంస్కృతం, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం వంటి భాషలన్నింట్లోకీ ఒక్క తెలుగు భాషకే భావాలను వేగాతివేగంగా అక్షర రూపంలోకి తర్జుమా చేయగల శక్తి ఉందని నిరూపించారు. 'ఇంగ్లిషులో ఒక అక్షరం 4.71 బిట్ల సమాచారాన్ని అందించగలిగితే, తెలుగు అక్షరం అదే సమాచారాన్ని అందించడానికి 1.14 బిట్లు మాత్రమే ఉపయోగించుకుంటుందని తేలింది. హిందీకి 1.56 బిట్లు, తమిళానికి 1.26 బిట్లు, కన్నడానికీ మలయాళానికీ 1.21 బిట్లు అవసరమయ్యాయి. ఇంగ్లిషులో ఒకే పదానికి అనేక పర్యాయపదాలు ఉండగా, ఒక్కో ప్రత్యేక పదం ద్వారా ఒక్కో ప్రత్యేక భావాన్ని స్పష్టంగా అందించగల సామర్థ్యం తెలుగు భాషకుంది. అదే ఈ వేగానికి కారణం.కంప్యూటరు, మౌజు, కీబోర్డు, హార్డ్‌వేరు, సాఫ్ట్‌వేరు...చివర్లో అచ్చు గుద్దేస్తే చాలు, కాకలుతిరిగిన ఇంగ్లీషు పదమైనా పంచెకట్టులోకి మారిపోతుంది. సాంకేతిక పదజాలాన్ని ఇట్టే ఇముడ్చుకోగల శక్తియుక్తులున్న ఏకైక భాష... భారతీయ భాషలన్నింట్లోకీ ఒక్క తెలుగేనని యాభై ఏళ్ల కిందటే ప్రపంచ ప్రసిద్ధ రసాయనశాస్త్రవేత్త ప్రొఫెసర్‌ హాల్డెన్‌ ప్రశంసించారు.మనదేశంలో 1652 మాతృభాషలున్నాయి. వీటిలో మహా అయితే ఓ పదిహేను, పదహారు భాషలకు లిపి ఉంది. రెండువందల భాషలకు పదహారు వందలకుపైగా మాండలికాలున్నాయి. ముప్ఫైశాతం పిల్లలు తమ మాతృభాషను నేర్చుకోవడం మానేస్తే, ఆ భాష ఉనికి ప్రమాదంలో పడినట్టే.1956 ఫిబ్రవరి 29న పాక్‌ సర్కారు బెంగాలీని కూడా మరో అధికార భాషగా గుర్తించింది. మాతృభాష కోసం నలుగురు బెంగాలీ యువకులు ప్రాణాలర్పించిన ఫిబ్రవరి 21వ తేదీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం'గా ప్రకటించింది. - కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు 21.2.2010)

Vol. No. 01 Pub. No. 204

Saturday, February 20, 2010

విలక్షణ హాస్య నటుడు కన్నుమూత

తెలుగు చలన చిత్ర రంగంలో విలక్షణ హాస్య నటుడిగా ప్రఖ్యాతిగాంచిన పద్మనాభం ఈరోజు ఉదయం కన్నుమూసారు. ఆ వార్త ఇక్కడ చూడండి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ...........


Vol. No. 01 Pub. No. 203

Friday, February 19, 2010

తెలుగు చలనచిత్రరంగ ' స్వాతికిరణం '

ఆయన చిత్రాలలో సంస్కారం వుంటుంది
ఆయన పాటలలో సభ్యత వుంటుంది

ఆయన చిత్రాలలో సంగీత సాహిత్యాలు సమాలంకృతాలు
ఆయన పాటలలో అణువణువునా నాట్య వేదనాదాలు

ఆయన చిత్రాలలో సహజత్వం వుంటుంది
ఆయన పాటలలో హృదయం వుంటుంది

ఆయన చిత్రాలు కళాత్మకాలు
ఆయన చిత్రాలు వ్యాపారాత్మకాలు కూడా

ఆయన చిత్రాలు కాసులూ కురిపించాయి
ఆయన చిత్రాలు ప్రశంసలూ కురిపించాయి

ఆయన చిత్రాలు పండితులూ చూస్తారు
ఆయన చిత్రాలు పామరులూ చూస్తారు

ఆయన వ్యాపారాత్మక చిత్రాలు తీసి విజయం సాధించారు
ఆయన కళాత్మక చిత్రాలు తీసి విజయాలు చవి చూసారు

ఆయన ప్రయోగాత్మక చిత్రాలూ తీసారు
ఆయన సందేశాత్మక చిత్రాలు తీసారు

ఆయన సినిమాలు ఇంటిల్ల పాదీ చూసి ఆనందించవచ్చు
ఆయన పాటలు ఆబాలగోపాలమూ పాడుకుని పరవశించవచ్చు 

ఆయన కళాకారుడు, కళా పిపాసి, కళా తపస్వి
ఆయనే కళాత్మక చిత్రాలకి, వ్యాపారాత్మక చిత్రాలకు గల అంతరాన్ని చెరిపేసిన దర్శకుడు
శ్రీ కాశీనాథుని విశ్వనాథ్

గురువు గారు శ్రీ కె. విశ్వనాథ్ గారి జన్మదిన సందర్భంగా నమస్సుమాంజులులతో............................. 

  

Vol. No. 01 Pub. No. 202

Thursday, February 18, 2010

కృష్ణదేవరాయని కరుణ కృత్యం - 1

శ్రీకృష్ణదేవరాయుల కాలం స్వర్ణయుగంగా మన చరిత్ర అభివర్ణిస్తోంది. వజ్రాలు, రత్నాలు మొదలైనవి రాశులుగా పోసి అమ్మేవారని అంటారు. వాటిమాటెలావున్నా రాయలవారి కాలంనాటివని చెప్పుకునే కథలెన్నో ప్రచారంలో వున్నాయి. వాటిలో నిజమైనవి ఏవో, ఊహాజనితమైనవి ఏవో చెప్పటం చాలా కష్టం. అలాంటి ఒక కథే మన  తెలుగు చలనచిత్ర చరిత్రలో మరుపురాని మధుర కావ్యంగా నిలిచిపోయిన స్వర్గీయ బి.ఎన్. రెడ్డిగారి ' మల్లీశ్వరి ' . ఆ చిత్రకథ రూపకల్పనకు బీజంగా చెప్పుకునే నాటిక ' కృష్ణదేవరాయని కరుణకృత్యం ' . తెలుగు సాహిత్యంలో బుచ్చిబాబుగా ప్రసిద్ధికెక్కిన శివరాజు వేంకట సుబ్బారావు గారు రాసిన ఈ నాటిక 1944 మే నెల ' భారతి ' మాస పత్రికలో ప్రచురించబడింది. ఆ నాటిక పరిచయం...........................

ఆ నాటిక ముందుమాటలో బుచ్చిబాబు ఇలా అంటారు.
విజయనగర సామ్రాజ్యాన్ని గురించి చాలా గ్రంథాలు చదివినా, గ్రంథకర్తలు ఆనాటి శిల్పాన్ని గురించి చరిత్రాత్మకంగా, మిగతా దేశాలలోని శిల్పాలతో పోల్చి వ్రాయడం తప్ప ఆ శిల్పులను గురించి వొక్క విషయం కూడా చెప్పరు. వాళ్ళు ఎట్ల్లాంటి వ్యక్తులు, ఎక్కడ నేర్చుకున్నారు, వాళ్ళ వేతనాలెంత మొదలైన జీవితాలకి సంబంధించిన విషయాలేవీ కనిపించలేదు.  సామ్రాజ్యం పోయింది. కొన్ని శిల్పాలు మాత్రం మిగిలాయి. ఆనాటి వాతావరణాన్ని సృష్టించి, వొక శిల్పి ఆంతరంగిక జీవితాన్ని ప్రదర్శించి చూపుదామన్న సంకల్పానికి యీ నాటిక ఫలితం. 
ఆంధ్రోత్పత్తి, కర్ణాటకవాదాలతో దీనికి నిమిత్తం లేదు. ఈ నాటికలో జరిగిన విషయాలకి చరిత్రలో ఆధారం లేదు. కాని అవి అసంభవం కాదు. మొదట కృష్ణ్దదేవరాయలని  వివాహమాడటానికి అంగీకరించని ముదుగల్లు కన్య ' నేహాల్ ' కథ ఫెరిష్టా వ్రాశాడు. ఆమెలాంటి స్త్రీ, తిమ్మరసు లాంటి పురుషుడు వున్నకాలాలలో యిట్లాంటి వ్యక్తులుండటం అసహజం కాదు.        

ఇక కథాక్రమంలోకి వస్తే శ్రీకృష్ణదేవరాయుల జనానాలో స్వరూపిణీదేవి కూడా ఒక రాణి. ఆవిడకొక చెలికత్తె చిట్టి. స్వరూపిణి రాణివాసంలో చేరిన అయిదు సంవత్సరాల కాలంలో రాయలవారు ఆమె వద్దకొచ్చింది కేవలం ఒక్కసారే !
ఈ అయిదు సంవత్సరాలలో ఆమె అడుగు బయిట పెట్టలేదు. అందుకే అంటుంది................

నేను చిన్నప్పుడు చిలకల్ని పంజరంలో బంధించి పెంచుకున్నాను. నా పాపం వూరికే పోతుందా ! హజారి రాముడు నన్నిందులో బంధించాడు.

తన అందం అడవిగాచిన వెన్నెల అయిపోతోందని ఆమె ఆవేదన.  తన చెలి చిట్టితో అంటుంది..................

నా సౌందర్యానికి విలువ లేదే ! ఏకాకిగా అరణ్యంలో వుండే యోగి మంచితనానికి ఎంత విలువ వుందో నా అందానికీ అంతే ! ఒసే, ఒక విశేషం చెబుతా విను. జీవితం అంటే కంబళి మీద శయ్య కాదు. కత్తి మీద సాము. రాజుగారి కిరీటంలో మణిగా వెలిగినప్పుడే నా అందం మెరిసిపోతుంది. 

ఆ రోజు చంద్రగ్రహణం. తన భర్తతో కలసి నదీస్నానానికి వెళ్ళాలని స్త్రీ సహజమైన కోరిక ఆమెది. ఆయన ఉనికిని గురించి వాకబు చేసిన చిట్టి ఆయన విఠలాలయాన్ని చూడటానికి వెళ్ళారని చెబుతూ ఆ ఆలయంలోని శిల్ప సౌందర్యాన్ని వర్ణిస్తుంది. 

రాజుగారు కటకాధిపతిగార్ని జయించి వొచ్చింతర్వాత విజయసౌధాన్ని కట్టించారు. చూశారూ ? ........ నేను మొన్న అల్లా వెడ్తుంటే - అందరూ దాన్ని చూస్తో నిలబడ్డారు. నేనూ వెళ్ళాను. అందులో వెనుక రెండు ఆడబొమ్మలు రాళ్లమీద చెక్కి వున్నాయండి. నమ్మండి. నమ్మకపొండి - అచ్చం మీలాగే వున్నాయండి. ఆ సన్నటి నడుం. గుండ్రటి భుజాలు. ఆ ముక్కు అంతా మీరే. 

వారి సంభాషణ క్రమంగా చిన్ననాటి తీపి జ్ఞాపకాలమీదకు వెడుతుంది. తన అనుభవాన్ని వర్ణిస్తూ స్వరూపిణీదేవి...  

మా వీధి చివర వీరపాంచాలుల గుడిసెలుండేవి. ఓ గొర్రెల కాపరి వుండేవాడే. నేను నదికి నీళ్ళకి వెళ్ళే సమయానికే వాడూ మందలతో చక్కా వొచ్చేవాడు. ఆ గట్టున కూర్చుని నన్నే చూస్తూ వుండేవాడు. ఇల్లా రెండు నెలలు. ఏమీ మాట్లాడేవాడు కాడు సుమా. నాకన్నీ జ్ఞాపకం వొస్తున్నాయి. నల్లగా వుండేవాడు. నల్లగా అంటే ఎట్లాగనుకున్నావు ? వెన్నెల తాలూకు మెత్తని, పల్చని నలుపు. భుజాలూ - అవీ కండలు తిరిగి వుండేవాడు....................
నేనిక్కడికి వొచ్చేస్తున్నానని వాడుకెట్లా తెలిసిందో - రోజూ మా యింటిముందు అరుగు కింద నిలబడి, కిటికీలోంచి నేను నాట్యం నేర్చుకుంటూంటే చూస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో మందేశ్వర శర్మ నాకు నాట్యం నేర్పేవాడులే. నాకు వాణ్ణి చూడగానే సిగ్గువచ్చి పాట నిలిపి ఆగిపొయ్యేదాన్ని. 

స్వరూపిణి నాట్యం గురించి విన్న చిట్టి అడుగుతుంది అమాయకంగా ఇక్కడ ఎప్పుడూ నాట్యమెందుకు చెయ్యలేదని. అంతే స్వరూపిణిని నిస్పృహ ఆవహిస్తుంది. 

నన్ను చెయ్యమని అడిగేవాడు లేందే ? నే నీ నాట్యంతో రాయలని ఆకర్షించాలట. రాణీవాసం వొచ్చింతర్వాత నాట్యం నాగలోకానికి వెళ్ళింది. శుద్ధాంతంలో పడ్దతర్వాత నా శక్తులన్నీ శిలలుగా మారిపొయ్యాయి. 

ఇలా ముచ్చట్లాడుకుంటున్న సమయంలో కిటికీలోంచి ఒక బాణమొచ్చి వారిముందు పడుతుంది. దానికో కాగితం గుచ్చి ఉంటుంది. అందులో................................

 " నువ్వు రాణివని నాకు తెలుసు. నేను సాధారణ మనిషిని. నిన్ను దూరం నుంచి చాలాకాలం ఆరాధించాను - కీటకం నక్షత్రాన్ని ఆశించినట్లు. ఈ జీవితంలో నేను చెయ్యగల పని చేశాను. ఇప్పుడు నాకు నీతో వొక గంటసేపు ఆంతరంగిక స్నేహం కావాలి. ఆ తర్వాత చచ్చినా బ్రతికినా నాకు లెక్కలేదు. జవాబు పంపేవరకూ నేనిక్కడనుంచి కదలను. తూర్పున 13 వ ద్వారం వద్ద తెల్లదుప్పటీ పాగా చుట్టుకున్న వ్యక్తి. ఇట్లు అనామకుడు. " 

ఆ లేఖ రాసే సాహసం ఎవరు చేసారో ఇద్దరికీ అర్థం కాదు. ఏం చెయ్యాలో తెలియక తర్జన భర్జనలు పడతారు. ఒక దశలో తనని పరీక్షించడానికి రాయలవారే ఆ పని చేసారేమోననే అనుమానం కూడా వస్తుంది..............

 అబ్బే ! నాకు నమ్మకం కుదరడం లేదే. ఆలయానికి వెళ్ళిన మహారాజు చంద్రగ్రహణం నాడు ఎన్నో కృత్యాలు నెరవేర్చవలసి వుండగా నాతో పరాచికాలాడుతూ కూర్చుంటాడటే - నా వెర్రి కాక ? ఐదు సంవత్సరాల నుంచి లేని ప్రేమ యీనాడు బైలుదేరిందా - నేను నమ్మనే. వీడేవడో దుండగీడు. పొగరుబోతు. నేనంటే అసూయతో కుళ్ళిపోతున్న నా సవతుల ప్రేరేపణల వల్ల ఎవడో తుంటరి బహుమానాలకు ఆశపడి పన్నిన పన్నాగం ఇది.

అంటుంది స్వరూపిణి.   ఇలాగ రకరకాలుగా మధనపడి చివరకు ఆ లేఖ వ్రాసిన వాడ్ని తుదముట్టించాలని నిర్ణయించుకుంటుంది. చిట్టిని పంపి అతన్ని పిలిపించుకుంటుంది. అతడు వచ్చాక తెర వెనుకనే వుండి వివరాలడుగుతుంది. పేరడిగితే అనామకుడనే చెబుతాడు. అంతేకాదు....................

 పేర్లతో సంబంధమేముంది రాణీ. మిమ్మల్ని స్వరూపిణీ దేవి అనికాక కురూపిణీ దేవి అని పిలిస్తే మీ సౌందర్యం మారుతుందా ? నేనది చూడటానికే వచ్చాను.......
నేను నియమాలని, సంప్రదాయాలని, కట్టుబాట్లని, సంఘనీతిని లక్ష్యం చెయ్యను. అసలు మీ వ్యక్తితో, మీ హోదాతో నాకు నిమిత్తం లేదు. మీ సౌందర్యం చూడాలి.

అంటాడు.  స్వరూపిణికి ఒక సందేహం వస్తుంది. ఆ అనామకుడికి భార్య వున్నదాయని. అదే విషయం అతన్ని అడుగుతుంది. అతని సమాధానం..............

లేదు. నా దగ్గర నౌకరీ చెయ్యడానికి ఏ స్త్రీ అంగీకరించలే. నాకు అన్నం పెట్టే శక్తి లేదు గనుక.  

అంటాడు. ఆమెకర్థంకాదు. వివరణ అడుగుతుంది........

వాళ్ళనీ, వాళ్ళ కుటుంబాలనీ అన్నం, బట్టా పెట్టి పోషించగలడు గనక యీ జనానాలో స్త్రీలందరూ రాయలవారికి భార్యలుగా అమ్ముడు పోయారు. అంతకంటే వేరే గూడార్థం లేదు. 

అంటాడు. అతని వృత్తిని గురించి అడుగుతుంది...........

నా వృత్తి సౌందర్యం సృష్టించడం

అంటూ తన హృదయాన్ని ఆమె ముందు పరుస్తాడు.

నాకు బాంధవ్యాలూ, స్నేహాలూ, చుట్టరికాలూ లేవు. ప్రపంచం నాకు పరలోకం. మిగతా మానవులు ఏమీ చేతకాక వొఠి శుంఠలై యీలోకానికి లొంగిపోయి - ఖజానా గుమాస్తాల కింద అమ్ముడుపోయి, అందమైన వొస్తువును అనుభవించడానికి ధైర్యం, తెగింపూ లేక, గౌరవనీయులైన నీతిపరులక్రింద యీ ప్రపంచ రథచక్రాలని పట్టుకు కూర్చున్నారు. వీళ్ళలా నేనూ వుంటే యీ సాహసం యెల్లా చేస్తా. మీరే చెప్పండి. నాకు యథార్థమైన శరీరం వుంటే యిక్కడికి వొచ్చే వుండను. శరీరాన్ని శ్మశానంలోనూ, వ్యక్తిత్వాన్ని విబూదిలోనూ గిరవాటెట్టి, నాయథార్థమైన హృదయాన్ని మీముందు పారేసుకుంటున్నాను. దాన్ని తృణీకరించొచ్చు. హింసించొచ్చు. తన్నొచ్చు. త్యజించొచ్చు - కానీ దాన్ని చంపలేరు. 
స్వరూపిణి : దాన్ని చంపడమే నా సంకల్పం 

అంటుంది. వెంటనే అతను................

ఈ చీరలకోసం, ఈ నగలకోసం, ఈ హోదా కోసం అన్యులు మిమ్మల్ని చూసి అసూయపడాలన్న మీ గుడ్ది కోరిక - యివే యథార్థాలనుకుని నమ్మి, మాతృత్వ, స్త్రీత్వం మొగ్గలోనే తుంచిన మీ మలిన శరీరంలో హృదయం ఎక్కడేడిసింది. ఉంటే రాయలకి యింతమంది స్త్రీలెందుకు ? 

అని నిందిస్తాడు. గడువైపోతోందని హెచ్చరించిన ఆమెతో రాణీగా కాక స్త్రీగా తనకు కనబడాలంటాడు. ఆలోచించిన స్వరూపిణి అలాగే కనబడతానని, అయితే కనబడిన మరుక్షణం తాను సిద్ధం చేసిన విషం తాగాలంటుంది. దానికి సిద్ధమేనన్న అతనితో మరి నీకోసం ఏడ్చేవాళ్ళెవరూ లేరా యని అడుగుతుంది. నా కోసం ఏడ్చేది నువ్వేనంటాడు అతను. ఆమెకతని ధోరణి అర్థం కాదు. ఆగ్రహిస్తుంది. అతను మరింత వివరంగా......................

అవును. నాకోసం ఏడ్చేది మీరే. సృష్టికర్తను నేను. మీకు మాతృత్వం అర్పించే శిల్పం కోసం మీరు ఏడుస్తూ వుంటారు. మా యింటి ఎదురుగా చెరువొకటి వుండేది. అందులో కెరటాలు గట్టున పడి చేసే చప్పుడు ఎదురుతిరగడం చేతకాక, పైకి చెప్పుకోలేక కుళ్ళి కుళ్ళి ఏడ్చే ప్రాచీన స్త్రీల ఏడ్పు చప్పుడులా వుంటుంది. సరస్సులో కెరటాలు గట్టున వయ్యారంగా పడనట్లు మా కన్నీరు మీ రొమ్ము వొంకర్ల మధ్య జారతాయి - శక్తికోసం తపించే పల్చని, మధురమైన కన్నీరు. ఏకాంతసౌధంలో బంధింపబడ్డామని తెలుసుకున్నపుడు మనమందరం అల్లానే నిశ్శబ్దంగా ఏడుస్తూ వుంటాము. పురుషుడి ఘనమైన, నిండైన కలలని మీ కన్నీరు నీరుగా, శూన్యంగా మారుస్తుంది. స్త్రీ కన్నీరులో మునిగి చావడం తప్పనే నేను మీ సౌందర్యమైన కన్నీటిలో మునిగి, రెండు మధురమైన గుటకలేసి చావడానికి సిద్ధంగా వున్నాను

అంటాడు. అంతే స్వరూపిణి తెర తొలగించుకుని బయిటకు వస్తుంది.  అతను తన తలపాగా తొలగిస్తాడు. అతన్ని చూసి ఖంగారు పడుతుంది.

                                                                                                       .....................ఇంకా వుంది. 


Vol. No. 01 Pub. No. 201

Tuesday, February 16, 2010

తిట్ల ఖరీదు

 గూడవల్లి రామబ్రహ్మం గారి పేరు చెప్పగానే ' మాలపిల్ల ', ' రైతుబిడ్డ ' చిత్రాలు గుర్తుకు వస్తాయి. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఆయనదొక సువర్ణాధ్యాయం. ఇంత పరిణితి చెందిన ప్రేక్షకులున్న రోజుల్లో కూడా చిత్ర నిర్మాతలు, దర్శకులు ధైర్యం చెయ్యలేని సాహసాల్ని, ప్రయోగాలని ఆయన ఆ రోజుల్లోనే చేశారు.

ఆయన దగ్గర ప్రొడక్షన్ మేనేజర్ గా  పనిచేసిన అనుమకొండ సూర్యనారాయణ గారు అకౌంట్స్ లో దిట్ట. అసలు సినిమా రంగంలో నిర్మాణ కార్యక్రమాలకు ప్రొడక్షన్ మేనేజర్ కీలకం. దూషణ, భూషణ, తిరస్కారాలకు సిద్ధంగా ఉండాలి. సరైన ప్రణాళికలు రూపొందించడం దగ్గరనుండి చిత్ర నిర్మాణం సక్రమంగా పూర్తవడం వరకూ ప్రొడక్షన్ మేనేజర్ బాధ్యత వహిస్తాడు.

రామబ్రహ్మం గారు ఉదార స్వభావులుగా పేరు పొందారు. అయితే ఆయనకు ప్రథమ కోపం జాస్తి అని చెప్పుకుంటారు. చిన్న చిన్న విషయాలకు కస్సు బస్సుమనేవారట. అయితే ఆయన వితరణ ముందు ఇవి తేలిపోయేవి. ఆయన తిట్టినా ఎవ్వరూ అంతగా బాధపడేవారు కాదట.

ఒకసారి ఆయన చిత్రం ఒకటి పూర్తయింది. అందరికీ ఇవ్వవలిసిన పారితోషికాలు పూర్తిగా ఇచ్చేసి పంపే పనిలో ఉన్నారు. అందరివంతూ పూర్తయి సూర్యనారాయణగారి వంతు వచ్చింది. మొత్తం చిత్ర నిర్మాణ ఖర్చులన్నీ అప్పగించమన్నారాయన్ని రామబ్రహ్మం గారు.

సరే ! పక్కాగా రాసి ఉంచిన లెక్కల్ని ఆయన ముందు పెట్టారు సూర్యనారాయణ గారు.
మొత్తం జాబితా అంతా పరిశీలించిన రామబ్రహ్మంగారు చివరగా కనబడ్డ ఒక అంశానికి ఆశ్చర్యపోయారు.
ఆ అంశమేమిటంటే ' ఈ చిత్ర నిర్మాణ సమయంలో మీరు నన్ను తిట్టినా తిట్లు 642 ' అని రాసి ఉంది. 
అంతే... గూడవల్లి రామబ్రహ్మంగారికి కోపం..... కాదు... ఆయనలోని ఉదారత బయిటికోచ్చింది.
తిట్టుకి రెండు రూపాయిలు చొప్పున 1284 రూపాయిలు సూర్యనారాయణ గారికి ఇచ్చారుట.
ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు దొరుకుతారా ?    

Vol. No. 01 Pub. No. 200

తెలుగువారికి గాంధీజీ సందేశం



 1946 ఫిబ్రవరి నెలలో గాంధీజీ ప్రత్యేక రైలులో మద్రాసు నుండి వార్తా వెడుతూ మన రాష్ట్రంలోని మధిర, ఖమ్మం, డోర్నకల్, వరంగల్ మొదలైన చోట్ల రైల్ ఆపించి ప్రసంగాలు చేసేవారు. వేలాదిమంది హాజరయిన ఆ సభలలో తన ప్రసంగాలతో గాంధీజీ జనాన్ని ఎంతో ప్రభావితం చేసేవారు. చివరి మజిలి అయిన ఖాజీపేటలో ఆయన తెలుగువారికోసం తన స్వహస్తాలతో ఒక సందేశం రాసిచ్చారు. ఆ సందేశ సారాంశం..........

ఆంధ్రదేశం పైన నాకు చాలా ఆశ ఉంది. ఈ ప్రాంతం నా ఆశయాలను పూర్తిగా నెరవేరుస్తుందని నా నమ్మకం. అవి అంటరానితనాన్ని తొలగించడం, అంతా ఖద్దరే ధరించడం, మాతృభాషతో బాటు హిందుస్తానీ దేవనాగరి, ఉర్దూ లిపులలో నేర్చుకోవడం, జాతీయ ఐకమత్యం కలిగి ఉండడం తెలుగువారందరూ ఆచరిస్తారని ఆశిస్తున్నాను. అన్ని దేవాలయాల్లోనూ అంటరాని వాళ్లకు ప్రవేశం ఉండాలి.

ఇవీ గాంధీజీ ఆంధ్ర ప్రాంతం మీద, తెలుగు వారి మీద పెట్టుకున్న ఆశలు. అవన్నీ పూర్తిగా నేరవేరాయా ? 

Vol. No. 01 Pub. No. 199

Monday, February 15, 2010

ఆరుమాసాల సహవాసం


శిరాకదంబం ప్రారంభించి నిన్నటికి ( 14 వతేదీ ) ఆరునెలలు గడచిపోయాయి. తెలుగులో బ్లాగులనేవి ప్రారంభమై చాలాకాలమైనా ఏడున్నర నెలల క్రితం వరకూ నేను అజ్ఞానంలోనే ఉండిపోయాను. నెలన్నర అధ్యయనం చేసి గత సంవత్సరం ( 2009 ) ఆగస్టు 14 వతేదీన నేను కూడా బ్లాగు ప్రారంభిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చి, ప్రారంభించడం ఎలా అనేది పెద్దగా ఆలో్చన లేకుండా ప్రారంభించేసాను. తర్వాత ప్రశ్న ఏం రాయాలి ? మొదట్లో నా భావాలు రాసాను. తర్వాత నా పుస్తకాల ఖజానాలోని విశేషాలను అందించడం మొదలు పెట్టాను.

నా బ్లాగుకి మొదటి వ్యాఖ్య 7 వ టపాకు వచ్చింది. మొదటి వ్యాఖ్యాతలు రాయరాజ్ గారు, నరసింహ గారు, భావన గారు . తర్వాత నా రాతలు చదువుతూ వ్యాఖ్యానం చేసిన మిత్రులు చిలమకూరు విజయమోహన్ గారు, ధరణీ రాయ్ గారు, వినయ్ చక్రవర్తి గారు, కొత్తపాళీ గారు, రవిచంద్ర గారు, బోనగిరి గారు, శివ గారు, జయ గారు , సృజన గారు , మంచుపల్లకీ గారు, సుభద్ర గారు, తృష్ణ గారు, పద్మార్పిత గారు, బుజ్జి గారు, తెలుగు తూలిక మాలతి గారు, వెంకటరమణ గారు, శేఖర్ పెద్దగోపు గారు, మాలాకుమార్ గారు, అమ్మఒడి ఆదిలక్ష్మి గారు, భాస్కర రామిరెడ్డి గారు, వైద్య భూషణ్ గారు, వరూధిని గారు, హరేకృష్ణ గారు, చిన్ని గారు, శ్రీనిక గారు, నేదునూరి గారు, జ్యోతి గారు, ఆచార్య ఫణీంద్ర గారు, మురళీమోహన్ గారు, అప్పారావు శాస్త్రిగారు, సూర్యుడు గారు, ఉష గారు, ఫణి గారు, శిశిర గారు, వాసు గారు, కంది శంకరయ్య గారు, మాడీ గారు, కొత్త రవికిరణ్ ( పూలవాన ) గారు, జలసూత్రం గారు, పరిమళం గారు, నా యిష్టం గారు, వేణు శ్రీకాంత్ గారు, కార్తీక్ గారు, సంతోష్ గారు, నిషిగంధ గారు, సి.బి.రావు గారు, సునీత గారు, సందీప్ గారు, ఆదిత్య గారు, గిరిధర్ గారు, గొర్తి బ్రహ్మానందం గారు, గీతాచార్య గారు, రాజన్ గారు, కెక్యూబ్ వర్మ గారు, రావు గారు, ఊకదంపుడు గారు, సురేష్ బాబు గారు, నాయని ఆదిత్యమాధవ్ గారు, కె.కె. గారు, చెర్రీస్ వరల్డ్ గారు, మహీ గ్రాఫిక్స్ వారికి, సిరిసిరిమువ్వ గారు, రాజన్ గారు, రవి గారు, నాగప్రసాద్ గారు, చదువరి గారు, నాగబ్రహ్మారెడ్డి గారు, అశ్వినిశ్రీ గారు, భైరవభట్ల కామేశ్వర రావు గారు, నెలబాలుడు గారు, ప్రేరణ గారు, ఫణి యలమంచలి గారు, వినయ్ చాగంటి గారు, చంద్రలేఖ 45 గారు, రాజేంద్రకుమార్ దేవరపల్లి గారు, రావు ఎస్. లక్కరాజు, హర్ష గారు, రాంగోపాల్ గారు, ఆమ్రపాలి గారు, నిరంజన్ గారు, చెప్పుదెబ్బలు పూలదండలు గారు, మధురవాణి గారు, థింకర్ గారు, సురేష్ మ్యూజింగ్స్ గారు ఇంకా అనేకమంది అజ్ఞాతలు. వీరే కాకుండా నా బ్లాగులో వ్యాఖ్యానించకపోయినా స్వయంగా ఫోన్ లో వ్యాఖ్యలు అందించే నవ్వులాట శ్రీకాంత్ గారు, కొత్త రవికిరణ్ గారు....... ఇంతమంది ఇస్తున్న ప్రోత్సాహమనే టానిక్ తాగి నా బ్లాగు బలం పెరిగింది. నాకు తెలుసు. నా బ్లాగులో వ్యాఖ్యలు తక్కువే ! నేను కూడా టపా రాసాక దాని మీద మిత్రుల స్పందనకు ఎదురు చూస్తాను, కానీ ఏ వ్యాఖ్య రాకపోయినా నిరుత్సాహపడను. ఆ రకమైన టపా మిత్రులకు ఎందుకు నచ్చలేదని విశ్లేషించుకుంటాను. దానికి తార్కాణం. చిత్రవైభవం పేరుతో తెలుగు చిత్ర చరిత్రకు సంబంధించిన విశేషాలు ఒక వరుసలో సచిత్రంగా అందించటం ప్రారంభించాను. కానీ వాటికి అంతగా స్పందన రాలేదు. మరి అలా వరుసగా సీరియల్ లాగ ఇవ్వడం మిత్రులకు నచ్చలేదో లేక అంతాకానీ, కొంతకానీ అయ్యాక టోకుగా వ్యాఖ్యానించాలని ఆగారో అర్థం కాలేదు. ఆ విశేషాలను వేరొక పద్ధతిలో ఇస్తే ఎలాగుంటుందనిపించింది. ఏమైనా ఒక అర్థవంతమైన వ్యాఖ్య మనకి సరైన దిశా నిర్దే్శం చేస్తుందని నమ్ముతాను. నా రాతలకు మిత్రులిచ్చిన వ్యాఖ్యలన్నీ నా అదృష్టవశాత్తూ అర్థవంతమయినవే అనుకుంటున్నాను. ' మీ టపా బాగుంది ' అని రాసారని కాదు. మొహమాటానికో, మరో ప్రయోజనానికో కాకుండా హృదయ పూర్వకంగా చేసే మెచ్చుకోలు వ్యాఖ్య కూడా అర్థవంతమైనదే ! నా రాతలకు వచ్చిన కొద్ది మెచ్చుకోలు వ్యాఖ్యలు అలాంటివే అని నమ్ముతాను. అలాగే చాలా వ్యాఖ్యలలో విశ్లేషణలు కూడా ఉన్నాయి. నా రాతలు చదివిన వాళ్ళందరూ వ్యాఖ్యలు రాయాలని లేదు కదా ! రాత నచ్చినా వ్యాఖ్య రాయలేక పోవడానికి అనేక కారణాలుంటాయి. అయితే మన రాతలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది మాత్రం వ్యాఖ్యలు తెలియజేస్తాయి. అవి తిరస్కారాలైనా, పురస్కారాలైనా !

ఈ సందర్భంగా మరోవిషయం. ఒక సోషల్ నెట్ వర్క్ లో పరిచయమైన ఒక మిత్రుడు సూటిగా నన్నో ప్రశ్న వేసాడు. మీరు బ్లాగెందుకు రాస్తున్నారు ? సమాజాని ఉద్ధరించడానికా లేక రచనల ద్వారా సమాజంలో మీకొక గుర్తింపు తెచ్చుకుందుకా ? అని. అతనికి నేనిచ్చిన సమాధానం. నా రాతల వల్ల సమాజాన్ని ఉద్ధరించగలననే అత్యాశ నాకు లేదు. నేను రచయితనో, కవినో, సంఘ సంస్కర్తనో కానని నాకు తెలుసు. నాకు తెలిసిన, నేను చదువుకున్న విషయాలు నా దగ్గరే దాచుకోకుండా పదిమందికీ చెబుదామని, ఏదైనా విషయం గురించో, సమస్య గురించో నాలో కలిగే భావాల్ని పదిమందితో పంచుకుందామని మాత్రమే రాస్తున్నాను. అవి కొంతమందికైనా నచ్చితే, ఆహ్లాదం కలిగిస్తే, ఉపయోగపడితే మంచిదే ! ఇక సమాజంలో గుర్తింపుకోసమైతే ఇప్పుడు దాని అవసరం నాకెంతవరకూ ఉందో నా ప్రొఫైల్ చూస్తే తెలుస్తుందన్నాను. పేరు తెచ్చుకునే అవకాశాలు నా చేతిలో పుష్కలంగా ఉన్న కాలంలోనే ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు అవసరమా ? అదీకాక పాపులర్ అవడానికి ప్లాట్ ఫాం ఇది కాదేమోననుకుంటాను. చాలా మార్గాలున్నాయి. ఆ మార్గాల్లో ప్రయత్నం చేస్తే పేరుతో బాటు, డబ్బు కూడా సంపాదించవచ్చేమో ! కానీ నాకా ఆశా, ఆసక్తి రెండూ లేవు. అందుకే పుస్తకాలు, మంచి స్నేహాలు తప్ప మరే ఆస్తి పాస్తులు లేవు.

బ్లాగ్లోకంలో ఆరునెలల సహవాసంలో ఎందరో కొత్త మిత్రులు పరిచయమయ్యారు. ఎన్నెన్నో భావాలు, అభిప్రాయాలు పరిచయమయ్యాయి. సహజంగా వివాదాలకు నేను దూరం. అందుకే వివాదాస్పద అంశాలకు కూడా దూరంగా ఉంటాను. వ్యక్తిగత దూషణలను, అభ్యంతకర వ్యాఖ్యాలను నేను సమర్థించలేను. అందుకే వాటికి దూరంగా ఉంటాను. అంతమాత్రం చేత ఆయా మిత్రులకు దూరమని కాదు. ఈ ఆరునెలలలోనే కొత్తపాళీ గారి పుస్తకావిష్కరణ సంబరంలోను, ఇ-తెలుగు వర్క్ షాప్ లోను పాల్గొనడం, సాహిత్య అభిమాని శివ గారితో కలయిక నాకెంతో ఆనందం కలిగించిన విషయం. రాబోయే కాలంలో బ్లాగు మిత్రులందరి భాగస్వామ్యం ఉండే శీర్షికలు నడపడానికి ప్రయత్నిస్తున్నాను. వాటికి మీ అందరి ప్రోత్సాహం మరింతగా ఉంటుందని, అలాగే తప్పుటడుగులు వేస్తే హెచ్చరికలు చేస్తుంటారని ఆశిస్తున్నాను.

మిత్రులందరికీ ' శిరాకదంబం ' అర్థవార్షికోత్సవం ( ఫిబ్రవరి 14 ) సందర్భంగా నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు.

Vol. No. 01 Pub. No. 198

Sunday, February 14, 2010

కొన్ని ప్రశ్నలు - శ్రీశ్రీ సమాధానాలు


ప్రశ్న : 1+1 = 1 ఎలా అవుతుంది ?
శ్రీశ్రీ : ప్రేయసీ + ప్రియులు = ఇద్దరు ఒక్కటే !
       దేవుడు + మానవుడు = ఇద్దరు  ఒక్కటే !

ప్ర :  శ్రీశ్రీకి కుడికన్ను అదురుతుందా ?
శ్రీశ్రీ : శ్రీశ్రీ ఎప్పుడూఎడమ ప్రక్కనే ఉంటాడు. కుడిప్రక్కన ఉండడు. పుట్టిన దగ్గరనుండి ఎడమ కాలు, ఎడమ చెయ్యి అలవాటు. కొంతకాలం ఎడమ చేత్తోనే రాసేవాణ్ణి.

 ప్ర : శ్రీశ్రీ అంటే అర్థమేమిటి ?
శ్రీశ్రీ :  చాలా ఉన్నాయి. శ్రీశ్రీ రచనలు ఎంతమంది చదివారో అన్ని అర్థాలు.

ప్ర : తెలంగాణా ప్రజల కోరికలు అర్థరహితమా ?
శ్రీశ్రీ : ఏ ప్రజల కోరికలు అర్థరహితం కావు. వాళ్ళ తరఫున వకాల్తా పుచ్చుకునే వినాయకుల వ్యాఖ్యానాలే అర్థరహితమైనవి. 


ప్ర:: మీ కవిత్వం చూస్తే ఆవేశం, మీ ప్రవర్తన చూస్తే అసహ్యం. మీరేమంటారు ?
శ్రీశ్రీ : నా ప్రవర్తన నాతోనే అంతమవుతుంది. నా కవిత్వం తెలుగుజాతి ఉన్నంత కాలం నిలుస్తుంది.

 Vol. No. 01 Pub. No. 197

ప్రత్యక్ష ' డబ్బింగ్ '


ఇతర భాషా చిత్రాలు మన రాష్ట్రంలో విడుదల కావడం మనకు కొత్త కాదు. అలాగే అనువాద చిత్రాలూ మనకి కొత్తకాదు. టాకీలు మొదలైన కొంత కాలానికి గానీ ఇతర భాషల్లోకి అనువాదం చేసే ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈ అనువాదం లేదా డబ్బింగ్ ప్రారంభం కాక ముందు సామాన్య ప్రేక్షకులకు ఆ భాష అర్థం కావడానికి ఆయా థియేటర్ల యజమానులు కొంత కసరత్తు చేసేవారు. ఆ విన్యాసాల్లో ఓ ప్రక్రియ ' ప్రత్యక్షానువాదం '.

ఈ ప్రక్రియ ముఖ్యంగా రెండో శ్రేణి నగరాలలో ఎక్కువగా ఉపయోగించేవారు. ఇంతకీ అదేమిటంటే ఇతర భాష ముఖ్యంగా హిందీ, ఇంగ్లీషు భాషల చిత్రాలు విడుదలయినపుడు తెర వెనుక ఒక వ్యక్తిని కూర్చోబెట్టి ఆ చిత్రం లోని సంభాషణలన్నీ అనువాదం చేసి చెప్పించేవారు. అతను ప్రతి సంభాషణను మక్కికి మక్కి అనువాదం చేసి వినిపించేవాడు. ఒకప్రక్క సినిమాలోని అసలు సంభాషణలు, మరోప్రక్క అనువాదకుని సంభాషణలు కలగలసిపోయి అదొక గందరగోళం.......

1942 లో అశోక్ కుమార్ హీరోగా హిందీలో వచ్చిన ' కిస్మత్ ' సంచలనం సృష్టించింది. కలకత్తాలో సుమారు మూడు సంవత్సరాలు నడిచి చరిత్ర సృష్టించింది. ' షోలే ' వరకూ ఆ రికార్డు అలాగే ఉంది. ఆ చిత్రం విజయవాడలో విడుదలయినపుడు తొలిసారి ఈ ' ప్రత్యక్ష అనువాదం ' లేకుండా నడిపించారు. అప్పటినుండి పర భాషా చిత్రాలు ఆయా భాషల్లోనే చూడడానికి అలవాటు పడ్డారు తెలుగు ప్రేక్షకులు. తమిళం లాంటి ఇతర భాషల చిత్రాలు డబ్బింగ్ చెయ్యడం ఆ తర్వాత ప్రారంభమయ్యింది. హాలీవుడ్ లో విడుదలయిన కొన్ని సంవత్సరాలకు గానీ మనం చూడలేని సినిమాలిప్పుడు నేరుగా మన భాషలోనే విడుదలవుతున్నాయి. ఎప్పుడో విడుదలయిన చిత్రాలు డబ్బింగ్ చేసి విడుదల చెయ్యడంనుంచి, ఇప్పుడు అసలు చిత్రం విడుదలతో బాటు డబ్బింగ్ చిత్రం కూడా విడుదల చేసే స్థితికి చేరుకున్నాం.

అనుబంధం : ప్రత్యక్ష డబ్బింగ్ విషయంలో ప్రత్యక్ష అనుభవం

నేను రాస్తున్న, రాసిన విషయాలన్నీ నా ప్రత్యక్షానుభవాలు కాదు. పెద్దల ద్వారా విన్నవి, పత్రికలు, పుస్తకాలలో చదివినవి క్రోడీకరించి రాస్తున్నవే !
ఈ టపాలో రాసిన విషయంలో ప్రత్యక్షానుభవంగల బ్లాగు మిత్రులు శ్రీ నరసింహ ( వేదుల బాలకృష్ణమూర్తి ) గారు తమ స్వీయానుభవాన్ని వ్యాఖ్య రూపంలో తెలియజేసారు. అది కేవలం వ్యాఖ్య రూపంలో ఉండిపోవడం ఇష్టం లేక ఇందులో అనుబంధంగా చేర్చాను. ఆయన్ని తమ అనుభవాలు, అనుభూతులు ఇంకా వివరంగా తెలియజెయ్యమని కోరడం జరిగింది. అలాగే నేను రాస్తున్న విషయాలలో ప్రత్యక్ష, పరోక్ష అనుభవాలు కలిగిన వారెవరైనా ఆ విషయాలను తెలియజేస్తే బాగుంటుంది. మరింత ఆసక్తికరమైన, విస్తృతమైన సమాచారాన్ని చదువరులకు అందించగలం.
* నరసింహ గారి అనుభవం....................

చిన్నప్పుడు (1963)అంటే పదకొండో క్లాసు పబ్లిక్ పరీక్షలు భీమవరంలో వ్రాసేసాక అక్కడే తాజ్ మహల్ హిందీ సినిమా చూసాం. అప్పుడే మీరు చెప్పిన ప్రత్యక్ష అనువాదం ఆ ధియేటర్లో మొదటిసారిగాను, చివరిసారిగాను కూడా వినటం జరిగింది. అనువాదం చాలా బాగా సాగినట్టు గుర్తు.

* గతంలో సి. బి. రావు గారి టపా డేరా సినిమా లో Mike Dubbing చూడండి.


Vol. No. 01 Pub. No. 196

Saturday, February 13, 2010

ముద్దుకృష్ణ ఓదార్పు

తెలుగు కవితాలోకంలో ' వైతాళికులు ' ఓ సంచలనం. ముద్దుకృష్ణ చేసిన ఈ కవితా సంకలనం గురించి తెలియని కవితాప్రియులుండరు. ఆయన 1934 ప్రాంతంలో ' జ్వాల ' అనే పత్రిక నడిపారు. అయితే ఆ పత్రిక దురదృష్టవశాత్తూ ఎక్కువకాలం నడవలేదు. కానీ అప్పట్లో ఓ ప్రముఖ పత్రికగా నిలిచింది.

ఓసారి ఆ పత్రికలో ఆప్పుడే వెలుగులోకి వస్తున్న ఒక కవిగారిని ఘాటుగా విమర్శిస్తూ ఒక వ్యాసం ప్రచురించారు. అంత ! ఆ కవిగారికి కోపం వచ్చింది. జ్వాల కార్యాలయానికి ఆవేశంగా వచ్చి ముద్దుకృష్ణ గారిని కలిసారు. ఆగ్రహం వ్యక్తం చేసారు. తన నిరసన తెలిపారు.

ముద్దుకృష్ణగారు ముద్దుగా నవ్వుతూ " అయ్యా ! మేమేదో ప్రచురించాం ! కానీ మా పత్రిక కొని చదివే వాళ్ళలో సగంమంది ఆ వ్యాసాన్ని చూడరు. చూసిన వాళ్ళలో సగంమంది చదవరు. చదివిన వాళ్ళలో సగంమందికి అందులోని విషయం అర్థం కాదు. అర్థమయిన వాళ్ళలో సగంమందికి తమరెవరో తెలియదు. మిమ్మల్ని తెలిసిన వాళ్ళలో సగంమంది ఎలాగూ ఆ వ్యాసాన్ని నమ్మరు. ఎవరైనా నమ్మితే.... ఆ నమ్మిన వారిలో సగంమందిని మనం లెఖ్ఖ చెయ్యనక్కర్లేదు. ఇక మిగిలేది ఈ చివరి సగంమంది. వాళ్ళవలన తమకేమీ నష్టం లేదు కనుక మీరేం ఖంగారు పడనక్కరలేదు, నిశ్చింతగా ఉండండి " అని ఓదార్చి పంపేశారట.   

Vol. No. 01 Pub. No. 195

Friday, February 12, 2010

శివోహమ్ !

బ్రహ్మ మురారి సురార్చిత లింగం 
నిర్మల భాసిత శోభిత లింగం
జన్మజ దు:ఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివలింగం..............




మిత్రులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు 

శివరాత్రి అనుభవాలు నా  స్వ' గతం ' పేజీలో ......

Vol. No. 01 Pub. No. 194

Thursday, February 11, 2010

అజరామరగానం

ఆ పాట ఆగిందా ?
ఇది నిజమా ?
లేదు గానం ఆగలేదు 
ఆ గానం అజరామరం
ఆ పాట నిత్య సత్యం
యేళ్ళు గడిచినా
దశాబ్దాలు గడిచినా
చివరకు శతాబ్దాలు గడిచినా
ఆ గానం ఆగదు.. ఆ గళం మూగవోదు
ఇంటింటా ప్రతిధ్వనిస్తుంటుంది
తెలుగు బావుటా విశ్వమంతా ఎగురవేస్తూనే ఉంటుంది 



 Vol. No. 01 Pub. No. 193

Tuesday, February 9, 2010

ఆజన్మాంతం

కొంతమంది అడ్డూ ఆపూ లేకుండా డబ్బు సంపాదించడమే పనిగా పెట్టుకుంటారు.
ఆ సమయంలో ఆకలిదప్పులు తెలియవు. కొందరైతే ఉచ్చ్హనీచాలు కూడా మరచిపోతారు.
అలా సంపాదించీ, సంపాదించీ అలసిపోయాక, జీవిత చరమాంకానికి చేరుకున్నాక బెంగ పట్టుకుంటుంది.
భయం చుట్టుకుంటుంది.
తన తదనంతరం ఈ సంపదంతా ఏమై పోతుంది ?
తన పిల్లలు దీన్ని సవ్యంగా నిలబెట్టుకుంటారా ?
తన సంపద మీద బంధువులు, దాయాదులు కన్నేసి కాజేయరు కదా ?
ఇలా....సవాలక్ష సందేహాలు.
తన బెంగ తీరాలంటే ఒకటే మార్గం.....
తాను మరణాన్ని జయిస్తే బాగుండును.
తన ఆస్థిని తనే కాపాడుకోవచ్చు. ఎవరి మీదా ఆధారపడనక్కర్లేదు.
కానీ... అది సాధ్యమా ?
ఒకవేళ సాధ్యమైతే...... ఏమవుతుంది ?


*** 

అలెగ్జాండర్ ప్రపంచ విజేత. ఆయన గురించి చెప్పుకునే ఓ కథ........         

అలెగ్జాండర్ ప్రపంచంలో తనకు తెలిసిన భూభాగాన్నంతా జయించేసాడు.
అప్పుడు మరణం గుర్తుకు వచ్చింది. ఏదో ఒకరోజు చనిపోక తప్పదు.
ఆ తర్వాత ఇంత కష్టపడి జయించి సంపాదించిన సామ్రాజ్యమంతా ఏమైపోతుంది ? అని బెంగపట్టుకుంది.
అంతే ! ఆయనకు మృత్యువుని జయించాలనిపించింది. అమరుడవ్వాలంటే అమృతం కావాలి.
దానికోసం అన్వేషణ ప్రారంభించాడు. కొండలు, కోనలు, కీకారణ్యాలు అన్నీ గాలించాడు. చివరికి సాధించాడు. ఒకచోట అమృతధార దర్శనమిచ్చింది. మహదానంద పడిపోయాడు.
ఆ అమృతధార ఉన్న చిన్న గుహలో అంతా చీకటి.
ఆ ధార మాత్రం మిలమిలా మెరుస్తూ దర్శనమిచ్చింది. దగ్గరకు వెళ్ళి దోసిటపట్టి తాగబోయాడు.
ఇంతలో అక్కడే చిరకాలంనుంచి నివసిస్తున్న ఒక కాకి అలెగ్జాండర్ ని నిలవరించి 
" నేనూ నీలాగే అమరత్వం సాధించాలని, కలకాలం బ్రతకాలని చాలా యుగాల క్రిందటే ఈ అమృతాన్ని తాగాను. సుదీర్ఘమైన జీవితంలో కొంతకాలం కోరుకున్నవన్నీ తృప్తిగా అనుభవించాను.
తరువాత నెమ్మదిగా అన్నిటి మీదా వాంచ తగ్గింది.
కోరికలన్నీ నశించాయి. దేనిమీదా వ్యామోహం లే్దు.
ఇప్పుడు చచ్చిపోవాలనిపిస్తోంది. కానీ ఈ అమృతం కారణంగా చావు రావడం లేదు.
అనేక ప్రయత్నాలు చేసాను. పీక కోసుకుందామంటే కత్తి బండబారిపోతోంది.
సముద్రంలో దూకితే నీళ్ళమీద తేలుతున్నాను.
ఈ బ్రతుకు బ్రతకలేక రోజు రోజూ చస్తున్నాను.
ఇహలోకంలోనే నరకం అనుభవిస్తున్నాను.
తాగబోయేముందు ఇదంతా నీకు తెలిస్తే మంచిదని చెబుతున్నాను.
అయినా నీకు తాగాలని వుంటే నిరభ్యంతరంగా తాగు.
కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా దీనికి విరుగుడు తెలిస్తే మాత్రం నాకు చెప్పు " అందట ఆ కాకి.

ఇంకేం మాట్లాడతాడు ?
అందుకే ఆ ప్రయత్నం విరమించుకుని వెనుదిరిగాడట బుద్ధిశాలైన అలెగ్జాండర్.  


Vol. 01 Pub. 192




మేరా భారత్ మహాన్

మనం దేశ పౌరులుగా అనేక రకాల పన్నులు కడుతున్నాం. కానీ అందులో ఎంతభాగం ప్రజా సంక్షేమం కోసం వినియోగమవుతోంది, ఎంతభాగం నాయకుల సంక్షేమం కోసం వినియోగమవుతోంది అనేది పట్టించుకోం ! ఒకసారి కొన్ని నిజాలు తెలుసుకుందాం !

మన
దేశంలో ఒక పార్లమెంట్ సభ్యుని ( M.P. ) గౌరవ వేతనాలు, భత్యాలు ఇలా ఉన్నాయి.
  • నెల జీతం : రు. 12, 000/-
  • నియోజక వర్గ ఖర్చు (నెలకు ) : రు. 10, 000/-
  • కార్యాలయ ఖర్చులు (నెలకు ) : రు. 14, 000/-
  • ప్రయాణ భత్యం : కిలోమీటరుకు రు. 8/- (ఉదాహరణకు రాజధాని ఢిల్లీ నుండి దక్షిణ కొసనున్న కేరళకు మారుగా 6, 000 కిలోమీటర్లు ) చొప్పున రు. 48, 000/-
  • పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నపుడు రోజు వారీ భత్యం : రు. 500/-
  • రైలు ప్రయాణ ఖర్చులు : దేశంలో ఎక్కడినుండి ఎక్కడికైనా, ఎన్నిసార్లు అయినా రైలులో మొదటి తరగతి . సి. ఉచితం.
  • విమాన ప్రయాణం : వాణిజ్య తరగతిలో భార్య లేదా భర్త / వ్యక్తిగత సహాయకుడు తో సంవత్సరానికి 40 సార్లు ఉచితం.
  • వసతి : ఢిల్లీలో పార్లమెంట్ సభ్యుల హాస్టల్ లో ఉచితం.
  • విద్యుత్ ఖర్చులు : నివాసానికి 50, 000 యూనిట్ల వరకూ ఉచితం
  • ఫోన్ ఖర్చులు : 1, 70, 000 కాల్స్ వరకూ ఉచితం
  • మొత్తం ఖర్చులు : ఒక్కొక్క సభ్యునికి సంవత్సరానికి సుమారుగా రు. 32, 00, 000/- అంటే నెలకు సుమారు రు. 2, 66, 000/-
  • పదవీకాలానికి ( 5 సంవత్సరాలకు ) మొత్తం ఖర్చు : రు. 1, 60, 00, 000/-
  • పార్లమెంట్ సభ్యుల మీద మొత్తం ఖర్చు : అయిదు సంవత్సరాలకు మొత్తం 534 సభ్యుల మీద దేశం పెడుతున్న ఖర్చు రు. 8, 54, 40, 00, 000/- అంటే సుమారు రు. 855 కోట్లు .

ఇదంతా మనం ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తున్న డబ్బు లోనుండి పెడుతున్న ఖర్చు.
ఇక సామాన్యులకవసరమైన సరుకుల ధరలు పెంచకపోతే ఎలా సమకూడుతుంది ?

Vol. No. 01 Pub. No. 191

Monday, February 8, 2010

నిద్రాభంగం

అత్యున్నత స్థానానికి ఎదగాలంటే కృషి, పట్టుదలతో బాటు అంకితభావం కావాలి. వాటి విలువ తెలుసుకుని ప్రపంచంలోనే ప్రముఖ స్థానంలో నిలిచిన వ్యక్తి దగ్గర పనిచేసేటపుడు మనం కూడా ఆ లక్షణాలను అలవర్చుకోవడానికి కొంచెమైనా ప్రయత్నం చే్స్తే అంత కాకపోయినా కొంతవరకైనా ఎదుగుతాయేమో ! కానీ అవేమీ పట్టించుకోకపోతే........

   
Vol. No. 01 Pub. No. 190

Sunday, February 7, 2010

నవ్వులరేడు ' రాజబాబు '

తెలుగు చిత్ర ప్రేక్షకులను సుమారు ఇరవై మూడేళ్ళ పాటు హాస్యరస గంగాప్రవాహంలో ముంచెత్తిన నవ్వుల రేడు, హాస్య నటచక్రవర్తి రాజబాబు వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ...........


 
ఎవరికి వారే యమునా తీరే !
ఎక్కడో పుడతారు!
ఎక్కడో పెరుగుతారు!
ఎవ్వరికీ చెప్పకుండా పోతూనే ఉంటారు!... పోతూనే ఉంటారు !.......................



Vol. No. 01 Pub. No. 189

ప్రజాస్వామ్య నిర్వచనం

 ఈనాడు ప్రపంచమంతా చెప్పుకునే ప్రజాస్వామ్య నిర్వచనం నేపథ్యం.....................


Vol. No. 01 Pub. No. 188

Saturday, February 6, 2010

నటనకు బీజం

మహనీయుల జీవితాల్లో వారు ఆ స్థాయికి చేరడానికి వారి బాల్యంలోనే అంకురార్పణ జరుగుతుంది. దానికి ఒక ఉదాహరణ..........


Vol. No. 01 Pub. No. 187

Friday, February 5, 2010

అజ్ఞానంలో ' ఆత్మ '

ఆది శంకరాచార్యుల వారి సుభాషితం....

Vol. No. 01 Pub. No. 186

మోత బరువు

 ఆపదలో ఉన్న వారికి సాయపడి వారినేదో ఉద్ధరించేసామనో, వేరే ఎవరైనా చేసి మంచి పేరు తెచ్చుకుంటే మనకా అవకాశం చేజారి పోయిందని వారి మీద బురద జల్లే ప్రయత్నం చెయ్యడమో ఎంత హీనం...........


Vol. No. 01 Pub. No. 185
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం