ఒకామె తన కూతురు, చిన్న కొడుకులతో నడుచుకుంటూ వెడుతోంది. రోడ్డు ప్రక్కన ప్రవహిస్తున్న మురుగు కాలవలో నీళ్లు రక్తం రంగులో ఎర్రగా కనిపించాయి. అది చూసి వాళ్లు ఆశ్చర్య పోయారు. ఆ నీళ్ళకు ఆ రంగెలా వచ్చిందో వారికి అర్థం కాలేదు. అకస్మాత్తుగా ఆ చిన్నబాబు అదృశ్యమయ్యాడు. కొన్ని గంటల తర్వాత ఇంటికి తిరిగొచ్చిన ఆ పిల్లవాడు తన పరిశోధన విశేషాలు వివరించాడు, ఆ మురుగు కాలవలో నీటికి ఆ రంగు రావడానికి కారణం అక్కడకు కొద్ది దూరంలో ఉన్న రంగుల అద్దకం పరిశ్రమ అని.అక్షరాలు నేర్చుకుంటున్న వయస్సులో తినడానికిచ్చిన రొట్టెను గట్లుగా పేర్చి తాగడానికిచ్చిన పాలను వాటిలో పోస్తూ ఆడుకునేవాడు. అదేమిటని అడిగితే కాలవలు కడుతున్నానని సమాధానం. వర్షం కురుస్తున్న రోజుల్లో బయిటకు వెడితే తన దగ్గరున్న చేతికర్రతో రోడ్డుమీద ప్రవహిస్తున్న వర్షపు నీటిని సక్రమంగా మురుగునీటి కాలవలోకి ప్రవహించేటట్లు దారి చేస్తుండేవాడు. పువ్వు పు

ట్టగానే పరిమళించినట్లు చిన్నప్పుడే నీటి పారుదల పైన అవగాహన పెంచుకున్న ఆ పిల్లవాడు మన ఆంధ్ర దేశాన్ని సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు
జనరల్ సర్ ఆర్థర్ కాటన్. సమాజహితాన్ని కోరేవారికి దేశం, ప్రాంతం, భాష, జాతి, మతం, కులం లాంటివేవీ అద్దంకి కాదని నిరూపించిన మహనీయుడు.
వృధాగా సముద్రం పాలవుతున్న నదీజలాలకు అడ్డుకట్ట కట్టి వాటిని పొలాల్లోకి మళ్ళించి లక్షలాది ఎకరాల భూముల్ని సస్యశ్యామలం చేసిన కాటన్ ను భారత నీటి పారుదలా వ్యవస్థ పితామహుడిగా పేర్కొంటారు.
1844 లో రాజమండ్రికి చర్చి నిర్మాణం నిమిత్తం వచ్చిన కాటన్ అక్కడ గోదావరి పరీవాహక ప్రాంతాల పరిస్థితిని చూసి ఆ నదీజలాలను సరైన పద్ధతిలో వాడుకుంటే వచ్చే ప్రయోజనాలను గుర్తించాడు. దాని మీద ఒక సమగ్ర నివేదిక రూపొందించి గోదావరి నదిపైన ఆనకట్ట ఆవశ్యకతను ప్రభుత్వానికి తెలియజేసాడు. దీని వలన రైతులు సగం ఖర్చు, శ్రమ తోనే రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చనేది ఆయన వాదన. బ్రిటిష్ ప్రభుత్వాదికారుల్ని వప్పించి ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట నిర్మించాడు. దానికి అనుబంధంగా అనేక కాలవలు, రోడ్లు, వరదనష్టాల్ని తగ్గించడానికి ఏటిగట్లు పటిష్ట పరచడం లాంటి ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు చేసాడు. అప్పటివరకూ పరీవాహక ప్రాంతాల ప్రజలకు దు:ఖదాయని
గా ఉన్న గోదావరి అన్నపూర్ణగా మారిపోయింది. అప్పటివరకూ అది రాజమండ్రి జిల్లా ! అప్పటినుంచి గోదావరి జిల్లాగా మారిపోయింది !! గోదావరి డెల్టా వాసులకు అతడు ఆరాధ్య దైవం. అందుకే వారికి అతడు కాటన్ కాదు, కాటన్న. కోనసీమలోని ప్రతి ఉళ్లోనూ కాటన్నలున్నారు. అతడు కృష్ణానది పరీవాహక ప్రాంతానికి చేసిన సేవ కూడా అనుపమానమైనదే ! బెజవాడలో
ఆనకట్ట నిర్మాణం ఆయన చలవే ! ఈనాడు ఆంధ్ర దేశం అన్నపూర్ణ గా ఖ్యాతిగాంచడానికి కాటన్ కారకుడనడంలో సందేహం లేదు.
సముద్రం పాలవుతున్న నదీ జలాలను పొలాల్లోకి మళ్లించిన అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్.
(
సర్ ఆర్థర్ కాటన్ మునిమనమడు రాబర్ట్ చార్లెస్ కాటన్ దంపతులు మన రాష్ట్రంలో పర్యటిస్తున్న సందర్భంగా...... )
Vol. No. 01 Pub. No. 121
No comments:
Post a Comment