Friday, December 10, 2010

ఆంధ్ర విశ్వకళా పరిషత్తు రూపశిల్పి


నీతి నిజాయితీలకి మారుపేరుగా నిలిచిన చిత్తూరు ప్లీడర్ గారు సుబ్రహ్మణ్యం రెడ్డి
ఆయన ద్వితీయ కుమారుడిగా కట్టమంచి గ్రామంలో జన్మించిన మహనీయుడు రామలింగారెడ్డి

ఆయనే తర్వాత కాలంలో విద్యావేత్తగా, రచయితగా, విమర్శకుడిగా, రాజకీయనాయకునిగా పేరుపడ్డ సి. ఆర్. రెడ్డి
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో వర్డ్స్ వర్త్ లాంటి మహాకవి చదివిన సెయింట్ జాన్ కళాశాలలో చదివిన సి. ఆర్. రెడ్డి
పందొమ్మిదేళ్ళ వయసులోనే ' ముసలమ్మ మరణం ' అనే కావ్యాన్ని రచించిన రచయిత సి. ఆర్. రెడ్డి 

మహాత్మాగాంధీ కంటే చాలా ముందే దళితులకు పాఠశాల ప్రవేశం చేయించిన సంఘ సంస్కర్త సి. ఆర్. రెడ్డి
ఆంధ్ర విశ్వకళా పరిషత్తు స్థాపన సమయంలో ఉపాధ్యక్షుడిగా అందరికీ తొలుత స్పురించిన వ్యక్తి సి. ఆర్. రెడ్డి

ఉత్తమ విద్యాప్రమాణాలు, ఉన్నతమైన పరిశోధనావకాశాలు గల విద్యాకేంద్రంగా తీర్చిదిద్దిన శిల్పి సి. ఆర్. రెడ్డి
ఉప్పు సత్యాగ్రహంలో నాయకులను అరెస్ట్ చేసినందుకు నిరసనగా ఉపాధ్యక్ష పదవిని వదులుకున్న సి. ఆర్. రెడ్డి
అందరి అభ్యర్థనలను మన్నిస్తూ రెండవసారి ఉపాధ్యక్ష పదవి చేపట్టి ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని చదువులతల్లి ఆలయంగా మార్చిన సి. ఆర్. రెడ్డి

కట్టమంచి వారు ఛలోక్తులు విసరడంలో దిట్ట. ఆయన ఛలోక్తులు కొన్నిటిని అందించిన గతంలోని టపా ....

http://sirakadambam.blogspot.com/2009/10/blog-post_1761.html


సర్ కట్టమంచి రామలింగారెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తూ.....  
 
బ్లాగ్మిత్రులు మంద పీతాంబర్ గారు కట్టమంచి వారి గురించి తమ వ్యాఖ్యలో మరింత విలువైన సమాచారం అందించారు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆ సమాచారం వ్యాఖ్య రూపంలోనే ఉండిపోతే చాలామందికి చేరే అవకాశం తక్కువ కాబట్టి అనుబంధ టపాగా అందిస్తున్నాను.
http://sirakadambam.blogspot.com/2010/12/blog-post_9938.html

Vol. No. 02 Pub. No. 079

3 comments:

మంద పీతాంబర్ said...

"యువభారతి"వారు 1980 లో ప్రచురించిన "ఆలోచనా లహరి"లో శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారిని గూర్చి డా"చల్లా రాధాకృష్ణ శర్మ గారు చేసిన ప్రసంగ వ్యాసం నుండి కొన్ని విషయాలను యీ సందర్భంలో తెలియజేయడం సముచింగా ఉంటుందనిపించింది . " మా వంశమున కేది వచ్చిన రానిండు,తెనుగు భాష యొక్కటి మాత్రమక్షయముగా నిలిచియుండిన చాలును" అన్న మహనీయుడు.గొప్ప భాషాభిమాని శ్రీ రామలింగా రెడ్డి గారు..ఆయన మేధావి,పండితుడు,రచయిత ,వక్త ,విద్యా వేత్త,రాజనీతి వేత్త,పరిపాలనా దక్షుడుయీ గుణాలతో పాటు ఆయన మానవత వాదిగా కూడా ఉండడం ఒక గొప్ప లక్షణమని వారు పేర్కొన్నారు.రాజనీతి వేత్తగా కంటె,విద్యా వేత్తగా కంటె,విద్వాంసుడుగా కంటే కూడా వ్యక్తిగా కట్టమంచి వారు చాలా ఉదాత్తుడని ఆచార్య కె.ర్.శ్రీనివాస అయ్యంగారు పేర్కోన్నారట.

1921 నుండి 1926 వరకు,1930 నుడి 1936 వరకు వారు రాజకీయాలలో పాల్గోన్నారట ఆ రోజుల్లో ఆయనంటే మంత్రులకు సింహ స్వప్నమట.వివిధ సమయాలలో ఆయన చేసిన ప్రసంగాలు,వాటిలో దొర్లిన చెణుకులు ,విసిరిన విసుర్లు,ఆలోచనామృతాలు."కాలం గతిస్తున్నది కాబట్టి,కాలంతో పాటే జ్ఞాపక శక్తి కూడా గతించ కూడదు " ద్వంద పరి పాలన ఒక్క,మదరాసుకే పరిమితమైన వ్యాధి కాదు. అది అఖిల భారత వ్యాధి ""పదవుల ఆశ సంశ్లేషానికి హేతువైతే ఆశా భంగాలు విశ్లేషానికి దారి తీస్తాయి"

ఒకసారి ఆయన శాసన మండలిలో ప్రభుత్వ విధానాలను నిశితంగా విమర్శిస్తుండగా ,సహించలేక పోయిన ముఖ్య మంత్రి(పానగల్ రాజా) తన జేబులోంచి ఒక కాగితం తీసి భయ పెట్టలనుకొన్నాడు.అందులో రెడ్డి గారు స్వకార్యం గురించి విన్నవించుకొన్నారట.అది గమనించిన కట్టమంచి వారు వెంటనే యిలా అన్నారట "ఇంగ్లాడులో అయితే కలహించుకొన్న ప్రేమికులు
విడి పోయేటప్పుడు ఎవరి ఉత్తరాలను వాళ్లకు ఇచ్చివేస్తారు" అంతే ; ముఖ్య మంత్రి నోటికి తాళం పడిందట .

ఇంకొక సారి ఆయన బడ్జెట్ గురించి ప్రస్తావిస్తూ కొన్ని సంఖ్యా వివరాలు తన ప్రసంగంలో తెలియ జేశారట. అవి సరి కావనిఒకరు ఆక్షేపణ తెలపడం తరువాయి "నేను లెక్కలు చెప్పడం లేదు ,రాజకీయాలు మాట్లాడుతున్నాను " అన్నారట ఏమాత్రం
తడుముకోకుండా.

ఒక రాజకీయ సభలో ప్రసంగిస్తుండగా కొందరు వేదిక మీదకు రాలు రువ్వారట.వెంటనే "మన రాజకీయాల్లో
జస్టిస్ పార్టి వారు కొందరు రాతి యుగాన్ని ప్రవేశ పెడుతున్నారు"అన్నారట వెంటనే.

ఒకసారి రైలు ప్రయాణం చేసి మదరాసు దిగారట పత్రికా విలేఖరులు చుట్టు ముట్టి అప్పుడు అందరి నోళ్ళలో నానుతున్న ఓ ప్రశ్న వేసి ,మీ అభిప్రాయ మేమిటని అడిగారట "ఇప్పుడు నాకు కావలసింది పోర్టరు గాని ,రిపోర్టరు కాదు " అని అన్నారట .

ఆయన మహ స్వతంత్రులట.ఒక సారి కేంద్ర విద్యా మంత్రి ఒకరు "మీరు విద్యా శాఖ కార్య దర్శిగా చేరతారా? అని అడిగారట అందుకు కట్టమంచి సమాధానం "ఇద్దరు విద్యా మంత్రులు ఎలా ఉంటారు "

రాజాజీ అంతటి వాడు ఆయన్ని "అసాధారణ ఉపాద్యక్షుదని"అభి వర్ణిoచారట.

రామలింగా రెడ్డి గారి రచనల్లో అందాలు దిద్దుకొన్న కొన్ని సూక్తులు

"కుటుంబ రక్షణార్ధం ద్రవ్యార్జన కై యతించుట దోషము కాదు గదా!"

"కనిత్వమునకు జీవకళ భావము .పద్యము శరీర మాత్రము"

"రక్షించుట కు శక్తి లేనిచో సృష్టించుట మహా పాతకము"

"రసార్ద హృదయులు నిత్య యౌవనులు గదా!"

"కవిత్వము నెదురు గొన్న వారికి మేఘ సంచారమే గాని భుసంచార మెక్కడిది ?"

ఆత్మ ప్రశంస ఆత్మ హత్యకు దుల్యము"

"మన:కృషియు,హస్త కృషియు గలియక యున్న నేర్పడునది "కళ" గాదు "కళంకము""

"విజ్ఞాన ముండిన మాత్రమున జన్మ సాఫల్యము కలుగ బొదు"

మీ బ్లాగు ద్వారా ఆయనను గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉంది.

SRRao said...

పీతాంబర్ గారూ !
చాలా చాలా కృతజ్ఞతలు. విలువైన సమాచారం అందించారు. నాకు చాలా ఆనందంగా వుంది. అయితే అది వ్యాఖ్య రూపంలో వుంటే చాలా తక్కువ మందికి చేరుతుంది. అందుకని అనుబంధ టపాగా ఇచ్చాను. గమనించగలరు.

Anonymous said...

ఒక ఆదర్శ వ్యక్తిని స్మరించుకొని, ఆయన గురించి ఎన్నో విషయాలు తెలుసుకొనే అవకాశం కలిపించారు ఈ వ్యాసం ద్వారా. అభినందనలు

nArAyaNi.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం