Friday, May 27, 2011

తెలుగు తేజం కందుకూరి

మూఢాచారాలతో కునారిల్లుతున్న మన సమాజాన్ని అభ్యుదయం వైపు నడిపించడానికి ప్రతీ యుగంలోనూ, ప్రతీ తరంలోనూ కొంతమంది మహనీయులు పుడుతుంటారు. వారు తమ జీవిత సర్వస్వాన్ని ధారభోసి సమాజోద్ధరణకు అంకితమవుతారు. అలాంటి కోవకు చెందిన మహానుభావుడు కందుకూరి వీరేశలింగం.

సమాజం లో పేరుకుపోయిన మూఢనమ్మకాల కుళ్ళును తొలగించడానికి  నడుం కట్టిన వీరేశలింగం సంస్కర్తలకే ఆదర్శంగా నిలిచారు. తెలుగువారు గర్వంగా చెప్పుకోగలిగిన మహనీయుల్లో ప్రథమశ్రేణిలో నిలిచిన వారు వీరేశలింగంగారు.

అతి బాల్య వివాహాలు, అతి వృద్ధవివాహాలు, కన్యాశుల్కం లాంటి దురాచారాలను రూపుమాపడానికి ఏర్పాటైన బ్రహ్మ సమాజం కొంతమంది చదువుకున్న వారిలో తప్ప ఇతరుల్లో ప్రభావం చూపకపోవడంతో సామాన్య జనులలో కూడా ఈ దురాచారాల దుష్ప్రభావాన్ని ప్రచారం చేసి అవి రూపుమాపడానికి కృషి చేసారు. వీటితో బాటు భర్త మరణంతో విధవలుగా ముద్ర పడి జీవితాంతం మోడులా బ్రతుకుతున్న స్త్రీలను ఉద్ధరించడానికి విధవా పునర్వివాహాలను ప్రోత్సహించారు.

తన వివేకవర్థని పత్రికను అవినీతి అక్రమాలపై  కొరడాగా ఝళిపించి పత్రికారంగంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పారు.
 తన ఆశయ సాధనకోసం ఏటికి ఎదురీది, ఎన్నో కష్టనష్టాలకోర్చిన కార్యసాధకుడు కందుకూరి.

 తెలుగు తేజం కందుకూరి వీరేశలింగంపంతులు గారి వర్థంతి నేడు. ఆ మహనీయునికి నీరాజనాలర్పిస్తూ.......

పంతులు గారు జరిపిన తొలి పునర్వివాహం విశేషాలు మీకోసం .............. 

http://sirakadambam.blogspot.com/2010/12/blog-post_11.html


Vol. No. 02 Pub. No.241

2 comments:

యమ్వీ అప్పారావు (సురేఖ) said...

మా రాజమండ్రి తెలుగు తేజం గురించి తెలియజేసినందుకు
ధన్యవాదాలండి. ఆయన రాజమండ్రిలో నిర్మించిన టౌన్ హాలులో
ఇప్పటికీ ఏదో ఒక మంచి కార్యక్రమం జరుగుతూనే వుంటుంది.
ఇదే మరో రాష్ట్రంలో నైతే ఆయన గృహాన్ని, టౌన్ హాలుని మరింత
బాగా పరిరక్షించే వారేమోననిపిస్తుంది.

SRRao said...

అప్పారావు గారూ !

ధన్యవాదాలు. నిజమే ! ఇలాంటి తెలుగు తేజాల్ని మన ప్రభుత్వాలే కాదు, ప్రజలు కూడా మరచిపోతున్నారు. అందుకే అలాంటి మహానుభావుల్ని, వారి వారసత్వాన్నీ ఈ విధంగా అందరికీ గుర్తు చెయ్యాలనే ఆయా సందర్భాలలో ఇలా రాస్తున్నాను.
మీకు ' శిరాకదంబం' తరఫున జన్మదిన శుభాకాంక్షలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం