Wednesday, April 13, 2011

అపర శకుని

 రారాజు సుయోధనుడు భీష్మ పితామహుడని సర్వ సైన్యాధ్యక్షునిగా ప్రకటించి అందుకు గుర్తుగా భీష్ముడికి రాజ ఖడ్గం అందించాడు. ఆ సందర్భంలో సుయోధన సార్వభౌముడిని భీష్మాచార్యులవారు భుజం తట్టి అభినందించారు.


" కట్..... రీటేక్ ! " అన్నారు దర్శకులు బి. ఏ. సుబ్బారావు గారు.
అంటూనే " ఏం ? మీ భుజం అలా అదిరిందేమిటి ? " అనడిగారు సుయోధనసార్వభౌమ పాత్రదారిని.
ఆయన ఏం చెప్పాలా అని ఆలోచిస్తుంటే " ఇప్పుడు అలా జరగదులెండి డైరెక్టర్ గారూ ! ఈసారి ఆయన భుజం మీద మెల్లగానే చెయ్య వేస్తాను " అన్నారు భీష్మాచార్య పాత్రలో జీవిస్తున్న నందమూరి తారకరామారావు గారు. ఆ మహానటుడితో నటించే అవకాశం కలిగినందుకు ఆనంద పారవశ్యంలో వున్న తనను ఆయన తన భుజం తట్టగానే ఒళ్ళు జలదరించి ఆ నటుడికి భుజం అదిరినట్లనిపించింది. అంతటి సూక్షమైన విషయాన్ని కూడా గ్రహించిన ఆ మహానటుడికి మనస్సులోనే నమస్కరిస్తూ రెండో టేక్ లో అద్భుతంగా చేసి తారకరాముడి ప్రశంసలు పొందారు.


ఈ సన్నివేశ చిత్రీకరణకు ముందు ఆ నటుడ్ని ఎన్టీయార్ కి పరిచయం చెయ్యగానే " మానవజన్మ దుర్లభం. అందులో అందర్నీ అలరించే నటుడిగా జన్మించడం సుకృతం. అది నిలబెట్టుకోవడం మన కర్తవ్యం " అంటూ నిండుమనసుతో ఆశీర్వదించారు. ఆయన ఆశీర్వదించినట్లే ఆ తర్వాత కాలంలో అంతటి పేరు తెచ్చుకున్న ఆ నటుడు ధూళిపాళ సీతారామ శాస్త్రి. 

 ధూళిపాళ రంగస్థలం నుంచి చిత్రసీమకు మాయాబజార్ చిత్రంతో పరిచయమయ్యారు. అదే మాయాబజార్ చిత్రంతో అపర శకునిగా పేరుతెచ్చుకున్న సి. యస్. ఆర్. అనంతరం మళ్ళీ ఆ పాత్రలో అంతటి పేరు తెచ్చుకున్న నటుడు ధూళిపాళ. విలక్షణమైన పాత్రలెన్నో పోషించిన ఆయన చివరి దశలో సన్యాసాశ్రమం స్వీకరించారు. ఆయన స్వస్థలం గుంటూరులో హనుమంతుని ఆలయం నిర్మించారు.

 ఈరోజు ( ఏప్రిల్ 13 ) ధూళిపాళ సీతారామశాస్త్రి గారి వర్థంతి సందర్భంగా ఆయనకు కళానీరాజనాలు. 

Vol. No. 02 Pub. No. 201

6 comments:

Rajendra Devarapalli said...

a minor correction here Dhulipala is indeed a proud son of the soil of Guntur but his birthplace is Dachepalli,Palnadu.

Anonymous said...

Dachepally is also in Guntur District...

SRRao said...

* రాజేంద్రకుమార్ గారూ !
మీ సూచనకు ధన్యవాదాలు. స్వస్థలానికి సంబంధించి జిల్లా అంతటినీ ఒకే ప్రాంతంగా చెప్పుకోవడం ఆనవాయితీ కనుక గుంటూరు జిల్లా వాసి అయిన కారణంగా స్వస్థలం గుంటూరు అని రాసాను. ఆయన చివరి రోజుల్లో గడిపింది కూడా గుంటూరే ! గమనించగలరు.

* అజ్ఞాత గారూ !
మీ సూచనకు కూడా ధన్యవాదాలు.

Rajendra Devarapalli said...

రావుగారు,నా వాఖ్యను ప్రచురించింనందుకు గాను మొదట నా ధన్యవాదాలు(ఇంగ్లీషులో ఉన్నప్పటికీ).ధూళిపాళ చారిత్రక వ్యక్తి,ఆయనను గురించిన ప్రతి వివరమూ ఇవ్వాళ చరిత్ర.కాబట్టే అంత వివరంగా చెప్పాల్సొస్తుంది.ఆయన గుంటూరు జిల్లాకు చెందినవారే.అయితే ముక్తసరిగా అలా చెప్పేసి ఊరుకోటం బాగోదని నేను దాచేపల్లి అని,పల్నాడు అని నొక్కి చెప్పాల్సొచ్చింది.
గతంలో సాలూరి రాజేశ్వరరావు గారు మనల్ని వదలిపోయినప్పుడు ఒక పత్రికలో వచ్చిన,వారు ఇచ్చిన సమాచారం మీద నేను వ్యక్తం చేసిన ఒక అభ్యంతరంపై కొంత చర్చ జరిగింది.ఆ తర్వాత ఆయన జన్మస్థలం తదితరవివరాలు సంపూర్తిగా ఇవ్వటంలోని ఔచిత్యం కూడా వారు గ్రహించారు.అప్పట్నుంచి అంతే ఇస్తున్నారు.

సుజాత వేల్పూరి said...

గుంటూరు గుజ్జనగుండ్లలో ఉండేదండీ ఆ హనుమదాయలం! ఆలయోద్ధరణకు ఆయన సమీప ప్రాంతాల్లో భిక్ష తీసుకున్నారు కూడా. గుంటూరు పట్టాభిపురం లో మా అక్కయ్య ఇంటికి వచ్చి భిక్ష తీసుకున్నపుడు చూశాను ఆయన్ని! ఒక మహర్షి లా ఎంతో తేజస్సుతో కనిపించారు. CSR శకుని పాత్రలో మెత్తని విలనిజం ఈయన శకుని పాత్రలో కనిపించదు. వంకరగా చూసే ఆ కళ్ళలోనే పగనంతా ప్రతిఫలిస్తూ ఉండేది.

SRRao said...

* రాజేంద్రకుమార్ గారూ !
సమాచారమిచ్చేటపుడు స్పష్టత వుండడం చాలా అవసరం. ఆ విషయంలో సందేహం ఏమీ లేదు. మీరు చేసిన సూచనకు, సవరణకు ధన్యవాదాలు.

* సుజాత గారూ !
ఆ హనుమ భక్తుని ఈ హనుమజ్జయంతి రోజున తల్చుకోవడం చాలా సంతోషం. పని మీద నాల్గురోజులు హైదరాబాదు వెళ్ళడం వల్ల చూడటం ఆలస్యమై మీద్వారా ఈ అవకాశం కలిగింది. మీకు కృతజ్ఞతలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం