Monday, December 6, 2010

నటనలో జీవించిన నటి

 ఆమె నటనలో జీవించింది
కానీ జీవితంలో నటించలేదు

ఆమె నటన ఎందరికో మార్గదర్శకం  
కానీ ఆ జీవితం కాదు ఎవ్వరికీ ఆదర్శం 

తెలుగు చిత్రసీమ గర్వంగా చెప్పుకునే నటి
తెలుగు కళా వినీలాకాశంలో వెలిగిన ధ్రువతార

పదహారణాలా తెలుగు కళాకారిణి, సహజ నటి 
మహానటి సావిత్రి జన్మదినం సందర్భంగా స్మృత్యంజలి ఘటిస్తూ ...............












సావిత్రి గారి ఇంటర్వ్యూలు మరి కొన్ని యూట్యూబ్ లోని ముక్కామల గారి ఛానెల్లో ఈ క్రింది లింకుల్లో చూడండి............

http://www.youtube.com/watch?v=wRhHGH5EWdE
http://www.youtube.com/watch?v=KMmKYWiFDHM
http://www.youtube.com/watch?v=iKKEwGfn_R0

సావిత్రి గారిపై గతంలో రాసిన టపాలు ................


Vol. No. 02 Pub. No. 075

Saturday, December 4, 2010

గాన సామ్రాజ్య సామ్రాట్


యేను తెలుగువల్లభుండ అని స్వయంగా చెప్పుకున్న చక్రవర్తి కృష్ణదేవరాయలు
అఖండ విజయనగర సామ్రాజ్యాన్ని జనరంజకంగా పాలించి చరిత్రలో నిలిచాడు  

తాను చెప్పుకోకపోయినా మనకి మరో తెలుగు వల్లభుడు ఘంటసాల
తెలుగు ప్రజల హృదయసామ్రాజ్యాన్ని నిరాటంకంగా ఇప్పటికీ ఏలుతూనే వున్నాడు

కృష్ణదేవరాయలు సాహిత్యలక్ష్మిని అభిమానిస్తే
ఈ గాన వల్లభుడు సంగీతలక్ష్మిని ఆరాధించాడు

తెలుగు సంగీతాన్ని అందని శిఖరాలకు చేర్చాడు
తెలుగు వారందర్నీ అలరించాడు... అలరిస్తున్నాడు....అలరిస్తాడు

ఏ సామ్రాజ్యంలోనైనా చక్రవర్తి మరణంతో ఖాళీ అయిన సింహాసనాన్ని మరొకరు అధిష్టిస్తారు 
మూడున్నర దశాబ్దాల క్రితం ఖాళీ అయిన తెలుగు గాన సింహాసనాన్ని ఎవరైనా అధిష్టించగలిగారా ? ఇకముందైనా అదిష్టించగలరా ?
 ప్రపంచంలో ఘంటసాలగారి కంటే ఎక్కువ పాటలు పాడిన వాళ్ళుండవచ్చు
మరణానంతరం ఆయన కంటే ఎక్కువకాలం తమ గానంతో సజీవంగా వున్న వాళ్ళుండవచ్చు
కానీ తెలుగు జాతి వున్నంతకాలం ఆయన తన గానంతో సజీవంగానే వుంటారు  
ఆయనది గతించిన తరం కాదు...... అది నిరం'తరం'

తెలుగు భాషకు అలంకారం పద్యం
తెలుగు దేశానికి అలంకారం ఘంటసాల
తెలుగు ప్రజలకు ఆయన దూరం కాలేదు 
తెలుగు భాష ఉన్నంతవరకు ఆయన వుంటారు

గాన సామ్రాజ్య సామ్రాట్ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి సందర్భంగా ఆయన పాడిన పద్యాలతో కూర్చిన నీరాజనం ...........
   





ఘంటసాల గారిపై గతంలో రాసిన టపాల లింకులు 

http://sirakadambam.blogspot.com/2009/12/blog-post_04.html
http://sirakadambam.blogspot.com/2009/12/blog-post_1328.html
http://sirakadambam.blogspot.com/2010/02/blog-post_11.html

Vol. No. 02 Pub. No. 074

Friday, December 3, 2010

మన తొలి రాష్ట్రపతి

కాలం పరుగులు పెడుతోంది. తరాలు మారుతున్నాయి. రాబోయే తరాలు మన స్వాతంత్ర్య సమరం గురించి ఇక పుస్తకాలలో, అంతర్జాలంలో మాత్రమే చదువుకునే పరిస్థితి వస్తోంది. ఎందుకంటే అప్పటి చిహ్నాలు, ఆ సమరంలో పాల్గొన్న మనుష్యులు క్రమంగా కనుమరుగవుతున్నారు. గాంధీజీ, నెహ్రుజీ లాంటి వాళ్ళను తప్ప స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న మిగిలిన ప్రముఖులను గురించి తెలియని పరిస్థితి ఎదురవబోతోంది. ఇప్పటికే వాళ్ళు చేసిన త్యాగాలను మరచిపోయాం ! కనీసం మరచిపోయినట్లు నటిస్తున్నాం ! మన తర్వాతి తరాలకు వారి గుర్తులు కూడా మిగలకుండా చేసే పరిస్థితి ఏర్పడబోతోంది. ఆ మధ్య గాంధీ చిత్రం రాకపోతే ఇప్పటి తరంలోనే ఆ ప్రమాదం ఏర్పడేదేమో ! అటెంబరో ఒక రకంగా ఆ ప్రమాదం నుంచి మనల్ని రక్షించాడు. అలా మరుగున పడుతున్న మహనీయుల్లో ఒకరు బాబూ రాజేంద్ర ప్రసాద్.

స్వాతంత్ర్య సమర యోధుడు, సమాజ సేవకుడు, విద్యావేత్త, రాజ్యాంగ రచనా సంఘ ప్రముఖుడు, భారతదేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్. 1884 లో  బీహార్ లోని ఒక గ్రామంలో జన్మించిన రాజేంద్రప్రసాద్ పాట్నాలోను, కలకత్తా లోనూ పై చదువులు చదివారు. కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో సైన్సు విద్యార్థిగా జగదీశ్ చంద్ర బోస్, ప్రఫుల్ల చంద్ర రాయ్ లాంటి ఉద్దండుల దగ్గర శిష్యరికం చేశారు. అక్కడే ఆయనలోని నాయకత్వ లక్షణాలు విద్యార్థి సంఘాల నిర్వహణ ద్వారా బయిట కొచ్చాయి. తర్వాత ఆర్ట్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఆయన కొంతకాలం ముజఫర్ పూర్ లో అధ్యాపకునిగా పనిచేశారు. తన సోదరుని సూచనతో ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి న్యాయశాస్త్రం చదివి పట్టా పుచ్చుకున్నారు. లాయర్ వృత్తిలో మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. ప్రో. అశుతోష్ ముఖర్జీ గారి ఆహ్వానం మీద కలకత్తా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా కూడా పనిచేశారు.

దక్షిణ ఆఫ్రికాలో సత్యాగ్రహం అనే ఆయుధాన్ని విజయవంతంగా ప్రయోగించి భారతదేశానికి తిరిగి వచ్చిన గాంధీజీ పిలుపుకు ప్రభావితులై స్వాతంత్ర్య సమరంలో ప్రవేశించారు రాజేంద్రప్రసాద్. ప్రముఖ రచయిత రాహుల్ సాంకృత్యాయన్ సాహచర్యంలో స్వాతంత్ర్యోద్యమం గురించి పత్రికలలో అనేక వ్యాసాలూ రాసారు. ఉద్యమ ప్రచారం కోసం అనేక ప్రాంతాలు పర్యటించారు. ఆ ఉద్యమంలో పూర్తి సమయం పనిచెయ్యడం కోసం బంగారు బాతు లాంటి న్యాయవాద వృత్తిని త్యజించారు. 1934 లో బొంబాయి లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1939 లో సుభాస్ చంద్ర బోస్ రాజీనామాతో మరోసారి కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు. బీహార్, బెంగాల్ లలో సంభవించిన వరదలు, భూకంపాలు లాంటి విపత్తులలో భారీ ఎత్తున విరాళాలు సేకరించి అప్పటి ప్రభుత్వం కంటే బాధితులకు మెరుగైన సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. స్వాతంత్ర్యోద్యమంలో జైలు శిక్ష కూడా అనుభవించారు.

1947 లో భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించగా 1950 లో సర్వసత్తాక రాజ్యంగా ( రిపబ్లిక్ గా ) మారింది. ఆ సమయంలోనే కొద్దికాలం ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. రాజ్యాంగ రచనా సంఘంలో బాబూ రాజేంద్ర ప్రసాద్ ప్రముఖ పాత్ర పోషించారు. సర్వసత్తాక రాజ్యంగా అవతరించిన భారదేశానికి తొలి రాష్ట్రపతి గా రాజేంద్రప్రసాద్ ఎన్నికయ్యారు. అప్పటినుంచి పన్నెండు సంవత్సరాలు భారత రాష్ట్రపతిగా పనిచేసిన ఆయన 1962 లో స్వచ్చందంగా పదవీ విరమణ చేశారు. 

ఈరోజు ( డిసెంబర్ 3 వ తేదీ ) మన తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా ఆయన్ని గుర్తుచేసుకుంటూ........

Vol. No. 02 Pub. No. 073
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం