Wednesday, November 3, 2010

శంకరశాస్త్రి....శారద.... ? - జవాబులు

  కనుక్కోండి చూద్దాం - 3 0 - జవాబులు 

ఈ ప్రశ్నలకు స్పందించిన మిత్రులకు ధన్యవాదాలు. మాధురి గారు మొదటి ప్రశ్నకు సరైన సమాధానమిచ్చారు. లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ గారు, కేకే గారు ఇచ్చిన సమాధానాలు అప్పట్లో కొన్ని ఆలోచనలు మాత్రమే ! పూర్తిగా నిర్ణయించినవి కావు. ఇక జవాబులు చూడండి.

 తెలుగు చిత్ర రంగంలో ఈ చిత్రం సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రంలో రెండు ప్రధానమైన పాత్రలు శంకరశాస్త్రి, ఆయన కూతురు శారద.
ఈ పాత్రలను పోషించిన సోమయాజులు గారు, రాజ్యలక్ష్మి చాలా పేరు తెచ్చుకున్నారు. కానీ ఆ పాత్రలకు ముందుగా నిర్ణయించింది వారిని కాదు.

మరి ముందుగా అనుకున్న ......
* శంకరశాస్త్రి ఎవరు ?
జవాబు : కృష్ణంరాజు గారు. అయితే అంతటి ఉదాత్తమైన పాత్ర ఔచిత్యానికి తన రెబెల్ హీరో ఇమేజ్ అడ్డు వస్తుందేమోననే సందేహం వ్యక్తపరచడంతో.... చాలా ఆలస్యంగా అప్పుడే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రముఖ రంగస్థల నటుడు జే. వి. సోమయాజులు గారిని ఎంపిక చెయ్యడం జరిగింది.  

* శారద ఎవరు ?
జవాబు : తొలుత ఈ పాత్రకు అప్పడప్పుడే హీరోయిన్ గా నిలదొక్కుకుంటున్న జ్యోతిని అడిగారు. అయితే ఆ పాత్ర ప్రాధాన్యం తక్కువ అనే ఉద్దేశ్యంతో ఆమె ఒప్పుకోలేదు. దాంతో ఆ పాత్ర కూడా అప్పట్లో పరిశ్రమలో కొత్తగా అడుగుపెట్టిన రాజ్యలక్ష్మిని వరించింది. 

Vol. No. 02 Pub. No. 046a

Monday, November 1, 2010

కర్తవ్యం

కీర్తిశేషులు భోగరాజు పట్టాభిసీతారామయ్య గారు, కృష్ణాపత్రిక సంపాదకులు ముట్నూరి కృష్ణారావు గారు చాలా సన్నిహితులు. ఇద్దరి మధ్యా అంతులేని ఆత్మీయత ఉండేది.  విలువలు పాటించే ఆ రోజుల్లో కర్తవ్యానికి స్నేహం అడ్డు రాకూడదని నమ్మిన వారు.

ఓసారి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. సుభాష్ చంద్రబోస్ కు పోటీగా గాంధీగారి అభ్యర్థిగా పట్టాభిగారు నిలబడ్డారు. ఆ సందర్భంలో ముట్నూరి కృష్ణారావు గారు తన పత్రికలో పట్టభిగారిని ఘాటుగా విమర్శిస్తూ సంపాదకీయం రాసారు. ఈ విషయం తెలిసి తనకు అత్యంత ఆత్మీయుడు, తన గురించి సంపూర్ణంగా తెలుసున్న మిత్రుడు కృష్ణారావు గారు అలా రాసినందుకు పట్టభిగారు చాలా బాధపడ్డారు.

వారిద్దరికీ ఆత్మీయులైన కొందరు ఈ విషయాన్ని ముట్నూరి వారి దగ్గర చెప్పారు. అప్పుడాయన  తన తల మీద వున్న తలపాగాను తీసి బల్ల మీద పెట్టారు.
" ఇప్పుడు పట్టాభిని ఎవరైనా పల్లెత్తు మాటన్నా చీల్చి చెండాడేస్తాను " అన్నారు ముట్నూరివారు.

తలపాగా వృత్తి చిహ్నం. వృత్తి ధర్మం ఆయన చేత పట్టాభిగారిపై విమర్శలు చేయించింది.
స్నేహం వ్యక్తిగతం. ఆ స్నేహం ఆయన చేత మిత్రునికి రక్షణ కల్పించింది.

కర్తవ్యం వేరు......... వ్యక్తిగతం వేరు.........

................ అవీ అప్పటి పత్రికారంగ విలువలు.

Vol. No. 02 Pub. No. 048

రెండో రాముడు

గతంలో రంగస్థల నాటకాలు సుదీర్ఘంగా సాగేవి. అందుకని రాముడు, కృష్ణుడు వంటి ముఖ్య పాత్రలను ఇద్దరు ముగ్గురు నటులు ధరించేవారు. ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు..... ఇలా ఆ పాత్రని ఫలానా నటుడు ధరిస్తాడని అని కరపత్రాల్లో ముద్రించేవారు.

అలాగ కాదుగానీ  మనకి వెండి తెర రాముడు అంటే గుర్తుకొచ్చేది నందమూరి తారక రాముడే ! ఆయన్ని తప్ప ఊహించుకోలేకుండా వున్న పరిస్థితుల్లో ఆయనే తన స్వంత చిత్రం ' సీతారామకల్యాణం ' లో మరో రాముణ్ణి ప్రవేశపెట్టారు. ఆ రాముడే హరనాథ్.

హరనాథ్ తండ్రి నటుడు అవ్వాలని మద్రాస్ చేరి సహకార దర్శకుడిగా మారారు. హరనాథ్ కి కూడా సినిమాల మీద, నటన మీద ఆసక్తి వున్నా తండ్రి తన అనుభవంతో విధించిన ఆంక్షల కారణంగా బి.ఏ. పూర్తి చేసేవరకూ ఆవైపు తొంగి చూడలేదు. ఇంటర్ మద్రాస్ లో చదివేటపుడు బాపు రమణలు ఆయన సహాధ్యాయులు. కాకినాడలో బి.ఏ, చదివేటపుడు ప్రముఖ నిర్మాతలు వి. బి. రాజేంద్రప్రసాద్, ఏడిద నాగేశ్వరరావు లు సహాధ్యాయులు.

తండ్రి వల్లో, మిత్రుల వల్లో హరనాథ్ కు సినిమాలలో అవకాశం రాలేదు.  బి.ఏ. పూర్తిచేసి మిలిటరీలో చేరే ఉద్దేశ్యంతో మద్రాస్ కొచ్చిన హరనాథ్ ఒకరోజు కోడంబాక్కం బస్సు స్టాప్ లో నిలబడి వుండగా అప్పట్లో ప్రముఖ కళాదర్శకుడైన సూరన్న చూసి తన కారు ఆపి ' సినిమాలో వేషం వేస్తావా ? ' అని అడిగాడు. తన చిరకాల కోరిక తీరే అవకాశం తనని వెదుక్కుంటూ వచ్చినందుకు షాక్ తిన్న ఆయన్ని నవశక్తి గంగాధరరావు గారికి పరిచయం చేశారు సూరన్న. అతని రూపం, హావభావాలు నచ్చి గుత్తా రామినీడు దర్శకత్వంలో తాను నిర్మించబోయే చిత్రంలో అవకాశం ఇచ్చారు గంగాధరరావు గారు.    

అలా హైదరాబాద్ సారధి స్టూడియోస్ లో చిత్రీకరించబడ్డ మొదటి చిత్రం ' మా ఇంటి మహాలక్ష్మి ' తో 1959 లో చిత్రరంగ గృహప్రవేశం చేసిన హరనాథ్ 60 వ దశకంలో తెలుగు చిత్ర సీమలో ప్రముఖ హీరోల సరసన చేరాడు. బడ్జెట్ చిత్రాల హీరో గా, పురాణ పాత్రలకు సరిపోయే ఆకారంతో, చూడ చక్కని రూపంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. జమున, హరనాథ్ జంట అప్పటి ప్రేక్షకుల కన్నుల పంట.  ' భీష్మ ' ( 1967 ) చిత్రంలో కృష్ణుడిగా,  ' శ్రీరామకథ '   ( 1969 ) లో మరోసారి రాముడిగా నటించారు. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో సుమారు 130 చిత్రాల్లో నటించిన హరనాథ్ చివరి చిత్రం ' నాగు ' .  దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తొలిసారి హీరోగా నటించిన ' పగడాల పడవ ' చిత్రంలో హరనాథ్ ఓ ప్రముఖ పాత్ర పోషించారు. ఆ చిత్రం విడుదల కాలేదు.

ఉన్నతమైన స్థానానికి ఎదగడానికి అన్ని లక్షణాలు వున్న వ్యక్తి కొన్ని అవలక్షణాల బారిన పడితే తన పతనం తానే కోరి తెచ్చుకున్నట్లవుతుందని చెప్పడానికి హరనాథ్ జీవితమే ఒక ఉదాహరణ.

ఈరోజు ( నవంబర్ 1 )  హరనాథ్ వర్థంతి. ఆయనలోని నటుడిని స్మరించుకుంటూ ..............



Vol. No. 02 Pub. No. 047
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం