Thursday, September 23, 2010

అస్తమించిన మరో అభ్యుదయం

 కళను పూర్తి వ్యాపారాత్మక వస్తువుగా మార్చుకుంది ఈనాటి సినిమా రంగం
కళ కేవలం వ్యాపారం కోసమే కాదు దానికొక సామాజిక బాధ్యత వుంది
ఆ బాధ్యతను గుర్తించిన సినిమా రంగ ప్రముఖులలో కె. బి. తిలక్ కూడా ఒకరు
ఆయన నిర్మించిన, దర్శకత్వం వహించిన చిత్రాల్లో ఈ విషయం స్పష్టంగా కనబడుతుంది
జగ్గయ్య, గాయని జానకి, జయప్రద లాంటి వాళ్ళనెందరినో తెలుగు తెరకు అందించారు తిలక్


ఈనాటి తెలుగు చిత్రాల్లో ఆ అభ్యుదయం కనుమరుగైంది
నేడు ఆ అభ్యుదయ దర్శక నిర్మాత అస్తమించాడు
అలాంటి సామాజిక బాధ్యత కలిగిన దర్శక నిర్మాత మళ్ళీ ఎప్పుడో ..... ఎవరో ....

ఈరోజు అస్తమించిన ఆ అభ్యుదయానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ.........




Vol. No. 02 Pub. No. 032

నడి ' మం ' త్రపు సిరి

 సంస్కృతం భారతీయ భాషలన్నిటికీ తల్లి వంటిది. ఆ భాషా వ్యాప్తికి ఎందఱో మహానుభావులు తమ జీవితాలు అంకితం చేశారు.
వారిలో ప్రముఖులు కాశీ కృష్ణాచార్య గారు. ఆయనకు పద్య ధారణా శక్తి ధారాళంగా ఉండేదని చెప్పుకునేవారు. కృష్ణాచార్య గారు మంచి వక్త కూడా !

ఒకసారి ఆయనకు మచిలీపట్టణంలో ఘన సన్మానం ఏర్పాటయింది. ఆయన్ని వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఆ నిర్వహణా సంఘ సభ్యుడు
" కాశీ కృష్ణమాచార్య గారిని వేదికను అలంకరించవలసినదిగా కోరుతున్నాం "
అని సంభోధించారు. అలాగే కృష్ణాచార్య గారిని సభకు పరిచయం చేసే సందర్భంలో కూడా అదే పేరుతో పరిచయ కార్యక్రమం కానిచ్చారు. పండితుల వారు ఈ విషయాన్ని నిశితంగా గమనించారు. తర్వాత కృష్ణాచార్యుల వారు తమ ప్రసంగం ప్రారంభిస్తూ

" నాగురించి పరిచయకర్తలు చెప్పినట్లు నాకు నడి'మం'త్రపు సిరి లేదు. నాపేరు కేవలం కృష్ణాచార్య మాత్రమే ! "
అన్నారు.  పండితులకు చమత్కారభాషణ సహజమే కదా !

Vol. No. 02 Pub. No. 031

Wednesday, September 22, 2010

ఈనాటి వాగ్గేయకారుడు పి.బి.


వాగ్గేయకారుడు అనే మాటకు సజీవ ఉదాహరణ పి. బి. శ్రీనివాస్
కాకినాడలో పుట్టి కన్నడిగులను మెప్పించిన గాన గంధర్వుడు పి.బి.

విలక్షణమైన స్వరం, వినసొంపైన గానం ఆయన స్వంతం
అందుకే పరాయి భాషల్లో కూడా ఆయన నీరాజనాలందుకున్నారు

తెలుగు..తమిళ.. కన్నడ..మళయాళ.. హిందీ..ఉర్దూ.. భాషల్లో పండితుడు
ఆశువుగా పద్యాలు పాటలు రాస్తారు .... అలవోకగా గజల్స్ గీతాలు పాడతారు


1951 - 52 ప్రాంతాల్లో ' మిస్టర్ సంపత్ '  అనే హిందీ చిత్రంలో అప్పటికే ప్రముఖ గాయనీమణులైన  గీతాదత్, షంషాద్ బేగం, జిక్కి లాంటి వారితో కలిసి పాడడంతో చిత్రసీమలో అడుగు పెట్టారు.  అదే సంవత్సరం ప్రముఖ కన్నడ దర్శక నిర్మాత ఆర్. నాగేంద్రరావు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నిర్మించిన త్రిభాషా చిత్రం ' జాతకఫలం ' లో మూడు భాషలలోను పి. బి. శ్రీనివాస్ పాడారు.  ఒకే సంవత్సరంలో నాలుగు భాషల్లో గాయకుడిగా పరిచయమైన ఘనత బహుశా ఆయన ఒక్కరిదేనేమో !

ఆయన గాయకుడే కాదు కవి, రచయిత కూడా ! ఎన్నో కవితలు, గజల్స్ వంటివి రాసారు. వాటిని స్వయంగా స్వరపరచి ఆలపించారు. సినిమాలకు పాటలు కూడా రాసారు. తెలుగులో ఎం.ఎస్. శ్రీరాం నిర్మించిన ' మంచిరోజు ' చిత్రంలో కొన్ని పాటలు రాసారు. ' భాగ్యజ్యోతి ' అనే కన్నడ చిత్రంలో సంస్కృత భాషలో ఒక పాట రాసారు. అలాగే మరో కన్నడ చిత్రం ' మక్కళ భాగ్య ' లో ఒక పాట అయిదు భాషల్లో వుంటుంది. అందులో కన్నడ చరణం తప్ప మిగిలిన తమిళ, తెలుగు, మళయాళ, హిందీ భాషల చరణాలు పి. బి. శ్రీనివాస్ రాసి తానే స్వయంగా ఆ పాట పాడారు.

ఎనభై వసంతాలు పూర్తి చేసుకున్న ఈనాటి వాగ్గేయకారుడు ప్రతివాది భయంకర శ్రీనివాస్ గారి జన్మదిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఆణిముత్యాల కదంబం..............





Vol. No. 02 Pub. No. 030
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం