కార్తీకమాసం
శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైనది. ఈ నెలంతా పండుగలే ! కార్తీకమాస
ప్రారంభానికి గుర్తుగా ముందురోజు దీపావళి వస్తే కార్తీక సోమవారాలు
పుణ్యదినాలు. ఇంకా ఈ వారంలో ఉత్థాన ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక
పౌర్ణమి లాంటి పర్వదినములు వస్తున్నాయి. వాటి ప్రాశస్త్యం గురించి డా.
ఇవటూరి శ్రీనివాసరావు గారి వివరణ శిరాకదంబం వెబ్ పత్రిక ఈ వారం సంచికలో చూడండి ........
కార్తీక సోమవారాలు, నాగులచవితి, క్షీరాబ్దిద్వాదశి, కార్తీక పౌర్ణమి.... ఈ మాసంలో వచ్చే కొన్ని ముఖ్యమైన పర్వదినాలు. కార్తీకమాసం యొక్క ప్రాముఖ్యము, అందులో మొదటగా వచ్చే నాగులచవితి విశిష్టత గురించి డా. ఇవటూరి శ్రీనివాసరావు గారి వివరణ శిరాకదంబం వెబ్ పత్రికలో ఈ క్రింది లింకులో .............
మాట కరుకు, మనసు వెన్న.... తెలుగు సాహితీకారులకి జ్ఞాన పీఠాన్ని రుచి చూపిన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. అందుకో ఉదాహరణ......
బందరులో కుర్రాడు విశ్వనాథ గారి ప్రతిభ విని ముగ్దుడై ఓ రోజు ఆయన్ని చూడడానికి విజయవాడ వచ్చాడు. వారిని, వీరిని అడిగి తెలుసుకుని మొత్తానికి విశ్వనాథ వారిల్లు పట్టుకున్నాడు. ఎండాకాలం. అసలే బెజవాడ. ఓ ప్రక్క ఎండ మండిపోతోంది. మరో ప్రక్క చెమటలు. అలాగే ఆ ఇంటి తలుపు తట్టాడు. ఓ పెద్ద ముత్తైదువ వచ్చి తలుపు తీసింది.
ఆ అబ్బాయి " విశ్వనాథ సత్యనారాయణ గారున్నారా ? " అని అడిగాడు. ఉన్నారు కూర్చోమని చెప్పి ఆవిడ లోపలికి వెళ్లి పోయింది. ఎంతసేపైనా లోపల్నుంచి ఎవరూ రాకపోయేసరికి అతనే గుమ్మం దగ్గరికి వెళ్లి లోపలికి తొంగి చూసాడు. వంటిల్లు కనబడింది. ఎండాకాలం ఆవకాయ సీజను కదా ! దానికోసం లోపల పచ్చి మామిడికాయల రాసి పోసి వుంది. దాని ముందు కత్తిపీట పెట్టుకుని కూర్చుని ఒక పెద్దాయన కాయలు తరుగుతున్నాడు. వంటాయన కాబోలు అనుకున్నాడా అబ్బాయి. ఆ శ్రమకు, వేడికి బయిటకు వస్తున్న చెమటలు తుడుచుకుంటూ తరిగేస్తున్నరాయన. ఈ అబ్బాయి ఆయన్ని పిలిచి విశ్వనాథ వారిని గురించి అడిగాడు. తరగడం ఆపి ఓసారి ఇతన్ని పరీక్షగా చూసి లోపలి రమ్మని పిలిచారు.
ఆ అబ్బాయి లోపలి వెళ్ళాడు. " నీ పేరేమిటి ? " అని అడిగారాయన. చెప్పాడా అబ్బాయి. ఏం చదువుతున్నావంటే చెప్పాడు. ఊరు, పేరు.... ఇలా ఒక్కొక్కటే అడుగుతుంటే అతనికి విసుగొచ్చింది.
" ఇంతకీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఎక్కడా ? " అనడిగాడు.
" ఆయనతో నీకేం పని " అని ఎదురు ప్రశ్న వేసారు ఆ పెద్దాయన.
" పనేం లేదు. ఊరికే చూసి పోదామని. అంతే ! " అన్నాడా అబ్బాయి తాపీగా.
అంతే... ఆ పెద్దాయనకు కోపం ముంచుకొచ్చింది.
" వచ్చిన ప్రతీవాడికీ నేనేం ధర్మ దర్శనం ఇస్తానని చెప్పలేదు. నన్నేం చూస్తావు నా పిండాకూడు. ఎలాగూ వచ్చావు. నాలుక్కాయలు తరిగేసి పో ! నాక్కాస్త సాయం చేసినట్లేనా వుంటుంది " అని గయ్యిమన్నారు.
దాంతో ఆ అబ్బాయికి ఆయనే విశ్వనాథ వారని అర్థమయింది. వెంటనే ఆయన కాళ్ళ మీద పడి క్షమించమన్నాడు. అంతే ! ఆ మహానుభావుడి మనసు వెన్నలా కరిగిపోయింది. ఆ అబ్బాయిని లేవదీసి...
" లేరా అబ్బాయ్ ! నువ్వేదో కష్టపడి వచ్చావు గానీ నేను చదవవలసిన వాడినే కానీ చూడవలసిన వాడిని కాదురా ! "
...... అని ఆ పూట భోజనం పెట్టి, సాహితీ తాంబూలంగా కొన్ని పుస్తకాలు ఇచ్చి పంపారు.
1957 లో విడుదలైన దొంగల్లో దొర చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారికి అరవై వ చిత్రం. ఆ చిత్రం విడుదల సందర్భంగా తన ఎదుగుదలకు సహకరించిన చిత్ర పరిశ్రమలోని వారందరినీ సత్కరించాలని అనుకున్నారు అక్కినేని. ఆరోజే ఆంధ్ర విశ్వవిద్యాలయానికి విరాళం కూడా ఇవ్వాలని తలపెట్టారు. ఇంత భారీ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజానీకాన్ని తట్టుకునే వేదిక ఎక్కడా అన్న సమస్య వచ్చింది.
అప్పట్లో వాహినీ స్టూడియో ఎదురుగా పెద్ద ఖాళీ స్థలం వుండేది. ముళ్ళపొదలు, పిచ్చిమొక్కలతో నిండిపోయి చిట్టడవిలా వుండేది. వేదిక అనేది పెద్ద సమస్య కాదని కొట్టి పడేస్తూ విజయా సంస్థ అధినేత బి. నాగిరెడ్డి గారు ఆ ప్రదేశంలో వేదిక ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. దానికి అందరూ పెదవి విరిచారు. ఆ స్థలం బాగు చెయ్యాలంటే చాలా సమయం పడుతుందని, శ్రమ ఆవుతుందని... కనుక అది సాధ్యం కాదని అనుకున్నారు. అందరూ ఇంకా తర్జన భర్జనలు పడుతూ ఉండగానే నాగిరెడ్డి గారు ఒక బుల్ డోజర్ తెప్పించారు. చిట్టడవిని మైదానంగా మార్చేసారు. వందలాది మంది వడ్రంగులని, తాపీ మేస్త్రీలని, పెయింటర్లని, మౌల్దర్లని ఇంకా కూలీలు, తోట పని వాళ్ళు.... ఇలా ఎంతోమందిని ఏర్పాటు చేసి, ఎన్నో రకాల పూల మొక్కలు తెప్పించి ఆ ప్రదేశమంతా నందనవనంలా మార్చేసారు.
నాగిరెడ్డి గారి నిర్వహణా సామర్థ్యానికి గీటురాయిగా నిలిచిన ఆ ప్రదేశమే విజయా గార్డెన్స్. అప్పటినుంచి సినిమా వాళ్ళందరికీ అది కల్పవృక్షంగా మారింది. ఎన్నో చిత్రాలు అక్కడ రూపుదిద్దుకున్నాయి. విజయా సంస్థ కిరీటంలో మరో కలికి తురాయిగా నిలిచింది విజయా గార్డెన్స్.
విమర్శ అనేది ఎలా ఉండాలంటే ఎదుటివారిలో లోపాలను సునిశితంగా పరిశీలించి వారి లోపం వారికి తెలిసే విధంగా వుండాలి. అది వారి అభివృద్ధికి తోడ్పడాలి. అంతేకానీ లేని లోపాల్నీ వెదికి, అంత ప్రాముఖ్యం కాని అంశాలను ఎత్తి చూపితే అది విమర్శ అనిపించుకోదు. తమలోని అహాన్ని సంతృప్తి పరచడానికి ఎదుటివారిని విమర్శించేవారు మనకు చాలామంది కనబడుతుంటారు. నిండు కుండ తొణకదు అన్నట్లు ఒక అంశంలో నిష్ణాతులైన వాళ్లకి అదే అంశంలో ఇతరులు చేసే చిన్న చిన్న పొరబాట్లు, లోపాలు కూడా స్పష్టంగా అగుపడతాయి. అవి గమనించి ఊరుకోక వారికి చెప్పి వారి లోపాలను సవరించడానికి ప్రయత్నిస్తారు. ఇలా చెప్పడానికి వారికి అహం అనేది అడ్డు రాదు. అలా పెద్దలు, నిష్ణాతులు చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకుని తమలోని లోపాలను సవరించుకుంటే వారు కూడా ఆయా కళలలో, ఇతర అంశాలలో నిష్ణాతులుగా తయారయ్యే అవకాశముంది. అలాంటి ఓ సునిశిత విమర్శ లేదా సూచనను గురించి పరిశీలిద్దాం.
తెలుగు నాటక రంగం గురించి ఏమాత్రం అవగాహన ఉన్నవారికైనా స్థానం నరసింహారావు గారి స్త్రీ పాత్రల గురించి తెలియక పోదు. ఆయన ధరించిన స్త్రీ పాత్రల్లో రోషనార ప్రముఖమైనది. దానికంటే ముందు ధర్మవరపు రామకృష్ణాచార్యులు గారు రచించిన ' రోషనార శివాజీ ' నాటకం ద్వారా రోషనార పాత్రలో పేరు గడించిన నటులు పెమ్మరాజు కేశవమూర్తి గారు.
ఒకసారి ఆ నాటక ప్రదర్శన జరుగుతోంది. ఆ ప్రదర్శనకు ప్రముఖ నటులు, ప్రయోక్త బళ్ళారి రాఘవాచార్యులు గారు హాజరయ్యారు. ముందు వరసలోనే కూర్చున్నారు. ఇది గమనించిన కేశవమూర్తి గారు రెట్టించిన ఉత్సాహంతో నటించడం ప్రారంభించారు. ఫలితంగా ఆనాటి రోషనార పాత్ర ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. దానికి నిదర్శనం హాలంతా మార్మోగిన చప్పట్లు, రంగస్థలం మీద కురిసిన రూపాయిల, బంగారు ఆభరణాల వర్షం. ప్రేక్షకులు అంత తన్మయం చెందినా, ప్రశంసల వర్షం కురిపించినా బళ్ళారి రాఘవ గారి ముఖంలో అంత సంతృప్తి వున్నట్లు కేశవమూర్తి గారికి తోచలేదు. ఆయన అహం దెబ్బతింది. విషయమేమిటో తెలుసుకోవాలనుకున్నారు.
ప్రదర్శన పూర్తి అయ్యాక నేరుగా బళ్ళారి రాఘవ గారి దగ్గరికి వచ్చి వినయంగా నమస్కరించి
" తమవంటి పెద్దలు నా ప్రదర్శనకు రావడం అదృష్టం. మీకేవైనా లోపాలు కనిపిస్తే చెబితే సరి దిద్దుకుంటాను " అన్నారు. పైకి వినయంగా అడిగినట్లు వున్నా ఆయన మాటల్లో అహంకారం ధ్వనించింది. అది గ్రహించిన రాఘవగారు చిరునవ్వుతో
" బాగుంది. చిన్న చిన్న లోపాలు సరిదిద్దుకుంటే నీ నటన ఇంకా రాణిస్తుంది " అన్నారు.
నా నటనలో లోపాలా అన్న అహం ధ్వనిస్తుండగా " ఆ లోపాలేవిటో సెలవిస్తే సవరించుకుంటాను " అన్నారు కేశవమూర్తి గారు. అప్పుడు బళ్ళారి వారు
" బాబూ ! నువ్వు వేసిన వేషం రోషనార. అంటే ముస్లిం వనిత. శివాజీకి ఉత్తరం రాసే ఘట్టంలో నువ్వు ఏ భాషలో రాస్తున్నట్లు ? ఉర్దూ భాషలో కదా ! ఆ భాషలో వాక్యాలను కుడినుంచి ఎడమకి కదా రాసేది. నువ్వు అలా రాసావా మరి ? " అన్నారు.
అంతే ! కేశవమూర్తి గారు ఆశ్చర్యచకితులై పోయారు. ఆయన సునిశిత పరిశీలనా శక్తికి ముగ్ధులై రాఘవ గారి పాదాల మీద వాలిపోయారు.
కుడి ఎడమ కావడాన్ని సాధారణ ప్రేక్షకుడు గమనించ లేకపోవచ్చు గానీ బళ్ళారి రాఘవ గారి లాంటి నిష్ణాతుడికి సాధ్యమే ! అందుకే అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు మన అభివృద్ధికి పునాదులు.
1939
లో వాహినీ వారు నిర్మించిన ' వందేమాతరం ' చిత్రంలో ప్రధాన కథాంశం నిజానికి
స్వాతంత్ర్యోద్యమం కాదు. నిరుద్యోగ సమస్య. అయితే బ్రిటిష్ ప్రభుత్వం ఆ
పేరు చూసి నిషేదిస్తుందేమోననే సందేహంతో ఇంకో పేరు కూడా పెట్టారు. అసలు పేరు
' వందేమాతరం ' క్రిందనే చిన్న అక్షరాలలో ఉపశీర్షికగా ఆ పేరు వేసేవారు.
రాజకీయవేత్తగా, కొన్ని రాష్ట్రాలకు గవర్నర్ గా కూడా పని చేసిన ఒకప్పటి కథానాయకుడు, నిర్మాత, దర్శకుడు 1944
లో ప్రారంభించిన ఒక చిత్రానికి అదే పేరు పెట్టారు. అంతే కాదు ఆ చిత్రానికి
మొదట వేరే పేరు ప్రకటించి, ప్రొడక్షన్ దశలోనే ఇంకో పేరు మార్చి, చివరికి
అది పూర్తయి విడుదల చేసే ముందు ఈ పేరు ఖరారు చేసారు.
అ ) 1939 లో ఉపశీర్షికగా, 1946 లో ప్రథాన శీర్షికగా వచ్చిన ఆ పేరు ఏమిటి ?
జవాబు : మంగళసూత్రం
ఆ ) 1946 లో వచ్చిన చిత్రం మొదటి రెండు పేర్లు ఏమిటి ?
జవాబు :మొదటి పేరు ' ఇది మా కథ ', తర్వాత పేరు ' మనమిద్దరం '
ఇ ) 1946 లో వచ్చిన ఆ కథానాయకుడు, నిర్మాత, గవర్నర్ ఎవరు ?
జవాబు : కోన ప్రభాకరరావు - ఈయన రాజకీయాలలో అనేక పదవులనలంకరించడంతో బాటు పుదుచ్చేరి, సిక్కిం, మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేసారు.
దేవికగారు దాదాపుగా అంతా సరిగానే చెప్పారు. ముఖ్యంగా ఆవిడ పరిజ్ఞానానికి ధన్యవాదాలు. మీరు చెప్పినట్లు ' మంగళసూత్రం ' చిత్రం విడుదలైంది 1946 లోనే ! కాకపోతే ఆ చిత్రనిర్మాణ సన్నాహాలు ప్రభాకరరావు గారు 1944 లో ప్రారంభించారు. ఆ విషయమే వివరణలో ఇచ్చినా ప్రశ్నలలో మార్చకపోవడం పొరబాటు అయింది. జవాబులో సవరించాను. మీ సవరణకు ధన్యవాదాలు.
రమణారావు గారు చెప్పినట్లు ప్రభాకరరావు గారు 1948 లో వచ్చిన ' ద్రోహి ' చిత్రంలో విలన్ గా నటించారు. అంతేకాదు.. 1951 లో విడుదలయిన ' రూపవతి ' అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. రమణారావు గారికి కూడా ధన్యవాదాలు.
" ఎక్కువ పాటలు రాయాలనే కోరిక నాకెప్పుడూ లేదు. రాసిన నాలుగూ మంచివి రాయాలనే తపన తప్ప "
అనేవారు అచ్చమైన తెలుగు సినీ గేయ రచయిత జాలాది.
జానపదాలను సినీపదాలుగా మార్చిన అక్షర బ్రహ్మ జాలాది. ఈయన సినిమా రచయితగా మారక ముందు డ్రిల్ మాస్టర్ గా, డ్రాయింగ్ మాస్టర్ గా పని చేశారు.
" మేడ కట్టలేకపోవచ్చు గానీ, మేడలో గూడు కట్టుకోగలను. అలాగే నేను మనుష్యుల గుండెల్లో గూడు కట్టుకోవాలని ప్రయత్నిస్తానే తప్ప స్వార్థంతో గుడి కట్టుకోవాలని తాపత్రయపడను " అనే సంస్కారం ఆయనది.
1939 లో వాహినీ వారు నిర్మించిన ' వందేమాతరం ' చిత్రంలో ప్రధాన కథాంశం నిజానికి స్వాతంత్ర్యోద్యమం కాదు. నిరుద్యోగ సమస్య. అయితే బ్రిటిష్ ప్రభుత్వం ఆ పేరు చూసి నిషేదిస్తుందేమోననే సందేహంతో ఇంకో పేరు కూడా పెట్టారు. అసలు పేరు ' వందేమాతరం ' క్రిందనే చిన్న అక్షరాలలో ఉపశీర్షికగా ఆ పేరు వేసేవారు.
రాజకీయవేత్తగా, కొన్ని రాష్ట్రాలకు గవర్నర్ గా కూడా పని చేసిన ఒకప్పటి కథానాయకుడు, నిర్మాత, దర్శకుడు 1944 లో నిర్మించిన ఒక చిత్రానికి అదే పేరు పెట్టారు. అంతే కాదు ఆ చిత్రానికి మొదట వేరే పేరు ప్రకటించి, ప్రొడక్షన్ దశలోనే ఇంకో పేరు మార్చి, చివరికి అది పూర్తయి విడుదల చేసే ముందు ఈ పేరు ఖరారు చేసారు.
అ ) 1939 లో ఉపశీర్షికగా, 1944 లో ప్రథాన శీర్షికగా వచ్చిన ఆ పేరు ఏమిటి ?
ఆ ) 1944 లో వచ్చిన చిత్రం మొదటి రెండు పేర్లు ఏమిటి ?
ఇ ) 1944 లో వచ్చిన ఆ కథానాయకుడు, నిర్మాత, గవర్నర్ ఎవరు ?
హరికథా పితామహ ఆదిభట్ల నారాయణదాసు గారికి, విజయనగరం రాజా ఆనంద గజపతి మహారాజు గారికి స్నేహం మెండు.
ఓసారి ఇద్దరూ ఢంకా పలాస్ ఆడుతున్నారు. నారాయణదాసు గారికి మూడు రాజులు పడ్డాయి. ఆయనకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. రెచ్చిపోయి పందెం కాస్తున్నారు. అయితే రాజుగారికి మూడు ఆసులు పడ్డాయి. కానీ ఆ విషయం ఆయన బయిట పెట్టలేదు. దాసు గారి ఉత్సాహాన్ని అడ్డుకోవడం ఇష్టం లేక ఆయనా పందెం కాస్తున్నారు. రసవత్తరంగా పందెం సాగుతోంది. కొంతసేపటికి ఆదిభట్ల వారి దగ్గర డబ్బులు నిండుకున్నాయి. ఆ విషయం గ్రహించి రాజు గారు ఉదారంగా దాసు గారినే ముందుగా ముక్కలు తిప్పమన్నారు. ఆయన తన దగ్గరున్న మూడు రాజుల్ని తిప్పారు గర్వంగా ! రాజు గారు చిరునవ్వుతో తన దగ్గరున్న మూడు ఆసుల్ని చూపించారు. ఆదిభట్ల వారు తెల్లబోయారు.
పందెం డబ్బు రాజుగారు స్వంతం చేసుకుంటుండగా దాసుగారు అమాయకంగా మొహం పెట్టి
" అయితే రాజా వారూ ! రాజులకంటే ఆసులే గొప్పవన్నమాట !! "
అన్నారు. దాసుగారి మాటల్లో చతురతని గ్రహించిన రాజు గారు ఫకాలున నవ్వుతూ పందెం డబ్బంతా దాసు గారికి ఇవ్వడమే కాకుండా మంచి బహుమతితో సత్కరించారట.
సంస్కృతంలో వాడుకలో వున్న ఈ భ్రమర కీట న్యాయం అనేదాన్ని మనం కూడా వాడుతూ వుంటాం.
ప్రశ్న : దీని అర్థమేమిటో, ఏ సందర్భంలో వాడుతామో చెప్పగలరా ?
జవాబు : భ్రమరం అంటే తుమ్మెద. కీటం అంటే పురుగు.
పురుగు చుట్టూ తుమ్మెద తిరుగుతుంది. కొంతకాలానికి ఆ పురుగే తుమ్మెదగా మారుతుంది.
అయితే కనబడిన ప్రతి పురుగు చుట్టూ తుమ్మెద తిరగదు. అలాగే తుమ్మెద తిరిగిన ప్రతీ పురుగు తుమ్మెదగా మారదు.
తుమ్మెద ఎలా అయితే తనక్కావాల్సిన పురుగును వెదుక్కుని దాని చుట్టూ పరిభ్రమించి తనలాగే మార్చేస్తుందో అలాగే మనం కూడా మనక్కావలసిన వ్యక్తిని ఎంచుకుని విద్యాబుద్ధులు లాంటివి చెప్పించి మనంతటి వాడిని చెయ్యాలని ప్రయత్నిస్తాం.
దీనినే భ్రమర కీట న్యాయం అన్నారు పెద్దలు. తండ్రి కొడుకుల సంబంధం, గురుశిష్య సంబంధం ఇలాంటివే !
స్పందన : ముందుగా వెంటనే స్పందించిన జ్యోతి గారికి ధన్యవాదాలు. దాదాపుగా సరైన వివరణ ఇచ్చిన పందిళ్ళ శేఖర్ బాబు గారికి కూడా ధన్యవాదాలు.
శిఖిపింఛమౌళి శ్రీకృష్ణుడు నుంచి శకుని దాకా
ఎదిగిన వైనమే చిలకలపూడి సీతారామంజనేయుల నటజీవిత ప్రస్తానం. ఆయనే మనందరికీ
తెలిసిన సీయస్సార్.
తండ్రి ప్రోత్సాహంతో ఎదిగిన
సీతారామాంజనేయులు తన పదిహేడవ యేట ' రాధాకృష్ణ ' నాటకంలో శ్రీకృష్ణ పాత్రతో
నటజీవితానికి శ్రీకారం చుట్టాడు. నిండిన విగ్రహం, స్పురద్రూపం, ధారాళంగా
సంభాషణలు చెప్పగల, అంతకు మించి కమ్మగా పాడగల కంఠం ఆయన స్వంతం కావడంతో
రంగస్థలం మీద దూసుకెళ్లాడు. మహానటుడు స్థానం నరసింహారావు గారి దృష్టిలో
పడ్డాడు. ఫలితంగా ఆయన చేలికాడుగా ఎన్నో నాటకాల్లో నటించే అవకాశం వచ్చింది.
స్థానం వారు సత్యభామ అయితే... రఘురామయ్య రుక్మిణి అయితే రామాంజనేయులు
శ్రీకృష్ణుడు. తెలుగు నాటక స్వర్ణ యుగాన్ని స్వంతం చేసుకున్న వారిలో ఈయన
కూడా ఒకరు.
1933 లో రామదాసు చలన
చిత్రంలో శ్రీరాముడి పాత్ర పోషించే అవకాశం వచ్చినా అది వెలుగు చూడలేదు.
తర్వాత హెచ్. యమ్. రెడ్డి గారు శ్రీకృష్ణ రాయబారం చిత్రంలో శ్రీకృష్ణ
పాత్రకు అడిగితే పద్యానికి అయిదు వందల పారితోషికం అడిగారట సీయస్సార్. దాంతో
ఆ అవకాశం కూడా జారిపోయింది.
1936
లో సరస్వతీ టాకీసు వారు తీసిన ' ద్రౌపదీ వస్త్రాపహరణం ' లో శ్రీకృష్ణ
పాత్రతో వెండితెరపై అడుగుపెట్టారు సీయస్సార్. బళ్ళారి రాఘవ, బందా ల వంటి
ఉద్దండుల పోటీని ' ద్రౌపదీ మానసంరక్షణ ' చిత్రం ద్వారా ఎదుర్కొని విజయఢంకా
మ్రోగించడంతో చిత్రసీమలో కూడా స్థిరపడ్డారు సీయస్సార్.
మరాఠీ భక్తుడైన తుకారం ని తెలుగు వారికి పరిచయం చేసింది సీయస్సార్.
తుకారం నాటకం రాయించి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. అదే నాటకం ఆధారంగా 1938
లో తుకారం చిత్రాన్ని నిర్మించారు. తానూ రంగస్థలంపై నటించిన నాటకాలలో
మరికొన్నింటిని చలనచిత్రాలుగా మలిచారు సీయస్సార్.
ఆయన చలనచిత్ర జీవితంలో చెప్పుకోదగ్గ విశేషం 1935
లో నిర్మించిన ' శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం ' చిత్రం. అందులో శ్రీ
వేంకటేశ్వరుడిగా ఆయన నటన అందర్నీ ఆకట్టుకుంది. దురదృష్టవశాత్తూ ఆ చిత్రం
నెగటివ్ తరవాత కాలంలో కాలిపోయింది.
సీయస్సార్ నటించిన భీష్మ, చూడామణి, వాల్మీకి మొదలైన చిత్రాలు ఆయనకు
పేరు తెచ్చాయి. సారధి వారి ' గృహప్రవేశం ' చిత్రం ఆయనలోని సునిశితమైన
హాస్యాన్ని వెలుగులోకి తెచ్చింది. అందులో ఆయన పాడిన పాటలు, పద్యాలు తెలుగు
చిత్ర ప్రేక్షకులను రంజింపజేసాయి. భక్త శిరియాళ, వాలిసుగ్రీవ, మాయరంభ వంటి
చిత్రాలు కూడా ఆయనలోని గాయకుడి ప్రతిభను ప్రదర్శించాయి.
పరమానందయ్య
శిష్యుల కథ, నిత్యకళ్యాణం పచ్చతోరణం, కన్యాదానం, కన్యాశుల్కం, తల్లిప్రేమ,
సురభి, మాయాలోకం, అంతమనవాళ్ళే, రోజులు మారాయి, రత్నమాల, లైలామజ్ఞు,
చక్రపాణి, దేవదాసు, పాతాళభైరవి, అప్పుచేసి పప్పుకూడు వంటి చిత్రాల్లో తన
నటనా వైదుష్యాన్ని ప్రదర్శించారు సీయస్సార్.
భక్త
కుచేల చిత్రంలో కుచేలుడి పాత్ర ఆయన నటనకు పరాకాష్ట. ఏ ఇతర భాష చిత్రాల్లో
నటించకపోయినా ఈ చిత్రాన్ని మలయాళంలో పునర్నిర్మించినపుడు ఆయనే కుచేలుడి
పాత్ర పోషించి ఉత్తమ నటుడి బహుమతినందుకున్నారు. ఆ చిత్రం తెలుగులోకి డబ్
చెయ్యబడింది. కాకపోతే సీయస్సార్ గారు అప్పటికే మరణించడంతో ఆయనకు మద్దాలి
కృష్ణమూర్తి గారు స్వరం ఇచ్చారు.
ఇన్ని
చెప్పి ఆయన ' మాయాబజార్ ' శకుని గురించి ప్రస్తావించకపోవడం సమంజసం కాదు.
శకునిలో ఉండే విభిన్న కోణాల్ని ఆయన వెండితెరపై ఆవిష్కరించిన తీరు అమోఘం.
అడుగడుగునా కుటిలత నిండి వున్నా, పగ ప్రతీకారాలు నిండి వున్నా, పైకి మాత్రం
ఆప్యాయత, బంధుజన పక్షపాతం నటించే శకుని పాత్రను అవలీలగా పోషించడమే కాదు...
వెండితెర శకునిగా శాశ్వత కీర్తిని ఆర్జించారు. ఈ పాత్రలో సీయస్సార్ నటన
గురించి ఎంత చెప్పినా తక్కువే !
అలా శిఖిపింఛమౌళి శ్రీకృష్ణుని పాత్రతో ప్రారంభించి శకునిగా తెలుగు ప్రేక్షకుల మదిలో శాశ్వత స్థానం కల్పించుకున్న సీయస్సార్ 1963 లో ఆయన నటరాజులో ఐక్యమైపోయారు.
సీయస్సార్ వర్థంతి సందర్భంగా ఆయనకు కళా నీరాజనాలు సమర్పిస్తూ.............
సీయస్సార్ గారి గురించి గతంలో రాసిన టపాలు...........
డా. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు బందరు జాతీయ కళాశాల పాలకమండలి కార్యదర్శిగా పనిచేశారు. ఆ సమయంలో ఓ రోజు ఆయనకో లేఖ అందింది. అందులో ...........
" ప్రాణేశ్వరీ ! అనుకోకుండా ఊరికి వెడుతున్నాను. కనుక ఈ మూడురోజులూ మనకి వియోగం, విరహవేదన తప్పవు...... " అంటూ ఇంకా ఏదేదో రాసి వుంది. అది ప్రేమ లేఖ అని పట్టాభి గారికి అర్థమయింది గానీ ఎవరు రాసారో, తనకెందుకు వచ్చిందో మాత్రం అర్థం కాలేదు. సాధారణంగా ప్రేమలేఖల్లో వుండేటట్లే సంభోదనలో గానీ, సంతకంలో గానీ కొసరు పేర్లే గానీ అసలు పేర్లు లేవు. అందుకనే ఆయనకేమీ అర్థం కాలేదు.
ఎటూ పాలుపోక తన మిత్రుడు కృష్ణాపత్రిక సంపాదకుడు ముట్నూరి కృష్ణారావు గారికి ఆ ఉత్తరం చూపించారు పట్టాభిగారు. అది చదివిన కృష్ణారావు ఆ చేతివ్రాత నిశితంగా పరిశీలించి ఆ రాత ప్రముఖ సాహితీకారుడు, చిత్రకారుడు అయిన అడవి బాపిరాజు గారిదని గుర్తుపట్టారు. కానీ బాపిరాజు గారు రాసిన ప్రేమలేఖ పట్టాభి గారికెలా వచ్చిందో అర్థం కాలేదు. ఆ విషయమే ఆయన్ని అడిగారు కృష్ణారావు గారు. అప్పుడు ఆలోచిస్తే ఇద్దరికీ విషయం బోధపడింది. ఏమిటంటే............
అప్పట్లో అడవి బాపిరాజు గారు జాతీయ కళాశాలకు ప్రధానాచార్యులుగా వుండేవారు. ఆయన ఆ సమయంలో స్వంత పని మీద ఊరికి వెళ్ళారు. బహుశః ఆ విషయం తెలియజేయ్యడానికి సమయం లేక ఆయన భార్యకు ఈ లేఖ రాసి ఉంటారని... పట్టాభి గారికి సెలవు మంజూరు కోరుతూ సెలవు చీటీ రాసి ఉంటారని... అయితే కవరు మీద చిరునామాలు తారుమారు అయి ఉంటాయని నిర్థారణకు వచ్చి నవ్వుకున్నారు పట్టాభి గారు, కృష్ణారావు గారు.
ఆ అఖిలాండేశ్వరి శక్తి స్వరూపిణి శిష్ట రక్షణ కోసం దుష్ట సంహారం చేసి విజయోత్సవాన్ని జరుపుకుంటున్న రోజు ఈ విజయదశమి రోజు. ఆ జగజ్జనని అలాగే దుష్ట సంహారం కొనసాగించి అందరికీ సకల శుభాలను, విజయాన్ని అందించాలని కోరుకుంటూ........
పాటల పల్లకి దుర్గ దసరా ప్రత్యేక కార్యక్రమం ఇక్కడ వినండి............
1936 లో ఒకే ఇతివృత్తంతో రెండు చిత్రాలు పోటాపోటీగా విడుదలయ్యాయి. తెలుగు టాకీల పితామహుడు హెచ్. యం. రెడ్డి గారి అల్లుడు హెచ్. వి. బాబు దర్శకత్వంలో ' ద్రౌపదీ వస్త్రాపహరణం ' ఒకటి, ఎస్. జగన్నాథ్ దర్శకత్వంలో ' ద్రౌపదీ మానసంరక్షణ ' మరొకటి. బాబు కంటే జగన్నాథ్ సినిమా కళలో అప్పటికే నిష్ణాతుడు. కానీ ' ద్రౌపదీ వస్త్రాపరహణం ' బాక్సాఫీసు దగ్గర ఘన విజయం సాధించగా ' ద్రౌపదీ మానసంరక్షణ ' పరాజయం పాలైంది. అయితే జగన్నాథ్ చిత్రంలోనే దర్శకత్వ విలువలు పుష్కలంగా వున్నాయని అప్పటి ప్రముఖ పత్రిక ' కృష్ణాపత్రిక ' తన సమీక్షలో ప్రశసించింది. బాబు దర్శకత్వంలోని లోపాలు ఎత్తిచూపుతూ రాసిన ఆ సమీక్ష హెచ్. యం. రెడ్డి గారిని ఆకర్షించింది. వెంటనే ఆ సమీక్షకుడిని మద్రాస్ కు పిలిపించారు.
ఆ సమీక్షకుడు ఎవరో కాదు. తర్వాత కాలంలో భారత సినిమారంగానికి పౌరాణిక చిత్ర పథ నిర్దేశకుడిగా పేరు తెచ్చుకున్న కమలాకర కామేశ్వరరావు గారు.
ఆయన నిష్పక్షపాతంగా ఆ సమీక్ష రాస్తే... ఆ సమీక్షలోని విమర్శలను సహృదయంతో స్వీకరించి హెచ్. యం. రెడ్డి తెలుగు చిత్రరంగానికి ఓ మాణిక్యాన్ని అందించారు. తాను నిర్మిస్తున్న ' గృహలక్ష్మి ' చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచెయ్యడానికి కామేశ్వరరావు గారిని ఆహ్వానించారు. అలా పత్రికా రంగం నుంచి చిత్రసీమలో అడుగు పెట్టిన కమలాకర కామేశ్వరావు గారు వాహినీ సంస్థలో చేరి బి. ఎన్. రెడ్డి, కే. వి. రెడ్డి ల శిష్యరికంలో తన ప్రతిభకు మెరుగు పెట్టుకున్నారు. అయితే ఆయన తొలి చిత్రం ' చంద్రహారం ' పరాజయం పాలైంది. మలి చిత్రం ' పెంకి పెళ్ళాం ' కూడా అంతంత మాత్రంగానే నడిచింది. సాధారణంగా ఏ దర్శకుడికైనా భవిష్యత్తు ప్రశ్నార్థకమే ! కానీ కామేశ్వరరావు గారికి అలా కాలేదు. తర్వాత కాలంలో ఆయన దర్శకత్వం వహించిన ' పాండురంగ మహాత్మ్యం ' అఖండ విజయం ఆయన్ని పౌరాణిక బ్రహ్మను చేసింది.
పురాణాల మీద ఆయకున్న పరిజ్ఞానం, సినీ కళలో ఆయన సాధించిన పరిజ్ఞానం కలసి ఆయన్ని సినీ వ్యాసుణ్ణి చేసాయి. ఆ పురాణ కథల్ని కామేశ్వరరావు గారు సెల్యులాయిడ్ మీద లిఖించిన తీరు న భూతో న భవిష్యతి. దర్శకుడికి విషయ పరిజ్ఞానం, సాంకేతికాంశాలలో అనుభవం.... రెండూ ఎంత అవసరమో కామేశ్వరరావు గారి సినిమాలు చూస్తే తెలుస్తుంది. అందుకే ఆయన పౌరాణిక చిత్రాలు ప్రేక్షకుల హృదయాల్లో ఎలా శాశ్వత స్థానం సంపాదించాయో, సాంఘిక ఇతివృత్తంతో ఆయన దర్శకత్వంలో వచ్చిన ' గుండమ్మ కథ ' అంతకంటే ఎక్కువ స్థానం సంపాదించింది. ఆయన వందల సంఖ్యలో చిత్రాలకు దర్శకత్వం వహించి రికార్డులు సృష్టించలేదు. ఆయన చిత్రాలు యాభైకి మించలేదు. అయినా ఆయన పేరు తెలుగు చిత్రసీమ చరిత్రలో ప్రథమ స్థానంలో కనిపిస్తుంది.
' శ్రీకృష్ణావతారం' , ' శ్రీకృష్ణతులాభారం ', ' పాండవనవాసం ', ' వీరాంజనేయ ', ' బాలభారతం ', ' కురుక్షేత్రం ' లాంటి పౌరాణిక చిత్రాలతో బాటు అచ్చమైన తెలుగు చారిత్రాత్మకం ' మహామంత్రి తిమ్మరుసు ' అద్భుతమైన కళాఖండంగా తెలుగు చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అందుకే ఆయన సినీ వ్యాసుడు. కర్మయోగి. మన పురాణాలకి సినిమాల్లో శాశ్వత ముద్ర వేసి తెలుగు భాషకు, జాతికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టిన కమలాకర కామేశ్వరరావు సినీ జీవితం ఎంత వున్నతమైనదో వ్యక్తిగత జీవితం అంతకంటే ఉన్నతమైనది. సినిమా వాళ్ళందరూ అనేక ప్రలోభాలకు లోనవుతారనే భావం అందరిలోనూ వుంది. అది పూర్తిగా నిజం కాదనడానికి నిలువెత్తు నిదర్శనం ఆయన వ్యక్తిత్వం. దేనికోసం ఆశపడలేదు. ఆయన జీవితకాలంలో ఎలాంటి ప్రలోభాలకు, ఆవేశకావేశాలకు లోనయిన దాఖలాలు లేవు. అభిమానం, దురభిమానం అనే మాటలకు ఆయన జీవితంలో చోటు లేదు. తాను నమ్మిన బాటలో ఎన్ని అడ్డంకులు, వివాదాలు ఎదురయినా చిరునవ్వుతో ఎదుర్కొన్నారు.
పౌరాణిక చిత్రబ్రహ్మ కమలాకర కామేశ్వరరావు గారి జయంతి సందర్భంగా ఆయన్ని సంస్మరించుకుంటూ....
డ్రీం గర్ల్ హేమమాలిని నర్తించిన " శ్రీకృష్ణ విజయం " చిత్రంలో జోహారు శిఖిపింఛ మౌళీ ......
ఒక కళాఖండం తయారవాలంటే ఎంతో మంది కృషి కావాలి. అన్ని కళారూపాల్నీ తనలో ఇముడ్చుకుని, సాంకేతికాంశాలను కూడా కలుపుకుని సరికొత్త కళగా రూపుదిద్దుకుంది సినిమా. ఈ ఆధునిక కళా రూపం ప్రజలకు ఇంత చేరువవడానికి వెనుక అసలు రహస్యం ఇదే !
సాధారణంగా తెర మీద కనిపించే నటీనటుల్ని ఎక్కువగా అబిమానిస్తారు ప్రేక్షకులు. వారి ప్రతిభ మనల్ని అలరించడం వెనుక ఎందఱో కళాకారులు, సాంకేతిక నిపుణుల కృషి వుంది. అందరూ సమన్వయంతో పనిచేస్తేనే అది ఉత్తమ కళాఖండంగా రూపుదిద్దుకుంటుంది.
మన తెలుగు చిత్రసీమకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చిన చిత్రాల్లో మొదటగా చెప్పుకోదగ్గవి విజయా వారి చిత్రాలు. తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడానికి కారణం ఆ సంస్థలో పనిచేసిన ప్రతీ ఒక్కరికీ దక్కుతుంది.
విజయా సంస్థలో అద్భుతమైన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి అనేక సెట్స్ రూపకల్పనకు, ముఖ్యంగా విదేశీ సాంకేతిక నిపుణులను సైతం అబ్బురపరచిన విజయావారి చందమామ రూపకల్పనకు కారణమైన కళాదర్శక జంట మాధవపెద్ది గోఖలే, కళాధర్.
ఈ జంటలో ఒకరైన కళాధర్ గారి 97 వ జన్మదినోత్సవం ఈరోజు.. ఆ సజీవ కళామూర్తికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి వివరాలతో గతంలో రాసిన టపా, వారిపై రూపొందించిన కళాచిత్రం ఈ క్రింది లింకులో .......