Thursday, April 14, 2011

అపర భగీరథుడు

 కొంతమంది తమకోసం పుడతారు. మరికొంతమంది తమవారికోసం పుడతారు. ఇంకాకొంతమంది తమ చుట్టూ వున్నా వారికోసం పుడతారు. 

ఈ చివరి కోవకు చెందిన వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ప్రస్తుతం కర్ణాటకరాష్ట్రంలో భాగంగా వున్న చిక్ బళ్లాపూర్  జిల్లాలోని ముద్దనహళ్లి అనే గ్రామంలో తెలుగు కుటుంబంలో జన్మించిన విశ్వేశ్వరయ్య కర్ణాటకతో బాటు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలలో సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేసి వ్యవసాయం విస్తరించడానికి దోహదపడ్డారు. దానితో బాటు విద్యుత్ ప్రాజెక్టులు, వరద నీటి ప్రాజెక్టులు లాంటి ఇంకా ఎన్నో రకాల ప్రాజెక్టుల రూపకల్పనకు కారణభూతుడయ్యారు.

చిన్ననాటే తండ్రి మరణంతో ఎన్నో కష్టనష్టాలకోర్చి ఇంజనీరింగ్ పూర్తి చేసి అప్పటి బొంబాయి ప్రభుత్వంలో ఉద్యోగంలో చేరారు. పూణే ప్రాంతంలో మొదటిసారిగా ఆటోమాటిక్ వరద గేట్లు ప్రవేశపెట్టి విజయం సాధించారు.
నిజాం నవాబు అభ్యర్థనతో హైదరాబాద్ నగరాన్ని తరచూ ముంచెత్తుతున్న మూసీ నది వరద ఉధృతిని అరికట్టేందుకు పథకాలు ప్రారంభించారు. దాంతో అప్పటివరకూ నగరప్రజలను పట్టి పీడిస్తున్న వరద సమస్యకు పరిష్కారం లభించింది.
సముద్ర తీరప్రాంత భూమికోత నుండి విశాఖపట్నం నౌకాశ్రయాన్ని రక్షించే పథకాన్ని రచించారు విశ్వేశ్వరయ్య.

కర్ణాటకలో ఎన్నో పరిశ్రమల స్థాపనలో, ప్రాజెక్టుల నిర్మాణంలో, సాంకేతిక విద్యారంగాభివృద్ధిలో, వాణిజ్య సంస్థల ప్రారంభంలో విశ్వేశ్వరయ్య గారి పాత్ర ఎనలేనిది. మైసూరు మహారాజా ఆహ్వానంతో వారి సంస్థానంలో చీఫ్ ఇంజనీర్ గా, మైసూరు దివాన్ గా బాధ్యతలు నిర్వర్తించారు.

ప్రజలకు ఆయన చేసిన మేలును గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం ' నైట్ కమాండర్ ' పురస్కారంతో సత్కరించింది. స్వాతంత్ర్యానంతరం 1955 లో భారత ప్రభుత్వం ' భారతరత్న ' బిరుదుతో సత్కరించారు.

ప్రతి సంవత్సరం మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని ఇంజనీర్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

ఆధునిక భారతదేశ నిర్మాణానికి పునాదులైన ఇంజనీర్లలో ప్రథముడిగా, ఎన్నదగిన వాడిగా పేరుపొందిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి వర్థంతి ( ఏప్రిల్ 14 ) సందర్భంగా స్మృత్యంజలి.  

Vol. No. 02 Pub. No. 202

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం