Tuesday, April 19, 2011

దేవులపల్లి వారి తొలి సినిమాపాట

మల్లీశ్వరి చిత్ర దర్శకులు బి. యన్. రెడ్డి గారు సందర్భం చెబుతూ దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారితో ' నేనడిగిన సమయానికి రాసివ్వడం కుదరకపోయినా సాధ్యమైనంత త్వరగా పాట రాసిస్తే సంతోషిస్తాను ' అన్నారు.  

' అలాగే ' అని తలూపారు దేవులపల్లి వారు. 

అన్నట్లుగానే రెండు రోజుల్లో పాట రాసి తీసుకొచ్చి రెడ్డి గారికి చూపించారు. భారీ వర్ణనలతో, సంస్కృత సమాసాలతో నిండి పామరులకేమాత్రం అందని భాషలో ఉందా రచన. అది చూసిన బి. యన్. గారు కృష్ణశాస్త్రిగారి పాండిత్యానికి ఓ ప్రక్క సంతోషిస్తూనే .......

" మన కథ ప్రకారం ఈ పాట ఓ పల్లెటూళ్ళో పద్మశాలీల కుటుంబంలో మేనత్త మేనమామ బిడ్డలు పాడుకునేది. అందుకని వారి సహజ సిద్ధమైన భాషలో వుంటే బాగుంటుంది " అన్నారు.

దేవులపల్లి వారు " అలాగా ? " అంటూ కళ్ళు మూసుకున్నారు. రెండు నిముషాలు అలోచించి కళ్ళు తెరిచారు. అరగంటలోపే ఆ పాటను మార్చి రాసేసారు. ఆ రచన చూసి బి. యన్. రెడ్డి గారు ఆనందం చెప్పనలవికాదు. వెంటనే రాజేశ్వరరావు గారికి బాణీ కోసం ఆ పాటనిచ్చారు    

ఆ పాట ' రావిచెట్టు తిన్నె చుట్టూ......' 




తన తొలి సినిమా అనుభవం గురించి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు తన సినిమా పాటల సంకలనం '
మేఘమాల ' లో వివరిస్తూ ....

" నా మొదటి చిత్రం మల్లీశ్వరితోనే సినిమాకు పాటలు రాయడం నేర్చుకున్నాను. సినిమా మీడియంకు కావాల్సిన శిల్పాన్ని, భాషను అప్పుడే అలవరచుకున్నాను " అంటారు.

ఒక రంగంలో ప్రవేశిస్తూనే అన్నీ తెలిసిపోయాయనుకోవడం, అదేమైనా బ్రహ్మ విద్యా ? అనుకోవడం మానవ సహజం.  కానీ అప్పటికే మహాకవిగా ప్రఖ్యాతిగాంచిన కృష్ణశాస్త్రి గారు సినిమాలకు రచనను అప్పుడే నేర్చుకున్నాననడం ఆయన  నిబద్ధతకు, చిత్తశుద్ధికీ నిదర్శనం.  

Vol. No. 02 Pub. No. 205

2 comments:

అక్షర మోహనం said...

Nice one your contribution..keep it up..

SRRao said...

మోహన రాంప్రసాద్ గారూ !
ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం