Sunday, October 31, 2010

శంకరశాస్త్రి.... శారద... ?

  కనుక్కోండి చూద్దాం - 3

తెలుగు చిత్ర రంగంలో ఈ చిత్రం సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రంలో రెండు ప్రధానమైన పాత్రలు శంకరశాస్త్రి, ఆయన కూతురు శారద.
ఈ పాత్రలను పోషించిన సోమయాజులు గారు, రాజ్యలక్ష్మి చాలా పేరు తెచ్చుకున్నారు. కానీ ఆ పాత్రలకు ముందుగా నిర్ణయించింది వారిని కాదు.

మరి ముందుగా అనుకున్న ......
* శంకరశాస్త్రి ఎవరు ?
* శారద ఎవరు ?

Vol. No. 02 Pub. No. 046

Saturday, October 30, 2010

క్రీడోత్సవాలకు మరో కొత్త ఆట

 మొన్ననే కామన్ వెల్త్ క్రీడలు ముగిసాయి. మళ్ళీ ఆసియా క్రీడలు, ఒలింపిక్ క్రీడలు ఇంకా ఏవేవో వస్తాయి. వీటన్నిటికంటే ఇంగ్లీష్ వాళ్ళు మనకంటించిన క్రికెట్ ఎలాగూ వుంది. ఈ క్రీడా పోటీల నిర్వాహకులకి ఈసారి ఓ విజ్ఞప్తి చెయ్యాలని వుంది. వాళ్ళ క్రీడల జాబితాలో మరో కొత్త క్రీడను కలుపుకోమని చెప్పాలి. అందరం సామూహికంగా విజ్ఞప్తులు చెయ్యాలి. అవసరమైతే ఆందోళనలు చెయ్యాలి. ధర్నాలు, నిరాహారదీక్షలు, ర్యాలీలు.... ఇలా ఒకటేమిటి అనుకున్నది సాధించడానికి ఏమైనా చెయ్యాలి. ఎలాగైనా సాధించాలి.

ఇంతకీ అదేం క్రీడ అంటారా ? అక్కడికే వస్తున్నా ! కొంచెం ప్రాణాంతకమైనా మంచి ఉత్సుకత, సస్పెన్సు వగైరా పుష్కలంగా వుంటాయి. అసలు అవేమీ లేకపోతే ఆటలో థ్రిల్ ఉంటుందా ? కిక్ ఉంటుందా ? ఆమాటకొస్తే ఫుట్ బాల్, హాకీ.....చివరకి క్రికెట్ లో కూడా మనకు ఉత్కంఠగా వుంటుంది. ఆటగాళ్లకు ప్రాణసంకటంగానే వుంటుంది.... పాపం. వాళ్ళలోని క్రీడాస్పూర్తికి మనం పోటీలు పడి స్టేడియం అదిరిపోయేలాగా చప్పట్లు కొడతాం. బూరాలు ఊదుతాం. డప్పులు కొడతాం. డాన్సులు చేస్తాం. ఇవన్నీ టీవీల ముందు వుండి కూడా  చేస్తాం. మన చేష్టలతో వాళ్ళు ఉత్సాహంతో రెచ్చిపోయి ఇంకా బాగా ఆడతారని సంబరపడిపోతాం. ఇంతలో వాళ్ళు అవుట్ అయిపోయి పెవిలియన్ దారి పడుతుంటే మన ఒక్కసారిగా ఉత్సాహం చల్లబడిపోతుంది. ఇంతకీ వాళ్ళు మన ఉత్సాహానికి రెచ్చిపోయి ఆడాల్సింది పోయి వెన్ను చూపుతారెందుకు అని ఒకసారి సావధానంగా ఆలోచిస్తే అర్థమవుతుంది. మనకంత సావదానం, సావకాశం ఎక్కడుంటాయండీ ? అందుకే అంత దూరం ఆలోచించం. మనమిచ్చే డబ్బులకు ఆశపడి వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటారా చెప్పండి. మన గోలకు అవతల జట్టు వాళ్లకు ఎంత ఒళ్ళు మండుతుందీ అన్నది మనకంటే వాళ్ళకే ఎక్కువ తెలుసు కనుకనే అబౌట్ టర్న్.

అసలు ఇంగ్లీషువాడు మనం తోటల్లోనూ, పొలంగట్ల మీద, రోడ్లమీద ఆడుకునే కర్రా బిళ్ళా ఆట చూసే క్రికెట్ కనిపెట్టాడని నాకో అనుమానం. మీక్కూడా అదే అనుమానం ఉందా ? ఉంటుంది మరి. ఆ ఆట అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది కదా ! అలాగే మనం తోటల్లోను... అదే పార్కుల్లో, పొలంగట్ల మీద... అదేనండీ పేవ్ మెంట్ల మీదా ( అవేక్కడున్నాయని నన్నడక్కండి ), ఇంకా రోడ్ల మీదా ఆడుకునే ఈ ఆట కూడా అంతర్జాతీయ స్థాయికి వెళ్లాలని నా ఆశ. ప్రభుత్వం ప్రోత్సాహమిస్తే పిల్లలు, పెద్దలు, మగవారు, ఆడవారు, మాన్యులు, సామాన్యులు..... ఇలా ఒకరేమిటి అందరూ తమ ప్రతిభ నిరూపించుకునే అవకాశం వస్తుంది. మిగిలిన ఆటల్లో క్రీడాకారులు కఠోర సాధనతో జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటుంటుంటే ఈ ఆటలో ప్రజలందరూ క్రీడాకారులే ! అందరూ అంతర్జాతీయ స్థాయికి అవిరళంగా కృషి చేస్తున్నవారే ! మరి వాళ్ళనెందుకు ప్రోత్సహించకూడదూ ? ఇది నా మదిన దొలుస్తున్న ప్రశ్న.

ప్రతీ ఆటలోనూ రెండు జట్లుంటాయి. ప్రత్యేకమైన ప్రత్యర్థులుంటారు. వారి మధ్యనే పోటీ వుంటుంది. ఎదుటి జట్టుని మాత్రమే ఎదుర్కోవాలి తప్ప కనీసం రిఫేరీ మీదకైనా వెళ్ళకూడదు. అంటే వాటిలో స్వేచ్చ చాలా తక్కువ. మన ఆటలో స్వేచ్చ చాలా ఎక్కువ. దీనికి ఎలాంటి నియమ నిబంధనలు లేవు. జట్లు ఉండవు. ఎవరైనా ఎవరికైనా ప్రత్యర్థే ! ఎవరు ఎవరినైనా ఎంచుకోవచ్చు. అసలు ఎంచుకోకపోవచ్చు కూడా ! ఈ ఆటకు స్టేడియంలు అక్కరలేదు. క్రీడా శిక్షణా శిబిరాలక్కర్లేదు. కోచ్ లు అక్కర్లేదు. అన్నిటికంటే క్రీడాకారులకు పెద్ద పెద్ద పారితోషికాలక్కర్లేదు. చూసారా ఈ దేశానికి ఎంత డబ్బు ఆదానో ! రోడ్ వుంటే చాలు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండేదైతే మరీ మంచిది. బాల్, బాట్ లాటివి ఏవీ అక్కర్లేదు. ఒక చిన్న సాధనం మాత్రం అవసరం. అసలు ఈ ఆటకు అదే కీలకం. ఆటగాడికి శిక్షణ, నైపుణ్యం వగైరా లనవసరం. ఇప్పటికైనా అర్థం అయిందా ? అవలేదా ! వస్తున్నా .....వస్తున్నా ! అక్కడికే వస్తున్నా !

ఈ మధ్య మనం రోడ్ మీద నడుస్తున్నా, ద్వి/ త్రి/చతుశ్చక్ర వాహనం మీద వెళ్తున్నా తప్పనిసరిగా ఉండవలసిన వాటిలో మరో వస్తువు చేరింది. ఆ వస్తువే మనల్ని అంతర్జాతీయ స్థాయికి చేర్చే ఆటలో నిపుణుల్ని చేస్తోంది. నడుస్తూ, డ్రైవ్ చేస్తూ తమలోకంలో తాము వున్నట్లు, పరిసరాలతో పనిలేనట్లు తమలో తామే మాట్లాడుకుంటూ వెళ్ళే లోకాతీతులు మీకందరికీ దర్శనమిచ్చే వుంటారు. అదిగో వాళ్ళే ఈ క్రీడాకారులు. ఫుట్ బాల్, బాట్ లాంటి వాటిలాగ వాళ్ళ చేతుల్లో ఉండే క్రీడా సాధనమేమిటో ఎవరైనా ఊహించగలరా ?

అదేనండీ సెల్ ఫోన్. దాంతో రోడ్ మీద మన క్రీడాకారులు చేసే విన్యాసాలు చూసి తీరాలి. మిగిలిన ఆటలు చూడాలంటే పెద్ద మొత్తాలు ఖర్చుపెట్టి టికెట్స్ కొనాలి. అక్కడ తోపులాటల్లో ఇరుక్కోవాలి. అవేమీ లేకుండా ఫ్రీగా దొరుకుతున్న వినోదం. ఒకరు సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెడుతుంటారు. మనం ఎదురు వెళ్ళామనుకోండి. మనల్ని చూసి ప్రక్కకు తప్పుకుంటారనుకుంటాం కదా ! ఊహు( ! తప్పుకోరు. మనకడ్డుగానే మనం ఎటు తిరిగితే అటు తిరుగుతారు. మన కాళ్ళల్లో కాళ్ళు పెట్టి మనల్ని పడగొట్టాలని చూస్తారు. మనం ఎన్ని తిట్టినా వాళ్ళ ధోరణిలో వాళ్ళుంటారు తప్ప మనల్ని పట్టించుకోరు. చూసారా వాళ్ళకెంత ఏకాగ్రతో ! మనల్ని పడగొట్టాలనే గానీ మరే ధ్యేయం లేనట్లు ఎంత సీరియస్ గా ఆడుతుంటారో ! ఆ ఆటలో సాధారణంగా మనమే ఓడిపోతామనుకోండి. ఎందుకంటే మనం ఆ ఆటలో నిష్ణాతులం కాదు కదా !

పోలో ఆట గుర్రపు స్వారీ చేస్తూ కూడా ఆడుతారు. అలాగే కొంతమంది సెల్ క్రీడాకారులు బైక్ లు డ్రైవ్ చేస్తూ ఆడే ఈ ఆట బహు ముచ్చటగా వుంటుంది. మనం బైక్ మీద వేడుతున్నామనుకోండి. మన ముందు వెడుతున్న ఓ బైక్ హటాత్తుగా స్లో అవుతుంది. కొద్ది క్షణాల్లోనే ఆ రౌతు ( బైక్ స్వారీ చేస్తున్న వ్యక్తి ) తల ఓ ప్రక్కకి ఒరిగిపోతుంది. వెనుకనున్న మనం పాపం అతని మెడకి ఏమైందోనని ఖంగారు పడతాం. హటాత్తుగా బైక్ వేగం పెరుగుతుంది. మనకి మళ్ళీ ఖంగారు. ఆ బైక్ అటూ ఇటూ ఊగుతుంది. ఓ ప్రక్కకి ఒరుగుతుంది. ఇదంతా ఆటలోని భాగమని తెలియని మనకి ఖంగారు మరింత పెరుగుతుంది. మన బైక్ వేగం పెంచి అతని ప్రక్కకి వెడతాం. ఏవో మాటలు వినబడతాయి. పరిశీలనగా చూస్తే ఒరిగిపోయిన మెడ క్రింద నలిగిపోతూ కనిపిస్తుంది సెల్ ఫోన్. పద్మవ్యూహంలో అభిమన్యుడు ఎలా జోరబడ్డాడో మనకి ప్రత్యక్షంగా తెలియదు గానీ ట్రాఫిక్ పద్మ వ్యూహంలో అతను సాక్షాత్తూ అభిమన్యుడి లాగే కనబడతాడు. ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం క్రీడాకారులకి అర్జున అవార్డులిచ్చినట్లు గానే ఈ సెల్ క్రీడాకారులకి అభిమన్య అవార్డులిచ్చి ప్రోత్సహించాలి. వీరు అలా సెల్ మాట్లాడుతూ రోడ్ మీద ఆట ఆడే తీరు బహు రమ్యం గా వుంటుంది. సడెన్ గా స్పీడ్ పెరుగుతుంది. మళ్ళీ స్లో అవుతుంటుంది. తన మానాన తాను పోతున్న వాహనం మీదకో, నడిచి వెడుతున్న మనిషి మీదకో వేడుతుంటుంది. ఖంగారు పడి తప్పుకోవడం వాళ్ళ వంతు. లేకపోతే ఔటే ! ఇదంతా చూస్తున్న రోడ్ మీద ప్రేక్షకులకి ఎంత ఉత్కంఠ ! అంతర్జాతీయ ఫుట్ బాల్ పోటీల్లో కూడా అంతటి ఉత్కంఠ వుండదేమో !

ఇక ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మాత్రం వీళ్ళు తమ ఆటకు బ్రేక్ తీసుకుంటారు. అక్కడ వాళ్ళ శత్రువులు ( పోలీసులు )  వుంటారు కదా ! ఆది కూడా ఒక కారణం. అసలు ఈ దేశంలో క్రీడా స్పూర్తి లేదు. క్రీడాకారులకు స్వేచ్చ లేదు. లేకపోతే హాయిగా రోడ్ మీద ఆటను ప్రాక్టీసు చేస్తున్న వాళ్ళ మీద కేసులా ? వాళ్ళు రేపొద్దున్న అంతర్జాతీయంగా రికార్డులు సృష్టిస్తే మాత్రం సన్మానాలు చేస్తారు. ఏమిటో ఈ న్యాయం ? చట్టాలు మార్చమని కూడా ఆందోళన చెయ్యాలి.

అసలు ప్రత్యర్థులను ఓడించడంలో వీళ్ళను మించిన వాళ్ళు ఇంకెవరూ వుండరేమో ! అప్పటివరకూ రోడ్ కి ఓ ప్రక్కగా వెడ్తున్న వీళ్ళకు ఫోన్ రావడం పాపం ... రోడ్ మధ్యలోకి వచ్చి వెనుక వచ్చే ప్రత్యర్థుల్ని చిత్తు చెయ్యడానికి వీళ్ళు చేసే విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. వాళ్ళు వెళ్ళరు. వీళ్ళని వెళ్ళనివ్వరు. హార్న్ కొట్టినా వినిపించుకోరు. అడ్డు తప్పుకోరు. చివరికి వాళ్ళ బైక్ కి మన బైక్ తగిలి ఆక్సిడెంట్ అవుతుందేమోననే భయంతో మనం సడెన్ బ్రేక్ వేసి.. దాంతో బైక్ స్కిడ్ అయి క్రింద పడి దెబ్బలు తిని ఈ ఆటలో ఓడిపోయి అయోమయంగా చూస్తుంటే విజయగర్వంతో ఆగకుండా ముందుకు సాగిపోయే ఈ నిర్వికార క్రీడాకారులకు ఏ అవార్డు ఇచ్చి సత్కరించాలో అర్థం కాదు. ఈ విషయం నిర్ధారించడానికి ఓ కమిటీ వెయ్యాలి. వాళ్ళతో పోటీ పడలేని వాళ్ళు అంటే సెల్ ఫోన్ లేని వాళ్ళని, వున్నా డ్రైవ్ చేస్తూ, రోడ్ మీద నడుస్తూ సెల్ ఫోన్ లు మాట్లాడడం చేతకాని వాళ్ళని, ఆ క్రీడాకారుల్ని ఓడించే సామర్థ్యం లేనివాళ్ళని ఆ భగవంతుడే కాపాడాలి. యుద్ధంలోను, క్రీడల్లోనూ గెలుపోటములు దైవాధీనాలు. కానీ ఈ ఆటలో మాత్రం గెలుపు ఖచ్చితంగా సెల్ ఫోన్ డ్రైవర్లదే !

నీతి : దుష్టులను దూరంగా ఉంచవలెను. డ్రైవింగ్ లో సెల్ ఫోన్ మాట్లాడే వాళ్లకు మనమే వీలైనంత దూరంగా ఉండవలెను. ఇది నా స్వానుభవం.

 Vol. No. 02 Pub. No. 045

Thursday, October 28, 2010

పోటాపోటీ


తెలుగు చిత్ర రంగంలో ఇప్పుడు నడుస్తున్న కొత్త ట్రెండ్ టైటిల్స్ కోసం పోటాపోటీ. గతంలో కూడా ఈ పోటీ వున్నా ప్రజలకు అంతగా తెలిసేది కాదు. వాళ్ళల్లో వాళ్ళే పరిష్కరించుకునేవారు. ఇప్పుడు చీమ చిటుక్కుమంటే ప్రజలకు చేరిపోతోంది. చిన్న విషయం కూడా పెద్ద రాద్దాంతమవుతోంది. ఇది కూడా ప్రసార మాధ్యమాలు సాధించిన ప్రగతి పుణ్యమే !

అసలు ఈ పోటీ తత్త్వం తెలుగు చిత్ర రంగం ఆవిర్భవించిన తొలినాళ్ళలోనే ఆరంభమైంది. అయితే ఇప్పటి పోటీ పేర్లకోసమైతే అప్పటి పోటీ కథలకోసం !

  1933 లోనే ఈ పోటీ తత్వానికి అంకురార్పణ జరిగింది. ' రామదాసు ' పేరుతో రెండు చిత్రాలోచ్చాయి. ఒక చిత్రాన్ని బొంబాయి కి చెందిన ఇంపీరియల్ కంపెనీ నిర్మించగా మరో చిత్రాన్ని కలకత్తాకు చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్మించింది. రెండవ చిత్రంలో సి. యస్. ఆర్, ఘంటసాల రాధాకృష్ణమూర్తి, రామతిలకం నటించారు. సి. పుల్లయ్య దర్శకత్వం వహించారు.

మరో విశేషమేమిటంటే అదే సంవత్సరం ' సావిత్రి ' పేరుతో రెండు చిత్రాలు వచ్చాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్మించిన చిత్రానికి సి. పుల్లయ్య గారే దర్శకత్వం వహించగా రామతిలకం, వేమూరి గగ్గయ్య, నిడుముక్కల సుబ్బారావు నటించారు.  

రెండో చిత్రం బి. వి. రామానందం దర్శకత్వంలో కృష్ణా ఫిలిం కంపెనీ నిర్మించింది. ఈయన విశ్వనట చక్రవర్తి ఎస్వీరంగారావుగారికి మేనమామ. ఇందులో సురభి కమలాబాయి, మునిపల్లె రాజు నటించారు. ఈ రెండింటిలో మొదటి చిత్రమే విజయం సాధించి ఒకే డేరా హాలులో సంవత్సరంపాటు ఆడిందని చెబుతారు. కథలలోనే కాదు పేర్లలో కూడా మార్పు లేకపోవడం ఈ చిత్రాల విశేషం.

1936 లో మళ్ళీ రెండు సినిమాలు పోటీ పడి రికార్డులలో నిలిచిపోయాయి. రెండింటి ఇతివృత్తం ఒకటే ! మొదటిది ' ద్రౌపదీ మానసంరక్షణ ' . లక్ష్మి ఫిల్మ్స్ పతాకంపైన నిర్మించిన ఈ చిత్రానికి ఎస్. జగన్నాథ్ దర్శకుడు. ఇందులో ప్రముఖ రంగస్థల నటుడు బళ్ళారి రాఘవ దుర్యోధనుడిగా నటించగా సురభి కమలాబాయి ద్రౌపదిగా నటించారు.

రెండవ చిత్రం ' ద్రౌపదీ వస్త్రాపహరణం '.  సరస్వతీ టాకీస్ పతాకంపైన నిర్మించిన ఈ చిత్రానికి హెచ్. వి. బాబు దర్శకుడు. ఇందులో కృష్ణుడిగా సి. యస్. ఆర్. ఆంజనేయులు, ద్రౌపదిగా కన్నాంబ, దుర్యోధనునిగా యడవిల్లి సూర్యనారాయణ నటించారు. ఈ చిత్రమే విజయం సాధించింది.


మళ్ళీ ఈ పోటీ చిత్రాల సందడి 1950 వ సంవత్సరంలో కనిపించింది. ' శ్రీలక్ష్మమ్మ కథ ' పేరుతో ప్రతిభా పతాకంపైన ఘంటసాల బలరామయ్య గారు స్వీయ దర్శకత్వంలో నాగేశ్వరరావు, అంజలీదేవిలతో ఒక చిత్రం నిర్మించారు.

' లక్ష్మమ్మ కథ ' పేరుతో శోభనాచల స్టూడియో వారు గోపీచంద్ దర్శకత్వంలో  సి. హెచ్. నారాయణరావు, కృష్ణవేణిలతో మరో చిత్రం నిర్మించారు. ఘంటసాల గారిని సంగీత దర్శకుణ్ణి చేసిన చిత్రం కూడా ఇదే ! రెండు చిత్రాలలోనూ ఈ చిత్రమే విజయం సాధించింది. 

ఇవీ తెలుగు చిత్ర రంగ తొలినాళ్లలోని పోటీ చిత్రాల వివరాలు.

Vol. No. 02 Pub. No. 045

Tuesday, October 26, 2010

నవలక్ష్ములు

అష్టలక్ష్ముల గురించి అందరికీ తెలుసు. మరి తొమ్మిదవ లక్ష్మి ఎవరు ? తెలుసుకోవాలనుందా ? అయితే .......

నటరత్న నందమూరి తారకరామారావు గారి వారసుడు బాలకృష్ణ నటుడిగా ఈ తరం ప్రేక్షకులకు తెలుసు. కానీ గత తరం ప్రేక్షకులకు హాస్యనటుడు బాలకృష్ణ గుర్తుండే వుంటారు. ' పాతాళ భైరవి ' అంజిగాడు అంటే చాలామంది సులువుగా గుర్తు పట్టేస్తారు. ఈ బాలకృష్ణ ఎన్టీరామారావు గారికి అభిమాన నటుడు కూడా !

బాలకృష్ణది చాలా జాలిగుండె. సెట్లో వున్నపుడు ఎవరైనా దిగులుగా కనిపిస్తే దగ్గరకు వెళ్ళి పలుకరించి ఓదార్చేవాడు. ఓసారి ఓ జూనియర్ ఆర్టిస్ట్ సెట్ బయిట దిగులుగా కూర్చుని వుండడం చూసి ........

" ఏంటి బాబాయ్ ! దిగాలుగా కూర్చున్నావు ? " అని అడిగారు.

దానికా నటుడు
" ఏం చెప్పమంటావ్ బాబాయ్ ? మాకు ఇప్పటికి ఎనిమిదిమంది ఆడపిల్లలు. ఇప్పుడు మళ్ళీ నా భార్య గర్భవతి. అదే నా దిగులు " అన్నాడు.

" ఓహో ! మళ్ళీ ఆడపిల్ల పుడితే ఇంకా ఖర్చు పెరుగుతుందనా నీ దిగులు ? " అని అడిగారు బాలకృష్ణ.

దానికా నటుడు
" ఖర్చు గురించి నాకు దిగులు లేదు. ఏదో తెర మీద కనిపించాలనే దురదతో ఈ ఫీల్డ్ లోకి వచ్చి ఈ ఎక్స్ ట్రా వేషాల బారిన పడ్డాను గానీ మీ దయవల్ల మా వూళ్ళో కావలసినంత ఆస్తి వుంది " అన్నాడు.

" మరింక దేనికయ్యా నీ దిగులు ? " అనడిగాడు బాలకృష్ణ

" ఇప్పటివరకూ నా ఎనిమిదిమంది కూతుళ్ళకూ ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, భాగ్యలక్ష్మి...... ఇలా అష్టలక్ష్ముల పేర్లు పెట్టేసాను. మళ్ళీ ఆడపిల్ల పుడితే ఏం పేరు పెట్టాలా అనేదే నా దిగులు " అని తన దిగులుకి కారణం తేల్చాడా నటుడు.

దానికి బాలకృష్ణ కొంచెం అలోచించి
" ఏముంది ? ఈసారి జ్యోతిలక్ష్మి అని పెట్టేయ్యి. సరిపోతుంది " అనేసి అక్కడనుంచి తప్పుకున్నాడు.

తోటరాముడు, నేపాళ మాంత్రికుడు, డింగరి లతో 'అంజి ' గాడిని ఈ పాటలో చూడండి....



  
Vol. No. 02 Pub. No. 044

Sunday, October 24, 2010

కళా దర్శకత్వం

 కనుక్కోండి చూద్దాం - 29 

ఈ  ఫోటోలో ఉన్నవారు తెలుగు వారు గర్వించదగిన వ్యక్తి.  బహుముఖ ప్రజ్ఞాశాలి. రచయిత, చిత్రకారులు, గాయకులు. తెలుగు చలన చిత్రరంగం తొలినాళ్ళలో రెండు చిత్రాలకు కళా దర్శకత్వం వహించారు.


* ఆయన పేరేమిటి ?

* ఆయన కళా దర్శకత్వం వహించిన చిత్రాల పేర్లు ఏమిటి ?  





Vol. No. 02 Pub. No. 043

Friday, October 22, 2010

మీసం చేసిన మోసం

 రంగస్థలం మీద నటునికి ముందుగా కావాల్సింది ధారణ శక్తి . ఎంత పెద్ద డైలాగ్ నైనా, ఎన్ని పేజీలున్నా తడుముకోకుండా సహజరీతిలో చెప్పాల్సివుంటుంది. జ్ఞాపకశక్తి అంతగా లేని నటుడు రంగస్థలం మీద రాణించడం కష్టమే !
సినిమాలో అయితే ఆ అవసరం తక్కువ. గతంలోనైతే ముందుగా పక్కాగా స్క్రిప్ట్ తయారయ్యేది, దాన్ని షూటింగ్ కి వెళ్లక ముందే నటీనటులకు పంపడం జరిగేది. వాళ్ళు బాగా చదువుకుని, హావభావాలు సాధన చేసి మరీ షూటింగ్ కి వచ్చేవారు. అందువలన దర్శకుడు ఇచ్చే సూచనలను బాగా అర్థం చేసుకుని నటించడానికి వీలయ్యేది. సెట్ మీద అప్పడికప్పుడు డైలాగ్ లు రాసుకుని, అసలు డైలాగ్ షీట్ అవసరం లేకుండా సీన్ చెబితే చాలు నటీనటులు ఎవరికి తోచిన డైలాగ్ లు వారే చెప్పుకునే స్థాయికి ఎదిగిన ఈరోజుల్లో ఈ సంగతి చాలామందికి తెలియక పోవచ్చు....తెలిసినా తెలియనట్లు నటించొచ్చు, లేదా అంత శ్రమ పడడం శుద్ధ దండగ అని కొట్టి పడేయ్యవచ్చు. 

ఎంత పెద్ద పేరున్న నటుడైనా ఎప్పుడైనా తడబడతాడేమో గానీ ఎంత పెద్ద డైలాగ్ ఇచ్చినా ఒక్క అక్షరం పొల్లు పోకుండా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసాడా అన్నట్లు నటించే నటుడు సాక్షి రంగారావు. ఆయన సంభాషణా ప్రవాహానికి ఒక ఉదాహరణ ' నటనలో జీవించిన సాక్షి ' అనే టపాలో గతంలో వివరించాను.

అయితే ఎంత గొప్పవారికైనా, ఎంత జాగ్రత్త తీసుకున్నా ఒక్కోసారి తప్పటడుగు పడే సందర్భం వస్తుంది. అంతటి ధారణాశక్తి కలిగిన సాక్షి రంగారావు గారికి కూడా అలాంటి పరిస్థితి ఒకసారి ఎదురయింది. అయితే దాన్నుంచి ఆయన ఎలా బయిట పడ్డారో చూద్దాం.......

ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనపుడు బాధితుల సహాయం కోసం చలనచిత్ర నటులు సాంస్కృతిక ప్రదర్శనలివ్వడం ద్వారా ధన సేకరణ చెయ్యడం ఆనవాయితీ. అలా ఓసారి కరువు బాధితుల సహాయం కోసం సూపర్ స్టార్ కృష్ణ తెనాలిలో ఓ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రముఖ నటీనటులు పాల్గొన్నారు. అందులో భాగంగా కృష్ణ, చంద్రమోహన్, సత్యనారాయణ, రావికొండలరావు, రాధాకుమారి, సాక్షి రంగారావు పాల్గొన్న ' వింత మనుషులు ' అనే హాస్యనాటిక ప్రదర్శించారు.

సాక్షి రంగారావు చేతిలో గొడుగుతో స్టేజి మీదకు ప్రవేశించే ఘట్టం. ఆయన హుషారుగా వచ్చేసాడు. కానీ ఆయన  మీసం పెట్టుకోవడం మరచిపోయాడు. ఆది గమనించిన రావికొండలరావు గారు ఊరుకోకుండా సాక్షి చెవిలో ' మీసం పెట్టుకోలేదేం ? ' అని అడిగారు. దాంతో సాక్షిగారు తెల్లబోయారు. గుటకలు మింగారు. ఆ తప్పు ఎలా జరిగిందో అర్థం కాక అయోమయంలో పడిపోయారు.

అంతే ! ఆ దెబ్బకి చెప్పాల్సిన డైలాగ్ మరిచిపోయారు. తోటి నటీనటులందరి వంకా వెర్రిచూపులు చూస్తూ నిలబడిపోయారు. ఆయన మొహంలో రకరకాల భావాలు ఒకేసారి కనిపించాయి. డైలాగ్ గుర్తు తెచ్చుకోవడానికి రకరకాల వింత చేష్టలు చేశారు. ఇదంతా చూస్తున్న ప్రేక్షకులు మాత్రం ఆది కూడా నటనలో భాగమే అనుకుని ఆనందపడిపోయారు. పగలబడి నవ్వారు. చివరికి గండం గట్టెక్కిందనుకోండి. సాక్షి రంగారావు గారిని మీసం చేసిన మోసం కథ ఆది.   

Vol. No. 02 Pub. No. 042

Thursday, October 21, 2010

పరామర్శ

సంజీవదేవ్ ప్రముఖ చిత్రకారుడు. ఒకసారి ఆయనింట్లో దొంగలు పడ్డారు. నగలూ, నట్రా పోయాయి. ఈ విషయం ఆయన మిత్రుడైన రచయిత చలం గారికి తెలిసింది. సంజీవదేవ్ గారిని పరామర్శిస్తూ ఆయన ఓ ఉత్తరం రాసారు.

' దొంగలు పడ్డారని తెలిసింది. చారుదత్తుడిలాగ మీరు ఆ దొంగలు వేసిన కన్నం దగ్గర కూర్చుని వారి హస్త లాఘవాన్ని మెచ్చుకోవడం లేదు కదా ! 

  ఏమేం పోయాయి ? నగా నట్రా అయితే ఫర్వాలేదు. కానీ మీ దగ్గరున్న పుస్తకాలు, ఉత్తరాలు, చిత్రాలు భద్రంగా వున్నాయి కదా ! ఎందుకంటే అవి అన్నిటికంటే విలువైనవి కదా !  '

........... ఇలా సాగింది ఆ పరామర్శ.

నిజమే కదా ! నగలూ, నగదూ అయితే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ విజ్ఞాన బాంఢాగారాలైన పుస్తకాలు వగైరా పోతే మళ్ళీ సంపాదించుకోవడం సులువు కాదు కదా ! అయినా వాటికంటే నగలూ, నట్రా విలువైనవి అంటారా ?

Vol. No. 02 Pub. No. 041

Tuesday, October 19, 2010

కీర్తి కండూతి



అనంతమైన కీర్తి సంపాదించాలని, తమ పేరు దశదిశలా మార్మోగిపోవాలని, ఆ కీర్తి ఆ చంద్ర తారార్కం నిలిచివుండాలని ఎవరికుండదు చెప్పండి ? అందుకే అందరూ ఆ కీర్తి కోసం తహతహలాడిపోతారు.

కొందరు ఈ విషయాన్ని నేరుగా వప్పుకోరు. ' అబ్బే ! నాకలాంటి కొరికలేమీ లేవండీ ! ఏదో నా జీవనం సాఫీగా గడిస్తే చాలు. మా పిల్లలు చక్కగా స్థిర పడితే అంతకంటే కావాల్సిందేముంటుంది. శేష జీవితాన్ని కృష్ణా, రామా అంటూ గడిపేస్తాను ' అంటూంటారు. వాళ్ళనే మీ గొప్పతనానికి మెచ్చి మీకు సన్మానం చెయ్యాలనుకుంటున్నాం అని చెప్పండి. ' అబ్బే ! సన్మానం చేయించుకునేంత గొప్పతనం నాలో ఏముంది చెప్పండి. ఏదో నా విధి నేను నిర్వర్తించాను. అంతే కదా ! ' అంటూనే పక్కవాళ్ళతో, ఇంట్లో వాళ్ళతో నాకు సన్మానం చేస్తారట. వద్దన్నా వినడం లేదు అని చెబుతారు. ' పోనీలే ఆయన మొహమాట పడుతున్నాడు. ఈసారికి మరొకరిని వెదుక్కుందాంలే అని మనం అనుకునేలోగా పరోక్షంగా అంగీకారం తెలియజేసేస్తారు. సన్మానమంటే ఎవరికి చేదు చెప్పండి.

ఇంకా కొంతమంది వుంటారు. వాళ్ళకి ఇలాంటి సన్మానాలు, ప్రచారాలు చేయించుకోవాలని కోరిక బలంగా వుంటుంది. కానీ ఎవరిని, ఎలా అడగాలో తెలీదు. తెలిసినా అడిగితే వాళ్ళు ఏమనుకుంటారోనని సంకోచం. ఎవరి వల్లనైనా తమకు ప్రచారం వస్తుందని అనిపిస్తే వాళ్ళ చుట్టూ తిరుగుతూ వుంటారు, ఎప్పటికైనా గుర్తించి తమకు సన్మానమో, మరోటో చేసి ప్రచారం కల్పిస్తారనే ఆశతో

మరికొంతమంది వుంటారు. తమకు ప్రచారం కావాలనుకోండి. మీడియా వాళ్ళను పిలిచి ఏదో ఒక విషయం మీద మాట్లాడేస్తుంటారు. ఈ మధ్య మీడియాలో వచ్చిన పోటీ ధోరణి వీళ్ళకు మరింత ఆలంబన. ఒకవేళ వాళ్ళు రారేమోననిపిస్తే ఏ స్టార్ హోటల్ లోనో విందు కార్యక్రమం, ఇతర ఆకర్షణలు ఏర్పాటు చేసి రప్పిస్తారు. మరి తిన్న విశ్వాసం చూపించాలి కదా అందుకే మర్నాడు మీడియాలో ఈయన మాటలు వచ్చేస్తాయి. అవి మామూలుగా వుంటే జనం ఒకసారి చూస్తారు. వివాదాస్పదంగా వుంటే ఇంక చెప్పనక్కర్లేదు. మరో కొన్ని రోజులు మీడియాకు విందు. ఈయనకు పసందు. దీనివలన కలిసొచ్చేది ఏమిటయ్యా అంటే పైకి కారణాలేమి చెప్పినా ఈయనకు అదో తృప్తి

వీళ్లలోనే మరో రకం. మీడియాను పోగెయ్యలేకపోయినా చుట్టూ పదిమందిని పోగేసి అక్కడ లేని వాళ్ళ గురించో, ప్రపంచ రాజకీయాల గురించో, చరిత్రలో లేని చారిత్రాత్మక విషయాల గురించో..... ఏదో విషయం గురించి మాట్లాడేస్తూ వుంటారు . ఆ విన్న వాళ్ళంతా ' అబ్బో మీకెన్ని విషయాలు తెలుసండీ ! ' అంటూ ఆశ్చర్యపోతుంటే... అబ్బో ..... ఆ సంతృప్తే వేరు

కీర్తి కండూతికి ఎన్నో అవతారాలు. అందులో మరో అవతారం అంటే మరో రకం వున్నారు. వీళ్ళు తమను తాము గొప్పవాళ్ళుగా వూహించేసుకుని చుట్టూ వున్నవాళ్లు ఆథములని వాళ్ళను వుద్ధరించడానికే తాము అవతరించామని చెప్పుకుంటూ సంతృప్తి చెందుతూ వుంటారు. వంగి వంగి దణ్ణాలు పెట్టే వాళ్ళకు వందలు వందలు సమర్పించుకుంటారు.  వళ్లు వంచి పనిచేసే వాళ్ళను తమకు దణ్ణం పెట్టలేదనే కారణంతోనో, మరో కారణంతోనో దూరం చేసుకుంటారు. తమకు బాజా వాయించేవాళ్ళకు పంచభక్ష్య పరమాన్నాలు..... కష్టసుఖాలన్నిటిలో తోడునీడగా నిలిచే కుటుంబసభ్యులకు పచ్చడి మెతుకులు. బయిట అందరూ నా గొప్పతనానికి అడుగడుగునా మెచ్చుకుంటున్నారు, ఇంట్లో మాత్రం వీసమెత్తు విలువలేదు.....ఇదీ వారి ఫిర్యాదు. బయిట వాళ్లయితే తమ స్వార్థం కోసం తప్పనిసరై మెచ్చుకుంటారని,  ఇంట్లో వాళ్ళకు అడుగడుగునా మెచ్చుకునే అవసరం లేదని, వాళ్ళకు వీరి పట్ల బాధ్యత వుంటుందే కానీ స్వార్థం కాదనీ  అర్థం కాదు. అర్థం అయినా అది ఒప్పుకునేందుకు అహం అడ్డొస్తుంది. ఎందుకంటే పొగడ్తలనే భ్రమలో బతికేస్తుంటారు కదా !

 ఈ కీర్తి కండూతి మహా చెడ్డది. దీనిలో పీకలదాకా మునిగిపోయిన వాళ్ళు స్వజనాన్ని దూరం చేసుకుంటారు. ఉన్నదంతా ఊడ్చుకుపోయాక పరజనం దూరం అయిపోతారు. నిజానికి అందరిలోనూ ఈ కీర్తి కండూతి అంతో ఇంతో అంతర్లీనంగా వుంటుంది. కాకపోతే కొంతమంది బయిట పడతారు. కొంతమంది గుంభనంగా వుంటారు. ఎవరైనా తమ స్వార్థంకోసమో, నిస్వార్థంగానో  మనల్ని పొగడ్తలతో ముంచెత్తినపుడు వివేకం వుపయోగిస్తే సమస్య వుండదు. 

ఏమైనా ఈ కీర్తి కండూతిని తగిన మోతాదులో వాడాలి.  శృతి మించితే వికటించి కళ్ళు మూసుకుపోతాయి.... చెవులు వినిపించవు.... బుద్ధి పనిచేయదు.... విచక్షణ నశిస్తుంది. ఆలోపతీ మందుల కంటే సైడ్ ఎఫ్ఫెక్ట్స్ చాలా వుంటాయి. అన్నీ ఉడిగాక... సర్వం హరించుకు పోయాక జ్ణానోదయం అయినా ప్రయోజనం లేదు. బెల్లంకోసం వచ్చిన ఈగలు అది ఖాళీ అవగానే ఎగిరిపోతాయి. తమని సదా అంటిపెట్టుకుని మంచిచెడ్డల్లో అండగా నిలిచే తన మనుష్యులు దూరం అవుతారు. చివరికి ఒంటరిగా మిగిలిపోతారు. మనుష్యుల నైజమే అంత అనుకోండి. తమకందుబాటులో వున్నదాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అంతరిక్షంలో వున్నవాటికోసం అర్రులు చాస్తారు. 

మనలోని గొప్పతనం వల్లో, మన ప్రవర్తన వల్లో, మన మంచితనం వల్లో కీర్తి దానంతట అది రావడం ఎంత మంచిదో..... కీర్తిని బలవంతంగా తెచ్చుకోవాలనుకోవడం, కొనుక్కోవాలనుకోవడం అంత చెడ్డది. 

కీర్తి హానికరం కాదు. కీర్తి కండూతి మాత్రం అత్యంత ప్రమాదకరమైనది. కీర్తికోసం కాక ఒక ప్రయోజనం కోసం కృషి చేస్తే...  వస్తే దానంతట ఆదే వస్తుంది. లేకపోతే ఆత్మ సంతృప్తైనా మిగులుతుంది. కేవలం కీర్తికోసం మాత్రమే కృషి చేస్తే చివరకు అది అపకీర్తినే మిగులుస్తుంది. 

మనవి : ఈ వ్యాసంతో బాటు మానవ జీవితాల్లో కనిపించే ఇలాంటి విషయాల గురించి నా అనుభవంలో నాకు కలిగిన భావాలకి అక్షర రూపం తేవాలనే వుద్దేశ్యంతో రాయడం ప్రారంభించాను. మనసులో మెదిలినపుడు కొన్ని విషయాలని రాసి పెట్టుకున్నాను.  అయితే వాటికి మెరుగులు దిద్ది పూర్తి చేసి ప్రచురించడం ప్రారంభిద్దామనుకునే లోగా మా ఇంటర్నెట్ కనెక్షన్ లో గత నెల 24 వ తేదీ నుంచి సమస్య వచ్చింది. బి‌.ఎస్‌.ఎన్‌.ఎల్. వారితో ఒక రకంగా యుద్ధం చేశాక, జి‌ఎం వరకూ వెళ్ళాక విజయదశమికి ముందురోజు అంటే సుమారు 20 రోజుల తర్వాత  పూర్తి పరిష్కారం దొరికి మామూలుగా పనిచేస్తోంది. 

ఈలోపు అనుకోకుండా ఇదే కీర్తి అనే విషయం మీద ప్రముఖ రచయిత శ్రీయుతులు గొల్లపూడి మారుతీరావు గారు అంతర్జాల పత్రిక కౌముది లో అక్టోబర్ 11 వతేదీన ఓ ఆడియో సహిత వ్యాసం ప్రచురించారు. అద్భుతమైన ఉదాహరణలతో వున్న ఆ మహానుభావుడి వ్యాసం ఇక్కడ చదవండి. గొల్లపూడి గారికి, కౌముది వారికి కృతజ్ణతలతో......   

Vol. No. 02 Pub. No. 040

ఇది మౌనగీతం....

 కనుక్కోండి చూద్దాం - 28

ఒక ప్రముఖ గాయని తెలుగులో పాడిన తొలి పాట ఇది.
1 .  ఆ గాయని ఎవరు ?
2 . ఆ చిత్రం పేరేమిటి ?
3 . ఈ పాట రచయిత, సంగీత దర్శకులు ఎవరు ?



 Vol. No. 02 Pub. No. 039

Sunday, October 17, 2010

నవరాత్రుల విశేషాలు

శారదా / దేవీ నవరాత్రులు ముగుస్తున్నాయనగానే మేం చదువుకునే కాలంలోని కొన్ని జ్ఞాపకాలు బయిటకు వచ్చాయి. అప్పటికే సినిమా రికార్డింగ్ డాన్సులు వగైరాలతో కలుషితమై పద్య నాటకాలు, శాస్త్రీయ నృత్యాలు, జానపద కళా రూపాలైన తోలుబొమ్మలాటలు, బుర్రకథ, హరికథలు వగైరా కనుమరుగావడం చూసి ఇలాంటి ఉత్సవాల్లో వాటి పునరుద్ధరణకు మా వంతు కృషిగా 70 వ దశకంలో చేసిన ప్రయత్నంతో బాటు అప్పట్లో ఉత్సవాల తీరుతెన్నుల గురించి, నా అనుభవాల గురించి  వివరిస్తూ రాసిన
 శారదా / దేవీ నవరాత్రులు  
 నా స్వ'గతం'  పేజీలో చదవండి. ఆ పేజీలో ఈ అంశం కోసం చివరి వరకూ వెళ్ళవలసి వుంటుంది.

Vol. No. 02 Pub. No. 038

Saturday, October 16, 2010

అమ్మలగన్న యమ్మ....

అమ్మలగన్న యమ్మ  ముగురమ్మల మూలపుటమ్మ చాలపె
ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడీపుచ్చినయమ్మ, దన్నులో
నమ్మినవేల్పుటమ్మల మనమ్ములయుండెడియమ్మ, దుర్గ
మాయమ్మ కృపార్థియిచ్చు తమహత్త్వకవిత్వపటుత్వ సంపదల్

 ఈ విజయదశమికి ఆ జగజ్జనని మిత్రులందరికీ సకల శుభాలు అందించాలని   కోరుకుంటూ............



Vol. No. 02 Pub. No. 037

Wednesday, October 13, 2010

అందరూ దిగ్దంతులే !

 ఓసారి రవీంద్రభారతిలో పండితసభ జరుగుతోంది. అందులో గిడుగు సీతాపతి గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, వేదుల సత్యనారాయణ గారు లాంటి పెద్దలంతా పాల్గొన్నారు. భాషావాదం పైన వాడిగా, వేడిగా  చర్చ జరుగుతోంది.

' ఏ వస్తువైనా సరే ఏ కాలంలోనైనా, ఏ దేశంలోనైనా ధనవంతులకు మాత్రమే కాకుండా సామాన్య ప్రజలకు అందుబాటులో ధరలో ఉంటేనే బాగుంటుంది. అలాగే విద్వాంసులకోసం పండిత భాష అనేది వున్నా కూడా సామాన్యులకు కోసం సరళమైన భాష ఉండాలి. అప్పుడే భాషలోని పరిమళం అందరికీ అందుతుంది. '

....... అని పెద్దలందరూ సుదీర్ఘ చర్చ తర్వాత తీర్మానించారు. ఈ చర్చ మొత్తాన్ని ఆ వేదిక మీదే కూర్చున్న దేవులపల్లి వారు మౌనంగా గమనిస్తున్నారు. వేదుల వారికి అనుమానం వచ్చింది. భాషావాదం పైన ఇంత ఘాటుగా చర్చ జరుగుతుంటే అందులో పాల్గోవటం మానేసి కృష్ణశాస్త్రి గారు ఏమీ మాట్లాడకుండా కూర్చున్నారేమిటా అని.  అదే విషయం ఆయన్ని అడిగారు.

" వారంతా దిగ్దంతులు. వారితో మనమేం మాట్లాడగలం చెప్పండి " అని చమత్కరించారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు.

...... ఆ సభలో పాల్గొన్న పెద్దల్లో చాలామంది  ఢెబ్భైవ పడిలో పడ్డవారే !                                   
Vol. No. 02 Pub. No. 036

Tuesday, October 12, 2010

భోజన కాలస్మరణే గోవిందా ......

పాత సినిమాలంటే ఇష్టపడేవారికి వంగర వెంకట సుబ్బయ్య గారిని ప్రత్యేకంగా పరిచయం చెయ్యనక్కరలేదు. ఆయన నటుడే కాదు. వేద వేదాంగాలు అథ్యయనం చేసిన పండితుడు. సంగీతం, చిత్రలేఖనం, జ్యోతిష్యం వగైరాలన్నీ క్షుణ్ణంగా నేర్చుకున్నారు. ఆయనకు గురువు ఆయన తండ్రి గారే!

ఆయన తండ్రి గారు నేర్పిన మరో విషయం భోజన సమయంలో మొదటి ముద్ద నోటిలో పెట్టుకునే ముందు మన ప్రాణాన్ని నిలిపే ఆహారాన్ని మనకు అందిస్తున్న ఆ శ్రీమన్నారాయణుని స్మరించుకోవాలని. ఆయన ఎట్టి పరిస్థితులలోనూ తప్పకుండా ఆ నియమాన్ని పాటించేవారు. 

ఒకసారి ఆయన షూటింగ్ నిమిత్తం అమరావతి వెళ్ళారు. అక్కడ ఆయనతో బాటు ఆ గదిలో సి. యస్. ఆర్. కూడా వున్నారు. ఈయన న్యూస్ పేపర్ చదువుకుంటుంటే వంగర గారు బాత్రూంలో స్నానం చేస్తున్నారు. ఉన్నట్టుండి బాత్రూంలో నుంచి ' భోజన కాలస్మరణే గోవిందా... గోవిందా... ' అని వంగర గారి గొంతు వినబడింది.

సి. యస్. ఆర్. గారు ఆశ్చర్యపోయారు. ఆయనకేమీ అర్థం కాలేదు. అప్పుడే బాత్రూం లోనుంచి బయిటకు వచ్చిన  వంగర గారిని  " భోజనానికి ముందు గోవింద స్మరణ చేసే అలవాటు మీకు వుందని తెలుసు. కానీ బాత్రూం లో ఈ విష్ణు సంకీర్తన ఏమిటయ్యా ? " అనడిగారు. దానికి వంగర వెంకట సుబ్బయ్య గారు

" ఏం చెప్పమంటారు ? ఇందాక స్నానం చేస్తూ సబ్బుతో ముఖం తోముకుంటుంటే, ఆ పిడికెడు సబ్బు ముక్క కాస్తా గొంతులోకి జారిపోయింది. ఈరోజుకి ఇదే మొదటి ముద్ద కదా ! అందుకే గోవింద కొట్టాను " అన్నారు ఏడ్పుముఖంతో .

Vol. No. 02 Pub. No. 035

Friday, October 8, 2010

ఓ ఆచూకీ కథ

 ఇప్పుడు ఈ ఇంటర్నెట్ కాలంలో సోషల్ సైట్ల ద్వారా, ఇతర మార్గాల ద్వారా, ఇదిగో ఇలా బ్లాగుల ద్వారా కూడా ఎప్పుడో విడిపోయిన, దూరమైన కుటుంబ సభ్యుల, స్నేహితుల, బంధువుల ఆచూకీలు తెలియడం జరుగుతోందని తరచుగా వింటున్నాం. అప్పుడప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా విడిపోయిన వ్యక్తుల్ని మా ఛానల్ కలిపిందని కనీసం ఓ వారం పాటు ఊదరగోట్టడం మనందరికీ తెలుసు. ఇదంతా సాంకేతిక పురోగతి పుణ్యం.
 కానీ ఉత్తరాల కాలంలో అదీ రవాణా వ్యవస్థ అంతగా అభివృద్ధి చెందని కాలంలో ఇలా విడిపోయిన వాళ్ళ ఆచూకీ దొరకడమంటే దాదాపు అసాధ్యంగా ఉండేది. వార్తా పత్రికలు, రేడియో లాంటివి వున్నా ఈ విషయంలో వాటి ఉపయోగం చాలా తక్కువే !
అలాంటిది 1938 వ సంవత్సరంలో ఓ సినిమా ద్వారా పారిపోయిన కొడుకు ఆచూకీ కనుగొనగలిగారు ఓ తల్లిదండ్రులు. ఆ విశేషాలు.....

అప్పటి మద్రాసులోని జార్జ్ టౌన్ లోని రోడ్ మీద రోహిణి పిక్చర్స్ వారి ' గృహలక్ష్మి ' చిత్రం షూటింగ్ జరుగుతోంది. అప్పట్లో మద్రాసులో ట్రాం బళ్ళు  ఉండేవి. దర్శకులు హెచ్. ఎం. రెడ్డి గారు కన్నాంబ పై ఓ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఆమె ట్రాం బండి తో బాటు ఏడుస్తూ పరుగెత్తే సన్నివేశం ఆది. చుట్టూరా జనాలు. సహజత్వం కోసం దర్శకులు ఆ జనాల మధ్యలోనే కన్నాంబను పరుగెత్తమన్నారు.
జనాలకు సూచనలు చేస్తూ రెడ్డి గారు ' మీరెవ్వరూ కెమెరా వంక చూడొద్దు. అలా ఎవరైనా చూసారో ల్యాబ్ కెళ్ళాక నెగెటివ్ లో వారి ముఖం మీద సూదితో ఒక ఏసిడ్ చుక్క వేస్తాను. వారి ముఖం సినిమాలో కనిపించకుండా పోతుంది. జాగ్రత్త ' అని హెచ్చరించారు. దాంతో అందరూ భయపడి కెమెరా వంక చూడక పోయినా అక్కడ ఓ తివాచీలు అమ్మే దుకాణం దగ్గర స్టూల్ మీద కూర్చున్న ఓ కుర్రాడు మాత్రం కెమెరా నే తదేకంగా చూడసాగాడు.
తర్వాత ఆ చిత్రం విడుదల అయ్యాక కడప లో ఆ చిత్రం చూస్తున్న ఒకాయన ఆ సన్నివేశం చూస్తూ ఆ కుర్రాడు తన కొడుకుగా గుర్తించాడు. అప్పటికి సంవత్సరం క్రితం స్కూల్ ఫైనల్ పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో భయపడి ఆ అబ్బాయి ఇల్లు వదిలిపెట్టి మద్రాస్ పారిపోయాడు. హెచ్. ఎం. రెడ్డి గారి ' గృహలక్ష్మి ' పుణ్యమాని అతని ఆచూకీ దొరికింది. ఆ తండ్రి ఆనందంతో మద్రాస్ వెళ్ళి తివాచీ దుకాణంలో పనిచేస్తున్న కొడుకుని ఇంటికి తీసుకెళ్ళాడు. 
అదీ ఓ ఆచూకీ కథ. తెలుగు సినిమా ఆవిర్భవించిన దశకంలోనే సినిమా వల్ల ఒనగూడిన సాంఘిక ప్రయోజనం.

Vol. No. 02 Pub. No. 034

నెహ్రూజీ డూప్ - జవాబు

కనుక్కోండి చూద్దాం - 28 - జవాబు


జవాబు : నెహ్రుజీ కి డూప్ లా భ్రమింపజేసిన వ్యక్తి


అయితే ఆయన ఫోటో బ్లాగర్ లో అప్లోడ్ కాకపోవడంతో పికాస ద్వారా ప్రయత్నించగా పేరు మార్చిన ఫైల్ కాకుండా అసలు ఫైల్ అప్లోడ్ అయి ఆ ఫైల్ పేరు పేకేటి గా తెలుస్తోందనే అభిప్రాయాన్ని మాగంటి వంశీమోహన్ గారు వ్యక్తం చేశారు.  శివగారు పేకేటి గారి పూర్తి పేరు రాసారు. ఇక జే.బీ. గారి కోరిక మేరకు పేకేటి గారి వివరాలు ......


పేకేటి గా గత తరం ప్రేక్షకులకు సుపరిచుతులైన పేకేటి శివరాం అసలు పేరు పేకేటి శివరామ సుబ్బారావు. తూర్పు గోదావరి జిల్లా పేకేరు గ్రామంలో 1918 అక్టోబర్ 8 వ తేదీన జన్మించిన శివరాం బి.ఏ. పాసయి ఎస్. ఆర్. సుబ్బారావు పేరుతో , ముఠా, ఉదయగిరి, కస్తూరి అనే కలం పేర్లతో రచనలు చేశారు. హార్మోనియం, జలతరంగిణి వాద్యాలు నేర్చుకున్నారు.

1940 వ దశకంలోనే తెలుగు చిత్రసీమలో ప్రవేశించి ప్రొడక్షన్ అసిస్టెంట్ నుంచి దర్శకత్వం దాకా అన్ని శాఖలను నిర్వహించారు. 1944 లో ఘంటసాల బలరామయ్య గారి ప్రతిభా ప్రొడక్షన్స్ లో పబ్లిసిటీ మేనేజర్ గా పనిచేసే సమయంలో ' సీతారామ జననం ' చిత్రంలో నటించడానికి వచ్చిన అక్కినేని నాగేశ్వరరావు కి మంచి మిత్రుడయ్యారు. అక్కినేని సినీ జీవిత చరిత్రలో పేకేటిది ఒక అధ్యాయం. అక్కినేని జీవితంలో అన్ని ముఖ్యమైన ఘట్టాలకు పేకేటి సాక్షి. వారి మైత్రి చిరకాలం కొనసాగింది.

పేకేటి కొంతకాలం ఫైర్ ఆఫీసర్ గా పని చేశారు. ఇండియన్ న్యూస్ సర్వీసు లో కెమెరామన్ గా కూడా పని చేశారు.

పేకేటి తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించారు. ఆయన నట జీవితంలో చెరిగిపోని ముద్ర వేసిన పాత్ర అక్కినేని ' దేవదాసు ' చిత్రంలోని దేవదాసు మిత్రుడు భగవాన్. ఆ పాత్ర ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. దేవదాసు చూసిన ప్రేక్షకులు అక్కినేనిని ఎంత బాగా గుర్తు పెట్టుకున్నారో, భగవాన్ పాత్రలో పేకేటిని కూడా అంత బాగానూ గుర్తుంచుకున్నారు.

పేకేటి తెలుగులో చుట్టరికాలు, భలే అబ్బాయిలు, కులగౌరవం, కన్నడంలో మరికొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2002 లో హెచ్. ఎం. రెడ్డి పురస్కారం అందుకున్నారు.

ప్రముఖ కళా దర్శకుడు పేకేటి రంగా ఆయన పుత్రుడు. తమిళంలో ప్రముఖ హీరో ప్రశాంత్ పేకేటి శివరాం మనుమడు.

ఈరోజు పేకేటి శివరాం జన్మదినం సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ......


Vol. No. 02 Pub. No. 033a

Thursday, October 7, 2010

నెహ్రూజీ డూప్

కనుక్కోండి చూద్దాం - 28

 నెహ్రూజీ ప్రథానమంత్రిగా వున్నప్పుడు ఓసారి కలకత్తా నుండి బొంబాయి ( నేటి ముంబయి ) కి ప్రయాణం చేస్తున్నపుడు ఆయన వెంటవున్న విలేఖరులలో ఇండియన్ న్యూస్ సర్వీస్ కెమెరామన్ గా పనిచేస్తున్న తెలుగు వ్యక్తి కూడా వున్నాడు. ఆయన కూడా ఆరోజు నెహ్రూజీ వేసుకున్న జాకెట్ లాంటిదే తొడుక్కున్నాడు. ఆయనకు అప్పుడప్పుడు గాంధీ టోపీ పెట్టుకునే అలవాటు కూడా వుంది. ముంబయిలో విమానం ఆగగానే నెహ్రూజీ కంటే ముందుగా ఆయన విమానం దిగాడు. నెహ్రూగారికోసం అక్కడ వేచి వున్న వారు ఈయన వేషదారణ చూసి నెహ్రూగా పొరబడి పూలమాలలతో ముంచెత్తి స్వాగతం పలికారు. దాంతో తాను నెహ్రుని కానని చెప్పడానికి ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. ఆయన అవస్థ చూసి నవ్వుకుంటూ వెనుకగా దిగిన నెహ్రూజీని చూసి నాలుక కరుచుకున్నారందరూ !

ఇంతకీ నెహ్రూజీగా భ్రమింపజేసిన ఆ వ్యక్తి తర్వాత కాలంలో తెలుగు చిత్రసీమలో  ప్రముఖుడిగా ఎదిగాడు.
ప్రక్క ఫోటోలో వున్న ఆయన ఎవరో గుర్తు పట్టగలరా ?






Vol. No. 02 Pub. No. 033
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం