Thursday, September 23, 2010

అస్తమించిన మరో అభ్యుదయం

 కళను పూర్తి వ్యాపారాత్మక వస్తువుగా మార్చుకుంది ఈనాటి సినిమా రంగం
కళ కేవలం వ్యాపారం కోసమే కాదు దానికొక సామాజిక బాధ్యత వుంది
ఆ బాధ్యతను గుర్తించిన సినిమా రంగ ప్రముఖులలో కె. బి. తిలక్ కూడా ఒకరు
ఆయన నిర్మించిన, దర్శకత్వం వహించిన చిత్రాల్లో ఈ విషయం స్పష్టంగా కనబడుతుంది
జగ్గయ్య, గాయని జానకి, జయప్రద లాంటి వాళ్ళనెందరినో తెలుగు తెరకు అందించారు తిలక్


ఈనాటి తెలుగు చిత్రాల్లో ఆ అభ్యుదయం కనుమరుగైంది
నేడు ఆ అభ్యుదయ దర్శక నిర్మాత అస్తమించాడు
అలాంటి సామాజిక బాధ్యత కలిగిన దర్శక నిర్మాత మళ్ళీ ఎప్పుడో ..... ఎవరో ....

ఈరోజు అస్తమించిన ఆ అభ్యుదయానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ.........




Vol. No. 02 Pub. No. 032

నడి ' మం ' త్రపు సిరి

 సంస్కృతం భారతీయ భాషలన్నిటికీ తల్లి వంటిది. ఆ భాషా వ్యాప్తికి ఎందఱో మహానుభావులు తమ జీవితాలు అంకితం చేశారు.
వారిలో ప్రముఖులు కాశీ కృష్ణాచార్య గారు. ఆయనకు పద్య ధారణా శక్తి ధారాళంగా ఉండేదని చెప్పుకునేవారు. కృష్ణాచార్య గారు మంచి వక్త కూడా !

ఒకసారి ఆయనకు మచిలీపట్టణంలో ఘన సన్మానం ఏర్పాటయింది. ఆయన్ని వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఆ నిర్వహణా సంఘ సభ్యుడు
" కాశీ కృష్ణమాచార్య గారిని వేదికను అలంకరించవలసినదిగా కోరుతున్నాం "
అని సంభోధించారు. అలాగే కృష్ణాచార్య గారిని సభకు పరిచయం చేసే సందర్భంలో కూడా అదే పేరుతో పరిచయ కార్యక్రమం కానిచ్చారు. పండితుల వారు ఈ విషయాన్ని నిశితంగా గమనించారు. తర్వాత కృష్ణాచార్యుల వారు తమ ప్రసంగం ప్రారంభిస్తూ

" నాగురించి పరిచయకర్తలు చెప్పినట్లు నాకు నడి'మం'త్రపు సిరి లేదు. నాపేరు కేవలం కృష్ణాచార్య మాత్రమే ! "
అన్నారు.  పండితులకు చమత్కారభాషణ సహజమే కదా !

Vol. No. 02 Pub. No. 031

Wednesday, September 22, 2010

ఈనాటి వాగ్గేయకారుడు పి.బి.


వాగ్గేయకారుడు అనే మాటకు సజీవ ఉదాహరణ పి. బి. శ్రీనివాస్
కాకినాడలో పుట్టి కన్నడిగులను మెప్పించిన గాన గంధర్వుడు పి.బి.

విలక్షణమైన స్వరం, వినసొంపైన గానం ఆయన స్వంతం
అందుకే పరాయి భాషల్లో కూడా ఆయన నీరాజనాలందుకున్నారు

తెలుగు..తమిళ.. కన్నడ..మళయాళ.. హిందీ..ఉర్దూ.. భాషల్లో పండితుడు
ఆశువుగా పద్యాలు పాటలు రాస్తారు .... అలవోకగా గజల్స్ గీతాలు పాడతారు


1951 - 52 ప్రాంతాల్లో ' మిస్టర్ సంపత్ '  అనే హిందీ చిత్రంలో అప్పటికే ప్రముఖ గాయనీమణులైన  గీతాదత్, షంషాద్ బేగం, జిక్కి లాంటి వారితో కలిసి పాడడంతో చిత్రసీమలో అడుగు పెట్టారు.  అదే సంవత్సరం ప్రముఖ కన్నడ దర్శక నిర్మాత ఆర్. నాగేంద్రరావు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నిర్మించిన త్రిభాషా చిత్రం ' జాతకఫలం ' లో మూడు భాషలలోను పి. బి. శ్రీనివాస్ పాడారు.  ఒకే సంవత్సరంలో నాలుగు భాషల్లో గాయకుడిగా పరిచయమైన ఘనత బహుశా ఆయన ఒక్కరిదేనేమో !

ఆయన గాయకుడే కాదు కవి, రచయిత కూడా ! ఎన్నో కవితలు, గజల్స్ వంటివి రాసారు. వాటిని స్వయంగా స్వరపరచి ఆలపించారు. సినిమాలకు పాటలు కూడా రాసారు. తెలుగులో ఎం.ఎస్. శ్రీరాం నిర్మించిన ' మంచిరోజు ' చిత్రంలో కొన్ని పాటలు రాసారు. ' భాగ్యజ్యోతి ' అనే కన్నడ చిత్రంలో సంస్కృత భాషలో ఒక పాట రాసారు. అలాగే మరో కన్నడ చిత్రం ' మక్కళ భాగ్య ' లో ఒక పాట అయిదు భాషల్లో వుంటుంది. అందులో కన్నడ చరణం తప్ప మిగిలిన తమిళ, తెలుగు, మళయాళ, హిందీ భాషల చరణాలు పి. బి. శ్రీనివాస్ రాసి తానే స్వయంగా ఆ పాట పాడారు.

ఎనభై వసంతాలు పూర్తి చేసుకున్న ఈనాటి వాగ్గేయకారుడు ప్రతివాది భయంకర శ్రీనివాస్ గారి జన్మదిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఆణిముత్యాల కదంబం..............





Vol. No. 02 Pub. No. 030

Monday, September 20, 2010

ఎనిమిదిన్నర దశాబ్దాల నవయువకుడు

అరవై ఏళ్ళు అందుకోనున్న వాణ్ణి 
రెండొందల మెట్లు ఎక్కిన వాణ్ణి 
మిట్టలు ఎక్కిన వాణ్ని 
పల్లాల్లో పడ్డ వాణ్ని 

అయినా 


అంతటి ఇంతటి వాడిననలేదు
మరికొన్నేళ్ళు అధిగమించాలనీ 
మరిన్ని మంచి చెడ్డలు చవి చూడాలనీ 
ముందుకు వెడుతున్నాను 

అభిమానుల దృష్టిలో కుర్రవాణ్ణి
పెద్దల హృదయాల్లో దాగున్న చిన్నవాణ్ణి 
ముందుకు వెళ్ళి సాధించేదేమిటో తెలియదు నాకు 
వెళ్ళిన తర్వాత మిగిల్చిందేమిటో తెలియాలి మీకు 

....... ఇవి అరవైవ పడిలో పడ్డ సందర్భంలో
అ . ఆ. లు........ అక్కినేని ఆలోచనలు

 ఎవర్ గ్రీన్ అనే పదానికి అర్థం అక్కినేని. అందుకే ఇప్పుడు ఎనభైయవ పడి సగం దాటాక కూడా ఎప్పటిలాగే వున్న నవయువకుడు అక్కినేని.
అక్కినేని నాగేశ్వరరావు గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలతో...........





Vol. No. 02 Pub. No. 029

సూర్యకాంతమ్మ వైద్యం.. చిట్కా !


జలుబు, జ్వరాల కాలం నడుస్తోంది. ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా వీటితో బాధపడుతున్నవారే ! ఈ బాధలో ఎవరైనా తమకు తెలిసిన ఏ చిన్న చిట్కా వైద్యం చెప్పినా, కొంచెం సానుభూతి చూపించి పలకరించినా చాలా ఉపశమనంగా వుంటుంది. 

ఇప్పుడంటే పూర్తి వ్యాపారమై పోయి సంబంధాలన్నీ ఆర్థిక పరమై పోయాయి గానీ గతంలో చిత్ర పరిశ్రమలో కూడా కళాకారులు, సాంకేతిక నిపుణులు, నిర్మాత దర్శకులు...... ఒకరేమిటి.... అందరి మధ్యా ఆర్థికానుబందాల కంటే ఆత్మీయతానుబంధాలు ఎక్కువగా వెల్లి విరిసేవి. దానికో ఉదాహరణ.  

సూర్యకాంతమ్మ అంటే గయ్యాళితనానికి మారు పేరుగా స్థిరపడిపోయింది. కానీ ఆవిడ నిజ జీవితంలో ఎంత సాత్వికురాలో అప్పట్లో పరిశ్రమతో పరిచయం వున్న వారందరికీ తెలుసు. ఆవిడ గళంలో గయ్యాళితనం ఎంత బాగా ప్రతిబింబింబిస్తుందో, అంత బాగా ఆత్మీయత ప్రతిఫలించేది.
ఆవిడ సెట్లో వుంటే ఎవరికి ఏ నొప్పి వచ్చినా, ఏ బాధ కలిగినా ఆప్యాయంగా పలుకరించేది.  అంతే కాదు ఆవిడకు గృహవైద్యంలో ప్రవేశం వుండేదేమో... ఎప్పుడూ కూడా అల్లం, శొంఠి, మిరియాలు, వేపచెక్క లాంటివి కూడా వుంచుకునేవారు. వాటితో చిట్కా వైద్యం చేసి అందరి బాధలను పోగొట్టేవారు.  ఆ గృహవైద్యం కంటే ఆవిడ మాటలే వాళ్లకి మంచి ఔషధాలుగా పనిచేసి ఇట్టే ఉపశమనం ఇచ్చేవి. వాళ్ళు మళ్ళీసారి ఆవిణ్ణి కలిసినపుడు వారి బాధలు తగ్గినా వైనాన్ని చెప్పి కృతజ్ఞతలు తెలియజేస్తే ఆవిడ పొంగిపోయేదట.
తన చుట్టుపక్కల వాళ్ళందరూ ఆరోగ్యంతో ఆనందంగా వుండాలని కోరుకోవడం కంటే గొప్పతనం ఉందంటారా ?  అదే  సూర్యకాంతమ్మ గారిలో విశేషం. అయితే ఇలా అందరికీ చిట్కా వైద్యాలు చెబుతూ పోతుంటే అప్పుడప్పుడు ఎలా ఎదురు తిరుగుతాయో ఆవిడకు సంబంధించినదే....... ఓ సరదా సంఘటన......

సూర్యకాంతం గారు ఒకసారి షూటింగ్ నిమిత్తం మద్రాస్ నుండి హైదరాబాద్ రైలులో బయిలుదేరారు. ఆవిడతో బాటు ఆ కూపేలో మరొక ఆవిడ కూడా ప్రయాణం చేస్తోంది. బాగా జలుబు చేసిందేమో ఆవిడ అదే పనిగా తుమ్ముతోంది. ఆది చూసి సూర్యకాంతమ్మ గారికి ఖంగారు పట్టుకుంది.... ఆ జలుబు తనకేక్కడ పట్టుకుతుందోనని. ఎందుకంటే మర్నాడు షూటింగ్ వుందాయే !  ఎప్పుడూ తనతో కూడా ఉండే చిట్కా మందులు లేవేమో మరి ఆవిడకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అందుకని తన సహజ ధోరణిలో ఆ తుమ్ముతున్నావిడతో.......

" చూడండమ్మా ! జలుబుని అశ్రద్ధ చెయ్యకూడదు. వచ్చే స్టేషన్ లో శారిడాన్ బిళ్ళలేమైనా దొరుకుతాయేమో చూడండి. దొరికితే అవి రెండు వేసుకుని వేడి వేడి కాఫీ తాగండి. చలిగాలి తగలకుండా తలకు మఫ్లర్ కట్టుకోండి. వెచ్చగా శాలువా కప్పుకుని పడుకోండి. తెల్లారి సికింద్రాబాద్ లో దిగేటప్పటికి జలుబు, గిలుబు ఎగిరిపోతుంది " అంటూ ఎడా పెడా సలహాలిచ్చేసారు సూర్యకాంతమ్మ.

జలుబు, తుమ్ములతో బాధపడుతున్న పక్కావిడ ఏమీ మాట్లాకుండా మౌనంగా వింటూంది. సూర్యకాంతం గారికి అనుమానం వచ్చింది.

" ఇంతకీ నేను చెప్పింది వింటున్నారా ? నా సలహాలు మీకు అర్థమయ్యాయా ? పాటిస్తారా ? ఇప్పటిదాకా నేనే వాగుతున్నాను.  మీరేం మాట్లాడడం లేదు. మీ పేరేమిటో తెలుసుకోవచ్చా ? " అనడిగారు.

ఆవిడ నిదానంగా " డాక్టర్ కామేశ్వరి " అంది. అంతే సూర్యకాంతం గారికి నోట మాట ఆగిపోయింది. 

" ఏమిటో ఈ ముదనష్టపు జలుబు డాక్టర్లను కూడా వదలడం లేదు " అని సణుక్కుంటూ తన బెర్త్ మీదకు వెళ్ళి పడుకున్నారు సూర్యకాంతం.          

Vol. No. 02 Pub. No. 028

Saturday, September 18, 2010

ఉద్యోగ భయం

నేడు చెన్నైగా మారిన మదరాసు మహానగరంలో ఒకప్పుడు ట్రామ్ బళ్ళు తిరిగేవి. ఆ రోజుల్లో ఒకసారి ఒక ట్రామ్ లో ప్రయాణం చేస్తున్న రచయిత ఆచంట జానకిరామ్ గారికి వెలిసిన పాత కోటు వేసుకుని అతి దీనమైన అవతారంతో వున్న కవి పుంగవులు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కనిపించారు.

ఆయన పరిస్థితి చూసి ఏమీ అర్థం కాకపోయినా దగ్గరకెళ్ళి పరిచయం చేసుకున్నారు జానకిరామ్ గారు.
 అలా జరిగింది ఆ సరస్వతీ పుత్రుల తొలి పరిచయం. మర్నాడు జానకిరామ్ గారు మరో కవిశేఖరులు మల్లంపల్లి చంద్రశేఖర శాస్త్రి గారి ఇంటికి వెళ్లారు. అప్పుడక్కడికి కృష్ణశాస్త్రి గారు కూడా వచ్చారు. అయితే ఇప్పుడు మరో వేషంలో. మల్లెపువ్వులాంటి తెల్లని లాల్చీలో అచ్చమైన భావకవిలా వెలిగిపోతూ కనిపించారు. నిన్నటికీ, ఈరోజుకీ ఎంత తేడా అని జానకిరామ్ గారు ఆశ్చర్యపోయారు. అదే విషయం అడుగుదామని

" నిన్న మీరు ట్రాంలో..... వెలిసిపోయిన కోటులో .... " అంటూండగానే........

దేవులపల్లి వారు అందుకుని " అదా..... ఎవరో ఉద్యోగం యిస్తాం రమ్మన్నారు. వెళ్లక తప్పింది కాదు. వాళ్ళు అన్నంతపనీ చేస్తారేమోనని జడిసి ఆ కోటు తొడుక్కుని వెళ్లాను. అమ్మయ్య ! అదృష్టవశాత్తూ ఆ ఉద్యోగం రాలేదు " అన్నారట.

Vol. No. 02 Pub. No. 027

Friday, September 17, 2010

' రావణాసురుడు ' కాదు !


 ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి గారు పనిచేస్తున్న రోజుల్లో ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి భాట్టం శ్రీరామమూర్తి గారు విధాన సభలో సోషలిస్ట్ పార్టీ సభ్యులుగా వుండేవారు.

ఒకసారి శ్రీరామమూర్తి గారు అధికార పక్షాన్ని విమర్శిస్తుంటే సంజీవరెడ్డి గారు సభను ఉద్ద్యేశించి మాట్లాడుతూ....
" అధికార పక్షాన్ని దుయ్యబట్టే హక్కు ఒక్క ప్రతిపక్ష సభ్యులదే కాదు. అధికారపక్ష సభ్యులకు కూడా ఉంటుంది. మా పార్టీ సభ్యులై నన్నోకసారి రావణాసురుడు అన్నారు " అంటూ చెబుతుంటే ..........

వెంటనే భాట్టం శ్రీరామమూర్తి గారు అడ్డుకుని ......

" అయ్యా ! నేను గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని రావణాసురుడితో పోల్చలేదు. అలా పోల్చలేను కూడా ! ఎందుకంటే రావణాసురుడు గొప్ప తపస్సంపన్నుడు కదా ! " అన్నారు. సభంతా గొల్లుమంది.

Vol. No. 02 Pub. No. 026

Wednesday, September 15, 2010

గాయక నటుడు ......... ? - జవాబులు

కనుక్కోండి చూద్దాం - 27

 

* ఆ గాయక నటుడు ఎవరు ?

ఈ ప్రశ్నకు స్పందించిన జయ గారు, మాధురి గారు, ఆత్రేయ గారు, కంది శంకరయ్య గారు మాధవపెద్ది సత్యం గా గుర్తించారు. వారందరికీ ధన్యవాదాలు.   


   
* అనుబంధ నిన్న ఇచ్చిన ప్రశ్నకు మాధవపెద్ది సత్యం గారి సోదరులు, ప్రముఖ కళాదర్శకులు మా. గోఖలే గారిని అజ్ఞాత గారు గుర్తించారు. వారికి ధన్యవాదాలు.







* ఇక అసలు ప్రశ్న ఆయన పాడిన తొలి పాట ఏ చిత్రంలోనిది ?  

ఈ ప్రశ్నకు ఎవరూ జవాబివ్వలేదు.  
చిత్రం : లైలా మజ్ను  ( 1949 )
సంగీతం : సి. వి. సుబ్బరామన్ , సాహిత్యం : సముద్రాల సీనియర్ ,  గానం : సుసర్ల దక్షిణామూర్తి, ఘంటసాల, మాధవపెద్ది సత్యం


ఆ పాట ఇప్పుడు మీకోసం ................



Vol. No. 02 Pub. No. 025a

Monday, September 13, 2010

గాయక నటుడు ......... ?

కనుక్కోండి చూద్దాం - 27

ఆయన గత తరానికి చెందిన గాయక నటుడు.
చిత్రసీమలో నటుడిగా స్థిరపడాలని మద్రాస్ వెళ్లారు. అక్కడ అప్పటికే కళాదర్శకుడిగా పని చేస్తున్న తన అన్నగారింట్లో వుండి ప్రయత్నాలు చేశారు.
' లవంగి ' , ' రామదాసు ' అనే తమిళ చిత్రాల్లో తొలిసారిగా నటించారు.
' రామదాసు ' చిత్ర సంగీత దర్శకుడు సి. వి. సుబ్బరామన్ ఆయన పాట విని తాను సంగీత దర్శకత్వం చేసిన ఒక విజయవంతమైన తెలుగు చిత్రం ద్వారా గాయకుడిగా పరిచయం చేశారు.
తర్వాత  షావుకారు, మాయాబజారు, మనోహర, రాజమకుటం వగైరా చిత్రాల్లో నటించినా గాయకుడిగానే  ప్రసిద్ధుడయ్యారు. ఒక తరహా పాటలకు ఆయనదే సరైన గళమనిపించేంతగా ప్రాచుర్యం పొందారు. ముఖ్యంగా ఒక ప్రసిద్ధ నటునికి ఆయన పాడితే ఆ నటుడే పాడాడా అనిపించేంతగా ఆయన గళం అమరేది.

ఆ గాయక నటుడు ఎవరు ? ఆయన పాడిన తొలి పాట ఏ చిత్రంలోనిది ? 

Vol. No. 02 Pub. No. 025

Sunday, September 12, 2010

' విజయ ' రహస్యం


 విజయా వారి చిత్ర విజయాల వెనుక వున్న రహస్యమేమిటో తెలుసుకోవాలంటే ముందుగా ఆ సంస్థ అధినేతలలో ఒకరైన చక్రపాణి గారు అనుసరించిన సూత్రాల్ని తెలుసుకోవాలి.






" నేను సామాన్యుణ్ణి. పెద్దగా చదువుకోలేదు. ఇంగ్లీష్ కూడా సరిగా రాదు. ఎక్కువగా చదివే ఓపిక లేదు. కానీ ఎవరైనా చదివి చెప్పింది విని అర్థం చేసుకోగలను. మంచి చెడ్డా విడదీసి చూసుకోగలను. నేను కూడా సాధారణమైన సగటు వ్యక్తినేకాబట్టి నాకు నచ్చింది సామాన్యులైన ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని నా నమ్మకం "



విజయా వారి చిత్రాల్లో సంగీతం ఎంత ప్రజారణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ తరంలో కూడా వాటిని చాలా ఇష్టంగా వినే శ్రోతలుండడం దీనికి నిదర్శనం. ఆ పాటల రూపకల్పన చక్రపాణి గారు స్వయంగా పర్యవేక్షించించేవారు. దాన్ని గురించి చెబుతూ....

" నాకు స్వరజ్ఞానం గానీ, తాళజ్ఞానం గానీ లేవు. అసలు సంగీతమే రాదు. పాడటం ముందే రాదు. కానీ ఒక మామూలు శ్రోతగా పాట విని బాగుందో లేదో చెప్పగలను. అలాగే నాకు నచ్చితే సామాన్య శ్రోతకు కూడా నచ్చుతుందని నా అభిప్రాయం "


ఆయన ఆలోచనలు, అబిప్రాయాలు, నమ్మకాలు, అంచనాలు ఎంత వరకూ సరైనవో విజయా వారి చిత్రాల విజయాలు చెబుతాయి. నేల విడిచి సాము చెయ్యకుండా ఈ స్థాయిలో ఇప్పటి నిర్మాతలు, దర్శకులు ఆలోచించగలిగితే చాలా చిత్రాలు అందరూ చూడగలిగినవిగా  వుండి విజయాలు సాదిస్తావేమో !

విడుదలకు ముందే ఒక చిత్ర విజయాన్ని అంచనా వెయ్యడంలో చక్రపాణి గారు ఎలా వ్యవహరించేవారో చెప్పడానికి ఓ ఉదాహరణ....

' గుండమ్మ కథ ' ఫస్ట్ కాపీ వచ్చాక అందులో ఇద్దరు ప్రముఖ హీరోలున్నా కథ మొత్తం సూర్యకాంతం పాత్ర చుట్టూనే తిరగడంతో ఆ చిత్ర విజయంపై పరిశ్రమ పెద్దలు అనుమానం వ్యక్తం చేశారు. నాగిరెడ్డి చక్రపాణి గార్లకు కూడా అనుమానం మొదలైంది. ఇంతలో నాగిరెడ్డి గారింట్లో ఒక కార్యక్రమానికి ఆంధ్రలోని పలు ప్రాంతాలనుంచి బంధు మిత్రులు వచ్చారు. ఆ సందర్భంగా వారందరికోసం ' గుండమ్మ కథ ' ప్రివ్యూ ఏర్పాటు చేశారు. అందులో సూర్యకాంతం నటన , రామారావు నిక్కరుతో కనబడం లాంటివి అందర్నీ ఎంతో అలరించాయి. చిత్రం ఆసాంతం హాయిగా అస్వాదించారట ఆ ప్రేక్షకులంతా. ఏవైతే చిత్ర విజయానికి ఆటంకమవుతాయని అందరూ భావించారో అవే ఆ ప్రక్షకుల్ని ఆకట్టుకోవడంతో నాగిరెడ్డి చక్రపాణి గార్లకు ధైర్యమొచ్చింది.

" అన్నం సరిగా వుడికిందో లేదో చెప్పడానికి ఒక్క మెతుకు పట్టుకుని చూస్తే చాలదూ ! ఇదే మనకు సరైన జడ్జిమెంట్. ఈ సినిమా చాలా బాగా ఆడి తీరుతుంది " అన్నారట చక్రపాణి గారు.
ఆయన అంచనా ఎంతవరకూ సరైనదో ఆ చిత్ర విజయం చెప్పింది. స్టార్ డం చూసుకుని వుంటే తెలుగువారందరూ గర్వంగా చెప్పుకునే ఒక మహత్తర వినోద భరిత చిత్రం విడుదలకు నోచుకునేది కాదేమో !
 ( ఇదే విషయాన్ని శుక్రవారం అంటే 10 - 09 - 2010 న ఈటీవీ లో ప్రసారమైన WOW కార్యక్రమంలో రచయిత పరచూరి గోపాలకృష్ణ గారు కూడా ప్రస్తావించారు )                   


Vol. No. 02 Pub. No. 024

Saturday, September 11, 2010

శుభాకాంక్షలు - ముబారక్

 విఘ్ననాథుడు గణనాథుడు
సకలశుభ కారకుడు 
పర్యావరణ పరిరక్షకుడు

... అన్ని మంచి పనులకు మిత్రులందరికీ ఏ విఘ్నాలు కలగకుండా విజయవంతం కావాలని కోరుకుంటూ.....

వినాయక చతుర్థి శుభాకాంక్షలు 

దయకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్
ఆకలి వేడిని తెలియజేసేది ఉపవాస దీక్ష
మనిషికి ఉత్తమ విలువలను అందిస్తుంది ఈ నెల

.... ముస్లిం సోదరులందరికీ అల్లా అన్నీ శుభాలు కలుగజేయ్యాలని కోరుకుంటూ ...........

                           ఈద్ ముబారక్        




Vol. No. 02 Pub. No. 023

Thursday, September 9, 2010

తెలుగు సినిమా దాదా...!


 కృషితో నాస్తి దుర్భిక్షం ............
దీనికి సజీవ ఉదాహరణ డా. డి. రామానాయుడు గారు

సినిమా నిర్మాణం మీద మక్కువను పెంచుకుని మద్రాస్ బాట పట్టి చిత్ర నిర్మాణంలో మెళుకువలు నేర్చుకుని చిత్రసీమ మీద ' అనురాగం ' పెంచుకుని ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ నేడు భారత దేశంలో అత్యున్నత పురస్కారాన్ని అందుకునే స్థాయికి చేరడం........... నిజంగా తెలుగు సినిమా రంగం, తెలుగు సినిమా ప్రేక్షకులు గర్వించదగ్గ విషయం.


ఒక నిర్మాత ఇన్ని సంవత్సరాలు వరుసగా చిత్రాలు నిర్మించడం మాటలు కాదు.
అందుకే గిన్నిస్ బుక్ లోకి ఆయన పేరు చేరింది.
ఆయన చిత్రాలు నేల విడిచి సాము చేసినవి కావు
వినోదం, వ్యాపారం ప్రధానమైనా బాధ్యత మరచిపోలేదు
సినిమా తియ్యడం పెద్ద గొప్పేమీ కాదు.... పుంఖాను పుంఖాలుగా నేను కూడా తియ్యగలను.... అని అదీ ఇదీ అని చూడకుండా అడ్డమైన చెత్త తీసి ప్రేక్షకుల మొహాన కొట్టలేదు.

ఆయన చిత్రాల విజయానికి, ఆయన జీవిత విజయానికి ముఖ్యమైన కారణం ప్రణాళిక
ఆయన చిత్రం నిర్మించినా, స్టూడియో కట్టినా, సంతానాన్ని చిత్రసీమలో ప్రవేశపెట్టినా అన్నీ ఒక ప్రణాళిక ప్రకారం జరిగాయి....జరుగుతాయి.
సరైన ప్రణాళిక, నిబద్ధత వుంటే ఏ మనిషైనా ఎంత ఎత్తు ఎదగచ్చో నాయుడు గారిని చూస్తే తెలుస్తుంది
కేవలం డబ్బు ఆ స్థాయిని కల్పిస్తుందని అనుకుంటే ఆది చాలా పొరబాటు.
ఆయన కంటే డబ్బున్నవాళ్ళు చాలామందే పరిశ్రమలోకి వచ్చారు.  గొప్ప నిర్మాతలుగా చాలామంది చెలామణీ అయ్యారు. కానీ అవన్నీ స్వల్పకాలమే ! తరువాత తెరమరుగయిన వాళ్ళే ఎక్కువ .

ఆయన చలన చిత్ర జీవితం కొత్తగా వచ్చే నిర్మాతలకు పెద్దబాలశిక్ష.
వాళ్ళు కొంతకాలం ఆయన నిర్మాణ శైలిని నిశితంగా గమనించిన తర్వాత నిర్మాణంలోకి దిగితే చేతులు కాల్చుకోవాల్సిన అవసరముండదు.
ఆయన చిత్రాల్లో అనవసరపు ఆర్భాటాలుండవు. హింసతో నిండిపోవు. హద్దు మీరిన శృంగారం వుండదు. ఫ్యాక్షన్ లు, బాంబులు వగైరా మసాలాలుండవు. సగటు ప్రేక్షకుడికి ఏమి కావాలో ఆయనకు స్పష్టంగా తెలుసు. అందుకే ఆయన చిత్రాల్లో అన్నీ సమపాళ్ళల్లో రంగరిస్తారు. ఆయన చిత్రాలు ట్రెండ్ అంటూ గాలివాటుగా పోవు. అందుకే ఆయన తీసిన సినిమాలన్నీ దాదాపుగా విజయవంతమే !

కొందరికి తాము చేసిన పనుల కంటే తమకు ఎక్కువ గుర్తింపు రావాలనే కండూతి వుంటుంది. దానికోసం అవసరమైతే బిరుదులూ, సన్మానాలు కొనుక్కుంటారు. ఏదో ఒక సంచలన వార్తతోనో, వ్యాఖ్యతోనో మీడియా ద్వారా ప్రజల నోటిలో తమ పేరు నానేటట్లు చేసుకోవడానికి నానా తంటాలు పడతారు. ఆయనే ఒక చానెల్ గానీ, న్యూస్ పేపర్ గానీ పెట్టగలిగే స్థోమత వుండి కూడా పెట్టుకోలేదు. ఆయనకు ప్రచారం ఆయన చిత్రాలే !

రామానాయుడు గారికి ఆయన చిత్రాలు, ఆయన స్టూడియో తప్ప మరో దృష్టి వున్నట్లు తోచదు . రాజకీయాల్లో కూడా ఆయన ఇమడలేదు. తాను నమ్ముకున్న, తనని నమ్ముకున్న తెలుగు చిత్ర పరిశ్రమను ఆయన వదలలేదు. ఆ నిబద్ధతే ఆయన్ని ఈనాడు ఉన్నత శిఖరాలు చేర్చింది.

అందుకే ఆయన ఇంతకుముందు మూవీ మొఘల్ అయ్యారు.
ఇప్పుడు తెలుగు సినిమా దాదా అయ్యారు

దాదాసాహెబ్ ఫాల్కే భారతీయులకు సినిమాకళను అందించారు
రామానాయుడు తెలుగు చిత్ర పరిశ్రమకు నిర్మాణ కళను అందించారు 

 డా. రామానాయుడు గారికి దాదాసాహెబ్ ఫాల్కే  పురస్కారం ప్రకటించిన సందర్భంగా శుభాకాంక్షలతో............... 

Vol. No. 02 Pub. No. 022

Wednesday, September 8, 2010

ముచ్చటగా మూడు...? - మరికొన్ని వివరాలు.

ఈ ప్రశ్నలలో ఇచ్చిన చిత్రాలన్నీ అప్పట్లో సూపర్ హిట్ కాకపోయినా అంతో ఇంతో ప్రజాదరణ పొందినవే ! పేర్లు కూడా గుర్తుపెట్టుకోలేనివి మాత్రం కాదు. జవాబులతో బాటు మరికొన్ని వివరాలు ఇవ్వవలసింది. సులువుగా గుర్తుకొచ్చేవేమో ! నాకు తెలిసిన వివరాలతో బాటు ఆయా చిత్రాల పాటలు కూడా ఇస్తున్నాను. అవి వింటే గుర్తుకు రావచ్చు.

1. ప్రముఖ రచయిత్రి కె. రామలక్ష్మి ( ప్రముఖ రచయత ఆరుద్ర గారి సతీమణి ) సంభాషణలు రాసిన ఒకే ఒక చిత్రం ఏది ?

జవాబు : అభిమానవతి ( 1975 ) ; కృష్ణ , వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రం రామలక్ష్మి గారే రాసిన ' కరుణ ' అనే నవల ఆథారంగా నిర్మించబడింది.
చక్రవర్తి సంగీత నిర్దేశకత్వంలో దాశరథి రచించిన ఈ పాట బాలు గారు పాడారు. అప్పట్లో ఈ పాట ఎక్కువగా రేడియోలో వినిపించేది.





2. తెలుగులో తొలి ' పెద్దలకు మాత్రమే ' ( A సర్టిఫికేట్ ) చిత్రమేది ?

జవాబు : ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి  ' మనుషులు-మమతలు ' ( 1965 ) చిత్రం గురించి గత తరం ప్రేక్షకులకు ఎక్కువగా చెప్పనక్కర్లేదనుకుంటాను. అక్కినేని, సావిత్రి, జయలలిత నటించిన ఈ చిత్రంలో జయలలిత ధరించిన దుస్తులు అప్పట్లో సంచలనం కలిగించాయి. ఆ చిత్రంలోని పాటలన్నీ దాదాపుగా ప్రజాదరణ పొందినవే ! ఓసారి వింటే గుర్తుకు రాక మానవు.
తాతినేని చలపతిరావు సంగీతంలో ఈ చిత్రంలోని పాటలు ఆత్రేయ, దాశరథి, సి. నారాయణరెడ్డి రాశారు.




3. అందాల నటుడు శోభన్ బాబు ఆడ వేషంలో కనిపించిన చిత్రమేది ? ఏ పాత్రలో ?

జవాబు : ' కలసిన మనసులు ' ( 1968 ). ఇందులో ఓ అంతర్నాటకంలో శోభన్ బాబు రాధ వేషంలో, హీరోయిన్ భారతి కృష్ణుడి వేషంలో కనిపిస్తారు. మాస్టర్ వేణు సంగీత దర్శకత్వంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన ఈ పాట
ఘంటసాల, సుశీల పాడారు.
గత తరం తెలుగు సినీ సంగీత ప్రియులు ఈ పాటను మరిచిపోవడం సాధ్యం కాదేమో !



Vol. No. 02 Pub. No. 020b

Tuesday, September 7, 2010

ముచ్చటగా మూడు ....? - జవాబులు

   కనుక్కోండి చూద్దాం - 26 

జవాబులు


1. ప్రముఖ రచయిత్రి కె. రామలక్ష్మి ( ప్రముఖ రచయత ఆరుద్ర గారి
సతీమణి ) సంభాషణలు రాసిన ఒకే ఒక చిత్రం ఏది ?

జవాబు : అభిమానవతి ( 1975 ) ; కృష్ణ హీరో 





2. తెలుగులో తొలి ' పెద్దలకు మాత్రమే '           
( A సర్టిఫికేట్ ) చిత్రమేది ?

జవాబు : అక్కినేని నటించిన ' మనుషులు-మమతలు ' ( 1965 ) 




3. అందాల నటుడు శోభన్ బాబు ఆడ వేషంలో కనిపించిన చిత్రమేది ?
ఏ పాత్రలో ?


జవాబు : ' కలసిన మనసులు ' ( 1968 ). ఇందులో ఓ అంతర్నాటకంలో శోభన్ బాబు రాధ వేషంలో, హీరోయిన్ భారతి కృష్ణుడి వేషంలో కనిపిస్తారు.


Vol. No. 02 Pub. No. 020a

Monday, September 6, 2010

జనంలోంచి వచ్చిన పాట


సంగీతం పండిత జనుల్ని రంజింపజేయ్యడానికి ఉద్భవిస్తే పామర జనపదుల్లోంచి సంగీతం అలవోకగా ప్రవహిస్తుంది.
కొన్ని పాటలు జనం కోసం పుడితే మరికొన్ని పాటలు జనంలోంచి పుడతాయి.
అలా పామర జనంలోంచి వచ్చిన పాట గురించిన ఓ ఉదంతం.


ఓసారి ఘంటసాల మాస్టారు రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో మిత్రునితో కలసి విజయనగరంలో ఓ వీధిలోంచి నడిచి వెడుతుండగా ఆ అర్థరాత్రి వేళ ఎక్కడినుండో ఓ పాట వినబడింది. ఎక్కడా అని చూస్తే రోడ్డు ప్రక్కన గుడ్డి వెలుగులో కూర్చుని చెప్పులు కుట్టుకుంటున్న కార్మికుడు తీస్తున్న కూనిరాగమని అర్థమయింది. ఘంటసాల గారిని ఆ కూనిరాగం ఆకర్షించింది. ఆగి శ్రద్ధగా విన్నారు.

ఆయన మద్రాసు వచ్చాక కూడా ఆయన్ని ఆ కూనిరాగం వెంటాడుతూనే వుంది.  ఆయనలోని సంగీత కళాకారుడు ఊరుకోలేకపోయాడు. ఆ కూనిరాగంలోని బాణీని పట్టుకున్నాడు. ఫలితంగా కొత్త పాటకు బాణీ దొరికింది. తర్వాత కాలంలో ఘంటసాల విజయనగరం వెళ్ళినపుడు ఆ బాణీనందించిన కార్మికుణ్ణి గుర్తుపెట్టుకుని అతని దగ్గరకు వెళ్ళి మంచి బహుమానమిచ్చి గౌరవించారు.

ఆ బాణీతో ఘంటసాలగారు 1954 లో స్వీయ సంగీత దర్శకత్వంలో పాడిన ' చంద్రహారం ' చిత్రంలోని పాట ......................   



Vol. No. 02 Pub. No. 021

Sunday, September 5, 2010

ముచ్చటగా మూడు........ ?

  కనుక్కోండి చూద్దాం - 26 

ఈ క్రింద ముచ్చటగా మూడు ప్రశ్నలున్నాయి. జవాబులు చెప్పగలరేమో ప్రయత్నించండి.


1. ప్రముఖ రచయిత్రి కె. రామలక్ష్మి ( ప్రముఖ రచయత ఆరుద్ర గారి
సతీమణి ) సంభాషణలు రాసిన ఒకే ఒక చిత్రం ఏది ?





2. తెలుగులో తొలి ' పెద్దలకు మాత్రమే '
( A సర్టిఫికేట్ ) చిత్రమేది ?




3. అందాల నటుడు శోభన్ బాబు ఆడ వేషంలో కనిపించిన చిత్రమేది ?
ఏ పాత్రలో ?






Vol. No. 02 Pub. No. 020

Saturday, September 4, 2010

సాంగుల గ్రంథం

చమత్కారాలు పలికించడంలో కవులు, రచయితలు సిద్ధహస్తులు. ఆ విషయంలో మనకి ఎలాంటి సందేహం లేదు. మరి కవిత్వంలో ఉద్ధండులైన ఇద్దరు మహానుభావులు కలిస్తే .....................



దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు భావకవిత్వమెంత మధురంగా చెప్పగలరో సరస సంభాషణ కూడా అంతే మధురంగా చెయ్యగలరు.









కొసరాజు రాఘవయ్య చౌదరి తెలుగు సినీ కవిత్వాన్ని జానపదుల బాట పట్టించిన ఘనులు.


వీరిద్దరూ కలిస్తే ఆ సంభాషణ ఎంత సరసంగా వుంటుందో కదా ........ !

వాహినీ వారి ' బంగారు పంజరం ' చిత్రానికి పాటలు రాసే పనిలో వున్న దేవులపల్లి వారి దగ్గరకి కొసరాజు గారు వచ్చారు. ' పుస్తకం హస్త భూషణం ' అనే మాట కొసరాజు గారికి సరిగా సరిపోతుంది. ఆయన చేతిలో ఎల్లవేళలా ఒక పుస్తకం ఉండేది. దాంట్లో ఆయన రాసిన పాటలు, రాస్తున్న పాటలు ఉండేవి.

వస్తూనే దేవులపల్లి వారికి నమస్కారం చేశారు కొసరాజు గారు.  ప్రతి నమస్కారం చేస్తూ కృష్ణశాస్త్రి గారు కొసరాజు గారి చేతిలోని పుస్తకాన్ని ఏమిటన్నట్లు సైగ చేశారు.

విషయం గ్రహించిన కొసరాజు గారు ఆ పుస్తకాన్ని దేవులపల్లి వారికి చూపిస్తూ "  సాంగుల గ్రంథం " అన్నారు.
దానికి దేవులపల్లి వారు వెంటనే.......
 " సాంగుల గ్రంథం అంటున్నారు. మీరు గ్రంథ సాంగులు కారు కదా !  " .... అని చమత్కరించారు.

Vol. No. 02 Pub. No. 019

Thursday, September 2, 2010

చిన్ని చిన్ని కన్నయ్యా.....

 చిన్ని చిన్ని కన్నయ్యా.....
కన్నులలో నీవయ్యా....
నిన్ను చూసి మురిసేను......

చిన్నికృష్ణుని లీలలు అద్భుతం
చిన్న పిల్లల చిన్నెలు నయనానందం

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మా చిన్ని కృష్ణుడు.....



Vol. No. 02 Pub. No. 018

Wednesday, September 1, 2010

కలిపిన ' విడదీసే రైలు బళ్ళు '


నువ్వెక్కవలసిన రైలు బండి జీవితకాలం లేటు అన్నారు ప్రముఖ తెలుగు రచయిత ఆరుద్ర. కానీ ఆయన విషయంలో ఆది నిజం కాలేదు.

అలాగే ' విడదీసే రైలు బళ్ళు ' అని రాసిన ప్రముఖ రచయిత్రి కె. రామలక్ష్మి విషయంలో ఇదీ నిజం కాలేదు. అందుకేనేమో  వారిద్దరూ జీవితకాలం లేటు కాకుండా కలిసారు.


 భాగవతుల సదాశివశంకర శాస్త్రి అనే అసలు పేరు కల ఆరుద్ర కవిత్వంలో అప్పుడప్పుడే ప్రసిద్ధి చెందుతున్న కాలంలో అంటే 1950 వ దశకం తొలినాళ్ళలో రామలక్ష్మి ' స్వతంత్ర ' పత్రికలో పనిచేసేవారు. అప్పటికి ఆవిడకు దేవులపల్లి, శ్రీశ్రీ లాంటి వాళ్ళే కవులుగా తెలుసు. ఆరుద్ర పేరు, ఆయన కవిత్వం ఆ పత్రికలోనే ఆవిడకు పరిచయమయ్యారు. ఆయన కవిత్వం నచ్చింది. ఆయనా నచ్చారు. రామలక్ష్మి తన తొలి కథల సంపుటి ' విడదీసే రైలు బళ్ళు ' కు ముందుమాట రాయాల్సిందిగా ఆరుద్ర గారిని కోరారు. అమ్మాయి అడిగిందిగదాని అర్జెంటుగా రాసిచ్చేయలేదాయన. ఆర్నెల్లపాటు అడిగించుకుని మొహమాటం లేకుండా , పొగడ్తలు వగైరా లేకుండా సూటిగా తన అభిప్రాయాన్ని రాసిచ్చారు. అలా ఆ ' విడదీసిన రైలు బళ్ళు ' వాళ్ళని 1955 లో కలిపింది.
నిన్న ( 31 ఆగష్టు ) ఆరుద్రగారి జన్మదినం. ఆ సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ........



Vol. No. 02 Pub. No. 017
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం