Friday, August 6, 2010

ఆర్యుల ముఖ్య ఆహారం




మునిమాణిక్యం నరసింహారావు గారి పేరు తెలియని సాహితీ ప్రియులుండరేమో ! గిలిగింతలు పెట్టే ' కాంతం కథలు ' ఒక్కటి చాలు ఆయన్ని హాస్య రచయితగా తెలుగువారి మదిలో నిలపడానికి.

ఆయన మచిలీపట్టణం లోని హిందూ హైస్కూల్లో పనిచేశారు. అప్పట్లో ఆయనకో వింత అలవాటుండేది. తరచూ గోళ్ళు కొరుక్కునేవారు. పాఠం చెప్పే సమయంలో కూడా ఆ అలవాటు కొనసాగేది. 

ఓసారి ఆయన ' ఆర్యులు - నాగరికత ' పాఠం చెబుతున్నారు. ఆయన పాఠంతో బాటు గోళ్ళు కొరకడం కూడా సాగుతోంది. మధ్య మధ్యలో విద్యార్థుల్ని ప్రశ్నలడుగుతున్నారు.

" ఆర్యుల ముఖ్య ఆహారం ఏమిటి ? " అని ఒక విద్యార్థిని లేపి అడిగారు.
 
" గోధుమలు, సజ్జలు, వరి ....... " అని నసుగుతున్నాడు ఆ విద్యార్థి.  మునిమాణిక్యం గారు తన పని కానిస్తూనే ఆ విద్యార్థితో 

" ఇంకా... " అన్నారు.

" రాగులు, జొన్నలు....." అని ఆగాడు, మేస్టారు ఇంకా ఏం చెప్పారా అని ఆలోచిస్తూ. మాస్టారు అతన్ని మరింత ఉత్సాహపరచాలని

" ఇంకా.... ఇంకా ....." అంటూనే వున్నారు గోళ్ళు కొరుక్కునే కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే.

ఇంకా ఏమున్నాయా అని తీవ్రంగా ఆలోచిస్తున్న ఆ విద్యార్థి పరధ్యానంగా

" గోళ్ళు " అన్నాడు.

.................. అంతే !  మాస్టారితో బాటు పిల్లలంతా ఒకటే నవ్వులు.

Vol. No. 01 Pub. No. 365

2 comments:

భావన said...

:-)

SRRao said...

* భావన గారూ !
* సంతోష్ గారూ !

ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం