Monday, May 10, 2010

అచ్చు తప్పుకు ఆఠాణా

తెలుగు ప్రచురణ రంగానికి ఆద్యులు, తెలుగు భాషా వికాసానికి కృషి చేసిన మహానుభావుడు స్వర్గీయ వావిళ్ళ రామస్వామిశాస్త్రి గారు. అనేక ప్రాచీన గ్రంథాలను పరిష్కరించి, వాటిని ప్రచురించిన ఘనత ఆయనకే దక్కింది.  తెలుగులో వున్న వ్రాత ప్రతులను  ముద్రణా పద్ధతిని వుపయోగించి తమ ' ఆది సరస్వతీ ముద్రణాలయము ' ద్వారా ప్రచురించింది వావిళ్ళ వారే ! సి. పి. బ్రౌన్ పరిష్కరింపజేసిన ఎన్నో గ్రంథాలను ప్రచురించి వెలుగులోకి తీసుకొచ్చారు.

సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని రోజుల్లో ముద్రణా పద్ధతుల్లో కొత్త పుంతలు తొక్కి నాణ్యమైన గ్రంథాలను తెలుగువారికి అందించారు. వారి గ్రంథాలలో మచ్చుకైనా ఒక్క తప్పు కూడా కనబడేది కాదట. ముద్రణకు పూర్వమే అచ్చుతప్పులను సవరించడానికి ఉద్ధండులైన పండితుల్ని నియమించేవారు. వీరి లోపాలులేని ముద్రణ పైన ఆసక్తికరమైన కథనాలెన్నో ఉండేవి.  వాటిలో మచ్చుకి  ఒకటి.........

రామస్వామిశాస్త్రి గారు తన ముద్రణాలయం బయిట ముద్రణకు సిద్ధం చేసే ఫారాన్ని ప్రదర్శనకు పెట్టి
' మేము ప్రచురించిన గ్రంథములో అచ్చుతప్పులేరి చూపించిన వారికి ఒక దోషమునకు ఎనిమిది అణాలు చొప్పున  ఇస్తాం ! '
అని ప్రకటించేవారట.  తాను ప్రచురించిన గ్రంథాలపై ఆయనకు వున్న నమ్మకం అలాంటిది.

" వావిళ్ళవారి కృషి లేకున్న పక్షమున, వైదిక పురాణాది గ్రంథములు విస్మృతిలో నశించియుండును. కాలవాహినిలో అందరునూ కలిసిపోయి విస్మరింపబడినప్పటికీని, శ్రీ వావిళ్ళ వారి కృషి అమర ప్రాయము పొంది నిలువగలదు "
అని ప్రశంసించారు డా. కట్టమంచి రామలింగారెడ్డి గారు.

పిఠాపురం మహారాజావారు వావిళ్ళవారి గురించి
" సారస్వతవ సేవయే వారి ఆశయము. ఆంధ్రులకు జ్ఞాన దానము చేసినారు. ఆంధ్ర, తమిళ, కర్నాటక, సంస్కృత భాషలందు గ్రంథములు ప్రచురించి భాషా సేవా గావించుచూ ధన్యులై, విద్యావంతులై గుణగ్రహణ ప్రావీణులై యుండిరి "
అని ప్రస్తుతించారు.

తెలుగు గ్రంథ ప్రచురణకు మార్గదర్శకులైన స్వర్గీయ వావిళ్ళ రామస్వామిశాస్త్రి గారు 1891 వ సంవత్సరము మే నెలలో (  తేదీ లభ్యం కాలేదు ) దివంగతులైనారు. తెలుగు ప్రచురణకర్తలు వావిళ్ళవారిని స్మరించుకోవడం తమను తాము గౌరవించుకోవడమే ! వావిళ్ళ రామస్వామిశాస్త్రి గారికి సాహితీ నీరాజనాలు అర్పిస్తూ..........

వావిళ్ళ వారిపై గత టపాలు - పుస్తకానికి గజకేసరి యోగం , తెలుగు ముద్రణారంగ పితామహులు 

Vol. No. 01 Pub. No. 288

2 comments:

మాలతి said...

మంచి విషయం వెలుగులోకి తెచ్చారండీ. సంతోషంగా ఉంది నాకు. ఆరోజుల్లో శ్రద్ధ అలాటిది సాహిత్యపిపాసువులకు. నిజంగా పొద్దున్నే తలుచుకోవలసిన మహనీయులాయన.
మాలతి

SRRao said...

మాలతి గారూ !
ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం