Saturday, February 13, 2010

ముద్దుకృష్ణ ఓదార్పు

తెలుగు కవితాలోకంలో ' వైతాళికులు ' ఓ సంచలనం. ముద్దుకృష్ణ చేసిన ఈ కవితా సంకలనం గురించి తెలియని కవితాప్రియులుండరు. ఆయన 1934 ప్రాంతంలో ' జ్వాల ' అనే పత్రిక నడిపారు. అయితే ఆ పత్రిక దురదృష్టవశాత్తూ ఎక్కువకాలం నడవలేదు. కానీ అప్పట్లో ఓ ప్రముఖ పత్రికగా నిలిచింది.

ఓసారి ఆ పత్రికలో ఆప్పుడే వెలుగులోకి వస్తున్న ఒక కవిగారిని ఘాటుగా విమర్శిస్తూ ఒక వ్యాసం ప్రచురించారు. అంత ! ఆ కవిగారికి కోపం వచ్చింది. జ్వాల కార్యాలయానికి ఆవేశంగా వచ్చి ముద్దుకృష్ణ గారిని కలిసారు. ఆగ్రహం వ్యక్తం చేసారు. తన నిరసన తెలిపారు.

ముద్దుకృష్ణగారు ముద్దుగా నవ్వుతూ " అయ్యా ! మేమేదో ప్రచురించాం ! కానీ మా పత్రిక కొని చదివే వాళ్ళలో సగంమంది ఆ వ్యాసాన్ని చూడరు. చూసిన వాళ్ళలో సగంమంది చదవరు. చదివిన వాళ్ళలో సగంమందికి అందులోని విషయం అర్థం కాదు. అర్థమయిన వాళ్ళలో సగంమందికి తమరెవరో తెలియదు. మిమ్మల్ని తెలిసిన వాళ్ళలో సగంమంది ఎలాగూ ఆ వ్యాసాన్ని నమ్మరు. ఎవరైనా నమ్మితే.... ఆ నమ్మిన వారిలో సగంమందిని మనం లెఖ్ఖ చెయ్యనక్కర్లేదు. ఇక మిగిలేది ఈ చివరి సగంమంది. వాళ్ళవలన తమకేమీ నష్టం లేదు కనుక మీరేం ఖంగారు పడనక్కరలేదు, నిశ్చింతగా ఉండండి " అని ఓదార్చి పంపేశారట.   

Vol. No. 01 Pub. No. 195

3 comments:

Saahitya Abhimaani said...

మీరు ఛలోక్తులు చక్కగా సేకరించి మా అందరికి అంద చేస్తున్నారు. ధన్యవాదాలు.

Apparao said...

good one

SRRao said...

* శివ గారూ !
కృతజ్ఞతలు

* అప్పారావు శాస్త్రి గారూ !
ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం