Sunday, January 31, 2010

పౌరాణికాల స్క్రీన్ ప్లే ఎవరిది ?


మనదేశం లో చలన చిత్ర నిర్మాణం ప్రారంభమైన తొలినాళ్ళలో వచ్చిన చిత్రాలన్నీ పౌరాణికాలే ! ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు పౌరాణిక చిత్రాలు వస్తూనే ఉన్నాయి. అంతే కాదు మన సినిమా కథలన్నీ అటు తిరిగీ ఇటు తిరిగీ పౌరాణిక కథల చుట్టూనే తిరుగుతూ ఉంటాయనేది సత్య దూరం కాదేమో ! అయితే ఈ కథలను ఎవరు రాసారు ? కథనాలను..... అదే ! స్క్రీన్ ప్లే లను ఎవరు రూపొందించారు ? ఈ విషయాన్ని ప్రముఖ రచయిత పింగళి నాగేంద్రరావు గారి మాటల్లో ......


" పురాణ కథలు కొందరు తీస్తూ దానికి స్క్రీన్ ప్లే ఫలానావారు రాసారని టైటిల్స్ లో వేస్తుంటారు. ఇది ఏం సబబు ? ఆ కథలు వాళ్ళ సృష్టా ? అసలు ' రామాయణం ' లోని ఏ భాగమైనా తీసుకోండి. స్క్రీన్ ప్లే అందులోనే వాల్మీకి మహాముని రాసారు. ఉదాహరణకు రామకథను గానం చెయ్యడానికి వచ్చిన లవకుశులు తన కుమారులని శ్రీరామునికి తెలియదు. ఆ బాలురకు ఆ శ్రీరాముడే తమ తండ్రిగారని తెలియదు. ఎంత డ్రామా ! మహాభారతం తీసుకోండి. కలర్ లోనే స్క్రీన్ ప్లే ఉంది. ఎలాగంటే రణరంగం లో కొన్నివేల శ్వేత అశ్వాలు, వాటి పక్కన కొన్నివేల నల్లగుర్రాలు, ఎదుట కొన్నివేల గోధుమ వన్నె తురంగాలు ఉన్నాయని నేత్ర పర్వమొనర్చేలా రాయబడి ఉంది చూసారా ! " అంటారు పింగళి గారు.

పురాణాల మీద పేటెంట్, కాపీ రైట్ హక్కులు ఎవరికీ లేకపోవడమే ఇలా యధేచ్చగా తమ పేర్లు వేసుకోవడానికి కారణమై ఉండొచ్చు.

Vol. No. 01 Pub. No. 176

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం