Friday, December 31, 2010

కళా వాచస్పతి

 తెలుగు నాట గంభీర స్వరం అనగానే చటుక్కున గుర్తుకొచ్చే వ్యక్తి జగ్గయ్య
వాచికంలో స్పష్టత, పదాల విరుపులో భావుకత కలబోసిన కంఠం జగ్గయ్య
ఒకవైపు గంభీరమైన నటనతో తెలుగు చలన చిత్ర రంగాన్ని
మరోవైపు రచనతో సాహితీ రంగాన్ని సుసంపన్నం చేసిన కృషీవలుడు జగ్గయ్య

1928 లో గుంటూరు జిల్లా తెనాలి తాలూకా మోరంపూడి గ్రామంలో సంపన్న కుటుంబంలో జన్మించారు జగ్గయ్య. ఆయన తండ్రి సంస్కృతాంధ్రాల్లో పండితుడు. సంగీత విద్వాంసుడు. కళల మీద ముఖ్యంగా నటనంటే ఆయనకు ఆసక్తి ఎక్కువ. అందుకే తెనాలిలో ' శ్రీకృష్ణ సౌందర్య భవనం ' అనే పేరుతో ఒక ప్రదర్శనశాల నిర్మించారు. ఆయనది కూడా గంభీరమైన స్వరమే ! ఆ వారసత్వమే జగ్గయ్యకు వచ్చింది.

జగ్గయ్య దుగ్గిరాలలోని బోర్డు హైస్కూల్లో చదివారు. ఆయన పదకొండవయేటే పద్యాలు రాయడం ప్రారంభించారు. హైస్కూలు లో చదువుతున్న రోజుల్లోనే గాంధీ గారి బోధనలకు ప్రభావితులై హరిజనవాడలకు వెళ్ళి పాఠాలు చెప్పడం, మద్యపాన నిషేధ ఆవశ్యకతను తెలియజెప్పడం లాంటివి చేసేవారు. స్వాతంత్ర్యోద్యమాల్లో కూడా పాల్గొన్నారు.

ఆంధ్రదేశంలో గ్రంథాలయోద్యమం విస్తరించడానికి మూలకారకులైన గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు, పాతూరి నాగభూషణం గారి పిలుపుతో దుగ్గిరాలలో మిత్రులందరినీ కలుపుకుని వారి దగ్గరున్న గ్రంథాలను పోగుచేసి జగ్గయ్య ఓ గ్రంథాలయాన్ని స్థాపించారు.   

గుంటూరు ఆంద్ర క్రిస్టియన్ కళాశాలలో చదివేటపుడు విద్యార్థి ఉద్యమాలతోటి, నాటకరంగం తోటి అనుబంధం ఏర్పడింది. ప్రజానాట్య మండలి నాటకాల్లో కూడా పాల్గొన్నారు. అక్కడే నందమూరి తారక రామారావు గారు జగ్గయ్య గారికి సహాధ్యాయి. ఇద్దరూ కలసి అనేక నాటకాలు ప్రదర్శించారు. 1946 లో విజయవాడ నాటక కళా పరిషత్తు పోటీల్లో రామారావు గారితో కలసి ప్రదర్శించిన ' చేసిన పాపం ' నాటికకు ఉత్తమ ప్రదర్శన బహుమతినందుకున్నారు. ప్రజానాట్య మండలి తరఫున ప్రదర్శించిన ' తెలంగాణా ఘోష ' నాటకంలో జగ్గయ్య ధరించిన వృద్ధుడి పాత్రకు ఉత్తమ నటన బహుమతి లభించింది. డిగ్రీ పూర్తయ్యాక ఎన్టీయార్ తో కలసి నేషనల్ ఆర్ట్ థియేటర్స్ సంస్థలో నాటకాలు ప్రదర్శించారు.

గుంటూరులో చదువుతున్న కాలంలోనే నవ్య సాహిత్య పరిషత్ లో సభ్యత్వం కలిగి ఉండేవారు. తర్వాత విజయవాడలో అభ్యుదయ రచయితల సంఘం ఆవిర్భవించాక అందులో చేరారు. ప్రముఖ చిత్రకారులు అడవి బాపిరాజు గారి దగ్గర మూడేళ్ళు చిత్రలేఖనం నేర్చుకున్నారు. కొంతమంది మిత్రుల సహకారంతో ' శోభ ' అనే లిఖిత పత్రికను నడిపారు.

1941 లో బి. ఏ. పూర్తయ్యాక దుగ్గిరాల బోర్డు హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా చేరి ఇంగ్లీష్, చరిత్ర బోధించారు.

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ' శాక్రిఫైస్ ' అనే నాటకాన్ని ' బలిదానం ' అనే పేరుతో అనువదించారు. అప్పటివరకూ చిన్న చిన్న నాట్య ప్రదర్శనలకే పరిమితమైన సావిత్రి ని ( మహానటి సావిత్రే ! ) అపర్ణ అనే చిన్నపిల్ల పాత్రలో నాటకరంగానికి పరిచయం చేశారు.

దుగ్గిరాలలో వున్నపుడు ప్రదర్శించిన ' ఖిల్జీ రాజ్య పతనం ' నాటకం ద్వారా జమునను రంగస్థలానికి పరిచయం చేసారు.

తర్వాత డిల్లీ ఆకాశవాణి కేంద్రంలో అనౌన్సర్ గా, న్యూస్ రీడర్ గా మూడు సంవత్సరాలు పనిచేసారు. ఆ సమయంలోనే ఆకాశవాణి విదేశీ విభాగంలో యూరోపియన్ శ్రోతల కోసం తెలుగు సాహిత్యం మీద ఆంగ్లంలో ప్రసంగాలు చేసారు.

త్రిపురనేని గోపీచంద్ ' పేరంటాలు ' చిత్రంకోసం తొలిసారిగా జగ్గయ్య గారికి మేకప్ టెస్ట్ జరిగింది. అయితే పాత్రకు తగ్గ విగ్రహం లేదని అవకాశం మాత్రం రాలేదు. తర్వాత గోపిచంద్ గారిదే ' ప్రియురాలు ' చిత్రంలో కథానాయకుడుగా చిత్రరంగ ప్రవేశం చేశారు. అప్పుడే ఉద్యోగానికి రాజీనామా కూడా చేసారు. అయితే ' ప్రియురాలు ' చిత్రం ఫ్లాప్ అయింది. రెండవచిత్రం కూడా గోపీచంద్ గారి ' పాలేరు '. ఆ చిత్రం విడుదల కాలేదు. తర్వాత చిత్రం ' ఆదర్శం ' కూడా పరాజయం పాలయ్యింది. హెచ్. యం. రెడ్డి గారి లాంటి ఉద్దండుడి చిత్రం ' పేదల ఆస్తి ' లో కథానాయకునిగా వేస్తే అది కూడా ఫ్లాపే ! ఇలా వరుసగా వచ్చిన అవకాశాలన్నీ ఆయనకు, నిర్మాతలకు కలసిరాలేదు.

వాహిని పిక్చర్స్ వారి ' బంగారు పాప ' లో ఎస్వీ రంగారావు గారిది ఒక ముఖ్య పాత్ర. ఆ పాత్రతో ఇంచుమించుగా సమానమైన పాత్ర జగ్గయ్య గారిది. తర్వాత ' అర్థాంగి ' చిత్రంలో అక్కినేని గారి సోదరుని పాత్ర చేసారు. ఈ రెండు చిత్రాలు ఘన విజయం సాధించడంతో జగ్గయ్య గారికి ఇంక ఎదురులేక పోయింది. సుమారు 500 వందల సినిమాల్లో నటిస్తే అందులో సుమారు 125 సినిమాల్లో హీరో గా చేసారు.

గాంధీ గారి సహాయనిరాకరణ ఉద్యమం నేపథ్యంగా ' పదండి ముందుకు ' చిత్రాన్ని స్వంతంగా నిర్మించారు. తెలుగులో వచ్చిన తొలి రాజకీయ చిత్రం ' పదండి ముందుకు '. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా యాభైవేల రూపాయిల సబ్సిడీని ఇచ్చిన తొలి చిత్రం కూడా అదే ! తాష్కెంట్ చలన చిత్రోత్సవంలో పాల్గొంది. హీరో కృష్ణ ఈ చిత్రంలో చిన్న వేషం వేశారు.

తర్వాత తాను నిర్మించిన ' శభాష్ పాపన్న ' చిత్రం ద్వారా నటుడు శ్రీధర్ ని పరిచయం చేసారు జగ్గయ్య.

తన గంభీరమైన స్వరాన్ని తొలిసారిగా ' మనోహర ' చిత్రంలో శివాజీ గణేషన్ కి అరువిచ్చారు జగ్గయ్య. అక్కడినుంచి శివాజీ అనువాద చిత్రాలన్నిటికీ జగ్గయ్యగారే డబ్బింగ్ చెప్పారు. శివాజీ గారి ఆంగికానికి, జగ్గయ్య గారి వాచికానికి అవినాభావ సంబంధం ఏర్పడిపోయింది.

జగ్గయ్య గారు హైస్కూల్ చదువులో వున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో సోషలిస్ట్ విభాగం ఉండేది. దానిలో చేరడం ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1962 లో తెనాలి పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికైనా ఆచార్య ఎన్. జి. రంగ పోటీలో వుండడం, ఆయనలాంటి నిస్వార్థ ప్రజా సేవకుడు పార్లమెంట్ కి రావాలని కోరుకున్న అప్పటి ప్రధాని పండిట్ నెహ్రు గారి అభ్యర్ధన మేరకు జగ్గయ్య పోటీనుంచి విరమించుకున్నారు. 1967 లో ఒంగోలు స్థానం నుంచి పార్లమెంట్ కి ఎంపికయ్యారు. అయితే తనకు రాజకీయాలు సరిపడవని గ్రహించిన జగ్గయ్య 1972 లో రాజకీయాలనుంచి వైదొలిగారు.  

జగ్గయ్య గారి రచనల్లో చెప్పుకోదగ్గది  ' రవీంద్ర గీత '. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన 137 కవితలను పద్యకావ్యంగా తెలుగులోనికి అనువదించారు. దేశ, విదేశాల రాజకీయ పరిణామాలు, ముఖ్యమైన ఘట్టాలు, జాతీయ, అంతర్జాతీయ రాజకీయ నాయకుల జీవిత చరిత్రలు ప్రధానాంశంగా జగ్గయ్యగారు రచించిన ' రాజకీయ విజ్ఞాన కోశం ' అనే గ్రంథం అముద్రితంగా వుంది.

మనస్విని ట్రస్ట్ అనే పేరుతో ఒక సంస్థను స్థాపించి ప్రతీ ఏటా మంచి పాట రాసిన ఓ రచయితకు మనసు కవి ఆచార్య ఆత్రేయ గారి పేరు మీద పురస్కారం అందజేసేవారు జగ్గయ్య. 

తెలుగు చలనచిత్ర చరిత్రలో తనకంటూ ఒక పేజీని ఏర్పాటు చేసుకున్న నటుడు జగ్గయ్య.

 జగ్గయ్య గారి జన్మదినం సందర్భంగా ఆయనకు కళా నీరాజనం సమర్పిస్తూ......................

   


Vol. No. 02 Pub. No. 104

Thursday, December 30, 2010

నా ' త్యా ' గయ్య

నాకు ఊహ తెలిసాక, సంగీతాన్ని ఆస్వాదించడం ప్రారంభించినప్పట్నుంచీ త్యాగరాజు గారి గురించి, ఆయన కీర్తనల గురించి తెలిసినా ఆయన రూపాన్ని ఊహించుకోవడానికి మాత్రం ఎక్కడో ఎవరో గీసిన రేఖా చిత్రం మాత్రమే ఆధారం. అయితే చిన్నతనంలో చూసిన ' త్యాగయ్య ' చిత్రం పూర్తిగా గుర్తులేకపోయినా అందులో నాగయ్య గారి రూపమే త్యాగయ్యగా గుర్తుండిపోయింది. త్యాగరాజు గారి రేఖాచిత్రాలు ఎన్ని చూసినా, ఆఖరికి వాస్తవానికి దగ్గరగా ఉందనే రేఖా చిత్రాన్ని చూసినా అందులో కూడా నాగయ్య గారి పోలికలే కనిపిస్తాయి. దానికి నాగయ్య గారు త్యాగయ్యగా పరకాయ ప్రవేశం చేసారా ? లేక త్యాగయ్యే నాగయ్య గారిని ఆవహించారా ? తెలీదు గానీ నాకు మాత్రం త్యాగయ్య అంటే నాగయ్య గారే అని స్థిరపడిపోయింది. 

1938 లో ' గృహలక్ష్మి ' చిత్రంలో జాతీయ నాయకుడి పాత్రతో చిత్ర రంగ ప్రవేశం చేసిన నాగయ్య గారు రెండవచిత్రం ' వందేమాతరం ' చిత్రంతో హీరోగా మారారు. అయితే 1940 లో మూడవ చిత్రం ' సుమంగళి ' తో కందుకూరి వీరేశలింగం గారిని పోలిన వృద్ధ సంఘ సంస్కర్త పాత్ర పోషించడం ఒక సాహసం. మరో సాహసం 1942 లో ఆయన పోషించిన ' భక్త పోతన ' పాత్ర. తెలుగు, తమిళ ప్రేక్షకులలో ఎందరినో నాగయ్య గారికి భక్తులను చేసింది. ప్రముఖ ధ్వన్యనుకరణ సామ్రాట్ నేరెళ్ళ వేణుమాధవ్ గారు ఈ విషయానికి సంబంధించి ఓ సంఘటనలో వివరించారు......
ఐక్యరాజ్య సమితిలో వేణుమాధవ్ గారి మిమిక్రీ విశేషాలు తెలుసుకున్న డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు నాగయ్య గారి ద్వారా ఆయన్ని పిలిపించుకున్నారు. వారింటికి వెళ్ళాక పి. ఏ. ద్వారా రాధాకృష్ణన్ గారికి సమాచారం పంపితే ఆయనే స్వయంగా అక్కడికి వచ్చి లోపలి తీసుకెళ్ళారట. వేణుమాధవ్ గారు రాధాకృష్ణన్ గారికి పూలమాల వేసి పండ్లు చేతికిస్తూ ' మీ దర్శనం చేసుకోవడానికి వచ్చాను ' అనగానే రాధాకృష్ణన్ గారు నాగయ్య గారి చేతులు పట్టుకుని కళ్ళకద్దుకుని ' నా దర్శనం చేసుకుంటే ఏముంది. నాగయ్య గారి దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుంది ' అన్నారంటే నాగయ్య గారిలోని కళాకారుడు ఎంతటి ఉన్నత శిఖరాలకు చేరాడో ఊహించుకోవచ్చు.

1943 లో నాగయ్య గారు నిర్మాతగా మారి పి. పుల్లయ్య గారి దర్శకత్వంలో ' భాగ్యలక్ష్మి ' చిత్రం నిర్మించారు. ఆ తర్వాత ఆయన నటించిన ' స్వర్గసీమ ' 1945 లో ఘన విజయం సాధించింది. 1946 లో ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన  ' త్యాగయ్య ' న భూతో న భవిష్యతి. త్యాగయ్య గా ఆయనందుకున్నన్ని సన్మానాలు, గౌరవాలు మరే ఇతర నటుడుకూడా అందుకుని ఉండడు. ఆ విశేషాలు ఇక్కడ చదవండి.

న భూతో న భవిష్యతి ' నాగయ్య '


http://sirakadambam.blogspot.com/2009/11/blog-post_05.html

1947 లో వాహిని వారి ' యోగి వేమన ' చిత్రంలో ఆయన నటన మరువరానిది. ' ఫిలిం ఇండియా ' పత్రిక సంపాదకుడు బాబురావు పటేల్ నాగయ్య గారిని భారత దేశపు పాల్ ముని అని వర్ణించాడు.

1950 లో వచ్చిన ' బీదల పాట్లు ' చిత్రంతో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా రికార్డు సృష్టించినా చేతికి ఎముక లేకుండా చేసిన దానాల వలన చివరి దశలో ఆయనే పాట్లు పడాల్సి వచ్చింది. ఆయన స్వంత సంస్థ ' రేణుక ఫిల్మ్స్ ' కార్యాలయం ఎప్పుడూ కళకళలాడుతూ ఒక సత్రం లాగ ఉండేది. ఆ విశేషాలు ఇక్కడ చదవండి.

సంగీతమయం సమస్తం

http://sirakadambam.blogspot.com/2010/06/blog-post_07.html

తెలుగు సినిమాకి భావయుక్తంగా పాట ఎలా పాడాలో, పద్యం ఎలా చదవాలో నేర్పిన మహాభావుడు నాగయ్య.

తాను పోషించిన పాత్ర ' పోతన ' లాగే తనకంటూ ఏమీ మిగుల్చుకోలేకపోయిన ధర్మాత్ముడు నాగయ్య.

సినిమావాళ్ళంటే జులాయిలు, వ్యభిచారులు అనే అపప్రధను పోగొట్టి గౌరవాన్ని తెచ్చిపెట్టిన నటుడు నాగయ్య.

1965 లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ బిరుదు పొందిన తొలి తెలుగు సినిమా నటుడు నాగయ్య.

' నా యిల్లు ' చిత్రం తర్వాత నిర్మించిన ' భక్త రామదాసు ' ఆయన్ని ఆర్థికంగా మరింత కృంగదీసింది. అనేక కష్టాలకు ఓర్చి నిర్మాణం పూర్తి చేసి విడుదల చేసినా ఆర్థికంగా విజయవంతం కాకపోవడం ఆయన్ని మరిన్ని కష్టాలలోకి నెట్టింది. అందుకే ఆయన తన అనుభవాలను వివరిస్తూ .........
" నా జీవితం ఇంకొకరికి గుణపాఠం. నేను నేర్చుకున్న నీతిని అందరికీ వెల్లడిస్తూ నేర్చుకోమని విన్నవిస్తున్నాను. దానధర్మాలు చెయ్యండి. తనకు మాలిన ధర్మాలు చేయకండి. అందరినీ నమ్మకండి. అందరూ మంచివాళ్ళే అనుకోవడం పెద్ద పొరబాటు. మేకవన్నె పులులేవరో తెలుసుకుని వాళ్ళని వేరు చేయండి. మీ మంచితనాన్ని, సహృదయతను వినియోగించుకునే వాళ్ళని గమనించి ప్రవర్తించండి. పేరు ప్రఖ్యాతులు, అఖండ గౌరవాలు  పొందినా నాలాంటి దుర్దశ ఇంకొకరికి రాకూడదు "
అంటారు నాగయ్య.

మొదట భోగిగా, తర్వాత యోగిగా మారిన వేమన అంతిమయాత్ర జరుగుతోంది. తొలుత మిత్రుడు, తర్వాత శిష్యుడిగా మారిన అభిరాముడు దుఃఖంతో గానం చేస్తుండగా వేమన తనువు చాలించాడు. ' యోగి వేమన ' చిత్రంలో ఈ ఘట్టం చిత్రీకరణ పూర్తయింది. ఆ ఘట్టంలో అభిరాముడి పాత్రధారి లింగమూర్తి కూడా నాగయ్య గారికి ప్రియ మిత్రుడు. మేకప్ తీసేసాక ఆయనతో నాగయ్య గారు " బావా ! ఇలాగే మనిద్దరిలో ఎవరు ముందుగా కాల్ షీట్ పూర్తి చేసుకుని ఈ లోకం నుంచి నిష్క్రమించడానికి సిద్ధమవుతారో... వారి చెవిలో రెండవవారు నారాయణ మంత్రం చెబుతూ వీడ్కోలు పలకాలి. అలా అని నాకు మాటియ్యి " అని లింగమూర్తి గారి చేత చేతిలో చెయ్యి వేయించుకున్నారట.
1973 డిసెంబర్ 30 వ తేదీన లింగమూర్తి గారికి ఆమాట నిలబెట్టుకునే అవకాశం వచ్చింది. మద్రాస్ ' వాలంటరీ హెల్త్ సర్వీసెస్ ' ఆస్పత్రిలో నాగయ్య గారి చివరి ఘడియల్లో ఆ వార్డులో భజన జరుగుతుండగా లింగమూర్తి గారు నాగయ్య గారి చెవిలో నారాయణ మంత్రం జపించారు. ఆస్పత్రి వర్గాలు గానీ, అక్కడి రోగులు గానీ ఆ భజనకు ఆడ్డు చెప్పలేదు సరికదా వారు కూడా పాల్గోన్నారట.
దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.... నాగయ్య గారి మీద ప్రజలకు వున్న పూజ్య భావాన్ని. తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా దానధర్మాలు చేసినా తెలుగు, తమిళ ప్రజల మనస్సులో మాత్రం మహోన్నతమైన స్థానాన్ని మిగుల్చుకున్న మహానటుడు నాగయ్య గారు.

 ఈరోజు నాగయ్య గారి వర్థంతి సందర్భంగా ఆయనకు కళా  నీరాజనాలర్పిస్తూ...........
  



నాగయ్య గారి గురించి గతంలో రాసిన టపాలు ఈ క్రింది లింకుల్లో...........

http://sirakadambam.blogspot.com/2009/12/blog-post_30.html         

http://sirakadambam.blogspot.com/2010/03/blog-post_29.html

Vol. No. 02 Pub. No. 103

Wednesday, December 29, 2010

మాటల బ్రహ్మ

" డింగరి "
" డింభకా " 
" తప్పు తప్పు "
" లాహిరి లాహిరి "
" తసమదీయులు "
" గింబళి "
" హలా "
............. ఈ కొత్త కొత్త మాటలు ఎవరు పుట్టించారు ?

" ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడతాయి ? వెయ్యండి వీడికో వీరతాడు " అంటాడు మాయాబజార్ ఘటోత్కచుడు గురువు చిన్నమయ్యతో.

............ అలా ఎన్నో కొత్త మాటలు పుట్టించిన వారు, ఉన్న మాటలకు కొత్త ప్రయోగాలు నేర్పిన వారు పింగళి నాగేంద్రరావు గారు.

ఆయన రచనల్లో నాటకీయత వెనుక నాటక రచనానుభావం వుంది. బెంగాలీ నుంచి అనువదించిన ' మేవాడ్ రాజ్య పతనం ' , ' పాషాణి '  నాటకాలతో బాటు ఆయన స్వంత రచనలు ' జేబున్నీసా ', ' వింధ్యరాణి ', ' నా రాజు ' వగైరా నాటకాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. ఇందులో ' వింధ్యరాణి ' ఆయన చలనచిత్ర రంగానికి రావడానికి కారణమైంది. ప్రముఖ రంగస్థల నటులు డి. వి. సుబ్బారావు గారి ఇండియన్ డ్రమటిక్ కంపెనీలో పనిచేసిన అనుభవం పింగళి గారిది. అందుకే ఆయన రచన చేసిన చిత్రాల్లో కథలో డ్రామా వుంటుంది గానీ సన్నివేశాల్లో ప్రత్యక్షంగా వుండదు. అవి సహజంగా కనిపిస్తూనే డ్రామా అంతర్లీనంగా వుంటుంది.

ఇక పాటల గురించి విశ్లేషించ పూనుకోవడం సాహసమే అవుతుంది. ఎందుకంటే ఆంధ్ర దేశంలో పింగళి వారి సాహిత్యాన్ని తెలియని వారు, ఆస్వాదించని వారు దాదాపుగా లేరు. అందుకని కొత్తగా చెప్పవలసింది ఏమీ వుండదు. వారి మాటల కూర్పు, పదాల సౌందర్యం, సాహితీ సౌరభం మరోసారి విని, తల్చుకుని ఆనందించడం తప్ప ప్రత్యేకంగా విశ్లేషించడం అనవసరం. కనుక ఒకసారి విహంగ వీక్షణం చేసి వీనుల విందు చేసుకుందాం.



 మాటల బ్రహ్మ పింగళి నాగేంద్రరావు గారి జన్మదినం సందర్భంగా స్మృత్యంజలి 

Vol. No. 02 Pub. No. 102

Tuesday, December 28, 2010

ధ్వన్యనుకరణ చక్రవర్తి

" చతుషష్టి కళల్లో స్వర వంచన లేదా అనుకరణ కూడా ఒకటి. మన పురాణాల్లో ఇదొక ముఖ్యమైన అంశంగా కనిపిస్తుంది. మహాభారతంలోని కీచక వధ ఘట్టంలో కీచకుణ్ణి తప్పుదారి పట్టించడానికి భీముడు సైరంధ్రి ( ద్రౌపది ) గొంతుతో మాట్లాడుతాడు. రామాయణంలో అహల్య శాపం ఘట్టంలో గౌతమ మహర్షిని వంచించడానికి ఇంద్రుడు కోడిలాగ కూస్తాడు. మాయలేడి రూపంలో మారీచుడు సీతను నమ్మించడానికి రాముడి గొంతుతో 'హా లక్ష్మణా' అని అరుస్తాడు " అని మిమిక్రీ పుట్టుపూర్వోత్తరాల గురించి వివరిస్తారు ధ్వన్యనుకరణ చక్రవర్తి పద్మశ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ గారు.

" సంగీతానికి, నృత్యానికి, చిత్రలేఖనానికి, నటనకు ఇలా అన్నిటికీ పాఠ్యప్రణాళికలున్నాయి.... ఒక్క అనుకరణ కళకు తప్ప. ఆ కళకు వేణుమాధవ్ గారే సిసలైన సిలబస్ " అని కితాబిచ్చారు ప్రముఖ నటులు స్వర్గీయ చిత్తూరు వి. నాగయ్య గారు.

" మిమిక్రీ అనేది చాలా క్లిష్టమైన కళ. దాన్ని మీరు ప్రతిభావంతంగా సొంతం చేసుకున్నారు " అని వేణుమాధవ్ గారిని ప్రశంసించారు అప్పటి రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్.  

 అనుకరణ అనేది అనుకున్నంత సులువు కాదు. ఎదుటివారి హావభావాలను పరిశీలించాలి  వాచికాన్ని పట్టుకోవాలి. తర్వాత కఠోర సాధన చెయ్యాలి.
ఒక సంగీత కళాకారుడు కార్యక్రమం చెయ్యాలంటే తనకో వాయిద్యమో లేక ప్రక్క వాయిద్యాల తోడ్పాటో అవసరం. ఒక నృత్య కళాకారునికి ఆహార్యం, గాయకులూ, వాయిద్యాలు ఇవన్నీ అవసరం. కానీ మిమిక్రీ చెయ్యడానికి కళాకారుడికి ఏవిధమైన సాధనాలు అవసరం లేదు. అతని స్వరమే అతని సాధనం. అతని నటనే అతని వాయిద్యం. తన స్వరంతో అతను ప్రేక్షక శ్రోతల్ని ఆయా సన్నివేశాలను అతని కళ్ళెదుట సాక్షాత్కరింపజేస్తాడు. ఇప్పుడు టాకింగ్ డాల్ లాంటి బొమ్మల్ని, ఇతర సాధనాలని వాడుతున్నా అతని స్వరానికే ప్రాముఖ్యత ఎక్కువ.

మిమిక్రీ కళకు చక్రవర్తి పద్మశ్రీ నేరెళ్ళ వేణుమాధవ్
మిమిక్రీ కళా తపస్వి పద్మశ్రీ నేరెళ్ళ వేణుమాదవ్ గారు
ఆంధ్రదేశంలో అనేకమంది మిమిక్రీ నేర్చుకోవడానికి స్పూర్తి ప్రదాత వేణుమాధవ్ గారు
ఎదుటి వాళ్ళను ఎగతాళి చేసేందుకు కాకుండా అనుకరణ ఆనందపరిచే కళగా ఎదిగేందుకు కృషి చేసిన మహానుభావుడు నేరెళ్ళ వేణుమాధవ్ గారు.

ఆయన మిమిక్రీలో అనుకరణ మాత్రమే కాక ఏకపాత్రాభినయం, బహుపాత్రాభినయం, ధ్వన్యనుకరణ మిళితమై వుంటాయి. ఇంకా చెప్పాలంటే రంగస్థలం మీద ఉండేది ఆయనొక్కరే ! ఆయన ఆహార్యం సామాన్యమైనదే ! అక్కడ రంగాలంకరణలు, వస్తు సామగ్రి వగైరాలేవీ వుండవు. కానీ  పాండవోద్యోగ విజయాలు, కన్యాశుల్కం, విప్రనారాయణ, ప్రహ్లాద నాటకాల్లోని ఘట్టాలు, మెకన్నాస్ గోల్డ్, టెన్ కమాండ్మెంట్స్, హామ్లెట్, మాక్బెత్, జూలియస్ సీజర్, బెన్ హర్ లాంటి ఆంగ్ల చిత్రాల్లోని సన్నివేశాలు నేపథ్య సంగీతం, సౌండ్ ఎఫ్ఫెక్ట్స్ తో సహా తన స్వరంతో వినిపించి శ్రోతల్ని కాసేపు ప్రేక్షకులుగా మార్చేస్తారు.

ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లోననుకుంటాను.... ఆయన కార్యక్రమం చూడటం జరిగింది. ఆ కాసేపు ఏదో లోకంలో విహరింపజేశారు. ఆయన సృష్టించే శబ్దాలు, సన్నివేశాలు అప్పట్లో మమ్మల్ని ఆశ్చర్య చకితుల్ని చేసాయి. తర్వాత 1975 లో హైదరాబాద్ లో జరిగిన ప్రపంచ ప్రథమ తెలుగు మహాసభలలో అప్పుడప్పుడు వచ్చి ఆయన తన మిమిక్రీతో అలరిస్తూ ఉండేవారు. అప్పుడు ఆ మహాసభలకు ప్రతినిధిగా హాజరైన నాకు ఆయన మిమిక్రీని ఎక్కువసార్లు ఆస్వాదించే భాగ్యం కలిగింది.  

నేరెళ్ళ వేణుమాధవ్ గారి పేరు మిమిక్రీకి పర్యాయపదంగా మారిందంటే అతిశయోక్తి కాదు. ఆయన స్పూర్తితో ఎంతోమంది మిమిక్రీ కళాకారులు ఆంధ్రదేశంలో ఉద్భవించారు.  ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఆయనది. నిగర్వి. చాలాకాలం తర్వాత 2002 సంవత్సరంలోననుకుంటాను. రవీంద్రభారతి ఆవరణలో వున్న సాంస్కృతిక మండలి కార్యాలయానికి వెళ్ళిన నాకు ఆయన తారసపడ్డారు. అప్పటి సాంస్కృతిక మండలి కార్యదర్శి శ్రీ గోటేటి రామచంద్రరావు గారు వేణుమాధవ్ గారిని పరిచయం చేశారు. అప్పటికే పద్మశ్రీనందుకున్న అంత పెద్ద కళాకారుడు ఏమాత్రం భేషజం లేకుండా హాయిగా చాలా విషయాలు మాట్లాడారు. అందుకే అంటారు  ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందని.... అన్నీ ఉన్న ఆకు అణిగే ఉంటుందని. ఏమీ లేని ఆకులతో అప్పటికే కొన్ని అనుభవాలు వుండడం వలన ఈ సామెతలోని నిజం నాకప్పుడు బాగా అర్థమైంది.

ఐక్యరాజ్య సమితిలో మిమిక్రీ ప్రదర్శన ఇవ్వడానికి ఆహ్వానించబడ్డ ఏకైక భారతీయ కళాకారుడు వేణుమాధవ్ గారు. అక్కడ షేక్స్పియర్ ' హామ్లెట్ ' నాటకంలోని అంశాలతో బాటు ' ఒథెల్లో ' లోని సన్నివేశాలను ప్రదర్శించిన తీరు అందరి ప్రశంసలు పొందింది. ఆయన కీర్తి కిరీటంలో అదొక కలికి తురాయి. అలాగే ముంబై లో జరిగిన హరింద్రనాథ్ చటోపాధ్యాయ జన్మదిన సంబరాల్లో ఆయన ప్రదర్శించిన 45 నిముషాల పాటు సాగిన ' ఆంగ్ల భాషా ఉచ్చారణ ' కార్యక్రమం నభూతో నభవిష్యతి. వివిధ దేశాలు, ప్రాంతాలలోని ప్రజలు ఆంగ్లాన్ని ఉచ్చరించే తీరు ఆయన తన మిమిక్రీలో పలికించడం వర్ణనాతీతం.

వి. వి. గిరి గారు రాష్ట్రపతిగా వున్న రోజుల్లో రాష్ట్రపతి భవన్ లో శ్రీమతి సరస్వతీ గిరి రాసిన పద్యాలను కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి స్వరంతో చదివి వినిపించగా అక్కడ జరిగిన ప్రత్యేక సన్మానం ఆయన ప్రతిభకు నిదర్శనం. అంతకంటే చెప్పుకోదగింది వేణుమాధవ్ గారి కళానైపుణ్యానికి ముగ్ధులైన కవిసామ్రాట్ తన ' శివార్పణం ' కావ్యాన్ని ఆయనకు అంకితం ఇవ్వడం. ఇలాంటి గౌరవాలెన్నో ఆయన అందుకున్నారు. దేశ విదేశాలలో ఎన్నో ప్రతిష్టాకరమైన ప్రదర్శనలిచ్చారు. అవన్నీ చెప్పాలంటే పెద్ద గ్రంథమే అవుతుంది.

మీ సమయంలో ఒక సెకను కూడా వేణుమాధవ్ గారికి ఇవ్వకండి. ఇచ్చారో మరుక్షణం ఆయన మిమ్మల్ని అనుకరించేస్తారు..... ఇదీ వేణుమాధవ్ గారంటే ఆయన అభిమానులకు... అభిమానంతో కూడిన భయం.

మిమిక్రీ కళలో వేణుమాధవ్ గారు చేసినన్ని ప్రయోగాలు ఎవరూ చెయ్యలేదు. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్న శిష్యులలో అగ్రగణ్యుడు మిమిక్రీ శ్రీనివాస్. ప్రముఖ మిమిక్రీ కళాకారుడు హరికిషన్ కూడా వేణుమాధవ్ గారి శిష్యుడే ! ఇలాంటి అద్భుతమైన శిష్యులనెందరినో తయారు చేసి వేణుమాధవ్ గారు మిమిక్రీ కళను సుసంపన్నం చేసారు. 

పద్దెనిమిది సంవత్సరాలు ఉపాధ్యాయునిగా పనిచేసిన వేణుమాధవ్ గారు పి. వి. నరసింహారావు గారి ప్రభుత్వంలో విధానమండలి సభ్యునిగా కూడా పనిచేశారు. 1932 వ సంవత్సరంలో డిసెంబర్ 28 వ తేదీన జన్మించిన వేణుమాధవ్ గారు 78 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఆయన జన్మదినం మిమిక్రీ కళాకారులందరికీ పండుగ. ఈరోజు వారందరూ ఆయన స్వస్థలమైన వరంగల్ చేరుతారు. అక్కడ జరిగే ఉత్సవంలో వేణుమాధవ్ గారు ప్రతీ సంవత్సరం ఒక కళాకారుణ్ణి సన్మానించి, జ్ఞాపికను బహుకరించడం ఆనవాయితీ.

 ధ్వన్యనుకరణ చక్రవర్తి పద్మశ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ గారి జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ........

వేణుమాధవ్ గారు నటించిన ' గూఢచారి 116 ' చిత్రంలోని మిమిక్రీ సన్నివేశం చూడండి...... 



Vol. No. 02 Pub. No. 101

Monday, December 27, 2010

మంచి చిత్రాల ' వేదిక ' - చిత్రమాలిక లో

 

 మంచి చిత్రాలను ప్రోత్సహించి, మంచి ప్రేక్షకులను తయారు చేసే లక్ష్యంతో మొదలైన ఫిలిం సొసైటీల పుట్టు పూర్వోత్తరాలు, ఉద్యమ వ్యాప్తి వగైరా విశేషాలతో కూడిన నా వ్యాసపరంపరలో రెండవ భాగము
' చిత్ర మాలిక ' లో చదవండి. ఆ లింక్ ఇక్కడ ............

http://wp.me/p1cJWt-ee

Vol. No. 02 Pub. No. 100

రెండు విశేషాలు


తెలుగు వారికి స్వంతమైన కూచిపూడి నాట్యం ఈనాడు దిగంతాలకు వ్యాపించింది. 2800 మందితో నిన్న హైదరాబాద్ లో నిర్వహించిన నృత్య ప్రదర్శన గిన్నీస్ రికార్డు సాధించడం తెలుగు వారందరూ గర్వించదగ్గ విషయం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సిలికానాంధ్ర వారు అభినందనీయులు.
ఈ రోజు ఆంధ్రజ్యోతి లోని వార్తా కథనం ఈ క్రింది లింకులో...........
http://epaper.andhrajyothy.com/AJ/AJYOTHI/2010/12/27/ArticleHtmls/27_12_2010_002_005.shtml?Mode=1


 ***********************************************************************


మరో విశేషం. వావిళ్ళ సంస్థ నూరేళ్ళ క్రితం ప్రచురించిన ముద్దుపళని రచన ' రాధికా స్వాంతనము ' గురించి ఈరోజు ఆంద్రజ్యోతి లో వచ్చిన వ్యాసం  " వావిళ్ళ రాధికా స్వాంతనము కు నూరేళ్ళు " లో ముద్దుపళని గురించి చాలా విశేషాలున్నాయి. ఆ లింకు ఈ క్రింద.........

http://epaper.andhrajyothy.com/AJ/AJYOTHI/2010/12/27/ArticleHtmls/27_12_2010_004_010.shtml?Mode=1
 

Vol. No. 02 Pub. No. 099

Sunday, December 26, 2010

కూర్మా వారి తిట్టు

 ' ఆంధ్ర యూనివర్సిటీ సెమినార్ హాల్లో నీ ఉపన్యాసం పెట్టించేస్తాను జాగ్రత్త ! ' అని ఒక పాత్ర బెదిరిస్తుంది హాస్యబ్రహ్మ జంధ్యాల గారి ' రెండురెళ్ళు ఆరు ' చిత్రంలో. ఆది ఎందుకో ఆంధ్ర యూనివర్సిటీ గురించి తెలిసున్న వాళ్లకు, అక్కడ చదివిన వాళ్లకు, అక్కడ ఉపన్యాసం ఇచ్చిన వాళ్లకు బాగా తెలుసు.

ఒకప్పుడు ఆ యూనివర్సిటీకి రిజిస్ట్రార్ గా పనిచేసిన కూర్మా వేణుగోపాలస్వామి గారు చాలా గంభీరమైన వ్యక్తి. ఓరోజు అక్కడ ఏదో కార్యక్రమం జరుగుతోంది. సక్రమంగా జరగనిస్తే విద్యార్థుల గోప్పతనమేముంది. అందుకే ఆ యూనివర్సిటీ సాంప్రదాయం ప్రకారం యథాశక్తి గోల చేస్తున్నారు. కార్యక్రమాన్ని సజావుగా సాగనివ్వడం లేదు. వేణుగోపాలస్వామి గారు ఇదంతా చూసి చూసి ఇక ఆగలేక వేదికనెక్కారు.

ఆయన్ని కూడా వదలదల్చుకోని విద్యార్థి ఒకడు గాఠిగా " హాయ్ ! భీమా ! " అన్నాడు.

కూర్మా వారు తక్కువ తిన్నారా ! కుక్క కాటుకు చెప్పుదెబ్బలా వెంటనే అందుకుని
" ఏరా ! ఘటోత్కచా ? ఏం కావాలిరా ? " అన్నారు.

ఇందులో తిట్టేముందని అనుకుంటున్నారా ? అయితే కొంచెం ఆలోచించండి. మీకే అర్థం అవుతుంది.

Vol. No. 02 Pub. No.098

Saturday, December 25, 2010

ధ్వన్యావధాన సామ్రాట్

కళల్లో అనుకరణ ఒక విలక్షణమైన కళ. ఇతరుల్ని అనుకరించండం, పశు పక్ష్యాదులను, ఇతర శబ్దాలను అనుకరించడాన్ని మిమిక్రీ అని పిలుస్తారు. ఈ కళలో  అంతర్జాతీయ స్థాయినందుకున్న తెలుగు కళాకారుడు నేరెళ్ళ వేణుమాధవ్ గారు. ఆయనకు ప్రియ శిష్యుడు, మిమిక్రీలో ఎన్నో ప్రయోగాలు చేసి ఆయనకు వారసుడిగా ఎదిగిన మిమిక్రీ కళాకారుడు, ' మిమిక్రీ ' అనే మాటను ఇంటి పేరుగా మార్చుకున్న ' మిమిక్రీ శ్రీనివాస్ ' . మిత్రులకు, కళా ప్రియులకు ఆయన అసలు ఇంటి పేరేదో తెలీదు. మిమిక్రీ శ్రీనివాస్ గానే పరిచయం.

వేణుమాధవ్ గారి శిష్యుడిగా పదిహేను సంవత్సరాల వయసులోనే మొదటి మిమిక్రీ ప్రదర్శన ఇచ్చిన శ్రీనివాస్ ది వరంగల్ జిల్లా కేసముద్రం. ధ్వన్యనుకరణ ( వెంట్రిలాక్విజం ) ను చెన్నై లోని ప్రొ. ఎమ్. ఎమ్. రాయ్ గారి వద్ద నేర్చుకుని, అమెరికా లోని కొలరాడో లోని మహేర్స్ ఇన్స్టిట్యూట్ అఫ్ వెంట్రిలాక్విస్ట్స్  నుంచి పట్టా పొందారు.

మనదేశంలోనే కాక విదేశాలలో కూడా ఎన్నో నగరాల్లో ప్రదర్శనలిచ్చిన శ్రీనివాస్ తెలుగుతో బాటు, హిందీ, ఇంగ్లీష్ , ఉర్దూ, తమిళం భాషలలో కూడా ప్రదర్శనలు నిర్వహించగలరు. 1990 లో హైదరాబాద్ లో త్యాగరాయ గాన సభ లో ' ధ్వన్యావధానం ' అనే నూతన ప్రక్రియను ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందారు. అదే సంవత్సరం అదే చోట 32 గంటల నిర్విరామ మిమిక్రీ ప్రదర్శన యిచ్చి రికార్డు సృష్టించారు. సాధారణంగా మనం చూసే మిమిక్రీ అంశాలకు భిన్నంగా అనేక మిమిక్రీ, ధ్వన్యనుకరణ ప్రక్రియలను కనుగొన్నారు. వాటిలో స్వరాన్ని విసరడం ( Voice throwing ), శబ్దభ్రాంతి ( Sound illusion ), శబ్దదర్శనం ( Sound Perspective), వ్యంగ్యచిత్ర భ్రాంతి ( Caricature Illusion ) వంటి ఎన్నో విన్నూత్న ప్రక్రియలకు శ్రీకారం చుట్టి మిమిక్రీ కళకు మరింత వన్నె తెచ్చారు.

 తెలుగువారి కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో వ్యాపింపజేస్తున్న ప్రియమిత్రుడు మిమిక్రీ శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా         శుభాకాంక్షలు తెలుపుతూ...   ఇప్పటికే ముఫ్ఫై మూడు ఏళ్ళుగా ఆరువేల ప్రదర్శనలపైన ఇచ్చిన ఆయన త్వరలోనే పదివేల ప్రదర్శనలను పూర్తిచెయ్యాలని కోరుకుంటూ......

03 ఫిబ్రవరి 2010 తేదీన అమెరికాలోని స్ప్రింగ్ ఫీల్డ్ లో మిమిక్రీ శ్రీనివాస్ ప్రదర్శించిన ' శబ్దభ్రాంతి ' ప్రదర్శన ఇక్కడ.. దీంతో బాటు మరిన్ని వీడియోలు యుట్యూబ్ లో చూడవచ్చు.



Vol. No. 02 Pub. No. 097

మెర్రీ క్రిస్మస్ ... మెర్రీ క్రిస్మస్ .....



రెండువేల పది సంవత్సరాల క్రితం ఒక ధ్రువతార ఉదయించింది
ఆ తారే ................
లోకుల కష్టాలు తీర్చడానికి శిలువెక్కిన మహనీయుడు ఏసుక్రీస్తు
ఆ మహానుభావుడు ఉద్భవించిన రోజు క్రిస్మస్ రోజు ....... ఈ రోజు 

 మిత్రులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు 




Vol. No. 02 Pub. No. 096

Friday, December 24, 2010

మరోసారి మహానటి జ్ఞాపకం

మహానటి గురించి ఎంత చెప్పినా తక్కువే !
సహజసిద్ధమైన నటన
ముగ్దమనోహరమైన రూపం
స్పష్టమైన ఉచ్చారణ
చక్కటి హావభావాలు
ఇవన్నీ ఆమె సొంతం
ఆవిడ నటన తెలుగు వారి సొంతం

మహానటి సావిత్రి వర్థంతి సందర్భంగా కళా నీరాజనాలు అర్పిస్తూ.........
 శ్రీ ముక్కామల వెంకట సుబ్బారావు గారు మహానటి సావిత్రి గారి పరిచయ కార్యక్రమాలు సేకరించి యు ట్యూబ్ లో ఉంచారు. వాటి లింకులు ఇక్కడ ................

http://www.youtube.com/watch?v=iKKEwGfn_R0
http://www.youtube.com/watch?v=xjSQXbsAqvI

Vol. No. 02 Pub. No. 095

సినిమా అష్టావధాని

ఆవిడ సినిమా రంగంలో అష్టావధాని
ఆవిడ అన్ని రంగాల్లో ప్రజ్ఞాశాలి

ఆవిడ వైవిధ్యమైన నటి
ఆవిడ మూడు భాషల్లో దర్శకురాలు
ఆవిడ సంగీత దర్శకురాలు
ఆవిడ మధురమైన గాయని
ఆవిడ చిత్ర సన్నివేశాల కూర్పరి 
ఆవిడ మంచి చిత్రాల నిర్మాత
ఆవిడ ప్రతిష్టాకరమైన స్టూడియో యజమాని
ఆవిడ హాస్యాన్ని అందంగా చిలికించే రచయిత్రి 

తొలిసారి దర్శకత్వం వహించిన ' చండీరాణి ' తో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అడుగుపెట్టారు
తెలుగు మధ్యతరగతికి ప్రతిబింబంగా ' అత్తగారి కథలు ' తో సాహిత్య అకాడెమి పురస్కారం పొందారు   

... ఆవిడే బహుముఖ ప్రజ్ఞాశాలి, సినిమా అష్టావధాని భానుమతీ రామకృష్ణ .
ఈరోజు భానుమతీ రామకృష్ణ గారి వర్థంతి సందర్భంగా ఆవిడకు కళా నీరాజనంతో.................

యుట్యూబ్ లో ముక్కామల గారి ఛానల్ లో  భానుమతి గారి ఇంటర్వ్యూ .............
 


Vol. No. 02 Pub. No. 094

Thursday, December 23, 2010

తెలుగు ప్రధాని

ప్రధాని పీఠమెక్కిన ఏకైక తెలుగువ్యక్తి
బహుభాషా కోవిదుడైన సాహితీ వేత్త

రాజకీయాల్లో అపర చాణక్యుడు
మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం నడిపిన నాయకుడు

ఆర్ధిక సంస్కరణల రూపశిల్పి
ఆర్ధిక వ్యవస్థను ఇబ్బందుల నుండి బయిట పడేసిన మేధావి 

కష్టకాలంలో కాంగ్రెస్ ను గట్టేక్కించిన ఆపద్బాంధవుడు
కష్టాలు తీరాక కాంగ్రెస్ మరచిపోయిన తెలుగు నాయకుడు

 ఢిల్లీలో తెలుగు బావుటా ఎగురవేసిన తెలుగు తేజం
తెలుగునాట తెలుగు వారి చేత నిర్లక్ష్యానికి గురైన వైనం 

ఇది జరిగి సరిగా ఈరోజుకి ఆరేళ్ళు
ఇప్పటికైనా గుర్తిస్తారా కనీసం తెలుగు వాళ్ళయినా 

మొట్ట మొదటి, ఇప్పటివరకూ ఒకేఒక తెలుగు ప్రధానమంత్రి స్వర్గీయ పాములపర్తి వెంకట నరసింహారావు గారి వర్థంతి సందర్భంగా ఆయనకు స్మృత్యంజలి

Vol. No. 02 Pub. No. 093

Wednesday, December 22, 2010

బంగారు పాపాయి

 చిన్నారి చిత్కళ పుట్టినరోజు సందర్భంగా తమ ఆశీస్సులందించిన మిత్రులందరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు.   బంగారు పాపాయి బహుమతులు ( ఆశీస్సులు ) పొందిన వేళ నాయినమ్మ కూచిమంచి సావిత్రి గానపూర్వక ఆశీర్వచనం.....




Vol. No. 02 Pub. No. 092

Tuesday, December 21, 2010

మా ' కృష్ణుడి ' పుట్టినరోజు

 ' శిరాకదంబం  ' మకుటాన్ని అలంకరించిన బుల్లి కృష్ణుణ్ణి మీరందరూ చూస్తూనే వుండి వుంటారు. మొన్న శ్రీకృష్ణాష్టమి రోజున ' చిన్ని చిన్ని కన్నయ్యా ' టపాలో ఆ కృష్ణుడి విన్యాసాలు మిత్రులు చాలామంది చూసేవుంటారు. ఆ లింక్ ............

http://sirakadambam.blogspot.com/2010/09/blog-post_02.html

ఆ కృష్ణుడు మా తమ్ముడు ( కజిన్ ) శ్రీనివాస్ సుబ్రహ్మణ్యం, శిరీషల పుత్రిక. అసలు పేరు చిత్కళా సావిత్రి.

చాలా చిలిపి పిల్ల. అంత చిన్నపిల్లకి, ఆ చిన్నారి అన్న సాత్విక్ కీ మా కుటుంబమంటే అంతులేని అభిమానం. ఈరోజుతో మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని కె.జి. కి అర్హత సంపాదించుకుంది. అంటే చదువు భారాన్ని మోసేందుకు సిద్ధమవుతోంది. చిత్కళకు ఆశీస్సులందిస్తూ మీ అందరి ఆశీస్సులు ఆ చిరంజీవికి అందాలని కోరుకుంటూ .............



















                                                      పుట్టినరోజు జేజేలు...చిట్టి పాపాయి........                                                



Vol. No. 02 Pub. No. 091

Monday, December 20, 2010

మంచి చిత్రాల ' వేదిక '

కొంతకాలం క్రితం వరకూ దేశ విదేశాలలోని మంచి చిత్రాలను ప్రదర్శించడానికి తగిన వేదికలుండేవి కాదు. ఇప్పుడు విదేశీ చిత్రాలను అందించే టీవీ చానల్స్, వెబ్ సైట్లు ఎన్నో వున్నా వాటిలో కూడా వ్యాపారాత్మక మసాలాలున్న చిత్రాలే ఎక్కువగా దొరుకుతున్నాయి. కనుక మంచి చిత్రాలు కోరుకునే ప్రేక్షకులకు ఇప్పటికి కూడా వెదుకులాట, ఎదురు చూపులు తప్పదేమో !

తమ అభిరుచికి తగ్గ చిత్రాలను సేకరించి ప్రదర్శించుకోవడానికి తమతో పాటు తమ స్నేహితులు, సహచరులలో మంచి సినిమాలపై అభిరుచి పెరిగేటట్లు చెయ్యడానికి ఫిలిం సొసైటీలు అనేవి ఏర్పడ్డాయి. ఉత్తమ చిత్రాభిరుచిగలిగిన వారంతా కలసి ఏర్పాటు చేసుకున్న వేదికే ఫిలిం సొసైటీ. కొంతకాలం క్రితం వరకూ ఇదొక ఉద్యమంలాగ సాగింది. తర్వాత కాలంలో వచ్చిన టీవీ, వీడియో ఈ ఉద్యమాన్ని నీరు కార్చాయి.

సాంకేతికత పెరిగినంతగా విలువలు పెరగలేదు...సరికదా మరింత దిగజారుతున్నాయి. తద్వారా మసాలా, మూస ఫార్ములా చిత్రాలే విజయం సాదిస్తాయనే దురభిప్రాయం నిర్మాతల్లో ఏర్పడిపోయింది. మంచి చిత్రాలు నిర్మించే సాహసం చెయ్యడానికి వారు ప్రయత్నించడం లేదు. కానీ చరిత్రలో మంచి సినిమాలకు ఎప్పుడూ చోటు వుంటుంది. ఒక మసాలా సినిమా విజయం సాధించినంత మాత్రాన అందరూ ఆ దోవన నడవడం అంత మంచి పరిణామం కాదు. చిత్రాలు సందేశాలివ్వనక్కరలేదు. సంస్కరణలు చెయ్యనక్కరలేదు. వినోదం పేరుతో విపరీత ధోరణులకు పోకుండా వుంటే చాలు. మన సంస్కృతిని ప్రతిబింబించే శంకరాభరణం లాంటి చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించిన గుండమ్మ కథ లాంటి కుటుంబ కథా చిత్రాలు దశాబ్దాలు గడిచినా, తరాలు గడిచినా ఈనాటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో పదిలంగా వున్నాయి. మనసు వికలంగా వున్నపుడు జంధ్యాల గారి ఆరోగ్యకరమైన హాస్య చిత్రాలను చూస్తూ రీచార్జ్  అయ్యే తెలుగు వారెందరున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ సినిమాల్లో ఏ ఐటెం పాటలున్నాయి ? ఏ రక్త పాతాలున్నాయి ? ఏ సుదీర్ఘ పోరాటాలున్నాయి ? ఇంకా మసాలాలని చెప్పుకునేవి ఏమున్నాయి ? అవన్నీ పుష్కలంగా వున్న చిత్రాలు ప్రేక్షకుల మదిలో శాశ్వతంగా నిలబడినవి ఎన్ని ?

ఒక మసాలా చిత్రం హిట్ అయితే అలాంటి చిత్రాలు మరెన్నో అదే మూసలో తయారుచేసి  ప్రేక్షకుల మీద రుద్దుతారు. వాటిలో చాలా భాగం పరాజయం పాలవుతాయి. కానీ పైన ఉదాహరించిన చిత్రాల్లాంటివి విజయవంతమైనా, నిర్మాణ వ్యయం తక్కువ వల్లా, మినిమం గారంటీ వున్నా, విజయాల శాతం చాలా ఎక్కువ వున్నా అలాంటి చిత్రాలు నిర్మించడానికి ముందుకొచ్చిన నిర్మాతలు ఎంతమంది ? మసాలుంటేనే చిత్రం విజయవంతమవుతుందని, మంచి చిత్రాలు ప్రేక్షకులు ఆదరించరనే నిర్మాతల పలాయనవాదం, ఆత్మవంచన దీనికి కారణం.  వాళ్ళకీ తెలుసు.... ఏవి తక్కువ వ్యయంలో తయారవుతాయో, ఏవి ఎక్కువ శాతం విజయాలు సాధిస్తున్నాయో ! కానీ ఒప్పుకోలేరు. ఒప్పుకోరు. గొర్రె కసాయి వాణ్ణి నమ్ముతుందన్నట్లు మసాలా ఫార్ములానే నమ్ముకుంటారు. ప్రేక్షకులు అలాంటి సినిమాలే చూస్తారనే భ్రమలో వున్న వాళ్ళను మార్చడం సాధ్యం కాదు. కనుక ప్రేక్షకులే మారాలి. 

ఈ పరిస్థితుల్లో మంచి చిత్రాలను చూడడం, ఆదరించడం అలవాటు ప్రేక్షకుల్లో పెంచే ఫిలిం సొసైటీల ఆవశ్యకత ఈ రోజుల్లో కూడా ఎంతైనా ఉందనిపిస్తోంది. ఈ ఫిలిం సొసైటీల పుట్టు పూర్వోత్తరాలు, వాటి పరిణామం, మన దేశంలో వాటి గమనం, ప్రభావం గురించిన నా వ్యాస మాలిక   ' చిత్ర మాలిక ' ఇ - పత్రిక లో  ప్రారంభమైంది. మొదటి వ్యాసాన్ని ఈ క్రింద లింక్ లో చదవండి.

http://wp.me/p1cJWt-dD 





Vol. No. 02 Pub. No. 90

Saturday, December 18, 2010

సినిమాల గురించి శ్రీశ్రీ

 ఇప్పుడు తెలుగు చలనచిత్ర రంగం ఒక రకమైన స్తబ్దతలో వుంది. నిర్మాతలు ఆత్మ పరిశీలనలో  పడ్డారు. సుమారు నాలుగు దశాబ్దాల క్రితం అప్పటి చిత్ర నిర్మాణ పరిస్థితి గురించి మహాకవి శ్రీశ్రీ రాసిన ఓ వ్యాసంలోని కొన్ని భాగాలు ఇక్కడ ఇస్తున్నాను. పరిస్థితిలో ఇప్పటికి కూడా పెద్ద మార్పు లేదని ఈ వ్యాసం చదివిన వారందరూ సులువుగా గ్రహించవచ్చు. ఆ విషయాన్ని నిర్మాతలు కూడా గ్రహించి తమ ఆత్మ పరిశీలనలో శ్రీశ్రీ గారు స్పృశించిన అంశాలను కూడా పరిశీలనలోకి తీసుకుంటే బాగుంటుంది. ఇక చదవండి.......

 సినిమా అనేది ఒక బ్రహ్మాండమైన ఆయుధం.  దానిని వినియోగించగల బ్రహ్మాండమైన కళాస్రష్ట మనలో ఇంకా బయిలుదేరలేదు. ప్రస్తుతం ఆది చిటికెన వేలంతటి మనుషుల చేతిలోనే వున్నది. వారు కూడా దానిని తమ అల్ప ప్రయోజనాలకు వినియోగించుకుంటున్నారు. బిర్లా, టాటాలు 501 సబ్బును, సిమ్మెంటు బస్తాలను ఉత్పత్తి చేస్తున్నట్లుగానే మన ప్రొడ్యూసర్లు ఈనాడు చిత్ర నిర్మాణం చేస్తున్నారు.

సలు ఉత్తమ చిత్రాలు నిర్మిస్తే మన ప్రజలు చూడరని చెప్పడం కూడా మన ప్రొడ్యూసర్లకు పరిపాటి అయింది. ఇది ఎంత అసందర్భంగా ఉన్నదో చెబుతాను వినండి. ఆహారాన్ని విక్రయించడం ఒక వ్యాపారంగా నడపడం 20 వ శతాబ్దంలోనే ప్రారంభమయింది. ప్రతివాడూ తిండికోసం హోటలుకు వెళ్ళాలి. అతడికి ప్రతీసారీ ఆహారం ( మంచిది ) లభించకపోవచ్చు. అయినా రోజూ హోటలుకు వెళ్లక తప్పదు.

హారం వలెనే ఈనాడు మానవునికి సినిమాకూడా ఒక అవసరం. అందువల్ల ఏ చిత్రం వచ్చినా ప్రేక్షకుడు చూస్తున్నాడు. కానీ కంపుకొట్టే వేరుశనగ నూనెతో చేసే వంటకాలను కాని ప్రజలు ముట్టరని, వాటికి వారు అలవాటు పడ్డారని యజమాని చెబితే ఎంత అసందర్భంగా ఉంటుందో ఉత్తమ చిత్రాలను నిర్మిస్తే ప్రజలు చూడరని చెప్పడం కూడా అలాగే వున్నది.

నాటకానుభవంలేని కవులు సినిమా రచయితలుగా వస్తే, యతిప్రాసలు రానివారు కవిత్వం చెప్పడానికి పూనుకున్నట్లే ఉంటుంది. సినిమా రచయితలకు నాటకానుభవం ఉండి తీరాలి.  శ్రీ పింగళి నాగేంద్రరావుగారికి అట్టి అనుభవం వున్నందువల్లే " పాతాళభైరవి '' వంటి కాకమ్మ పిచికమ్మ కథలో అంత ' డ్రమెటిక్ ఎఫెక్ట్ ' తీసుకురాగలిగారు.

సాధ్యమైనంత ఎక్కువ యాక్షన్ తోనూ, సాధ్యమైనన్ని తక్కువ సంభాషణలతోనూ నిర్మించినపుడు చిత్రం ఉత్తమంగా వుంటుంది. అందుకు సహాయభూతం కాగల నాటకానుభవం వున్న రచయిత తప్పకుండా దర్శక పదవిని ఆక్రమించవచ్చు. డైరెక్టర్ అంటే ' స్టార్ట్ ' ' కట్ ' అని కేకలు వేసేవాడు మాత్రం కాదు.

మైనా ఏ ప్రజలకు తగిన ప్రభుత్వం ఆ ప్రజలకు లభించినట్లుగానే, ఆయా ప్రజల అభిరుచులను బట్టి ఆయా సినిమాల స్థాయి కూడా వుంటుంది.    

Vol. No. 02 Pub. No. 089

గానంలో పెద్ద ' మాధవపెద్ది '

రంగస్థల అనుభవం ఆయన్ని తీర్చిదిద్దింది
పద్యం ఆయన గళంలో వయ్యారాలు పోయింది

దుర్యోధనుడు, రావణుడు, ఘటోత్కచుడు....
ఇలా ఎన్నో పాత్రలకు ఆయన కంఠం జీవం పోసింది

ఎస్వీరంగారావు, రేలంగి, రమణారెడ్డి ......
ఇలా ఎందఱో నటులకు ఆయన కంఠం అమరి పోయింది

పాట ఆయన గొంతులో ఒదిగిపోయింది
పాడుతున్నది పాత్రలేమోననిపిస్తుంది
పాడుతున్నది పాత్రదారులేమోననిపిస్తుంది
వారిలో ఆయన స్వరం పరకాయ ప్రవేశం చేస్తుంది

ఆయన పద్యంలో భావం తొణికిసలాడుతుంది 
ఆయన పాటలో రాగం అలవోకగా అమరిపోతుంది
ఆయన కంఠంలో గాంభీర్యం నాట్యమాడుతుంది
ఆయన కంఠంలో హాస్యం గిలిగింతలు పెడుతుంది

ఆయనే కబీర్ పాత్రలో 1946 లో వచ్చిన ' రామదాసు ' తమిళ-హిందీ ద్విభాషా చిత్రంతో నటుడిగా చిత్రసీమలో అడుగుపెట్టి  గాయకుడిగా స్థిరపడి సుమారు మూడు దశాబ్దాలు తెలుగు ప్రేక్షక శ్రోతలను అలరించిన మాధవపెద్ది సత్యం. ఆయన నటుడిగా స్థిరపడిపోతే మనం గర్వంగా చెప్పుకోగలిగే మంచి గాయకుడిని కోల్పోయేవాళ్ళమేమో ! ఆది తెలుగు జాతి చేసుకున్న అదృష్టం. పాత్ర స్వభావాన్ని, పాత్రధారుని సంభాషణా చాతుర్యాన్ని అంత చక్కగా స్వంతం చేసుకుని పాడే గాయకుడు బహుశాః మాధవపెద్ది సత్యం గారొక్కరేనేమో !

ఆయన కుమారుడు, కూచిపూడి నృత్య కోవిదుడు మాధవపెద్ది మూర్తి గారు తన తండ్రి గారి జ్ఞాపకార్థం ' మాధవపెద్ది సత్యం పురస్కారం ' నెలకొల్పారు. ఆ పురస్కారం అందుకొన్న వారిలో ఎం. ఎస్. విశ్వనాథన్, పి. బి. శ్రీనివాస్ లాంటి ప్రముఖులున్నారు.

ఈ రోజు మాధవపెద్ది సత్యం గారి వర్థంతి సందర్భంగా ఆయనకు స్వర నీరాజనం అర్పిస్తూ ఆయన పాడిన కొన్ని పాటల, పద్యాల శకలాల కదంబం ........ 



గతంలో దూరదర్శన్లో ప్రసారమైన మాధవపెద్ది సత్యం గారితో ముఖాముఖీ కార్యక్రమం ముక్కామల గారి ద్వారా ...............



Vol. No. 02 Pub. No. 088

Thursday, December 16, 2010

మనసున మనసై ...

 ' అమర సందేశం ' మోసుకొచ్చిన ' మంచి మనసులు ' ఆదుర్తి
' మూగమనసులు ' ని ' తేనె మనసులు ' గా మలచిన ఆదుర్తి

ఆయన శిలలపై శిల్పాలు చెక్కాడు
ముద్దబంతి పువ్వులకి ఊసులు నేర్పాడు
దివినుండి దేవతను భువికి దింపాడు
మనసున మనసై తోడుగా వున్నాడు

' మనసు ' కవి ఆత్రేయ అయితే ' మనసు ' దర్శకుడు ఆదుర్తి
ఆత్రేయ తన పాటలతో పరవశింపజేస్తే ఆదుర్తి తన చిత్రాలతో మురిపింపజేశాడు
గోపికృష్ణ ' కల్పన ' నుంచి తెలుగు చిత్రసీమ వైపు దృష్టి మరల్చాడు  
వ్యాపార ' సుడిగుండాలు ' నుంచి ' మరోప్రపంచం ' వైపు ఒక అడుగు వేసాడు

....... మనసు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారి జయంతి సందర్భంగా స్మృత్యంజలి ఘటిస్తూ ..........



ఆదుర్తి సుబ్బారావు గారి మీద గతంలో రాసిన టపా :

http://sirakadambam.blogspot.com/2009/12/blog-post_16.html

Vol. No. 02 Pub. No. 087

' పాలేరు ' భీమన్న

 ఈ రోజు మరొక మహనీయుని వర్థంతి

కోనసీమలోని మామిడికుదురు గ్రామంలో జన్మించిన దళిత కవి, రచయిత, పాత్రికేయుడు బోయి భీమన్న గారు ఆ మహనీయుడు.





' పాలేరు ' నాటకంతో ప్రసిద్ధుడై ' గుడిసెలు కాలిపోతున్నాయి ' కి సాహిత్య అకాడెమి పురస్కారంతో బాటు పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి ఉన్నత పురస్కారాలు  కూడా అందుకున్న భీమన్న గారి గురించి ఈరోజు ఆంధ్రజ్యోతి లో వచ్చిన వ్యాసం  ' పాత్రికేయుడిగా బోయి భీమన్న ' ఈ క్రింది లింక్ లో ........................... 


http://epaper.andhrajyothy.com/AJ/AJYOTHI/2010/12/16/ArticleHtmls/16_12_2010_004_008.shtml?Mode=1





Vol. No. 02 Pub. No. 086

ఆశయ సాధనలో అమరజీవి

 ఆమరణ నిరాహార దీక్షకు నిజమైన నిర్వచనం పొట్టి శ్రీరాములు
ఆశయ సాధనలో ప్రాణాలే పణంగా పెట్టిన నాయకుడు శ్రీరాములు
తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడిన యోధుడు శ్రీరాములు
తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా పెట్టుకున్న శ్రీరాములు

నాలుగు దశాబ్దాల తెలుగు వారి ఆకాంక్ష ప్రత్యేక ఆంద్ర రాష్ట్రం
గాండ్రింపులు, గర్జనలు కాదు...దూషణలు, బెదిరింపులు కాదు
కుటిల రాజకీయాలు కాదు.... హింసలూ, ప్రతి హింసలూ కాదు
తెలుగు వారి కలను నిజం చేసి సాధించింది ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం 

ఆది కుహనా నాయకుల కల్లబొల్లి దీక్ష కాదు... కఠోర దీక్ష
ఆది స్వార్థపూరిత లక్ష్యాలున్న దీక్ష కాదు... ప్రజాశయ దీక్ష
ఆది రాజకీయ లబ్ది పొందే దీక్ష కాదు .... నిజమైన దీక్ష
ఆది ఆస్తులు పెంచుకునే దీక్ష కాదు .... ఆత్మగౌరవ దీక్ష

విద్యార్థుల్ని , ప్రజల్ని ఉద్యమంలో ముందుంచ లేదు ఆయన
వారి ముందు తనే నిలబడి ఉద్యమించాడు ఆయన
అందుకే ఆ ఉద్యమంలో ముందుగా ఆహుతయ్యింది ఆయన
అందుకే ఏ ఉద్యమకారులకైనా ఆదర్శం ఆయన

నిజాయితీ, నిబద్ధత కలిగిన నాయకుల నిర్విరామ కృషి ఫలితం ఆంధ్ర రాష్ట్రం
యాభై ఎనిమిది రోజుల శ్రీరాములుగారి అకుంటిత దీక్ష ఫలితం ఆంద్ర రాష్ట్రం
అఖిలాంద్ర ప్రజల ఆశయ సాధన కోసం ఆయన ఆహుతయ్యాడు
అందుకే...తెలుగు ప్రజలందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచి పోయాడు

1952 వ సంవత్సరం అక్టోబర్ 19 వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన పొట్టి శ్రీరాములు గారు డిసెంబర్ 15 వ తేదీ అర్థరాత్రి ( తెల్లవారితే 16 వ తేదీ ) అమరజీవులయ్యారు. ఆ అమరజీవికి నివాళులు అర్పిస్తూ....... అలాంటి మహానీయుల్ని ఓసారి తల్చుకుందాం !





అమరజీవి పొట్టి శ్రీరాములు గారిపై గతంలో రాసిన టపా లింక్ :

http://sirakadambam.blogspot.com/2009/12/blog-post_15.html

Vol. No. 02 Pub. No. 085

Wednesday, December 15, 2010

ఒక బుడుగు పుట్టినరోజు

ఆయన తన బొమ్మలతో తెలుగు వాకిట ముత్యాల ముగ్గు వేసాడు
ఆయన తన సినిమాలతో తెలుగింట గోరంత దీపం వెలిగించాడు
ఆయన చేతిలో తెలుగు వనితాగీత వయ్యారాలు పోయింది 
ఆయన కుంచెలో తెలుగు వాతావరణం వెల్లివిరిసింది
ఆయన గీతలు నవ్వులు సృష్టించాయి
ఆయన చేతిలో కుంచెలు విరిశాయి
ఆయనే ..............


కొన్ని తరముల సేపు
మన గుండె లూయల లూపు  
కొంటె బొమ్మల బాపు



తెలుగు జాతికి ఆభరణమైన బాపురమణ జంటలో ఒక బుడుగు బాపు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ .............. 




బాపు గారి మీద గతంలో రాసిన టపాలు :

http://sirakadambam.blogspot.com/2009/12/blog-post_1519.html

http://sirakadambam.blogspot.com/2010/11/blog-post_6306.html

Vol. No. 02 Pub. No. 084

ఇది తొలి పాట

నలభై నాలుగేళ్ళ ప్రాయం ఆ పాటకు
నూరేళ్ళ జ్ఞాపకం తెలుగు శ్రోతలకు

కోదండపాణి అందించిన బాణీ
చేసింది పాటలలో వైవిధ్యానికి బోణీ 

ఒక కొత్త స్వరం... ఒక కొత్త ఊపు తెలుగు పాటకి
ఒక కొత్త అనుభూతి... ఒక కొత్త అనుభవం తెలుగు శ్రోతకి

అప్పటినుంచి ఇప్పటిదాకా అదే గళం
వినిపిస్తోంది మధురగీతాల్ని అదే స్వరం

1966 వ సంవత్సరంలో ప్రముఖ సంగీత దర్శకులు ఎస్. పి. కోదండపాణి గారు పరిచయం చేసిన బాలసుబ్రహ్మణ్యం ఇంతింతై వటుడింతై బాలుగా తెలుగువారందరికీ సంగీతాత్మీయుడై తెలుగు చరిత్రలో తనకొక సుస్థిర స్థానాన్ని సంపాదించాడు.

బాలు స్థానం పటిష్టం కావడానికి ఆయన అవిరళ కృషితో బాటు ఎస్. పి. కోదండపాణి గారి కృషి కూడా చాలా ఎక్కువగా పనిచేసింది. ఆయన బాలు స్వరాన్ని తన సంగీతంలో పరిచయం చేయడంతో బాటు చిత్ర రంగానికి పరిచయం చేయడానికి ఎంత శ్రద్ధ తీసుకున్నారో ఆ గళంలో పాట నిలబడడానికి అంతే శ్రద్ధ తీసుకున్నారు. ఆయన తొలి పాటను సంగీత దర్శకులందరికీ వినిపించి, అతనికి అవకాశాలిమ్మని కోదండపాణి గారే అడిగేవారట. బాలు గారికి ఆర్థికంగా సహాయపడడానికి తన దగ్గర సహాయకుడిగా పనిచేయించుకునేవారట. ఇతర సంగీతదర్శకుల దగ్గర బాలు గారు పాడిన పాటల్ని ప్రత్యేకంగా వెళ్ళి వినేవారట. పాటలో పొరబాట్లను క్షమించేవారు కాదట. చిన్న తప్పు చేసినా ఎత్తి చూపేవారట.
 
బాలు గారి భవిష్యత్తుకు ఎంత ఆరాట పడ్డారో ఆయన ఆరోగ్యం కోసం కూడా అంతే ఆరాటపడ్డారు కోదండపాణి గారు. ఒకసారి బాలు గారు కష్టబడి సైకిల్ తొక్కుకుంటూ కోడంబాక్కం వంతెన మీద వెడుతుంటే అప్పుడే కారు మీద వెడుతున్న కోదండపాణి గారు చూసారు. బాలు గారిని ఆపి " ఏమిటయ్యా పంతులూ ! ఈ ఎండలో సైకిల్ మీద విహారం ఏమిటీ ? బుద్ధిలేదూ ? ఆరోగ్యం బాగుంటేనే పాట బాగుంటుంది. బస్సులో వెళ్ళు. ఇకెప్పుడైనా సైకిల్ మీద కనిపించావో ఊరుకోను " అని మందలించారట. ఆయన శ్రద్ధ, కోరిక ఫలించి తెలుగు వారికి మరో అద్భుతమైన గాయకుడు లభించాడు.
 
బహుముఖ పజ్ఞాశాలిగా ఎదిగిన బాలు గారు నలభై నాలుగు సంవత్సరాల క్రితం తొలి పాట పాడిన రోజు.... ఈరోజు.....
ఆ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆ పాట ఇక్కడ ..............
 


Vol. No. 02 Pub. No. 083

Tuesday, December 14, 2010

పద్యాలు - పాటలు _ జవాబులు

 కనుక్కోండి చూద్దాం - 34 _ జవాబులు 

1 .  గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వర రావు గారి జయంతి సందర్భంగా ప్రచురించిన టపాలో ఆయన చిత్రాల్లో పాడిన కొన్ని పద్యాలు ఇవ్వడం జరిగింది. అవి ఈ లింకులో వినవచ్చు.

 http://sirakadambam.blogspot.com/2010/12/blog-post_04.html

విన్నాక అవి వరుసగా ఏయే చిత్రాల్లోనివో చెప్పడానికి ప్రయత్నించండి ?


జవాబు : 1. మహామంత్రి తిమ్మరుసు 2 . తెనాలి రామకృష్ణ 3 .  శ్రీ కృష్ణార్జునయుద్ధం 4 . పాండవ వనవాసం 5 . అప్పు చేసి పప్పు చూడు 6 . పాండురంగ మహాత్మ్యం 7 . నర్తనశాల 8 . భూకైలాస్ 9 . జయసింహ 10 . శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం 11 . శ్రీకృష్ణ విజయము 12 . సారంగధర 13 . సత్య హరిశ్చంద్ర



2 . మామ మహదేవన్ జయంతి సందర్భంగా ప్రచురించిన టపాలో ఆయన సంగీత దర్శకత్వంలో వచ్చిన కొన్ని ఆణిముత్యాల శకలాలు వుంచడం జరిగింది. అవి ఈ క్రింది లింకులో వినవచ్చు.

http://sirakadambam.blogspot.com/2010/12/blog-post_552.html

విన్నాక అవి వరుసగా ఏయే చిత్రాల్లోనివో చెప్పడానికి ప్రయత్నించండి ? 

జవాబు :   1958 - దొంగలున్నారు జాగ్రత్త, ముందడుగు, బొమ్మలపెళ్లి; 1962 - మంచిమనసులు, ఆత్మబంధువు; 1964 - మూగమనసులు, దాగుడుమూతలు, ఆత్మబలం; 1965 -  వీరాభిమన్యు, తోడు నీడా,
తేనెమనసులు, సుమంగళి, ఇల్లాలు, అంతస్తులు ; 1966 - కన్నెమనసులు, ఆస్తిపరులు ; 1967 - సుడిగుండాలు, సాక్షి, ప్రాణమిత్రులు ; 1968 - లక్ష్మీనివాసం, ఉండమ్మా బొట్టు పెడతా ; 1969 - భలేరంగడు, బుద్ధిమంతుడు, మాతృదేవత, అదృష్టవంతులు, మనుషులు మారాలి, ఏకవీర ; 1970 - బాలరాజు కథ, ఇద్దరు అమ్మాయిలు, అక్కాచెల్లెలు, మాయని మమత, పెత్తందార్లు ; 1971 - చెల్లెలి కాపురం ; 1972 - సంపూర్ణ రామాయణం, భార్యాబిడ్డలు, విచిత్రబంధం, ఇల్లు-ఇల్లాలు, బడిపంతులు, ఇనస్పెక్టర్ భార్య ; 1973 - దేశోద్ధారకులు, బంగారుబాబు, డబ్బుకు లోకం దాసోహం, మాయదారి మల్లిగాడు, అందాలరాముడు ; 1974 - మంచివాడు, అందరూ దొంగలే, ఖాదీ బాబాయ్, ఓ సీత కథ ; 1975 - గాజుల కిష్టయ్య, సోగ్గాడు, శ్రీ రామాంజనేయ యుద్ధం, చిల్లరదేవుళ్ళు, ముత్యాలముగ్గు ; 1976 - ప్రేమబంధం, పల్లెసీమ, సిరిసిరిమువ్వ, పాడిపంటలు, సెక్రటరీ, శీలానికి శిక్ష ; 1977 - రాజా రమేష్, అడవిరాముడు ; 1978 - ఇంద్రధనస్సు, కుమారరాజా, గోరంత దీపం, సాహసవంతుడు ; 1979 - బంగారు చెల్లెలు, యుగంధర్, ముత్తైదువ, గోరింటాకు ; 1980 - శంకరాభరణం, శుభోదయం, రాజాధిరాజు, సర్కస్ రాముడు, వంశవృక్షం ; 1981 - ఆడాళ్ళూ మీకు జోహార్లు, సప్తపది, త్యాగయ్య, జేగంటలు ; 1982 - ఏకలవ్య ; 1984 - అభిమన్యుడు, మంగమ్మగారి మనవడు, జననీ జన్మభూమి ; 1985 - కొత్తపెళ్లికూతురు ; 1986 - సీతారామకల్యాణం, బుల్లెట్, ముద్దుల కిష్టయ్య, సిరివెన్నెల ; 1987 - శృతిలయలు, శ్రీనివాస కళ్యాణం ; 1988 - జానకిరాముడు ; 1989 - ముద్దులమామయ్య ; 1990 - అల్లుడుగారు, నారీనారీ నడుమ మురారి ; 1991 - అసెంబ్లీ రౌడీ ; 1992 - స్వాతికిరణం    

Vol. No. 02 Pub. No. 078a

Monday, December 13, 2010

నటన ' లక్ష్మి '

 విలక్షణమైన నటన
విలక్షణమైన గళం
వెరసి నటీమణి లక్ష్మిగా 
చిత్రసీమలో వెలిసింది

అలనాటి తెలుగు చిత్ర నిర్మాత వై. వి. రావు ఆమె తండ్రి
అలనాటి తమిళ చిత్ర నటి కుమారి రుక్మణి ఆమె తల్లి
పుట్టింది సినిమా కుటుంబంలో
పెరిగింది సినిమా వాతావరణంలో
అందుకే ఆమెకు సినిమా అవకాశాలు నల్లెరుమీద నడక

కథానాయికగా అడుగుపెట్టింది
తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ చిత్రాలతో బాటు
హిందీలోనూ జూలీ గా అఖండ విజయం సాధించింది
అనేక అవార్డులు, రివార్డులు స్వంతం చేసుకుంది
జాతీయ ఉత్తమ నటి పురస్కారం కూడా అందుకుంది
దక్షిణాది బాషల్ని క్షుణ్ణంగా నేర్చుకుంది
 
నలభై రెండు సంవత్సరాలుగా మూడుతరాల పాత్రల్ని పోషించింది
తర్వాతి తరానికి ఐశ్వర్య రూపంలో నటవారసురాలిని అందించింది  

మన తెలుగు చిత్రసీమలో మరో మంచి నటి లక్ష్మి కి జన్మదిన శుభాకాంక్షలతో ...........



Vol. No. 02 Pub. No. 082

Sunday, December 12, 2010

ఆంధ్రభాషోద్దారకుడు

 ఆంధ్ర మహాభారతము, ఆంధ్ర మహాభాగవతము లేని తెలుగును ఊహించగలమా ?
వేమన పద్యాలు, సుమతీ శతకము అనేవి లేకుండా తెలుగు భాష ఉంటుందా ?

ఆదికాలం నుంచి అనేక కావ్యాలు, గ్రంథాలు మన తెలుగులో వున్నాయని మనకు తెలియకపోతే...?
మనకొక వ్యాకరణం ఉందనీ, అనేక వేల పదాలు తెలుగులో వున్నాయని మనకు తెలియకపోతే...?

శ్రుత పాండిత్యమే గానీ, గ్రంథస్తం కాని ఎన్నో అపురూప గ్రంథాలు మనకు లభించకపోతే.....?
మనకున్న అంతులేని, అద్భుతమైన ప్రాచీన సాహిత్య సంపద మనకు లభించకపోతే...?

............ ఇవన్నీ ఊహించడం కష్టం.

ఎందుకంటే ఇవన్నీ మనకిప్పుడు లభ్యమవుతున్నాయి కనుక... !
కానీ ఇవన్నీ అంత సులువుగా మనకి లభ్యమయ్యాయా ?

లేదు.. నిజానికి ఒకప్పుడు ఈ సంపదను గురించి పట్టించుకునే నాథుడు లేడు
చాలా సాహిత్య సంపద కాలగర్భంలో కలసిపోయే దుస్థితి దాపురించింది

తెలుగు భాష వికాసాన్ని కోల్పోయి మరణించే స్థితికి చేరింది
తెలుగు సరస్వతి కళ కోల్పోయి దీనస్థితికి చేరింది

తెలుగును ఉద్ధరించి తెలుగు సరస్వతిని పునర్జీవింపజేసిన వ్యక్తి
తెలుగు భాషా వికాసానికి తన సర్వస్వాన్ని ఒడ్డిన మహనీయుడు

... అతను మాత్రం తెలుగు వాడు కాదు. అసలు భారతీయుడే కాదు 

" మినుకు మినుకు మంటున్న తెలుగు వాంగ్మయ దీపాన్ని స్నేహశిక్తం చేసి ప్రజ్వలింపచేసిన  ఆంద్రభాషోద్దారకుడు "
అని ప్రముఖ కవి జానమద్ది హనుమచ్చాస్త్రి కొనియాడిన మహనీయుడు చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్.

వ్యాపారం పేరుతో మన దేశ సంపదను కొల్లగొట్టిన బ్రిటిష్ సంతతి వాడు సి. పి. బ్రౌన్
తన సంపాదన మాత్రమే కాక అప్పులు చేసి మరీ తెలుగు భాషాభివృద్ధికి కృషిచేసిన దొర బ్రౌన్   

అవసరార్థం తెలుగు నేర్చుకుని అటు పిమ్మట తెలుగు మీద మక్కువ పెంచుకున్న ఆంగ్లేయుడు
భాషా పరిశోధన, పరిష్కారం, స్వీయ రచనలు, ప్రచురణ... అనే ప్రణాళికను పాటించిన వాడు



శిదిలమైపోతున్న ఎన్నో గ్రంథాలను వ్రాయసకాళ్ళను నియమించి తిరగ రాయించారు
కేవలం శ్రుత పాండిత్యానికే పరిమితమైన సాహిత్యాన్ని సేకరించి గ్రంథస్థం చేయించారు 


 భావితరాలు భాషార్థాలు మరచిపోకుండా ఉండేందుకు నిఘంటువులు వెలువరించారు
దేశం విడిచి తరలిపోయిన మన సాహిత్య సంపదను తిరిగి తెచ్చి మనకి అప్పగించారు

స్వంత డబ్బు ఖర్చు పెట్టి పరభాషైన తెలుగును బతికించిన మహానుభావుడు బ్రౌన్
ఆయన్ని మరచిపోవడం మన మాతృభాషను మరచిపోవడమే... మనల్ని మనం మరచిపోవడమే !

తెలుగు దొర, ఆంద్రభాషోద్ధారకుడు సర్ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ వర్థంతి సందర్భంగా స్మృత్యంజలి ఘటిస్తూ....... 

బ్రౌన్ దొర గురించి గతంలో రాసిన టపా ఈ క్రింది లింకులో .............

http://sirakadambam.blogspot.com/2009/11/blog-post_11.html 

పై టపాకు స్పందిస్తూ ప్రముఖ కవి, బ్లాగ్మిత్రులు ఆచార్య ఫణీంద్ర గారు బ్రౌన్ దొరపైన రాసి పంపిన పద్యాలు ఈ క్రింది లింకులో ....

http://sirakadambam.blogspot.com/2009/11/blog-post_5470.html


ఒక తియ్యని తెలుగు పాట విందాం .................



                       
Vol. No. 02 Pub. No. 081

Saturday, December 11, 2010

తొలి పునర్వివాహం

ఏటికి ఎదురీదమంటే ఆయనకు బహు ప్రీతి పాత్రమైన విషయం.
సంఘంలో పేరుకుపోయిన దురాచారాల్ని దిక్కరించారు.
సాంప్రదాయ వాదుల్ని ఎదిరించారు.
అప్పటికే సమాజంలో పేరుకుపోయిన ఎన్నో మూఢ విశ్వాసాలని రూపు మాపడానికి తన జీవితాంతం శ్రమించారు.
ఆయనే ఆంధ్రుల్లో ఆణిముత్యం కందుకూరి వీరేశలింగం పంతులుగారు.
ఆయన కవి, పండితుడు, పాత్రికేయుడు... వీటన్నిటికీ మించి సంఘ సంస్కర్త.
ఆయన చేపట్టి విజయం సాధించిన వాటిలో ముఖ్యమైన సంస్కరణ విధవాపునర్వివాహం.

భర్త చనిపోయిన స్త్రీ బొట్టు, గాజులు, పువ్వులు, మంచి చీరలు చివరికి ఆడువారికి అందాన్నిచ్చే శిరోజాలు వదులుకుని జీవితాంతం జీవచ్చవంలా బ్రతకాలనే దుష్టసాంప్రదాయం ఎవరు, ఏకాలంలో ప్రవేశపెట్టారో గానీ... చాలాకాలం స్త్రీలను శాపంలా పట్టుకుని పీడించింది. దాన్ని ఎదిరించడానికి గానీ, ఆ దురాచారాన్ని రూపుమాపడానికి గానీ ఎవరికీ ధైర్యం ఉండేదికాదు. ఎదిరిస్తే... కనీసం మాట్లాడితే మతాధికారుల ఆగ్రహానికి గురవుతామని, సంఘ బహిష్కరణకు గురవుతామనే భయం చాలా ఎక్కువగా ఉండేది. అసలు ఆ విషయం మాట్లాడడమే మహాపాపం అనుకునే పరిస్థితి. ప్రజల్లో ఈ విషయంలో మూఢత్వాన్ని పోగొట్టడానికి సమాజాన్ని ఎదిరించి ఎన్నో తిరస్కారాలు, చీత్కారాలు, బెదిరింపులు ఎదుర్కొని చివరకు విజయాన్ని సాధించి... వీరేశలింగం గారు తొలి విధవా పునర్వివాహం జరిపించిన రోజు 1881 వ సంవత్సరం డిసెంబర్ 11 .

దేశంలో చాలా చోట్ల అప్పటికే కొంతమంది సంస్కరణాభిలాషులు ప్రయత్నాలు ప్రారంభించినా అవి విజయవంతం కాలేదు. ఆ సమయంలోనే మద్రాస్ లో కూడా కొంతమంది ఒక సమాజాన్ని ఏర్పాటు చేశారు. ఇది దురాచారమని అందరికీ తెలిసినా బయిటకు వెల్లడించే ధైర్యం చాలామందికి లేకపోవడం వల్ల ఆ సమాజ కార్యకలాపాలు మందగించాయి. స్థాపకుల ఆశయం నీరు కారిపోయింది. అయితే ఇక్కడ రాజమహేంద్రిలో వీరేశలింగం గారు అలా ఊరుకోలేకపోయారు. ఎందరు నిరుత్సాహపరిచినా ఆయన తన ఆశయం నెరవేర్చుకోవాలనే పట్టుదల పెంచుకున్నారు.

అప్పట్లో వేద వేదాంగాలను ఔపోసన పట్టిన పండితులు కూడా ఈ మూఢత్వానికి లోనయ్యారు. ఎవరైనా విధవా పునర్వివాహం గురించి మాట్లాడితే వారికి సంఘ బహిష్కరణ శిక్ష విధించేవారు. కందుకూరి వారు తమ వివేకవర్ధని పత్రిక ద్వారా ఇలాంటి దురాచారాలను గురించి చైతన్య పరిచే రచనలు చేసేవారు. అయితే దానివలన వాళ్ళ ఆలోచనలలో మార్పు తీసుకురాగలిగినా, ఆచరణ దాకా తీసుకురాలేకపోయాననే వేదన ఆయనలో వుండేది. అందుకే ఎంతమంది ఆయన్ని నిరుత్సాహపరచినా ప్రియ మిత్రుడు చల్లపల్లి బాపయ్య గారి ప్రోత్సాహంతో బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. స్త్రీ పునర్వివాహ విషయంలో మొట్ట మొదటి మహాసభ 1879 వ సంవత్సరం ఆగష్టు 3 వ తేదీన విజయనగరంలో జరిగింది. ఆ సభకు హాజరైన సామాన్య జనం ఆలోచనలో పడినా పండితోత్తములు మాత్రం వీరేశలింగం గారిని పలు రకాలుగా దూషించి ఆయన ప్రతిపాదించిన విషయాలను తోసిపుచ్చారు. తర్వాత జరిగిన కొన్ని సభల్లో ఆయనపై దాడులకు కూడా ప్రయత్నించారు.

ఇంత వ్యతిరేకత ఎదురవుతున్నా చలించక కొంతమంది మిత్రులతో స్త్రీ పునర్వివాహ సమాజం పేరుతో ఒక సంస్థను స్థాపించి ఊరూరా తిరిగి ప్రచారం చేసేవారు. ఆ సమయంలో కూడా అనేక చోట్ల ఆయనకు ఎక్కువగా వ్యతిరేకత ఎదురయ్యేది. కాకినాడకు చెందిన పైడా రామకృష్ణయ్య గారు వారికి ఆర్థిక సహాయం చెయ్యడానికి ముందుకు వచ్చారు. మెల్లగా అనేకమంది అభ్యుదయవాదులు వీరేశలింగం గారితో కలిశారు. అంతేకాక అనేకమంది ప్రభుత్వోద్యోగులు కూడా ఆయన కార్యక్రమాలకు మద్దతిచ్చారు. దాంతో ప్రతిపక్షం పరోక్ష దాడికి పథక రచన ప్రారంభించాల్సి వచ్చింది. ఎంతోమంది యువకులు, విద్యార్థులు వీరేశలింగంగారి కార్యక్రమాలకు ప్రభావితులయ్యారు. ఆయనకు మద్దతిచ్చారు.

కృష్ణా జిల్లా తిరువూరు తాసిల్దారుగా పనిజేసిన దర్భా బ్రహ్మానందంగారు వీరేశలింగం గారి ప్రభావంతో ఒక విధవ బాలికకు వివాహం జరిపించడానికి ఆమె తల్లిని ఒప్పించి ఆ విషయంలో సహాయం చెయ్యాల్సిందిగా వీరేశలింగం గారిని కోరారు. కొంతమంది నమ్మకస్తులను పంపితే తల్లిని ఒప్పించి ఆ బాలికను వారి వెంట పంపగలనని కూడా తెలిపారు. అయితే వారి గ్రామంలో వారికి గల పలుకుబడి కారణంగా ఈ పని అత్యంత రహస్యంగా జరగాలని ఆమె కోరినట్లుగా ఉత్తరం రాశారు. బ్రహ్మానందంగారి కోరిక మేరకు వీరేశలింగంగారు ఇద్దరు మనుష్యుల్ని పంపారు. అయితే వీరు అక్కడికి చేరేలోగా బ్రహ్మానందం గారికి బదిలీ అయినట్లు తెలిసింది. అప్పటికే తిరువూరు చేరుకున్న ఆ వ్యక్తులు విషయం తెలుసుకుని దగ్గరలోనే వున్న ఆ గ్రామానికి రహస్యంగా వెళ్ళి ఆ బాలిక తల్లిని కలుసుకుని ఆమెను ఒప్పించి తమతో రాజమహేంద్రి తీసుకెళ్లారు. తమ ఇంట వుండి చదువుకుని పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తున్న  గోగులపాటి శ్రీరాములుని వరునిగా ఒప్పించారు పంతులుగారు. అప్పటికే అతనికి వివాహమై భార్య చనిపోవడం జరిగింది. ముహూర్త సమయానికి అతనికి అధికారులు సెలవు మంజూరు చెయ్యలేదు. వీరేశలింగంగారు ఉన్నతాధికారుల సిఫార్సుతో అతనికి సెలవు మంజూరు చేయించడమే కాక పెళ్ళికి ఎవ్వరూ విఘాతం కలిగించకుండా పోలీసు రక్షణ కూడా తీసుకున్నారు. వీరేశలింగం గారికి ఊరిలోని వ్యతిరేకులందరూ సహాయ నిరాకరణ ప్రారంభించారు. ఎవరూ ఆ పెళ్ళికి హాజరుకాకుండా వుండేందుకు, పనివాళ్ళెవరూ పని చేయకుండా వుండేందుకు ప్రయత్నాలు చెయ్యసాగారు. అయితే వాటన్నిటినీ వీరేశలింగంగారు తిప్పికొట్టి పెళ్లి నిర్విఘ్నంగా జరిగేటట్లు ఏర్పాట్లు చేశారు.

ప్రభుత్వాధికారులు ముఖ్యంగా పోలీసు వారు ఆయనకు రక్షణగా నిలిచారు. ఊరంతా నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి. వరుని ఇంట్లో కూడా అనేక రకాల బుజ్జగింపులు, బెదిరింపులు సాగాయి. అయినా అతను ఏమాత్రం జంకలేదు. ఫలితంగా అటువంటి మహాసంక్షోభంలో కూడా 1881 వ సంవత్సరం డిసెంబర్ 11 వ తేదీ రాత్రి రాజమహేంద్రి లోని కందుకూరి వీరేశలింగం గారి యింట మొదటి.. స్త్రీ పునర్వివాహం జరిగింది.

వీరేశలింగంగారి  సంకల్పం, పట్టుదల, దీక్ష ముందు మూర్ఖ సాంప్రదాయాలు నిలబడలేకపోయాయి. ఆయనంత కష్టానష్టాలకోర్చి అయిన వాళ్లందర్నీ దూరం చేసుకోవడానికి కూడా సిద్ధపడి ఈ సంస్కరణలకు పూనుకొని మహానుభావుడయ్యాడు. ఇప్పుడు స్త్రీ పునర్వివాహాన్ని సహజమైన ప్రక్రియగా చూస్తున్నారు గానీ వీరేశలింగంగారు చేసిన మొదటి స్త్రీ పునర్వివాహం  తర్వాత కూడా సమాజం నుండి అంత త్వరగా ఆయనకు మద్దతు రాలేదు. పూర్తిగా మార్పు రావడానికి సుమారు ఒక శతాబ్దం పట్టింది. ఇంకా ఇప్పటికీ మన సమాజంలో అనేక దురాచారాలు, దుష్ట సాంప్రదాయాలు పాతుకుపోయాయి.  అందులో ఒకటి అవినీతి. ఇది ప్రస్తుతం సాంప్రదాయమై కూర్చుంది. వీరేశలింగంగారు సంఘసంస్కర్త మాత్రమే కాదు ... పాత్రికేయుడు కూడా ! ఆయన తన వివేకవర్ధని పత్రిక ద్వారా సంఘంలోని, అధికారుల్లోని అవినీతిని ప్రక్షాళన చెయ్యడానికి కూడా ప్రయత్నించేవారు. తన పత్రికను చూసి అవినీతిపరులందరూ భయపడాలనుకునేవారు.  ఇప్పటి సంఘంలో పెరుగుతున్న అవినీతిని ముఖ్యంగా మీడియా రంగంలో కూడా అడుగుపెట్టిన అవినీతిని  పెళ్లగించడానికి మళ్ళీ వీరేశలింగం గారు పుట్టాలేమో !

తొలిసారిగా స్త్రీ పునర్వివాహం జరిగిన రోజును... వీరేశలింగం గారి ఆశయాలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ...   

Vol. No. 02 Pub. No. 080

Friday, December 10, 2010

కట్ట ' మంచి ' - ఆంధ్ర విశ్వకళా పరిషత్తు రూపశిల్పి - అనుబంధం

బ్లాగ్మిత్రులు మంద పీతాంబర్ గారు కట్టమంచి వారి గురించి తమ వ్యాఖ్యలో మరింత విలువైన సమాచారం అందించారు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆ సమాచారం వ్యాఖ్య రూపంలోనే ఉండిపోతే చాలామందికి చేరే అవకాశం తక్కువ కాబట్టి అనుబంధ టపాగా అందిస్తున్నాను. 

"యువభారతి"వారు 1980 లో ప్రచురించిన "ఆలోచనా లహరి"లో శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారిని గూర్చి డా. చల్లా రాధాకృష్ణ శర్మ గారు చేసిన ప్రసంగ వ్యాసం నుండి కొన్ని విషయాలను యీ సందర్భంలో తెలియజేయడం సముచింగా ఉంటుందనిపించింది .
" మా వంశమున కేది వచ్చిన రానిండు,తెనుగు భాష యొక్కటి మాత్రమక్షయముగా నిలిచియుండిన చాలును" అన్న మహనీయుడు.గొప్ప భాషాభిమాని శ్రీ రామలింగా రెడ్డి గారు..ఆయన మేధావి,పండితుడు,రచయిత ,వక్త ,విద్యా వేత్త,రాజనీతి వేత్త,పరిపాలనా దక్షుడు. యీ గుణాలతో పాటు ఆయన మానవత వాదిగా కూడా ఉండడం ఒక గొప్ప లక్షణమని వారు పేర్కొన్నారు.రాజనీతి వేత్తగా కంటె,విద్యా వేత్తగా కంటె,విద్వాంసుడుగా కంటే కూడా వ్యక్తిగా కట్టమంచి వారు చాలా ఉదాత్తుడని ఆచార్య కె.ఆర్.శ్రీనివాస అయ్యంగారు పేర్కోన్నారట.

1921 నుండి 1926 వరకు,1930 నుడి 1936 వరకు వారు రాజకీయాలలో పాల్గోన్నారట ఆ రోజుల్లో ఆయనంటే మంత్రులకు సింహ స్వప్నమట.వివిధ సమయాలలో ఆయన చేసిన ప్రసంగాలు,వాటిలో దొర్లిన చెణుకులు ,విసిరిన విసుర్లు,ఆలోచనామృతాలు."కాలం గతిస్తున్నది కాబట్టి,కాలంతో పాటే జ్ఞాపక శక్తి కూడా గతించ కూడదు " ద్వంద పరి పాలన ఒక్క,మదరాసుకే పరిమితమైన వ్యాధి కాదు. అది అఖిల భారత వ్యాధి ""పదవుల ఆశ సంశ్లేషానికి హేతువైతే ఆశా భంగాలు విశ్లేషానికి దారి తీస్తాయి"

ఒకసారి ఆయన శాసన మండలిలో ప్రభుత్వ విధానాలను నిశితంగా విమర్శిస్తుండగా ,సహించలేక పోయిన ముఖ్య మంత్రి(పానగల్ రాజా) తన జేబులోంచి ఒక కాగితం తీసి భయ పెట్టలనుకొన్నాడు.అందులో రెడ్డి గారు స్వకార్యం గురించి విన్నవించుకొన్నారట.అది గమనించిన కట్టమంచి వారు వెంటనే యిలా అన్నారట "ఇంగ్లాడులో అయితే కలహించుకొన్న ప్రేమికులు విడి పోయేటప్పుడు ఎవరి ఉత్తరాలను వాళ్లకు ఇచ్చివేస్తారు" అంతే ; ముఖ్య మంత్రి నోటికి తాళం పడిందట .

ఇంకొక సారి ఆయన బడ్జెట్ గురించి ప్రస్తావిస్తూ కొన్ని సంఖ్యా వివరాలు తన ప్రసంగంలో తెలియ జేశారట. అవి సరి కావని ఒకరు ఆక్షేపణ తెలపడం తరువాయి "నేను లెక్కలు చెప్పడం లేదు ,రాజకీయాలు మాట్లాడుతున్నాను " అన్నారట ఏమాత్రం
తడుముకోకుండా.

ఒక రాజకీయ సభలో ప్రసంగిస్తుండగా కొందరు వేదిక మీదకు రాలు రువ్వారట.వెంటనే "మన రాజకీయాల్లో
జస్టిస్ పార్టి వారు కొందరు రాతి యుగాన్ని ప్రవేశ పెడుతున్నారు"అన్నారట వెంటనే.

ఒకసారి రైలు ప్రయాణం చేసి మదరాసు దిగారట పత్రికా విలేఖరులు చుట్టు ముట్టి అప్పుడు అందరి నోళ్ళలో నానుతున్న ఓ ప్రశ్న వేసి ,మీ అభిప్రాయ మేమిటని అడిగారట "ఇప్పుడు నాకు కావలసింది పోర్టరు గాని ,రిపోర్టరు కాదు " అని అన్నారట .

ఆయన మహ స్వతంత్రులట.ఒక సారి కేంద్ర విద్యా మంత్రి ఒకరు "మీరు విద్యా శాఖ కార్య దర్శిగా చేరతారా? " అని అడిగారట అందుకు కట్టమంచి సమాధానం "ఇద్దరు విద్యా మంత్రులు ఎలా ఉంటారు "

రాజాజీ అంతటి వాడు ఆయన్ని "అసాధారణ ఉపాద్యక్షుడని"అభివర్ణిoచారట.

రామలింగా రెడ్డి గారి రచనల్లో అందాలు దిద్దుకొన్న కొన్ని సూక్తులు

"కుటుంబ రక్షణార్ధం ద్రవ్యార్జన కై యత్నించుట దోషము కాదు గదా!"

"కనిత్వమునకు జీవకళ భావము .పద్యము శరీర మాత్రము"

"రక్షించుట కు శక్తి లేనిచో సృష్టించుట మహా పాతకము"

"రసార్ద్ర హృదయులు నిత్య యౌవనులు గదా!"

"కవిత్వము నెదురు గొన్న వారికి మేఘ సంచారమే గాని భూసంచార మెక్కడిది ?"

ఆత్మ ప్రశంస ఆత్మ హత్యకు దుల్యము"

"మన:కృషియు,హస్త కృషియు గలియక యున్న నేర్పడునది "కళ" గాదు "కళంకము""

"విజ్ఞాన ముండిన మాత్రమున జన్మ సాఫల్యము కలుగ బొదు"

Vol. No. 02 Pub. No. 079a

ఆంధ్ర విశ్వకళా పరిషత్తు రూపశిల్పి


నీతి నిజాయితీలకి మారుపేరుగా నిలిచిన చిత్తూరు ప్లీడర్ గారు సుబ్రహ్మణ్యం రెడ్డి
ఆయన ద్వితీయ కుమారుడిగా కట్టమంచి గ్రామంలో జన్మించిన మహనీయుడు రామలింగారెడ్డి

ఆయనే తర్వాత కాలంలో విద్యావేత్తగా, రచయితగా, విమర్శకుడిగా, రాజకీయనాయకునిగా పేరుపడ్డ సి. ఆర్. రెడ్డి
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో వర్డ్స్ వర్త్ లాంటి మహాకవి చదివిన సెయింట్ జాన్ కళాశాలలో చదివిన సి. ఆర్. రెడ్డి
పందొమ్మిదేళ్ళ వయసులోనే ' ముసలమ్మ మరణం ' అనే కావ్యాన్ని రచించిన రచయిత సి. ఆర్. రెడ్డి 

మహాత్మాగాంధీ కంటే చాలా ముందే దళితులకు పాఠశాల ప్రవేశం చేయించిన సంఘ సంస్కర్త సి. ఆర్. రెడ్డి
ఆంధ్ర విశ్వకళా పరిషత్తు స్థాపన సమయంలో ఉపాధ్యక్షుడిగా అందరికీ తొలుత స్పురించిన వ్యక్తి సి. ఆర్. రెడ్డి

ఉత్తమ విద్యాప్రమాణాలు, ఉన్నతమైన పరిశోధనావకాశాలు గల విద్యాకేంద్రంగా తీర్చిదిద్దిన శిల్పి సి. ఆర్. రెడ్డి
ఉప్పు సత్యాగ్రహంలో నాయకులను అరెస్ట్ చేసినందుకు నిరసనగా ఉపాధ్యక్ష పదవిని వదులుకున్న సి. ఆర్. రెడ్డి
అందరి అభ్యర్థనలను మన్నిస్తూ రెండవసారి ఉపాధ్యక్ష పదవి చేపట్టి ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని చదువులతల్లి ఆలయంగా మార్చిన సి. ఆర్. రెడ్డి

కట్టమంచి వారు ఛలోక్తులు విసరడంలో దిట్ట. ఆయన ఛలోక్తులు కొన్నిటిని అందించిన గతంలోని టపా ....

http://sirakadambam.blogspot.com/2009/10/blog-post_1761.html


సర్ కట్టమంచి రామలింగారెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తూ.....  
 
బ్లాగ్మిత్రులు మంద పీతాంబర్ గారు కట్టమంచి వారి గురించి తమ వ్యాఖ్యలో మరింత విలువైన సమాచారం అందించారు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆ సమాచారం వ్యాఖ్య రూపంలోనే ఉండిపోతే చాలామందికి చేరే అవకాశం తక్కువ కాబట్టి అనుబంధ టపాగా అందిస్తున్నాను.
http://sirakadambam.blogspot.com/2010/12/blog-post_9938.html

Vol. No. 02 Pub. No. 079
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం