Saturday, November 14, 2009

శుక్ల అంబర ధరం....


మహామహోపాధ్యాయ ' వేదం వెంకటరాయ శాస్త్రి ' గారు సంస్కృతాంధ్ర పండితులు. గురజాడవారి కన్యాశుల్కం తర్వాత తెలుగు ప్రజల్ని అంతగా ప్రభావితం చేసిన నాటకం ' ప్రతాపరుద్రీయం '. ఆ నాటక సృష్టికర్త శాస్త్రి గారే ! ఆ నాటకంలోని యుగంధరుడు పాత్రను నాటకప్రియులు ఎప్పటికీ మర్చిపోలేరు. 1890 ప్రాంతం నుంచి సుమారు పాతికేళ్ళు మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో సంస్కృత పండితులుగా పనిచేశారు.
ఆయన ఒక సందర్భంలో మాట్లాడుతూ " మనం మాట్లాడే ప్రతి మాటకు చెప్పినట్లుగానే శ్లోకాలకు కూడా అర్థమూ, విపరీతార్థమూ చెప్పవచ్చు " అన్నారు. శ్రోతలు ఈ విషయాన్ని వివరించమని అడిగారు.
వేదం వారు " శుక్లాంభరధరం శ్లోకానికి అర్థం తెలుసు కదా ! ఇప్పుడు విపరీతార్థం చెబుతాను. ' శుక్ల ' - తెల్లనైన, ' అంబర ' - వస్త్రములను, ' ధర ' - ధరించునదియు లేక మోయునదియు, ' విష్ణు ' - వ్యాపించుచున్నట్టిదియు అంటే స్థిరముగా ఒకచోట ఉండక తిరుగునదియు, ' శశివర్ణం ' - బూడిదరంగు కలిగియున్నట్టిదియు, ' ప్రసన్న వదనం ' - ప్రసన్నమైన ముఖం కలది అయిన, ' ధ్యాయే ' - నిన్ను ధ్యానించుచున్నాము అని ' గాడిద ' ను ప్రార్తిస్తున్నట్లు అన్వయించవచ్చు " అన్నారు.
అందరూ వినాయక ప్రార్థనగా చదువుకునే ' శుక్లాంభరధరం ' శ్లోకాన్ని గాడిదపరంగా చెప్పేటప్పటికి ఆనందించారు. అయితే ఒక శ్రోతకు ఇది అసంబద్ధంగా తోచింది.
" శాస్త్రి గారూ ! విఘ్నాలేమీ రాకూడదని వినాయకుణ్ణి ప్రార్థిస్తాం గానీ గాడిదను ప్రార్థించడమెందుకండీ ? " అని అడిగాడు.
దానికి శాస్త్రి గారు సమాధానం చెబుతూ " ముందు జాగ్రత్తగా మాకు అడ్డు వచ్చి విఘ్నాలు కలిగించవద్దని ప్రార్థించాలి " అని చెప్పారు.

Vol. No. 01 Pub. No.
106

2 comments:

కంది శంకరయ్య said...

ఈ విపరీత వ్యాఖ్యానం గణపతి నవలలో మొదటిపేజీలోనే ఉంది.

SRRao said...

శంకరయ్య గారూ !
స్పందించినందుకు చాలా సంతోషం. మీరు చెప్పింది నిజమే ! ఇక్కడో విషయం. వేదం వారి జీవన కాలం 1853-1929. చిలకమర్తి వారిది 1867-1946. ' గణఫతి ' రచనా కాలం 1916 తర్వాత. ఇద్దరూ పూర్తిగా కాకపోయినా సమకాలికులే ! మహాకవి శ్రీశ్రీని తర్వాత కాలంలో చాలామంది అనుసరించినట్లు అప్పట్లో వేదం వారిని చిలకమర్తి వారు అనుసరించి ఉండవచ్చు. ఏమైనా మొదట ఎవరు చెప్పి ఉంటారనేది నిర్ణయించడం కొంచెం కష్టమే!

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం